రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Published Sun, Feb 16 2025 2:05 AM | Last Updated on Sun, Feb 16 2025 2:05 AM

రేపు

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కర్నూలు కల్చరల్‌: కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం

వెల్దుర్తి: సూక్ష్మ, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ నోడల్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఉమాదేవి అన్నారు. శనివారం ఆమె మండల కేంద్రంలో పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ స్కీం కింద ఏర్పాటు చేసుకున్న దాల్‌ మిల్‌, మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మార్కెటింగ్‌ అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం, పాడి, మత్స్య సంపదలకు అనుబంధంగా ఆహార ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 18 నుంచి 55 ఏళ్లలోపు వారికి సబ్సిడీతోపాటు యూనిట్‌ కాస్ట్‌లో కేవ లం 10 శాతం పెట్టుబడితో బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారికి సాంకేతిక శిక్షణ అందించడంతోపాటు, వారి ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఇంటింటి ఫీవర్‌ సర్వే

కర్నూలు(హాస్పిటల్‌): బాతులకు బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు నగరంలోని ఎన్‌ఆర్‌ పేటలోని ఒక కిలోమీటర్‌ పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది శనివారం ఇంటింటి ఫీవర్‌ సర్వే చేపట్టింది. ఎన్‌ఆర్‌ పేటలోని 47, 47ఏ, 48 వార్డుల్లోని 89 గృహాల్లో 320 మందికి ఎనిమిది బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ నాగప్రసాద్‌ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో జ్వర లక్షణాలు కలిగిన వారు లేరన్నారు. కాలానుగుణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధులు, సురక్షిత తాగునీటి ప్రాముఖ్యత, ఆహార శుభ్రత , చేతుల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సమీప పట్టణ/ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వద్ద, అర్హతగల వైద్యుల మాత్రమే చికిత్స చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంవో డాక్టర్‌ ఉమా, వైద్యాధికారులు డాక్టర్‌ ఫాతి మా, డాక్టర్‌ నందిని, ఎపిడమాలజిస్టు వేణుగోపాల్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇంగళదహాళ్‌ పాఠశాలను స్కూల్‌ కాంప్లెక్స్‌గా కొనసాగించాలి

హొళగుంద: ఇంగళదహాళ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను స్కూల్‌ కాంప్లెక్స్‌గా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ పలు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. శనివారం హెబ్బటం గ్రామంలో జరిగే స్కూల్‌ కాంప్లెక్స్‌ సమా వేశానికి హెచ్‌ఎంలు వెళ్లకుండా ఇంగళదహాళ్‌, ఎండీ హళ్లి, పెద్దగోనెహాళ్‌ గ్రామాల పరిధిలో వచ్చే పాఠశాలల హెచ్‌ఎంలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లు, గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్పంచ్‌లు ప్రమిదావతమ్మ, వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున, ఎస్సెమ్సీ చైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ గ్రామాల్లోని పాఠశాలల హెచ్‌ఎంలకు వినతి పత్రాలు అందజేశారు. కాంప్లెక్స్‌ సమావేశానికి వెళ్లవద్దని హెచ్‌ఎంలను కోరారు. పెద్దగోనెహాళ్‌లో సర్పంచ్‌ కొత్తింటి వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, గ్రామస్తులు పాఠశాల గేటుకు తాళం వేసి హెచ్‌ఎం, టీచర్లు సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హొళగుంద ఎస్‌ఐ బాల నరసింహులు ఆ గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. చాలా కాలంగా స్కూల్‌ కాంప్లెక్స్‌గా ఉన్న ఇంగళదహాళ్‌ పాఠశాలను తొలగించారని, దాన్ని తిరిగి యథావిధిగా కొనసాగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సమస్యను డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులకు ఎస్‌ఐ నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం హెచ్‌ఎంలు సమావేశానికి వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక 1
1/1

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement