
నంద్యాల పొగాకు–2 రకం సాగుతో మంచి దిగుబడులు
నంద్యాల(అర్బన్): నంద్యాల పొగాకు–2 రకం పొగాకు సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని రాజమండ్రి ఐసీఏఆర్ కేంద్రీయ పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు. అఖిల భారత సమన్వయ పథకం పరిశోధనల్లో భాగంగా స్థానిక ఆర్ఏఆర్ఎస్లో సాగవుతున్న నంద్యాల పొగాకు–1, 2 రకాలను శనివారం ఏడీఆర్ జాన్సన్, పొగాకు శాస్త్రవేత్తలు పుల్లిబాయి, సతీష్బాబుతో కలిసి డైరెక్టర్ శేషుమాధవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పొగాకు–1, 2 బీడీ రకాలు ఇదివరకే ఆర్ఏఆర్ఎస్ నుంచి విడుదలయ్యాయన్నారు. పొగాకు–2 రకం దిగుబడి మామూలు రకాలతో పోల్చి చూస్తే అధిక దిగుబడి నమోదవుతుంది కాబట్టి రైతులు నంద్యాల–2 రకాన్ని సాగు చేయాలన్నారు.
20 నుంచి ‘నైపుణ్య’ శిక్షణ
నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెబ్ డెవలపర్, డొమిస్టిక్ డేటా ఎంట్రీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్స్కు ఇంటర్, ఆపై చదివిన వారు, వెబ్ డెవలపర్ కోర్సుకు డిగ్రీ లేదా బీటెక్లో కంప్యూటర్ చదివిన వారు అర్హులన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో కూడా సర్టిఫికెట్ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం ఆయా కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అర్హులైన యువతీ యువకులు రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 8297812530 నంబరును సంప్రదించాలన్నారు.
జిల్లాలో 107 క్లస్టర్ పాఠశాలలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 29 మండలాల్లో 107 క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి, సర్వశిక్ష అభియాన్ జిల్లా అడిషనల్ కో ఆర్డినేటర్ ప్రేమాంత కుమార్, జిల్లా సెక్టోరియల్ అధికారి జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులకు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. క్లస్టర్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించామన్నారు. ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల మెరుగుదల, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 శివరాంప్రసాద్, ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, సుధాకర్, హైమావతి, పాఠశాల హెచ్ఎంలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మేలుజాతి దూడల ప్రదర్శన
డోన్: సీసంగుంతల గ్రామంలో మేలు జాతి గేదె, ఆవు దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉమ్మడి కర్నూలు జిల్లా పశువైద్యశాఖ కార్యనిర్వాహక ముఖ్య అధికారి డాక్టర్ రాజశేఖర్ పరిశీలించారు. ప్రాంతీయ పశువైద్యశాల వైద్యు లు డాక్టర్ నాగరాజు, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. మేలుజాతి పాడి పశువులకు కృత్రిమ గర్భధారణతో పశుపోషకులు లబ్ధి పొందవచ్చన్నారు. ఈతకు ఈతకు మధ్య దూరం తగ్గించాలన్నారు. పాడిరైతులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పశువైద్యు లు ఉసేన్బాషా, డాక్టర్ హరీష్, డాక్టర్ భాను, డాక్టర్ సాయికీర్తి పాల్గొన్నారు.
బాలల్లో నేర స్వభావాన్ని నియంత్రించాలి
కర్నూలు: బాల నేరస్తుల్లో ఉండే నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి కబర్ధి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో బాలుల న్యాయ చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు డీసీపీఓ శారద, నంద్యాల డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని, జేజేబీ మెంబర్లు మాధవి, సునిత పాల్గొన్నారు.

నంద్యాల పొగాకు–2 రకం సాగుతో మంచి దిగుబడులు
Comments
Please login to add a commentAdd a comment