![Man Pops Two Viagra Tablets With Alcohol Found Dead A Day Later - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/7/Tablets123.jpg.webp?itok=BRRdkCca)
న్యూఢిల్లీ: వయగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24 గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి భారత పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి రెండు వయగ్రా ట్యాబ్లెట్లు వేసుకుని అదే సమయంలో ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు.
ఆరుగురు సభ్యులతో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు దీనిపై కేస్ రిపోర్ట్ను గతేడాది సెప్టెంబర్లో రూపొందించారు. దీన్ని ఈ వారమే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ నివేదిక ప్రచురణకు కూడా ఆమోదం పొందింది. అయితే పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత జర్నల్లో ప్రచురించనున్నారు.
వయగ్రా తీసుకుని మద్యం తాగడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనే విషయంపై ఈ పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఈ ఘటనలో మరణించిన 41 ఏళ్ల వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి శస్త్రచికిత్సలు కూడా జరగలేదని గుర్తించారు.
ఇతడు చనిపోవడానికి ముందు రోజు తన స్నేహితురాలితో హోటల్లో ఉన్నాడు. రెండు వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం వల్లే అతను చనిపోయినట్లు తేలింది. మెదడులో గడ్డకట్టిన రక్తం 300 గ్రాములు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అలాగే అతని హార్ట్ వాల్స్ గట్టిపడటంతో పాటు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినట్లు వెల్లడైంది.
వైద్యుల సూచన అవసరం..
దీంతో వైద్యుల సూచన లేకుండా వయగ్రా వాడకూడదని పరిశోధకులు హెచ్చరించారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయంపైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం ఏంది నాయనా..?
Comments
Please login to add a commentAdd a comment