ఎస్టేటు అధికారుల బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): రైతుబజార్ల ఎస్టేటు అధికారుల బదిలీలు జరిగాయి. కీలకమైన సి.క్యాంపు రైతుబజారు ఎస్టేటు అధికారిగా కళ్యాణి నియమితులయ్యారు. అమీన్ అబ్బాస్నగర్ రైతుబజారు ఎస్టేటు అధికారిగా పనిచేస్తున్న కళ్యాణిని సి.క్యాంపునకు బదిలీ చేస్తూ రాష్ట్ర రైతుబజార్ల సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సి.క్యాంపులో పనిచేస్తున్న హరీష్కుమార్ ఆదోని రైతుబజారుకు బదిలీ అయ్యారు. కొత్తపేట రైతుబజారు ఎస్టేటు అధికారిగా పనిచేస్తున్న జయమ్మను అమీన్ అబ్బాస్నగర్ రైతుబజారుకు బదిలీ చేశారు. ఆదోని రైతుబజారులో ఎస్టేటు అధికారిగా పని చేస్తున్న అక్తర్షరీఫ్ను కొత్తపేట రైతుబజారుకు బదిలీ చేశారు. సి.క్యాంపు రైతు బజారులో నిజమైన రైతులకు స్థానం కల్పిస్తామని ఎస్టేటు అధికారి కళ్యాణి వెల్లడించారు.
శ్రీగిరి భద్రతపై సమీక్ష
శ్రీశైలంటెంపుల్: ‘సాక్షి’ దిన పత్రికలో శనివారం ‘భగవంతుడా.. ఇదేమి భద్రతా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు స్పందించారు. దేవస్థాన భద్రతా విషయాలపై సమగ్ర పరిశీలన చేయాలని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని ఈఓ ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యూలైన్ల వద్దకు చేరుకుని, క్యూలైన్ ఏఈఓ, పర్యవేక్షకులు, భద్రతా పరికరాల పర్యవేక్షణ చేపట్టే ఇంజినీర్లు, సెక్యూరిటీ సూపర్ వైజర్లతో సమీక్షించారు. మెటల్ డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లు కొన్ని పనిచేయడం లేదని, హ్యాండ్ డిటెక్టర్లు ఉన్నా వినియోగించేందుకు సిబ్బంది తక్కువ ఉన్నారని గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు మరింత మెరుగుపరుస్తామన్నారు. లగేజ్ స్కానర్లు సైతం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సోమవారం ఈఓ స్వయంగా క్షేత్ర భద్రతపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment