సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్లపై వేటు
● సత్తుపల్లి సబ్జైల్ ఉద్యోగుల సస్పెన్షన్ ● ఇటీవల రిమాండ్ ఖైదీ తప్పించుకోవడంతో చర్యలు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సబ్జైల్ సూపరింటెండెంట్ ఎస్.ప్రవీణ్, వార్డర్లు ఎన్.మారేశ్వరరావు, బి.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన అశ్వారావుపేట మండలం ఆసుపాకకు చెందిన రిమాండ్ ఖైదీ పెండ్ర రమేష్ సబ్జైల్ నుంచి పరారయ్యాడు. భార్యపై హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన పరారు కాగా, మూడు గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు జైళ్ల శాఖ డీఐజీ ఎం.సంపత్ ఈనెల 12వ తేదీన విచారణ నిర్వహించారు. ఈమేరకు బాధ్యతారహితంగా వ్యవహరించారని తేలుస్తూ జైలు సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్లను సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మధిర సబ్జైల్ హెడ్వార్డర్ ఎ.వెంకటమురళిని సత్తుపల్లి సబ్జైలుకు బదిలీ చేయగా ఆయన శుక్రవారం విధుల్లోకి చేరారు. అలాగే, సూపరింటెండెంట్గా మధిర సబ్ జైల్ సూపరింటెండెంట్ యు. కుటుంబరాజును నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
కేయూ దూరవిద్యలో
ప్రవేశాలకు దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్(గతంలో ఎస్డీఎల్సీఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 25వరకు ఉందని ఖమ్మం అధ్యయన కేంద్రం కోఆర్డి నేటర్ డాక్టర్ గోపి తెలిపారు. బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ మ్యాథ్స్, బ్యాచ్లర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పీజీ కోర్సుల్లో ఎంఏ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్ డెవలప్మెంట్, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంకామ్, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అవకాశముందని తెలిపారు. దరఖాస్తులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో చేయొచ్చని, వివరాలకు 98492 50633, 80088 11998 నంబర్లలో సంప్రదించాలని లేదా కేయూ దూరవిద్య కేంద్రం వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు.
పోస్టాఫీస్ ద్వారా రామయ్య పరోక్ష సేవలు
భద్రాచలం: పోస్టాఫీస్ ద్వారా భద్రగిరి రామయ్య పరోక్ష సేవలు అందించడానికి తపాలా శాఖ సిద్ధమైంది. శ్రీ సీతారాముల కల్యా ణం, మహాపట్టాభిషేకంలో స్వయంగా పాల్గొనలేని భక్తులు సమీపాన పోస్టాఫీస్కు వెళ్లి అంతరాలయ అర్చన, తలంబ్రాలకైతే రూ.450, ముత్యాల తలంబ్రాలకు రూ.150 చొప్పున చెల్లించి పూర్తి చిరునామా, వివరాలతో దరఖాస్తు అందజేయాలి. ఆపై స్వామి వారి తలంబ్రాలు భక్తులకు చేరవేస్తామని, ఈ అవకాశం ఏప్రిల్ 1వ తేదీ వరకే ఉంటుందని ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి, భద్రాచలం హెడ్ పోస్టాఫీస్ పోస్మాస్టర్ బీ.వీ.రామ్మోహన్రావు తెలిపారు.
సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్లపై వేటు
సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్లపై వేటు
Comments
Please login to add a commentAdd a comment