
సాక్షి, ఛత్తీస్ఘడ్: మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారా?. కావాలనే మృత దేహం అప్పగింతకు జాప్యం చేస్తున్నారా?. అసలు మృతదేహాన్ని అప్పగిస్తారా? లేదా?. ఆయన కుటుంబ సభ్యులు కోర్టు ఆర్డర్తో వెళ్లినా కూడా పోలీసులు తాత్సారం చేస్తుండడంపై ఇప్పుడు విమర్శలు వినవస్తున్నాయి.
ఛత్తీస్ఘడ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈనెల 21 న జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు తో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే..
ఆయన మృతదేహాన్ని(Nambala Dead Body) అప్పగించాలని ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయినా కూడా మృతదేహాల అప్పగింత విషయంలో ఛత్తీస్ఘడ్ పోలీసులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం ఆ రాష్ట్రానికి చెందిన మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించడం గమనార్హం.
మరోవైపు.. కేశవరావు కుటుంబ సభ్యులను పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తమ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు ఆర్డర్ ఉన్నా అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగి ఆరు రోజులు కావడం.. మృత దేహం కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నందున సత్వరమే నంబాల మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఛత్తీస్ఘడ్ పోలీసులు(Chhattisgarh Police) ఇదే రీతిలో వ్యవహరిస్తే ఆందోళన చేపతామని హెచ్చరిస్తున్నారు.

నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో.. మృతదేహాన్ని ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజును కడసారి చూపు చూసేందుకు లేకుండా చేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.