సమస్య పరిష్కారం అయితే బాధితులు తిరిగి అర్జీ ఇచ్చేందుకు
నామమాత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
● కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షిణ
● రాజకీయ జోక్యంతో
ఎక్కడి అర్జీలు అక్కడే..
● కనీసం పింఛన్లు కూడా
ఇవ్వలేని దైన్యం
● భూ సమస్యలతో
వృద్ధుల పడరానిపాట్లు
● జిల్లా కలెక్టర్కు చెప్పుకున్నా
క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం
కర్నూలు(సెంట్రల్)/కర్నూలు రూరల్/కల్లూరు: ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి బాధితులు వస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరిస్తుండటంతో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వీరిలో ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారే ఉంటున్నారు. చాలా మంది బీపీ, షుగర్తోపాటు ఒళ్లు, కాళ్ల నొప్పులతో బాధ పడుతున్నా ఎంతో ఆశతో కలెక్టరేట్కు వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. అయితే వాటి పరిష్కారాలపై క్షేత్రస్థాయిలో వేరుగా.. అధికారిక లెక్కల్లో మరో రకంగా ఉంటోంది. వచ్చిన అర్జీల్లో దాదాపు 93 శాతం అర్జీలకు పరిష్కారాలు చూపినట్లు అధికారులు చెబుతుండగా బాధితులు మళ్లీ మళ్లీ అవే అర్జీలతో కలెక్టరేట్కు వస్తుండటం గమనార్హం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చిన వారితో మాట్లాడినంతనే పరిష్కారం అయినట్లు అధికారులు రికార్డుల్లో చూపుతున్నారు. కొందరైతే కలెక్టర్, వారి శాఖల ఉన్నతాధికారుల భయంతో కూడా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపకపోయినా చూపినట్లు లాగిన్లో ఎంట్రీ చేస్తున్నట్లు బాధితుల మాటలను బట్టి అర్థమవుతోంది.
విపరీతమైన రాజకీయ జోక్యం..
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది.
● ఏకంగా సీఎం చంద్రబాబునాయుడే వైఎస్ఆర్సీపీ నాయకులకు సాయం చేస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించిన నేపథ్యంలో పాలనలో పక్షపాతం కనిపిస్తోంది.
● కూటమి నేతలు నేరుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఎవరూ ఏమి అనడంలేదు.
● పట్టున్న గ్రామాల్లో పేదల ఆధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని గెంటేస్తున్నారు.
● పోలీసు స్టేషన్కు వెళ్లినా బాధితులకు న్యాయం జరగడంలేదు.
● రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఏమి చేయలేకపోతున్నారు.
● ఈక్రమంలో కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను బాధితులు ఆశ్రయిస్తుండడంతో అక్కడ కూడా తమకు తెలియకుండా పరిష్కారాలు చూపరాదని అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు.
సీఎంఓ పంపే అర్జీలపైనే ప్రత్యేక దృష్టి
సీఎంఓ పంపే అర్జీలపైనే అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిర్దేశించిన గడువులోపు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 317 అర్జీలు రాగా, 259 అర్జీలను పరిష్కరించారు. అయితే ఆయా సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి విచారణ చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అర్జీలపై ఎప్పటికప్పుడు
సమీక్ష చేస్తున్నాం
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. ప్రతిరోజూ అర్జీలను పరిశీలించి పరిష్కారాలు చూపాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ జోక్యాన్ని సహించం.
– పి.రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్
2024 జూన్ 15 నుంచి ఇప్పటి వరకు అర్జీల వివరాలు
అర్జీలు 40,072
పరిష్కారం 37,415
పెండింగ్ 2657
సమస్య పరిష్కారం అయితే బాధితులు తిరిగి అర్జీ ఇచ్చేందుకు
Comments
Please login to add a commentAdd a comment