
బొప్పాయి సాగు.. లాభాల బాగు
పెద్దాపురం: ప్రస్తుత వేసవి సీజన్లో ఆరోగ్యప్రదమైన ఫలాల్లో బొప్పాయి ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు కోస్తాలో అధికంగా పండించే బొప్పాయి మెట్ట ప్రాంతంలోనూ రైతులకు మంచి ఆదాయాలను సమకూరుస్తోంది. ప్రధానంగా మెట్ట కేంద్రమైన పెద్దాపురం మండలంలోని చినబ్రహ్మదేవం, జె.తిమ్మాపురం, కట్టమూరు. ఆర్బీపట్నం, కొత్తూరు, కొండపల్లి, ఆనూరు గ్రామాల్లో సుమారు 150 ఎకరాల్లో బొప్పాయి సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించారు. నారు దశ మొదలు ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు, కోత, దిగుబడి వంటి అంశాలపై ఉద్యాన శాఖాధికారులు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయడంతో బొప్పాయి సాగు లాభాలు చేకూరుస్తోంది.
ఎరువుల యాజమాన్యం
చెట్టు వయస్సును బట్టి ఎరువులను వినియోగించాలి. ఏకలింగాశ్రయ దీర్ఘకాలిక రకాల బొప్పాయి ఒక్క మొక్కకు పది కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదపు పిండి, 500 గ్రామాల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ 800 గ్రామాలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వెయ్యాలి. రెండు నెలలకోసారి ఏడాదిలో ఆరుసార్లు ఎరువులను వెయ్యాలి. సూక్ష్మధాతు లోప నివారణకు ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్, ఒక గ్రాము బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5 గ్రాములు యూరియా, 19.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, వారం రోజుల వ్యవధితో 48 వారాలు ఇవ్వాలి. ఏకవార్షిక రకాలకు ఎరువులను ఏడవ నెల వరకు అందించాలి.
ఫెర్టిగేషన్
సిఫారసు చేసిన ఎరువులను కరగబెట్టి వడగట్టిన తరువాత ఫెర్టిగేషన్ ట్యాంక్ లేదా ఫుట్ స్పేయర్ ద్వారా గాని డ్రిప్ మెయిన్ పైపులోకి ప్రవేశపెట్టాలి. భాస్వరపు ఎరువుని ఫాస్పేట్ రూపంలో ప్రతీ రెండు నెలలకోసారి 260 గ్రాములు చెట్టుపాదులో కలపాలి.
నీటి యాజమాన్యం
మొక్క మొదళ్ల దగ్గర నీరు తగలకుండా, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పిల్ల పాదులు (డబుల్రింగ్ పద్ధతి) తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. డ్రిప్ ద్వారా చిన్న మొక్కలైతే రెండు రోజులకోసారి 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతీ 20–25 లీటర్ల నీటిని అందే విధంగా డ్రిప్పర్లు అమర్చుకోవాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు అందించాలి.
కోత, దిగుబడి
మంచి సైజు వచ్చిన కాయలను చెట్టు మీద మాగనీయకూడదు. వాటిని కోసి పేపర్తో చుట్టి రవాణా చేసుకోవాలి. నాటిన 9వ నెల నుంచి రెండున్నర సంవత్సరాల వరకు పంటనిస్తుంది. ద్విలింగ పుష్పాల నుంచి ఎదిగే కాయలు తక్కువ పొడవుతో గుండ్రంగా ఉంటాయి. అదే ఆడపుష్పాల నుంచి ఎదిగే కాయలు పొడవుగా, కోలగా ఉంటాయి. దిగుబడి ఎకరాకు 35 నుంచి 40 టన్నుల వరకు ఉంటుంది.
బొప్పాయి సాగులో
మంచి ఆదాయం
మెట్ట ప్రాంతంగా కావడంతో ఎక్కువ అపరాలు, పండ్ల తోటలను సాగు చేస్తుంటాం. ప్రధానంగా మామిడి, జీడిమామిడితో పాటు బొప్పాయి సాగులోను మంచి ఆదాయం వస్తుంది. అధికారుల సూచనలతో మరింత జాగ్రత్తగా సాగు చేపట్టడంతో బొప్పాయి మంచి దిగుబడి వచ్చింది.
–ఆచంట శివ, రైతు, చిన బ్రహ్మదేవం,
పెద్దాపురం మండలం
ఆరోగ్యానికి చాలా మంచిది
బొప్పాయి పండు ఆరోగ్యనాకి చాలా మంచింది. బొప్పాయిలో విటమిన్ సీ, ఏ యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు కొన్ని వ్యాఽధుల నుంచి రక్షిస్తుంది.
–డాక్టర్ భ్రమరాంబ,
ఏరియా ఆసుపత్రి వైద్యులు, పెద్దాపురం
మేలైన యాజమాన్య పద్ధతులతో
అధిక దిగుబడులు
వేసవిలో లబ్ధి పొందుతున్న
మెట్టలో రైతులు

బొప్పాయి సాగు.. లాభాల బాగు

బొప్పాయి సాగు.. లాభాల బాగు

బొప్పాయి సాగు.. లాభాల బాగు

బొప్పాయి సాగు.. లాభాల బాగు