
సాక్షి, న్యూఢిల్లీ : రెండు లక్షలకు దిగువ కేసులతో ఒక్కసారిగా తీవ్రత తగ్గిందేమో అనిపించిన కొవిడ్ 19 జబ్బు మళ్లీ విజృంభిస్తోంది. తాజా లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 2,11,298 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వివరాలను వెల్లడించింది. దేశంలో 89.66 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కాగా, మంగళవారం రెండు లక్షలకు దిగువ కేసులు నమోదు అయ్యాయి. దీంతో లాక్డౌన్ మంచి ఫలితాన్ని ఇస్తోందని, కరోనా విజృంభణ తగ్గుతోందని అనుకున్నారు. అయితే బుధవారం నుంచి మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటలలో 21,57,857 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2, 11, 298కి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇక దేశం మొత్తంగా కరోనాతో 3,847 మంది మృతిచెందినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,15,235 మంది కరోనాతో చనిపోయినట్లు అయ్యింది. ఈ కేసులతో మరణాల రేటు 1.15 శాతానికి చేరుకుంది.
ఇక గత 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 2,83,135. దేశంలో ఇప్పటిదాకా 2,73,69,093 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.19 శాతంగా, యాక్టీవ్ కేసుల సంఖ్య 24,19,907గా ఉంది. కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,46,33,951గా ఉంది. నిన్న(బుధవారం) దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 18,85,805.
Comments
Please login to add a commentAdd a comment