మిర్యాలగూడ సబ్ డివిజన్లో సీఐలు బదిలీ
మిర్యాలగూడ అర్బన్, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ రూరల్, టూ టౌన్ సీఐలుగా విధులు నిర్వహిస్తున్న వీరబాబు, నాగార్జునను మల్టీజోన్–2 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వారి స్థానంలో రూరల్ సీఐగా పీఎన్డీ ప్రసాద్, టూటౌన్ సీఐగా జి.సత్యనారాయణను నియమించారు. మిర్యాలగూడ వన్టౌన్ సీఐ స్థానం గతేడాది కాలంగా ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం మోతీరాంను నియమించినట్లు సమాచారం.
రూరల్ ఎస్ఐగా లక్ష్మయ్య
మిర్యాలగూడ రూరల్ పోలీస్స్టేషన్లో చేస్తున్న ఎస్ఐ పిల్లి లోకేష్కుమార్ను ఐజీ కార్యాలయాని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో చౌటుప్పల్లో పనిచేస్తున్న లక్ష్మయ్య మిర్యాలగూడ రూరల్ ఎస్ఐగా రానున్నారు.
బుచ్చిరెడ్డికి బాలసాహిత్య పురస్కారం
కనగల్ : మండలంలోని చిన్నమాధారం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి 2025 సంవత్సరానికి ఉత్తమ బాలసాహిత్య పురస్కారం లభించింది. శనివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో కునిరెడ్డి ఫౌండేషన్, చదువుల సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చంద్రారెడ్డి, డికె. చదువులబాబు, సాహితీవేత్త నరాల రామారెడ్డి మెమోంటో, సన్మాన పత్రం, శాలువతో బుచ్చిరెడ్డిని సన్మానించారు. బుచ్చిరెడ్డి రాసిన బంతిపూలు పుస్తకానికి బాలసాహిత్య పురస్కారం అందజేశారు. బుచ్చిరెడ్డికి పురస్కారం లభించడంపై పాఠశాల జీహెచ్ఎం వల్లంపట్ల పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
జేఎల్ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలి
నల్లగొండ : జూనియర్ లెక్చరర్లకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 11న హైదరాబాద్లోని నిర్వహించనున్న ధర్నాకు సంబందించి పోస్టర్ను శనివారం నల్లగొండలోని గడియారం సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2022లో వచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి 2023లో పరీక్షలు నిర్వహించి 2024లో ఫలితాలు విడుదల చేశారని.. 2025 ఫిబ్రవరి 19న కళాశాలలు కేటాయించారని.. కానీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాదికారి ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, రవీందర్, గోవర్ధన్, పందిరి శ్యాంసుందర్, ఎండీ.అబ్దుల్ ఖాదర్, గుండాల భిక్షమయ్య, దాసరి శ్రీరాములు, కే.చంద్రశేఖర్రెడ్డి, వి.లింగస్వామి, చిరుమర్తి వెంకటేష్, వి.హనుమంతు, ఎన్.వీరారెడ్డి, ఎండీ.ఫాతిమా బేగం తదితరులు పాల్గొన్నారు.
లక్ష సంతకాల సేకరణ ప్రారంభం
భువనగిరి టౌన్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పదవుల్లో దివ్యాంగులను నామినేట్ చేయడానికి వీలుగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది దివ్యాంగుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే భువనగిరి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు సుర్పంగ ప్రకాష్, కోశాధికారి కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ సబ్ డివిజన్లో సీఐలు బదిలీ
Comments
Please login to add a commentAdd a comment