
ఉద్యోగి యాదిలో క్రీడాపోటీలు
● సింగరేణి ఆధ్వర్యంలో ఏటా వేణుగోపాల్ మెమోరియల్ పోటీలు ● పలు జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు
రెబ్బెన(ఆసిఫాబాద్): గని ప్రమాదం నుంచి తోటి ఉద్యోగులను రక్షించే ప్రయత్నంలో అసువులు బాసిన ఉద్యోగి యాదిలో బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం ఏటా రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ క్రీడాపోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రం నలుమూలల క్రీడాకారులకు ఆహ్వానం పంపుతోంది. ఈ ఏడాది కూడా సింగరేణి యాజమాన్యం గోలేటి టౌన్షిప్లోని శ్రీ భీమన్న స్టేడియంలో 36వ వేణుగోపాల్ మెమోరియల్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. మూడు రోజులుగా భీమన్న స్టేడియంలో క్రీడాకారుల కేరింతల మధ్య కొనసాగుతున్న పోటీలు శనివారం ముగిశాయి.
ఎనిమిది జట్ల మధ్య పోటీలు
శ్రీభీమన్న స్టేడియంలో నిర్వహిస్తున్న వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలకు రా ష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఎనిమిది జట్లు పా ల్గొంటున్నాయి. హైదరాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, నస్పూర్, దేవాపూర్, కాగజ్నగర్, కోటపల్లి, గోలేటి ప్రాంతాల నుంచి జట్లు పోటీలకు హాజరయ్యాయి. టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్తో కలిపి 15 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. సెమీ ఫైనల్ వరకు పోటీలను లీగ్ పద్ధతిలో, సెమీ ఫైనల్ తర్వాత నాకౌట్ పద్ధతిలో నిర్వహించారు. పూల్ ఏ నుంచి హైదరాబాద్, కాగజ్నగర్ జట్లు, పూల్ బీ నుంచి బెల్లంపల్లి, దేవాపూర్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఫైనల్లో బెల్లంపల్లి జట్టుపై హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.
ఎవరీ వేణుగోపాల్..?
బెల్లంపల్లి ఏరియాలో ఒకప్పుడూ అన్ని భూగర్భ గనులే ఉండేవి. గతంలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో తరుచూ గని ప్రమాదాలు చోటు చేసుకునేవి. 40 సంవత్సరాల క్రితం మార్గన్ఫిట్ గనిలో ఆక్సిజన్ అందకపోవడంతో ఉద్యోగులు ప్రమాదం బారినపడగా.. అదే గనిలో ఓవర్మెన్గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ ప్రాణాలకు తెగించి తోటి ఉద్యోగులను రక్షించే ప్రయత్నం చేశాడు. కొంతమంది ఉద్యోగులను కాపాడినప్పటికీ చివరికి తనకే ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన కార్మికులకు సింగరేణి సంస్థ టెర్మినల్ బెనిఫిట్స్ అందిస్తుంది. కానీ వేణుగోపాల్ కుటుంబ సభ్యులు ఆ బెనిఫిట్స్ తీసుకోకుండానే వారి స్వగ్రామానికి వెళ్లిపోయారు. అతడికి చెల్లించాల్సిన డబ్బులు సంస్థ వద్దే ఉండిపోయాయి. వేణుగోపాల్ స్వతహాగా మంచి క్రీడాకారుడు. ఫుట్బాల్, హాకీ, క్రికెట్లో ప్రతిభ చూపేవాడు. దీంతో తోటి ఉద్యోగ క్రీడాకారులు సంస్థ అధికారులను కలిసి వేణుగోపాల్కు గుర్తుగా పోటీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా వేణుగోపాల్ మెమోరియల్ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. నాడు ప్రారంభమైన ఈ క్రీడాపోటీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు క్రీడాకారులను ‘సాక్షి’ పలకరించగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.