రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Published Thu, Mar 6 2025 12:18 AM | Last Updated on Thu, Mar 6 2025 12:18 AM

-

ముగ్గురికి గాయాలు

కొత్తకోట రూరల్‌: కారు డ్రైవర్‌ అజాగ్రత్త కారణంగా ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతి పట్టణానికి చెందిన కనికాపురం రామయ్య, అతని భార్య వసంత, కుమారుడు లోకేష్‌ హైదరాబాద్‌లో బంధువుల పెళ్లి ఉండటంతో సొంత కారుకు డ్రైవర్‌గా మల్లికార్జునను తీసుకొని బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున కారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి సమీపంలోకి రాగానే డ్రైవర్‌ అజాగ్రత్తగా అతివేగంగా నడిపాడు. ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొనడంతో కారు ముందు సీట్లో ఉన్న రామయ్య(58) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్‌తో పాటు వెనుక సీట్లో ఉన్న వసంత, లోకేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడి కుమారుడు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. లోకేష్‌ ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ మల్లికార్జునపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

వివాహిత

బలవన్మరణం

గద్వాల క్రైం: తీవ్రమైన తలనొప్పి, నరాల బలహీనతతో బాధపడుతున్న ఓ వివాహిత మనస్తాపం చెందిన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని పరుమాలలో చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సుమతి (34) కొంతకాలంగా తీవ్రమైన అరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన భర్త నరేష్‌ గమనించి చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ క్రైం: ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ సయ్యద్‌ అక్బర్‌ కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని ఏనుగొండకు చెందిన కె.నరేష్‌కుమార్‌(29) మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఏనుగొండ సమీపంలో రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నరే ష్‌కుమార్‌ కొన్ని రోజుల నుంచి ఉపాధి కోసం ప్రయత్నం చేయగా ఎలాంటి పని దొరకపోవడంతో పాటు ఆరోగ్య సమస్య వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

● రైలు ఢీకొట్టడంతో గాయాలైన క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 1న మధ్యాహ్నం కౌకుంట్ల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని (45) రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యా యి. దీంతో ఆయనను జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సయ్యద్‌ అక్బర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement