వైటీపీఎస్ కార్మికుల ఆందోళన
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ కేంద్రం(వైటీపీఎస్)లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేపట్టారు. రాయచూరు–హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. యరమరస్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పని చేసే 1500 మంది కార్మికులకు వేతనాలు పెంచాలని, డీఏపీఎఫ్, జీపీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని నిరసన ప్రదర్శన చేశారు. కాంట్రాక్టు పొందిన పవర్ మేక్ కంపెనీ యాజమాన్యం కార్మికులను వెట్టి చాకిరీ చేయించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు.
ముస్లింలకు ఇఫ్తార్ విందు
బళ్లారిటైన్: జేడీఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముస్లిం సోదరులకు జిల్లాధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేత, మాజీ మంత్రి శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు చేపట్టే ఉపవాస దీక్షలకు జేడీఎస్ పార్టీ ఇప్తార్ విందు చేయించడం శ్లాఘనీయం అన్నారు. నెల రోజులుగా వారు రంజాన్ దీక్షలను నిర్వహిస్తారని, వారు చేపట్టే ఇలాంటి కార్యక్రమాల్లో జేడీఎస్ పార్టీ చూపుతున్న చొరవను కొనియాడారు. దాదాపు 500 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు వండ్రి, మహిళా అధ్యక్షురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.
శిశువుల ఆరోగ్యానికి
చుక్కల మందు తప్పనిసరి
బళ్లారిటౌన్: 9 నెలల వయస్సు నిండిన పిల్లలకు తట్టు నివారణ చుక్కల మందు తప్పనిసరిగా వేయించాలని జిల్లా ఆర్పీఎస్ అధికారి డాక్టర్ హనుమంతప్ప పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో గుగ్గరహట్టి కౌల్బజార్, కాకర్లతోట ప్రాంతాల్లో చుక్కల మందు సరఫరా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సాధారణంగా ఎండాకాలంలో ఇలాంటి రోగాలు వ్యాప్తి చెందుతాయన్నారు. పిల్లలకు దగ్గు, జ్వరం, ముక్కులో కారడం వంటివి కనిపిస్తే వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని కోరారు. డాక్టర్ కాశి ప్రసాద్, డాక్టర్ శకుత్త షహిమా, ఈశ్వర్ హెచ్.దానప్ప, శాంతమ్మ, మంజుల, నాగలక్ష్మి ఈరయ్య, ముదస్సీర్లున్నారు.
సరాబైక్ రెంటల్ ప్రారంభం
హుబ్లీ: సిద్ధరూఢ స్వామి రైల్వే స్టేషన్లో సరా బైక్ రెంటల్ ప్రారంభమైందని పర్యాటకులు, స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని స్వర్ణ గ్రూప్ సంస్థ ఎండీ, ప్రవాసాంధ్రుడు డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ తెలిపారు. నగరంలో గురువారం నుంచి ప్రారంభమైన సరాబైక్ రెంటల్ షోరూంను ఆయన వీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్కు వచ్చే పర్యాటకులు ఇక ముందు వాహనాల కోసం వేచి చూడక్కరలేదన్నారు. సరాబైక్ రెంటల్ తమకు ఇష్టమైన బైక్ అద్దె రూపంలో తీసుకొని జంట నగరాల్లోని ప్రేక్షణీయ ప్రాంతాలను వీక్షించవచ్చన్నారు. అత్యంత తక్కువ ధరతో బైక్ అద్దెకు ఇస్తున్నారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీంతో సమయం ఆదా అవడమే కాకుండా ఎక్కువ దర్శనీయ స్థలాలను వీక్షించవచ్చన్నారు. సరా బైక్ యజమాని రాజ్భట్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ శెట్టి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇరు వర్గాల మధ్య
ఘర్షణతో ఉద్రిక్తత
హుబ్లీ: ధార్వాడ తాలూకా దేవరహుబ్బళ్లిలో రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని తీసే విషయంలో గుంపు ఘర్షణ తలెత్తి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ ట్రాలీ నిలిపిన విషయమై శివబసప్ప, నోవాన్ల మధ్య జగడం ప్రారంభమైంది. దీంతో నోవాన్ పారతో శివబసప్పపై దాడి చేశాడు. ఇది గుంపు ఘర్షణకు దారి తీసింది. ఆ గ్రామ పెద్దలు రాజీ చేసినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి నోవాన్, సమీర్లను అరెస్ట్ చేశారు. గ్రామంలో మతసామరస్యానికి భంగం కలిగించిన నేపథ్యంలో డీఏఆర్ పోలీసు బృందాన్ని గ్రామంలో ఏర్పాటు చేసి బందోబస్తు కల్పించినట్లు కేసు నమోదు చేసుకున్న గ్రామీణ పోలీసులు తెలిపారు.
వైటీపీఎస్ కార్మికుల ఆందోళన
వైటీపీఎస్ కార్మికుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment