
యువ తేజం
5వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్మేళా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉద్యోగ, ఉపాధి అవకాశల్లేక, పక్కదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించేలా జిల్లా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువత సమాజంలో గౌరవంగా బతికేలా చూసేందుకు ‘యువ తేజం’ పేరుతో జిల్లాలో పోలీసు శాఖ మొదటిసారిగా మెగా జాబ్మేళా నిర్వహిస్తోంది. యువతకు ఏదో ఒక ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వివిధ కంపెనీలతో మాట్లాడి, వారిని ఒప్పించి ఈనెల 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నారు.
యువత పక్కదారి పట్టకుండా..
జిల్లాలో పదో తరగతి, ఆపైన ఇంటర్, బీఏ, బీటెక్, బీబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర కోర్సులు చేసిన యువతలో కొందరు పక్కదారులు పడుతున్న వారు ఉన్నారు. మరికొందరు చదువుకున్నా అవకాశాలు లభించని వారు ఉన్నారు. తాగుడు, ఇతరత్రా మత్తు పదార్థాలకు బానిసైన వారు కూడా ఉన్నారు. యువత ఖాళీగా ఉండటం వల్ల వ్యససాలకు బానిసై పక్కదారులు పడుతోది. తద్వారా నేరాలు పెరిగిపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. యువత ఖాళీగా ఉండవద్దనే ఆలోచనలతో పాటు, నేరాలను అరికట్టేందుకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ నిర్ణయించారు.
రూ.13 వేలకు తగ్గకుండా వేతనం..
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారంతా అర్హులే. వారికి వివిధ రంగాల్లో అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ సేల్స్, కాల్సెంటర్, ఇతరత్రా కంపెనీల్లో ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎంపికైన వారికి ఆయా కంపెనీలు కనీస వేతనం రూ.13 వేలకు తగ్గకుండా ఇవ్వనున్నాయి. ఈ జాబ్మేళాలో పాల్గొనాలనుకునే వారంతా సమీప పోలీస్స్టేషన్లలో వెంటనే పేరు నమోదు చేసుకొని, 5వ తేదీన జాబ్ మేళాకు హాజరు కావచ్చు.
జాబ్మేళాకు వందకుపైగా కంపెనీలు..
డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా పెద్ద ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ జాబ్ మేళాలో విప్రో, ఫాక్స్కాన్, హెచ్సీఎల్, క్యూబ్ కన్సల్టింగ్, హెడ్ఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు, హెటిరో, అపోలో ఫార్మసీ తదితర ఫార్మా కంపెనీలు, సన్షైన్, ఏఐజీ హాస్పిటల్స్ తదితర ఐటీ, రిటైల్, హెల్త్కేర్రంగాలకు చెందిన వందకు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. వాటిల్లో యువతకు అవకాశాలు లభించనున్నాయి.
ఫవందకు పైగా కంపెనీలు, 2500
మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ఫ టెన్త్ ఆపైన చదివినవారు అర్హులు.. డిగ్రీ, బీటెక్, పీజీ వారికి ప్రత్యేక అవకాశాలు
ఫ యువత సన్మార్గంలో నడిచేలా ఎస్పీ శరత్చంద్ర పవార్ వినూత్న ఆలోచన
గంజాయికి బానిసైన వారు పాల్గొనేలా..
జిల్లాలోని నిరుద్యోగ యువతతోపాటు నల్లగొండ వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో చదువుకున్న యువతతోపాటు జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువతపై పోలీస్శాఖ ప్రత్యేక దృష్టి సారించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యంగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించిన దాదాపు 400 మంది జాబ్మేళాలో పాల్గొనేలా చేసి వారికి ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక నల్లగొండ పాతబస్తీలో ప్రతి వార్డు నుంచి 20 మంది జాబ్మేళాకు హాజరయ్యేలా చూడనున్నారు.