బైకుల చోరుని అరెస్ట్
● 6 ద్విచక్రవాహనాలు జప్తు
హొసపేటె: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని హగరిబొమ్మనహళ్లి పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితుడిని హగరిబొమ్మనహళ్లి తాలూకా మల్లనాయకనహళ్లికి చెందిన యువకుడు ప్రశాంత్గా గుర్తించారు. అతని వద్ద నుంచి సుమారు రూ.3.20 లక్షల విలువ చేసే బైక్లను స్వాధీనపరచుకున్నారు. హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అతనిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
డీఎస్పీగా శాంతవీర
రాయచూరు రూరల్: రాయచూరు డీఎస్పీగా శాంతవీర అధికార బాధ్యతలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సత్యనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాగల్కోటె జిల్లా జమఖండి డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న శాంతవీర రాయచూరుకు బదిలీ అయ్యారు. గతంలో ఉన్న డీఎస్పీ సత్యనారాయణను బళ్లారి ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు.
గుర్తు తెలియని శవాలు లభ్యం
రాయచూరు రూరల్: నగరంలో గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యమైనట్లు సదర్ బజార్ సీఐ ఉమేష్ కాంబ్లే వెల్లడించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని మావినకెరె చెరువులో 45 ఏళ్ల లోపు వయస్సుగల మహిళ శఽవం లభించింది. మూడు రోజుల క్రితం ఆమె చెరువులో పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. రాయచూరు కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో 75 ఏళ్ల వయస్సుగల వృద్ధుడు నీరసంతో కళ్లు తిరిగి పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వర్షాలకు గోడ కూలి ఇద్దరు మృతి
హుబ్లీ: నిర్మాణ దశలోని ఫ్యాక్టరీ గోడ భారీ వాన, గాలులకు కూలి పడటంతో ఇద్దరు కూలి కార్మికులు అక్కడికక్కడే చనిపోగా మరొకరు గాయపడిన ఘటన ధార్వాడ జిల్లా కలఘటిగి తాలూకా కాడనకొప్ప గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పాత హుబ్లీ నివాసి దావూద్ సబనూరు(52) రఫీక్ సాబ్ చెన్నపుర (50) మరణించారు. గాయపడిన హుబ్లీ తాలూకా అంచటగేరి గ్రామానికి చెందిన మహంతేష్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిస్త్రికోటి రోడ్డులో నివసిస్తున్న మృతులు భవన నిర్మాణ పని చేస్తున్నారు. మధ్యాహ్నం భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు తీవ్రంగా వీయడంతో గోడ వద్ద నిలబడిన సమయంలో సుడిగాలికి గోడ కూలడంతో మృతి చెందారు. ఘటనపై కలఘటిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నగరసభ అధ్యక్షురాలిగా మంజుల
చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె నగరసభకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మంజుల ప్రసన్నకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరసభలోని 23 మంది సభ్యులు అందరూ మద్దతు తెలపడం ద్వారా ఏకగ్రీవంగా నగరసభకు నూతన అధ్యక్షురాలిగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి, జెడ్పీ ఉప విభాగాధికారి మహమ్మద్ జిలాన్ తెలిపారు. మానవ సేవే మాధవసేవగా భావించి అందరి మన్ననలు పొందిన మంజుల ప్రసన్నకుమార్ను నూతన నగరసభ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం హర్షణీయమని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి అభినందించారు. కాగా సహచర నగరసభ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు నూతన అధ్యక్షురాలితో పాటు ఎమ్మెల్యేని పూలమాలతో అభినందించారు.
రోడ్ల వెడల్పునకు వినతి
రాయచూరు రూరల్: నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టాలని ప్రగతిశీల సంఘాల వేదిక డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అధ్యక్షుడు సుదానంద మాట్లాడారు. నగరంలోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రాం సర్కిల్, సూపర్ మార్కెట్, తీన్ కందిల్, నవోదయ రహదారి, ఆశాపూర్ రహదారి, శెట్టిబావి సర్కిల్, నగరసభ, ఇతర రహదారులు చిన్నవిగా ఉన్నాయని, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. నగరసభ అధికారులు చర్యలు చేపట్టి ఆక్రమించిన వాటిని తొలగించి, రహదారుల విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
బైకుల చోరుని అరెస్ట్
బైకుల చోరుని అరెస్ట్
బైకుల చోరుని అరెస్ట్
బైకుల చోరుని అరెస్ట్