
గడువులోగా పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ, ఆర్టీసీ, వివిధ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖల అధికారులు ఇప్పటికే పనుల షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని, షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు చేపట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదిలో నీటి సామర్ధ్యం నిశితంగా గమనిస్తూ ఉండాలని, గడిచిన 21 రోజుల నుంచి నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నామని, 13 సెంటిమీటర్లు నీరు తగ్గిందన్నారు. గత మే నెలలో గోదావరి నీటి మట్టం 94 మీటర్ల 540 సెంటిమీటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ తిరుపతి, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మహేష్, డీఈలు పాల్గొన్నారు. అలాగే జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్లకు జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ రాహుల్శర్మ
సరస్వతి పుష్కరాల పనుల
పురోగతిపై సమీక్ష