
టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ మూవీలో సుమన్ బాబు కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే శివరాత్రికే విడుదల కావాల్సిన ఈ చిత్రం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ వేసవి సీజన్లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా' అని అన్నారు.
దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. "ఈ సినిమాలో 45 నిముషాలు పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలెట్గా నిలుస్తాయి. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారు. రిలీజ్ ఆలస్యమైనా కంటెంట్ మాత్రం ఖతర్నాక్గా ఉందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నాం" అని అన్నారు.

కాగా.. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఎన్వీవీ సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ నిర్మించారు. ఈ మూవీకి ప్రమోద్ పులిగిల్ల సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment