
శనివారం చార్ధామ్ యాత్ర తొలిరోజు యమునోత్రి వద్ద భక్తుల రద్దీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఆరు నెలల అనంతరం తిరిగి తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర మొదలైంది. గంగోత్రి ఆలయ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి గుడిని 12.41 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. ఈ సందర్భంగా గంగోత్రి ఆలయంలో, యమునా దేవత శీతాకాల నివాసమైన ఖర్సాలీలో కూడా ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి పూజలు చేశారు.
అనంతరం యమునా దేవిని అందంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా యమునోత్రికి తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రకు ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈనెల 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. హిమాలయాల్లోని ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో రోజువారీ భక్తుల సందర్శనపై పరిమితం విధించాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు సీఎం ధామి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment