నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
భూపాలపల్లి: పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 3,449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. గతేడాది తక్కువ శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ ఏడాది ఖచ్చితంగా వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశం ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి రామానుజం చిత్ర పటానికి పూల మాలలు వేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీపీఆర్ఓ శ్రీనివాస్, పరీక్షల విభాగం ప్రత్యేక అధికారి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
పుష్కర ఏర్పాట్లు వేగిరం చేయాలి..
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ, విద్యుత్శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం 7, మిషన్ భగీరథ 15, దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం 28, విద్యుత్ 11 మొత్తం 65 పనులు పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. త్వరలో ఎన్నికల కోడ్ ముగియనున్నందున పనులు సత్వరమే చేపట్టేలా అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
పీఎం శ్రీ పనులు పూర్తి చేయాలి..
పీఎం శ్రీ, సర్వ శిక్షా అభియాన్ పనులను మార్చి 20వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులతో నిధులు మంజూరు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి..
ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేసే అంశాలపై హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ, ఇంటర్మీడియట్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, ఆర్టీసీ, వైద్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 3,720 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పుష్కరాల పనులు వేగవంతం
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment