నాటి రాజీవ్‌ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం! | Sakshi
Sakshi News home page

నాటి రాజీవ్‌ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం!

Published Sun, Oct 22 2023 10:07 AM

Madhya Pradesh Election Rehli Assembly Seat - Sakshi

అది..1985.. అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రచారానికి రహ్లీ వచ్చారు. ఈ నేపధ్యంలో ఇక్కడి హైస్కూల్ గ్రౌండ్‌లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. భారీగా జనం హాజరు కావడంతో ఆ సభ చారిత్రాత్మకంగా నిలిచింది. రాజీవ్‌ ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

బహిరంగ సభ విజయవంతమైన నేపధ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మహదేవ్ ప్రసాద్ వరుసగా మూడోసారి రికార్డుస్థాయి ఓట్లతో విజయం సాధిస్తారని కాంగ్రెస్‌ నేతలంతా భావించారు. అయితే మహాదేవ్‌ ప్రసాద్‌కు ప్రత్యర్థిగా బీజేపీ 32 ఏళ్ల గోపాల్ భార్గవ్‌ను రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడగానే అందరూ ఉలిక్కిపడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహదేవ్‌ తన ప్రత్యర్థి భార్గవపై దాదాపు 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

కాంగ్రెస్‌ ఈ ఓటమిపై విశ్లేషణ చేసింది.  బుందేల్‌ఖండ్‌లో ఓటర్లు నోటాను విరివిగా ఉపయోగించారని, ఇక్కడి ఓటర్లు అన్ని పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారని తేలింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ నియంత్రణ కార్యక్రమంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అప్పటి అనుభవజ్ఞుడైన కాంగ్రెస్ నేత శ్యామ చరణ్ శుక్లా పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ, రహ్లీ నుండి మహదేవ్ ప్రసాద్ హజారీ పేరును సూచించారు. తొలుత మహదేవ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించినా, ఆ తర్వాత అంగీకరించారు. కాగా నాటి నుంచి ఇప్పటి వరకు రహ్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎ‍ప్పుడూ గెలవలేదు. 1985 నుంచి బీజేపీ ఈ సీటును గెలుచుకుంటూ వస్తోంది. ఈ ట్రెండ్ 2018 వరకు కొనసాగుతూ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో గోపాల్ భార్గవ ఈ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై వరుసగా 9వ సారి పోటీకి దిగారు. 
ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? ఏడు అడుగులు దేనికి చిహ్నం?

Advertisement
Advertisement