Jabardasth Anchor Sowmya Rao Gets Emotional Over Her Mother - Sakshi
Sakshi News home page

Sowmya Rao: అమ్మకు క్యాన్సర్‌.. నన్ను కూడా మర్చిపోయింది.. జబర్దస్త్‌ యాంకర్‌ ఎమోషనల్‌

Published Fri, Jul 7 2023 2:54 PM | Last Updated on Fri, Jul 7 2023 3:42 PM

Jabardasth Anchor Sowmya Rao Gets Emotional Over Her Mother - Sakshi

నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన సౌమ్య రావు జబర్దస్త్‌ షోతో యాంకర్‌గా మారింది. పైకి నవ్వుతూ, పంచులు విసురుతూ చలాకీగా కనిపించే ఆమె జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగి ఉంది. తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూయడం ఆమెను ఎంతగానో కుంగదీసింది. చివరి రోజుల్లో తల్లి అనుభవించిన నరకాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తాజాగా ఓ షోలో హైపర్‌ ఆది.. సౌమ్య రావుకు ఆమె తల్లి జ్ఞాపకార్థం ఓ ఫోటో ఫ్రేమ్‌ ఇచ్చాడు. ఇది చూసి స్టేజీపైనే ఏడ్చేసింది సౌమ్య రావు.

ఆమె మాట్లాడుతూ.. 'ఒకరోజు అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్‌ క్యాన్సర్‌ అన్నారు. తను నెమ్మదిగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చింది. ఆఖరికి నన్ను కూడా మర్చిపోయింది. తనను మూడున్నరేళ్లపాటు బెడ్‌పైనే చూసుకున్నాను. ఆ దేవుడు అమ్మను ఇంతటి దారుణ స్థితిలో వదిలేస్తాడని అసలు ఊహించలేదు. అమ్మ మళ్లీ నా కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్య.

మొన్నామధ్య మాతృ దినోత్సవం సందర్భంగానూ తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది సౌమ్య. తల్లి కోసం భగవంతుడికి ఎన్నో పూజలు చేసినా, ఉపవాసాలు ఉన్నా ఆ దేవుడు కరుణించలేదని బాధపడింది. ఆ భగవంతుడు తనకే ఎందుకిలా చేశాడని ఆవేదన చెందింది. అందరూ అమ్మ ఫోటో షేర్‌ చేసి మదర్స్‌ డే శుభాకాంక్షలు చెప్తుంటే తనకు మాత్రం చివరి రోజుల్లో తల్లి పడ్డ బాధే కళ్ల ముందు మెదులుతోందని కన్నీళ్లు పెట్టుకుంది.. అమ్మ లేకుండా తన జీవితం అసంపూర్తిగా మిగిలిపోయిందని పేర్కొంది. ప్రతిరోజు, ప్రతిక్షణం తల్లిని మిస్‌ అవుతూనే ఉంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

చదవండి: వెకేషన్‌కు మెగాస్టార్‌ దంపతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement