కొడవటంచ జాతరకు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కొడవటంచ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి, ఆర్అండ్బీ, సమాచార, దేవాదాయ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక విధుల నిర్వహణకు గ్రామ సిబ్బందిని డిప్యూట్ చేసి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు పూలతో అందంగా ముస్తాబు చేయాలన్నారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల సౌకర్యార్ధం గ్రామంలోని అన్ని రహదారుల్లో వీధి లైట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు వైపు, పార్కింగ్ స్థలాలు, భక్తులు ఉండే జాతర స్థలాలలో తాత్కాలిక లైట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే కొడవటంచ బైపాస్, రేపాక, కొడవటంచ రోడ్, గుడెపల్లి–కొడవటంచదారులలో అడ్డంగా ఉన్న ముళ్లపొదలు తొలగించి, మొరం పోసి గుంతలు పూడ్చే పనులు పూర్తి చేయాలన్నారు. జాతర రోజులలో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, నీళ్ల ట్యాంకుల దగ్గర ఇంకుడుగుంతలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళల సౌకర్యార్ధం స్నాన ఘట్టాలు వద్ద బట్టలు మార్చుకొనే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని అనుసరించి తగు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని, భూపాలపల్లి డిపోతో పాటు ఇతర జిల్లాల నుంచి నిరంతరం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్డీఓ రవి, డీఎస్పీ సంపత్ రావు, ఈఓ మహేష్, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment