![డి గ్](/styles/webp/s3/article_images/2024/06/16/15bng115_mr-1718476979-0.jpg.webp?itok=FtCF9gfQ)
డి గ్యాంగ్కు మరో 5 రోజుల కస్టడీ
మరింత లోతుగా దర్యాప్తు
వాళ్లే హత్య చేశారన్న దర్శన్
బనశంకరి: రేణుకాస్వామి హత్యకేసులో నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడతో పాటు 14 మందికి 5 రోజుల పాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు. శనివారం కస్టడీ ముగిశాక కోర్టులో హాజరు పరిచారు. దర్శన్, పవిత్రగౌడ, పవన్, రాఘవేంద్ర, నందీశ్, జగదీశ్, అనుకుమార్, వినయ్, నాగరాజ్, లక్ష్మణ, దిలీప్, ప్రదోశ్ , కేశవమూర్తి అనే వారిని మరింత విచారించాలని, కాబట్టి కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో వారిని విచారణకు తరలించారు. కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ముఖం కనిపించకుండా పవిత్ర కొంగు కప్పుకుంది. జడ్జి ముందు విలపిస్తూ నిలబడింది.
ప్రత్యేక న్యాయవాది నియామకం
రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రసన్న కుమార్ను సర్కారు నియమించింది.
క్షమించమన్నాడు, డబ్బులు ఇచ్చి పంపించమన్నా
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో దర్శన్ పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. అయితే తాను, పవిత్రగౌడ కలిసి రేణుకాచార్యను ఉంచిన షెడ్కు వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దర్శన్ ఏం చెప్పారంటే... సార్.. నాకేం తేలీదు. రేణుకాస్వామిని తీసుకువస్తున్నట్లు నాకు ముందుగా చెప్పలేదు. బ్రూక్ రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పవన్ వచ్చి రేణుకాస్వామిని పట్టుకు వచ్చామని చెప్పాడు. దీంతో పవిత్రగౌడను తీసుకుని షెడ్ వద్దకు వెళ్లాను. క్షమాపణ చెప్పించి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని అనుకున్నాను. పవిత్రను చూడగానే రేణుకాస్వామి తప్పు జరిగింది, క్షమించమని వేడుకున్నాడు. దీంతో అతడికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఊరికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి వచ్చేశాను. నేడు షెడ్ నుండి బయటకు రాగానే వీళ్లంతా కలిసి రేణుకాస్వామిని కొట్టి హత్య చేశారు. ఇంతకు మించి తనకేం తెలీదని చెబుతున్నాడు. షెడ్ వద్దకు దర్శన్, పవిత్ర కార్లు రావడం, శవం పడేసిన చోటు కూడా వారి కార్లు తిరిగినట్లు సీసీ కెమెరాల్లో ఉండడం ఇద్దరికీ క్లిష్టంగా మారింది.
రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..
దొడ్డబళ్లాపురం: డి.బాస్ ముఠా ఆగడాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని ఎలా హత్య చేసిందీ పోలీసులు వివరాలు లాగేకొద్దీ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. 8వ తేదీ సాయంత్రం రేణుకాస్వామిని షెడ్లో బంధించి హింసించిన నిందితులు బిరియాని తెప్పించి మాంసం ముక్కలు నోట్లో కుక్కారు. లింగాయత కులానికి చెందిన రేణుకాస్వామి పూర్తి శాకాహారి. ఆ సంగతి తెలిసి కావాలనే అతనితో చనిపోయే ముందు బిరియాని తినిపించారు. బాస్ వస్తారు, ముక్కలు తిని రెడీగా ఉండు, తన్నులు తినడానికి బలం కావాలి కదా.. అంటూ ముఠా సభ్యులు అతన్ని హేళన చేశారు. నిందితుల్లో ఒకడైన దీపక్ పోలీసుల విచారణలో ఇదంతా చెప్పాడు.
![డి గ్యాంగ్కు మరో 5 రోజుల కస్టడీ 1](/gallery_images/2024/06/16/15bng116_mr-1718476979-1.jpg)
డి గ్యాంగ్కు మరో 5 రోజుల కస్టడీ
![డి గ్యాంగ్కు మరో 5 రోజుల కస్టడీ 2](/gallery_images/2024/06/16/15bng105a_mr-1718476979-2.jpg)
డి గ్యాంగ్కు మరో 5 రోజుల కస్టడీ
![డి గ్యాంగ్కు మరో 5 రోజుల కస్టడీ 3](/gallery_images/2024/06/16/15bng106_mr-1718476979-3.jpg)
డి గ్యాంగ్కు మరో 5 రోజుల కస్టడీ
Comments
Please login to add a commentAdd a comment