‘ప్రైవేట్‌’ ఇష్టారాజ్యం! | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’ ఇష్టారాజ్యం!

Published Mon, Mar 10 2025 10:24 AM | Last Updated on Mon, Mar 10 2025 10:21 AM

‘ప్రైవేట్‌’ ఇష్టారాజ్యం!

‘ప్రైవేట్‌’ ఇష్టారాజ్యం!

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బడులు

విద్యా హక్కు చట్టానికి తూట్లు

ఉదాసీన వైఖరిలో విద్యాశాఖాధికారులు

మెదక్‌జోన్‌: ‘మాసాయిపేట మండలం రామంతాపూర్‌ గ్రామ శివారులో ఇటీవల నూ తనంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలను నిర్మించారు. అందులో సీబీఎస్‌ఈ విధానంలో బోధన ఉంటుందని.. యూకేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం కొనసాగుతుందని కరపత్రాల ద్వారా ప్రచారం చేపడుతున్నారు. సదరు పాఠశాల నిర్వాహకులు వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థులకు ప్రవేశ టెస్టులు నిర్వహించి ఫీజుల వసూళ్లు చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ పాఠశాలకు అనుమతులు రాకపోవటం గమనార్హం’.

నిబంధనలకు తూట్లు

జిల్లాలో 220 ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో 45 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే వాటిలో 90 శాతానికి పైగా పాఠశాలల యాజమాన్యా లు విద్యాహక్కు చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలకు అనుమతి కావాలంటే విద్యార్థులకు పక్కా భవన సముదాయం, క్రీడా ప్రాంగణం, ఫిట్‌నెస్‌ ఉన్న బస్సులు, ఫైర్‌సేఫ్టీ అనుమతి పొంది ఉండాలి. కానీ నిబంధనలు, ప్రమాణాలకు విరుద్ధంగా అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి ప్రైవేట్‌ పాఠశాలలు, వాహనాలకు అనుమతులు ఇస్తున్నారని బాహాంటంగానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అదనుగా యా జమాన్యాలు పాఠశాల భవన నిర్మాణం నుంచి మొదలుకుని ఫీజుల వసూళ్ల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస విద్యార్హత లేని వారితో చదువులు చెప్పిస్తున్నట్లు సమాచారం. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా బోధన అందించాలి. కానీ అలాంటివి జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. నూతన పాఠశాలలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నా యి. అయితే ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండ ఉందని, దీంతో చేసేది లేక చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

చర్యలు తీసుకుంటాం

మాసాయిపేట మండలం రామంతాపూర్‌లో నూతనంగా నిర్మించిన పాఠశాలలో యూకేజీ నుంచి పదో తరగతి వరకు అనుమతులు అడిగారు. అనుమతుల కోసం రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ)కి పంపించాం. ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఆ పాఠశాలకు రాలేదు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం.

– రాధాకిషన్‌, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement