research
-
నిలిచి గెలిచిన శాస్త్రవేత్తలు
మానవజాతి ఉనికికి, పురోగమనానికి మహిళ పాత్ర కీలకం. ఆ మాటకొస్తే ఏ జాతి ప్రగతికైనా స్త్రీ పురుషుల భాగ స్వామ్యం తప్పనిసరి. కానీ అనాదిగా స్త్రీ వివక్షను ఎదుర్కొంటూనే ఉంది. ఇది ఏ ఒక్క రంగానికో, ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. అందుకు సైన్సు కూడా మినహాయింపు కాదు. అవధులు లేని అభివృద్ధిని సాధించామనుకుంటున్న నేటి పరిస్థితుల్లో కూడా మహిళ వివక్షను, ప్రతికూలతలను ఎదుర్కొంటూనే ఉంది. విజయాలందుకొంటూనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతిలో తనదైన ముద్రను కనబరుస్తూనే ఉంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె లేని సమాజాన్నెలా ఊహించుకోలేమో, ఆమె చేయూత లేని సైన్సు అభివృద్ధి కూడా ఊహాతీతం. నూరేళ్ల చరిత్ర కలిగిన నోబెల్ బహుమతులకు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేయటంలో కూడా ఈ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇన్నేళ్లయినా సైన్సులో నోబెల్ బహు మతి వచ్చిన మహిళలు రెండు పదులకు మించి లేరు. రెండు సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరి సైతం ఈ ప్రతికూలతను ఎదుర్కొంది. 1903లో తొలుత పియరీ క్యూరీ, హెన్రీ బెక్రెల్ల పేర్లే ఎంపికయినాయి. పియరీ దాన్ని తిరస్కరించటంతో ఆ తర్వాత మేరీతో కలసి వారు నోబెల్ బహుమతిని అందుకున్నారు. నేటి శాస్త్ర రంగాన్ని అత్యంత గణనీయంగా ప్రభావితం చేసినది వాట్సన్, క్రిక్ల డీఎన్ఏ నిర్మాణ డిస్కవరీ. ఇంత గొప్ప ఆవిష్కరణలో కీలక పరిశోధన లు అందించిన మహిళ రోజాలిండ్ ఫ్రాంక్లిన్కు నోబెల్ బహుమతి దక్కలేదు. డీఎన్ఏ నిర్మాణాన్ని కళ్లకు కట్టి చూపిన ఆమె ఎక్స్రే ఫొటో (ఫొటో నం. 51)నే ఆధారమన్న సంగతి మరచి పోలేని నిష్ఠుర సత్యం.ఈ డిస్క వరీ అనేకానేక విజ్ఞాన శాస్త్ర రంగా లకు ప్రాణం పోసింది. నేడది డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చటమే కాకుండా, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన శిలాజాల నుండి సంగ్రహించిన డీఎన్ఏ నమూనాలతో సరి కొత్త శిలాజ జీనోమిక్ శాస్త్ర విజ్ఞా నానికి నాంది పలికింది. ఆ పరిశో ధనలు చేసిన స్వాంటే పేబో వంటి శాస్త్ర జ్ఞులకు నోబెల్ బహుమతిని అందించింది కూడా.క్రోమోజోమ్లపై జన్యువులు ఒక స్థానం నుండి మరొక స్థానానికి దూకుతాయన్న ‘దూకుడు జన్యువుల’ డిస్కవరీ జన్యు శాస్త్రాన్ని గొప్ప మలుపు తిప్పింది. జెనెటిక్ ఇంజనీరింగ్లో కొత్త ప్రక్రియలకు పునాది వేసింది. దీనిని కనిపెట్టింది కూడా బార్బరా మెక్లింటాక్ అనే గొప్ప మహిళా శాస్త్రవేత్త. ఈ డిస్కవరీకి తానొక్కతే నోబెల్ బహుమతి మొత్తాన్ని గెలుచుకున్న తొలి మహిళ కూడా ఆమె. ఏ జన్యువు ఎప్పుడు పని చేయాలో, ఎక్కడ ఆగిపోవాలో అనేది పరిణామంలో ఒక పజిల్. ఈ డిస్కవరీలో పరిణామ జీవ శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. విద్యాధికులూ, శాస్త్రవేత్తలూ మాత్రమే గొప్ప ఆవిష్కరణలు చేస్తారని సాధా రణంగా అనుకుంటాం. ఇందుకు భిన్నంగా ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి చదువు కూడా పెద్దగా లేని మహిళ మేరీ యానింగ్ శిలాజ విజ్ఞాన శాస్త్ర వేత్తగా ఎదిగి జీవ పరిణామ సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసింది. బ్రిటన్ లైమ్రెజిస్ ప్రాంతపు సముద్ర తీరంలో పర్యాటకులకు గవ్వలమ్ముకుని జీవించే సాదా సీదా అమ్మాయి యానింగ్. పన్నెండేళ్ల వయసులోనే ఇక్తియోసార్ పుర్రెను వెలికి తీయటంలోతండ్రికి తోడ్పడింది. ఒకప్పుడు నీళ్లలో నివసించిన సరీసృపాల జాతికి చెందిన శిలాజానికిది నిదర్శనం. ఆమె కృషి పట్టుదలతో వెలికి తీసిన అనేక శిలాజాలు జీవులు పరిణామం చెందు తాయన్న ఆలోచనలకు బలం చేకూర్చాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఆమె కనిపెట్టిన శిలాజాలు పరిపుష్టం చేశాయి. అందుకే ఆమె ప్రపంచంలో తొలి మహిళా శిలాజ శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించింది. బ్రిటన్లో శాస్త్రవేత్తలకిచ్చే అత్యున్నత పురస్కారా లను సైతం ఈ సామాన్య యువతి అందుకుంది. అవాంతరాలు, ప్రతికూలతలు ఎన్ని ఉన్నా మహిళ సాధించలేనిది లేదని చెప్ప డానికివి మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలే. సైన్సు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే పురుషులతో సమా నంగా మహిళల భాగస్వామ్యాన్ని సాధించాలి.శాస్త్ర రంగంలో భారతదేశపు పరిస్థితి, మహిళల ప్రాతి నిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. 2005లోనే సైన్స్రంగంలో మహిళలపై భారత ప్రభుత్వ (డీఎస్టీ) నియమించిన నిపుణుల కమిటీ కూడా మహిళలు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని తేల్చింది. డాక్టరేట్లు చేసిన మహిళలు శాస్త్ర సంస్థలు, యూనివర్సిటీ సిబ్బందిలో అతి తక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా విధాన నిర్ణ యాలు చేసే స్థాయిలో, సంస్థల డైరెక్టర్లు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్లు, ఇతర పాలనాపరమైన ముఖ్య స్థానాల్లో పరిమితంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?మహిళలకు సైన్సులో మరింత ప్రోత్సాహం ఇవ్వాలనీ, ఉద్యోగ నియామకా లను క్రమబద్ధంగా జరపాలనీ ఆ కమిటీ సూచించింది. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. శాస్త్ర రంగంలో మహిళలు ముందడుగు వేయటానికి నిపుణుల సూచనలు అమలు చేయటం ఒక అవసరమైతే, ప్రభుత్వాల దృష్టి కోణంలో మార్పు రావటం అత్యవసరం. -వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షులు-ప్రొ‘‘ కట్టాసత్యప్రసాద్ -
ఏనుగు మళ్లీ జూలు విదిలిస్తుందా?
వూలీ మమోత్.. భారీ ఆకారంతో, సింహం జూలును తలపించేలా తొండం నుంచి తోకదాకా దట్టమైన రోమాలతో భీకరంగా ఉండే ఏనుగు అది. అలాంటి ఏనుగును పునః సృష్టించేందుకు.. ఒక ‘ఎలుకంత’ ముందడుగు పడింది.తల నుంచి తోకదాకా నిండా దట్టమైన రోమాలతో కూడిన ఎలుక జీవం పోసుకుంది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు చేసిన ఈ చిత్రమైన పరిశోధన ఏమిటో తెలుసుకుందామా... –సాక్షి, సెంట్రల్డెస్క్ధ్రువ ప్రాంత మంచులో దొరికిన ఆనవాళ్లతో..భూమ్మీద తిరుగాడి, కాలక్రమేణా అంతరించిపోయిన అరుదైన జీవులను పునః సృష్టి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు వూలీ మమోత్ ఏనుగులకు తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల్లోని జన్యువులను, ప్రస్తుతమున్న సాధారణ ఆసియన్ ఏనుగుల జన్యువులను పోల్చి చూశారు. మమోత్లలో దట్టమైన వెంట్రుకలకు కారణమైన జన్యువులను గుర్తించారు. దీనికి సంబంధించి తొలుత ఎలుకలపై ప్రయోగాలు చేపట్టారు. ‘‘అంతరించిపోయిన ఒకనాటి జీవులను పునః సృష్టించగలం అనేందుకు ఈ ఎలుకలు సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో వూలీ మమోత్లను పుట్టించి, ప్రకృతిలోకి వదిలిపెట్టగలం..’’అని కొలోస్సల్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ బెత్ షాపిరో పేర్కొన్నారు.1 ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల నుంచి జన్యువులను సేకరించారు.2 ఇప్పుడున్న ఆసియా ఏనుగుల జన్యువులతో, వూలీ మమోత్ జన్యువులను పోల్చి తేడాలను గుర్తించారు.3 ఎలుక పిండ కణాలను తీసుకుని.. వాటిలో పైచర్మం, వెంట్రుకలు, వాటి పొడవు, మందం తదితర లక్షణాలను నియంత్రించే ఎనిమిది జన్యువుల్లో.. మమోత్ల జన్యువుల తరహాలో మార్పులు చేశారు.4 ఈ జన్యుమార్పిడి చేసిన పిండ కణాలను కొన్ని సాధారణ ఎలుకల గర్భంలో ప్రవేశపెట్టారు.5 నిండా దట్టమైన రోమాలతో, అతి శీతల వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగిన ‘ఊలు ఎలుకలు’ జన్మించాయి. -
రాసిన పరీక్ష గురించి అతిగా ఆలోచించొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం తొలిరోజు పరీక్ష ముగిసింది. సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు గురువారం తొలి పరీక్ష ముగుస్తుంది. మధ్యలో విరామం తర్వాత తదుపరి పరీక్షలు కొనసాగుతాయి. అయితే తొలిరోజు పరీక్ష అనుభవం మిగతా పరీక్షలకు మార్గదర్శకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పరీక్ష ఎలా రాశాం? సన్నద్ధత సరిపోయిందా? అనేది ఒక్కసారి పైపైన సరి చూసుకోవాలే గానీ..దాని గురించి పెద్దగా ఆలోచించ కూడదని స్పష్టం చేస్తున్నారు. ప్రతి ప్రశ్న లోతుల్లోకి వెళ్ళొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మెదడులోకి జ్ఞాపక శక్తిని ప్రేరేపించే సున్నితమైన కణజాలం ఒత్తిడికి గురవుతుందని లండన్కు చెందిన మానసిక శాస్త్రవేత్తల పరిశోధన పేర్కొంటోంది. పరీక్షల సమయంలో ఒత్తిడి కల్గించే కణజాలంపై వారు ప్రత్యేక పరిశోధన చేశారు. ఈ పరిశోధనతో పాటు ప్రస్తుత కీలక సమయంలో విద్యార్థుల ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఎలాంటి మానసిక ధోరణిని అలవాటు చేసుకోవాలి? అనే అంశాలపై మరికొన్ని ఇతర పరిశోధనలు, నిపుణుల సూచనలు, అధ్యాపకుల అనుభవాలను ‘సాక్షి’క్రోడీకరించింది. పాజిటివ్ థింకింగ్ కొనసాగించాలి రాసిన పరీక్ష ఎలా ఉన్నా చెయ్యగలిగిందేమీ లేదు. కాబట్టి విద్యార్థులు బాగా రాశాం అన్న పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. ఇది పరీక్షలు పూర్తయ్యే వరకూ కొనసాగించాలి. రాసిన పరీక్షలో బాగా మార్కులు వస్తాయనుకున్న ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని మానసిక వైద్య నిపుణులు సంధ్య తెలిపారు. ఇది మెదడులోని కణాలకు సానుకూల సంకేతాలను పంపుతుందని ఆమె చెప్పారు. మున్ముందు రాసే పరీక్ష స్వభావం తేలికగా ఉంటుందనే భావన విద్యార్థిని ఉత్తేజపరుస్తుందని లండన్ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్ జాన్ ఉల్లేకర్ వివిధ పరిశోధనల పరిశీలన అనంతరం తెలిపారు. ముఖ్యంగా రాసిన పరీక్ష గురించి స్నేహితులతో పదేపదే సంభాషించకూడదు. దీనికి బదులు రాయబోయే పరీక్ష గురించి చర్చించుకోవడం మంచిది. అలాగే జరిగిన పరీక్షకు సంబంధించి అధ్యాపకుడితో ఎక్కువసేపు చర్చించే కన్నా.. జరగాల్సిన పరీక్షకు సంబంధించి సంభాషించడం వల్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని ముంబైకి చెందిన మానసిక శాస్త్ర నిపుణులు నీలమ్ ద్వివేది ఇటీవల ఐఐటీ ముంబై విద్యార్థులను ఉద్దేశించి హితబోధ చేశారు. నిన్నటి అంశాలను మరిచిపోవాలి కొన్ని రంగులు కలిస్తే మరో కొత్త రంగు ఏర్పడుతుంది. అదే విధంగా గత పరీక్షకు సీరియస్గా అయిన ప్రిపరేషన్.. తర్వాత పరీక్షకు సన్నద్ధతలో జ్ఞప్తికి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రిపరేషన్కు కొన్ని నిమిషాలు విరామం ఇవ్వాలని, అప్పుడే మంచి సన్నద్ధత అలవడుతుందని ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త అనిల్ పాండే తెలిపారు. రాసిన పరీక్షలో చివరి ప్రశ్నలు.. వాటి సమాధానాల తీరు మెదడులో నిక్షిప్తమై జ్ఞప్తికి వస్తుంటుంది. కాబట్టి తదుపరి పరీక్షకు పూర్తి వ్యతిరేక కోణంలో స్టడీ చేయాలని ఆయన సూచించారు. అంటే నిన్నటి పరీక్షకు చిన్నచిన్న ప్రశ్నలతో సన్నద్ధత మొదలుపెడితే.. రేపటి పరీక్షకు పెద్ద ప్రశ్నలతో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి.రాయడం, వినడం, చదవడం, గ్రూప్ డిస్కషన్ లాంటివన్నీ ముందు రోజుకన్నా భిన్నంగా ఉండాలి. నిన్నటి అంశాలను పూర్తిగా మరిచిపోవడానికి కొంతసేపు రేపటి పరీక్ష సబ్జెక్టును, కాలేజీలో బోధకుడు చెప్పిన అంశాలతో పాటు సరదాగా సాగిన గతాన్ని చర్చించుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్కు పూర్తి స్థాయి ప్రణాళికను అనుసరించే వీలుంటుందని కెనడాలో పరీక్షలపై జరిగిన పరిశోధన సారాంశం తెలియజేస్తోంది. సందేహాలు నివృత్తి చేసుకోవాలి.. టెన్షన్ వద్దు ఇంటర్లో రెండోరోజు రాసే పరీక్ష ఇంగ్లిష్. ఆర్టికల్స్, పాసివ్ వాయిస్, ప్యాసేజ్ క్వశ్చన్స్, మిస్సింగ్ లెటర్స్.. ఇలాంటివి బట్టీ పడితే రావు. వివిధ మార్గాల్లో ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకు టెన్సెస్ (కాలాలు..భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు) గురించి ప్రిపేర్ అవ్వాలంటే అనేక సందేహాలొస్తాయి. వాటికి కచ్చితమైన సమాధానాలు పుస్తకాల్లో ఉండవు. ఇలాంటి సందర్భాల్లో మెదడును అధికంగా ఒత్తిడికి గురిచేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఏ టెన్స్ను ఏ సందర్భంలో ఉపయోగించాలనే సందేహం ఉంటే అధ్యాపకుడిని ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. ప్యాసేజ్, పొయిట్రీ విషయంలో చేసే ప్రిపరేషన్ సరైందనే భావనతో ఉండాలి. క్రాస్ చెక్ పేరుతో సమయం వృథా చేయకూడదు. అనవసర భయాన్ని మెదడులోకి తీసుకెళ్ళొద్దు. జస్ట్ ప్రాక్టీస్.. అంతే ఇంటర్ ద్వితీయ పరీక్ష ఇంగ్లిష్. విద్యార్థులు తర్వాత రాసేది ఇదే. సాధారణంగా గ్రామర్ విషయంలోనే కొంత తికమక ఉంటుంది. మిస్సింగ్ లెటర్స్, ఆర్టికల్స్, ప్యాసేజీ వంటివి జడ్జి చేయడం ఇబ్బందే. అందువల్ల ఆఖరి నిమిషంలో కొంతమేర వీటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. గ్రామర్ పాయింట్స్కు పాఠ్య పుస్తకాలు ఫాలో అవ్వాలి. దీనివల్ల ఆఖరి నిమిషంలో కీలకమైన అంశాలు గుర్తించే వీలుంది. ఇది పాజిటివ్ మైండ్ సెట్కు దోహద పడుతుంది. – దాసరి సైదులు (ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆంగ్ల అధ్యాపకుడు, అమ్రాబాద్, నాగర్కర్నూల్ జిల్లా) -
'మష్రూమ్ చట్నీ పౌడర్': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!
బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించిన ముఖ్యమైన సాంకేతికతల్లో ఒకటి ‘అర్క మష్రూమ్ చట్నీ పౌడర్’ టెక్నాలజీ. పుట్టగొడుగులకు విలువ జోడించటం ద్వారా వాటిలో పోషక విలువలను అనేక విధాలుగా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. సంప్రదాయం, పౌష్టికత, రుచిల మేలు కలయికకు మష్రూమ్ చట్నీ పౌడర్ టెక్నాలజీ నిదర్శనంగా నిలుస్తుంది. తాజా పుట్టగొడుగులు ఎన్నో రోజులు నిల్వ ఉండవు, పైగా మార్కెట్ ధర ఎక్కువ. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండవు. అందుకని వీటిత పొడులు తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఎండు పుట్టగొడుగులతో రకరకాలుగా చట్నీ పొడులను తయారు చేసుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు రోజువారీ భోజనంలో సులభంగా వాడుకునే విధంగా పోషకాలు నష్టపోని రీతిలో పొడులు తయారు చేయవచ్చు. సంప్రదాయ రుచులకు తగినట్టుగా 7 రకాల పుట్టగొడుగుల చట్నీ పొడులను రూపొందించారు. బ్రహ్మీ, మునగ ఆకులు, అవిశ గింజలు, నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి వంటి వాటితో వీటిని వేర్వేరుగా రూపొందించారు. మన వంటకాల్లో కలిపి ఈ పొడులను వాడుకోవచ్చు. స్కూళ్లలో మధ్యాహ్నభోజనం, సైన్యానికి భోజనాల్లో సైతం వాడుకోదగినవని ఐఐహెచ్ఆర్ పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ పొడులను తయారు చేసి ఎయిర్ టైట్ కంటెయినర్లలో/ పౌచ్లలో నింపుకొని (26–28 డిగ్రీల సెల్షియస్) సాధారణ ఉష్ణోగ్రత ఉండే చోట నిల్వ చేసుకుంటే 3 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ పొడులను తయారు చేసి విక్రయించడం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలు, సైనిక వితంతువులు, వికలాంగులు.. ఉపాధి పొందవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఈ టెక్నాలజీ పూర్తి వివరాలకు.. 080–23086100 – ఎక్స్టెన్షన్ 348, 349 mushroomiihr@gmail.com(చదవండి: -
ఫోన్ లేకుంటేనే సూపర్ బ్రెయిన్!
మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్ ఫోన్తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా?. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అంతలా అడిక్ట్ అయ్యాం మరి!. అయితే ఫోన్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుండడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా(Smart phone Less Use) ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీకి చెందిన కోలోగ్నే, హెయిడెల్ బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం త్రీడేస్ చాలెంజ్ను కొంతమందిపై ప్రయోగించారు. ఎంపిక చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు(దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్కు అనుమతించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అడిక్షన్ను కూడా పరిశీలించారు. రీసెర్చ్కు ముందు.. తర్వాత ఆ వ్యక్తులకు ఎమ్మారై స్కాన్తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఫోన్ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్ అత్యంత చురుకుగా ఉండడం. అంతేకాదు.. వ్యసనానికి సంబంధించిన ‘‘న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ’’కు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులను గమనించారట. తద్వారా ఫోన్కు ఎంత దూరంగా ఉంటే.. బ్రెయిన్ అంత ‘సూపర్’గా మారుతుందని ఒక అంచనాకి వచ్చారు. సుదీర్ఘంగా.. పదే పదే జరిపిన పరిశోధనలన (longitudinal Study) తర్వాతే తాము ఈ అంచనాకి వచ్చినట్లు చెబుతున్న పరిశోధకులు.. భవిష్యత్తులో మరింత స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏం చెప్పిందంటే..ఇక్కడో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్ చాలెంజ్ను సక్సెస్ ఫుల్గా పూర్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన ఆమె.. మూడు రోజులు ఫోన్కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ అనుభవాన్ని తన ఇన్స్టాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులపాటు ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ అభిమానులకు ఆమె సూచన ఇచ్చారు కూడా. -
వాష్రూంలో టూత్బ్రష్.. మీ పళ్లు మటాష్!!
‘మీ టూత్పేస్ట్లో ఉప్పుందా?’.. అంటూ వచ్చే టీవీ యాడ్ను చూసే ఉంటారుగా.. దృఢమైన దంతాలు, చిగుళ్ల కోసం ఉప్పున్న తమ పేస్ట్నే వాడాలంటూ ఓ ప్రముఖ టూత్పేస్ట్ కంపెనీ చేసుకొనే ప్రచారం అది. మరి మీ టూత్బ్రష్లు వాష్రూంలో ఉంటాయా? బ్రష్ చేసుకొని తిరిగి వాటిని అక్కడే ఉంచుతారా? అయితే మీకు పంటి సమస్యలు తప్పవని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది!! సాక్షి, సిద్దిపేట: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టూత్పేస్ట్ను ఎంపిక చేసుకోవడం ఒక్కటే సరిపోదని.. టూత్బ్రష్లను సరైన చోట ఉంచడం కూడా ముఖ్యమని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన పరిశోధన తేల్చిచెబుతోంది. టూత్బ్రష్లపై ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని.. బ్రష్ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. వాష్రూంలలో ఉంచితే అంతే.. అటాచ్డ్ వాష్రూంలు ఉన్న ఇళ్లలో నివసించే వారిలో చాలా మంది తమ టూత్బ్రష్లను భద్రపరుస్తుండటం సహజమే. అయితే అలా వినియోగిస్తున్న టూత్బ్రష్లపై భారీగా సూక్ష్మజీవులు పేరుకుపోతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయనంలో తేలింది. టూత్ బ్రష్లను వాష్రూంలో ఉంచడం వల్ల ఫ్లష్ చేసిన ప్రతిసారీ కమోడ్ నుంచి నీటితుంపర్లు ఎగిరిపడతాయని.. తద్వారా కమోడ్లో ఉండే బ్యాక్టీరియా నీటితుంపర్ల ద్వారా గాల్లో వ్యాపిస్తూ అక్కడ ఉండే బ్రష్లపైకి ఎక్కువగా చేరుతున్నాయని నిర్ధారణ అయింది. అదే వాష్రూంకు దూరంగా, కాస్త గాలి, ఎండ తగిలే చోట టూత్బ్రష్లను ఉంచిన చోట సూక్ష్మక్రిములు నశిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అలాగే ఇంట్లోని అందరి టూత్బ్రష్లను కూడా ఒకే దగ్గర పెట్టడం అంత సురక్షితం కాదని నిరూపితమైంది. 45 రోజులపాటు సాగిన పరిశోధన టూత్ బ్రష్ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణ అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరిశోధన చేపట్టారు. కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర ఇన్చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో 45 రోజులపాటు పరిశోధన చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు వినియోగిస్తున్న టూత్బ్రష్ల నుంచి 100 నమూనాలను శ్వాబ్ల ద్వారా సేకరించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందా? ఉంటే ఏయే రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయనే దానిపై పరిశోధన చేపట్టారు. మూడు రకాల బ్యాక్టీరియాల గుర్తింపు శాంపిల్స్ సేకరించిన టూత్బ్రష్లలో ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ రకం బ్యాక్టీరియా 50 శాతం, స్టెఫైలోకోకస్ ఆర్యస్ 40 శాతం, ఎస్చెరిషియా కోలి (ఈ–కొలి) బ్యాక్టీరియా 20 శాతం ఉన్నట్లుగా తేల్చారు. పిప్పిపళ్లు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ బ్యాక్టీరియా కారణమవుతుందని చెప్పారు. అలాగే స్టెఫైలోకోకస్ ఆర్యస్ వల్ల గొంతు సమస్యలు, మౌత్ అల్సర్, ఈ–కోలి బ్యాక్టీరియా వల్ల జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.యూవీ లైట్తో బ్యాక్టీరియా మాయంబ్యాక్టీరియా ఉన్న బ్రష్లను ఆయా విద్యార్థులు సొంతంగా తయారు చేసిన యూవీ లైట్బాక్స్లో పెట్టి పరీక్షించగా వాటిపై ఎలాంటి క్రిములు లేవని తేలింది. టూత్ బ్రష్లను వినియోగించే ముందు యూవీ లైట్ బాక్స్లో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచడం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుందన్నారు. మరోవైపు ఒకవేళ బ్రష్లను ఒకేచోట పెట్టాల్సి వస్తే వాటికి క్యాప్లను పెట్టాలని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న విద్యార్థులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వేడినీటితో బ్రష్ను శుభ్రం చేశాకే వాడాలని.. మూడు నెలలకోసారి టూత్ బ్రష్ను తప్పనిసరిగా మార్చాలని చెబుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రిన్సిపాల్ సునీత సూచనలతో సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పర్యవేక్షణలో టూత్బ్రష్ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణపై పరిశోధన చేశాం. ప్రజలకు అవగాహన కల్పించాం. యూవీ బాక్స్ను సైతం తయారు చేశాం. – విద్యార్థినులు.. మౌనిక, షారోన్, నాగలక్ష్మి, సిద్ద, స్నేహ, సుష్మిత ప్రభుత్వ జిజ్ఞాస పోటీలకు పంపుతాం.. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే జిజ్ఞాస పోటీలకు పంపిస్తున్నాం. టూత్ బ్రష్ల ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతోందన్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పరిశోధన చేపట్టాం. – డాక్టర్ మదన్ మోహన్, సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
హిండెన్బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?
అదానీ గ్రూప్, నికోలా వంటి కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నోట్లో ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. సంస్థ మూసివేతకు సంబంధించి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అనే దానిపై అండర్సన్ నోట్లో వివరాలు తెలియజేశారు.‘సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాను. చాలా చర్చలు జరిగిన తర్వాతే సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాను. మేము తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవు. హిండెన్బర్గ్ నా జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ మాత్రం తొనకకుండా సంస్థను నిర్వహించాను. ఈ వ్యవహారం అంతా నాకో ప్రేమకథలా తోస్తుంది. కంపెనీ స్థాపించడానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో కష్టపడేవాడిని. ప్రస్తుతం కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తోంది. ఇకపై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను. నా బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావంహిండెన్బర్గ్ గురించి..నాథన్ అండర్సన్ 2017లో దీన్ని స్థాపించారు. యూఎస్కు చెందిన ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ సంస్థగా, ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. 2023లో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్లో మోసం చేసిందని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికతో కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు)కు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020లో నికోలా తన సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. హిండెన్బర్గ్ రద్దు చేయడానికి ముందు పోంజీ పథకాల నివేదికలతో సహా తన తుది దర్యాప్తులను పూర్తి చేసినట్లు తెలిపింది. అండర్సన్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. -
ఆత్మీయ నేస్తాలు.. పుంగనూరు పొట్టి దూడలు
మూడడుగుల ఎత్తుంటాయి.. చూడముచ్చటగా కనిపిస్తాయి. మార్కెట్లో ధర మాత్రం లక్షల్లో పలుకుతాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ పుంగనూరు పొట్టి దూడలను పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి ‘పొట్టి’ నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయిస్తున్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోపొట్టి దూడల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. పలమనేరు : పుంగనూరు పొట్టిరకం దూడల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవితకాలంలో కేవలం మూడడుగులు మాత్రమే పెరుగుతుంది. తోక నేలను తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ రకం దూడలు రూ.2 నుంచి 4 లక్షలు పలుకుతున్నాయి. రెండో క్వాలిటీ దూడలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈ దూడలు ఇంట్లో ఇంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం వరిస్తుందనే మాట వినిపిస్తోంది. వీటిని కొనేందుకు వందలాదిమంది నిత్యం పశువుల సంతలు, రైతుల వద్దకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టిదూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. 15 సెం.మీ నుంచి 50 సెం.మీ మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతుంటాయి. పొట్టి ఆవులు 85 సెం.మీ నుంచి 110 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం. ఇందుకే అంత డిమాండ్ పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. æ పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా మంచిదని జనం నమ్ముతారు. పొట్టి ఆవులు ఇచ్చే పాలలో రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం.తక్కువ మేత.. అధిక పాల దిగుబడిపలమనేరు సమీపంలోని క్యాటిల్ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. మేలైన పుంగనూరు ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తోంది. వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్కేవీవై కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, ఇందులో 277 వరకు పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోనే ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాల దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.రైతులకు అందిస్తున్నాం పలమనేరు పరిశోధన కేంద్రంతోపాటు ఏపీ ఎల్డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని రైతులు పొందవచ్చు. ఆవు ఎదకొచ్చిన తర్వాత స్థానిక వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో సెమన్ అందిస్తున్నాం. పుంగనూరు పొట్టిజాతిని అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ వీర్యం అవసరమైన రైతులు క్యాటిల్ఫామ్లో కూడా తీసుకోవచ్చు. –వేణు, శాస్త్రవేత్త, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి మూడేళ్లుగా పెంచుతున్నా మూడేళ్లుగా పుంగనూరు రకం పొట్టి దూడలు పెంచుతున్నా. దేశవాళీ రకం పుంగనూరు ఆవుల ద్వారా దూడలను ఉత్పత్తి చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది పొట్టి దూడలు పెంచుతున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంది. ఆసక్తి ఉంటే రైతులకు ఇది ఎంతో లాభదాయకం. – మణి, రైతు, మారేడుపల్లె, గంగవరం మండలం -
తాటి.. ఆదాయంలో మేటి
గ్రామీణ భారతంలో తాటిచెట్టుది ప్రత్యేక స్థానం. పేదవాడి కల్పవృక్షంగా పిలిచే తాటిచెట్టులో ఉపయోగపడని భాగమే ఉండదు. మనదేశంలో తీరప్రాంత రాష్ట్రాల్లో తాటిచెట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి. తమిళనాడులో తాటిచెట్లు అధిక సంఖ్యలో ఉండగా తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్దే. తాటిచెట్టు (Palm Tree) ప్రయోజనాలను గుర్తించిన మన పూర్వికులు దాన్ని ఇంటికి పెద్దకొడుకుగా భావించేవారు. పొలం గట్టున పది తాటిచెట్లుంటే ప్రశాంతంగా జీవించొచ్చు అనుకునేవారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో వీటిపై ఆసక్తి కొంత తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తాటిచెట్ల నుంచి గిరిజనులకు ఆదాయ మార్గాలను చూపించాలనే లక్ష్యంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రి కల్చర్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) ద్వారా అఖిల భారత వన్య పంట పథకంలో భాగంగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తొలిదశ పరిశోధనలు ఫలించాయి. భారతదేశంలో (India) 2010 సంవత్సరంలో తాటి చెట్లపై పరిశోధనకు రెండు చోట్ల అనుమతులు ఇచ్చారు. ఒకటి అల్లూరి జిల్లా పందిరిమామిడిలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, రెండోది తమిళనాడులోని కిలికులం. ఈ రెండు చోట్ల తాటిపై పరిశోధనలు ప్రారంభించారు. తక్కువ సమయంలో కాపునకు వచ్చే రకాలను అభివృద్ధి చేసేందుకు అనేక చోట్ల నుంచి మేలైన తాటి విత్తనాలను సేకరించి అభివృద్ధి పరిచారు. తాటి ఉప ఉత్పత్తులపైనా పరిశోధనలు జరిగాయి. ఇందులో భాగంగా తాటి తేగలతో ఉప ఉత్పత్తులు తయారుచేయడంపై జరిపిన పరిశోధనలు పూర్తయ్యాయి. రెండో దశలో యంత్రాలను ఉపయోగించి వాణిజ్యపరంగా ఉప ఉత్పత్తులు తయారు చేయడంపై పరిశోధనలు ప్రారంభించారు. రెండేళ్ల కిందట తెలంగాణలోని నల్గొండ జిల్లా మల్లేపల్లి, బిహార్లోని సబుర్లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. – రంపచోడవరం(అల్లూరి జిల్లా) లండన్కు తేగల పిండి చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆశ స్వచ్ఛంద సంస్థ పందిరిమామిడి (Pandiri Mamidi) హెచ్ఆర్ఎస్ హెడ్.. డాక్టర్ పి.సి. వెంగయ్య సహకారంతో 2019–20 సంవత్సరంలో మూడు టన్నుల తేగల పిండిని లండన్కు పంపించింది. తరువాత కోవిడ్ కారణంగా ఈ రవాణాకు బ్రేక్ పడింది. తిరిగి మారోమారు లండన్కు తేగల పిండిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రెండో దశ వాణిజ్య ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు తాటి ఉప ఆహారోత్పత్తులపై పరిశోధనలు జరిగాయి. రెండో దశలో వాణిజ్యపరంగా ప్రయోజనం చేకూర్చేందుకు పరిశోధనలు ప్రారంభమయ్యాయి. తాటి తేగల కోత నుంచి పిండి, రవ్వ తయారీ వంటివాటిని భారీ ఎత్తున యంత్రాలతో చేపట్టడంపై పరిశోధనలు సాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్లో 3 కోట్ల వరకు తాటి చెట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క శాతం ఉపయోగించుకున్నా కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో 272 రకాల తాటి చెట్లను అభివృద్ధి చేశాం. – డాక్టర్ పి.సి. వెంగయ్య, అధిపతి, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్, పందిరిమామిడి తేగలతో 12 రకాల ఆహార పదార్థాలు అల్లూరి జిల్లా పందిరి మామిడి పరిశోధన స్థానంలో తాటి తేగలతో పిండి, నూక(రవ్వ) తయారు చేసి, మైదా స్థానంలో వీటిని వినియోగించి పోషక విలువలతో కూడిన ఆహారపదార్థాలు తయారు చేశారు. వీటితో కేకులు, బిస్కెట్లు, జంతికలు, బ్రెడ్, నూడుల్స్, రవ్వలడ్డు, పిజ్జా బేస్ తదితర పదార్థాలు తయారు చేస్తున్నారు. తాటి పండు టెంకలు నాటిన 135 రోజుల తరువాత తాటి తేగలు కోతకు వస్తాయి. తేగలు 30 నుంచి 55 సెంటీమీటర్ల పొడువు, 70 గ్రాముల వరకు బరువు ఉంటాయి. తాటి తేగలు ముక్కులు శుభ్రం చేసి కడిగి ఒక ట్రేలో అరబెట్టాలి. వీటిని నాలుగు గంటల పాటు డ్రయ్యర్లో ఉంచాలి. తేగల పిండి తయారుచేయడానికి ఎండిన తేగలను మెత్తగా రుబ్బి జల్లెడ పట్టాలి. తరువాత పిండిని నానబెట్టి చేదు రుచి పోగొట్టేందుకు డిస్టల్డ్ వాటర్తో విశ్లేషణ చేయాలి. ఈ తేగల పిండిలో ప్రొటీన్ 3.40 శాతం, ఫైబర్ 8.80 శాతం, కాపర్ 0.05 శాతం, జింక్ 0.41 శాతం, ఐరన్ 2.40 శాతం, మెగ్నీషియమ్ 0.05 శాతం ఉంటాయి. బేకరీ ఉత్పత్తుల తయారీలో మైదాకు బదులు తేగల పిండి(ఫ్లోర్) వినియోగించవచ్చు. దీని ద్వారా అధిక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధన స్థానంలో తేగల పిండితో బిస్కెట్లు, నూడిల్స్, నూకతో కేక్లు తయారు చేశారు. మార్కెట్లో కేజీ తేగల రవ్వ ధర రూ. 170 వరకు ఉంది. పది తాటి చెట్ల ద్వారా ఏడాదిలో రూ. 35 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. -
గ్లోబల్ వార్మింగ్కు చెక్
సీతంపేట: విద్యార్థ్ధుల్లో నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు ఆవిష్కరిస్తారని మరొక సారి రుజువైంది. విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల లైఫ్ సైన్స్ విద్యార్ధుల పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డిగ్రీ స్థాయిలోనే అంతర్జాతీయ ప్రతిభ చాటారు బుల్లయ్య కళాశాల విద్యార్ధులు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న గ్లోబల్వార్మింగ్కు విద్యార్ధులు తమ పరిశోధన ద్వారా చక్కటి పరిష్కారం చూపారు.వాతావరణం వేడెక్కడానికి కారణం అవుతున్న కార్చన్ డయాక్సైడ్ శాతాన్ని వాతావరణంలో తగ్గించేలా తమ పరిశోధనతో పరిష్కారం చూపారు. కళాశాలలో బీఎస్సీ లైఫ్ సైన్స్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు హర్షిత, తేజాంబిక్, కార్తికేయ, అశ్విని తమ పరిశోధనల్లో విజయం సాధించారు. విశాఖ సముద్ర తీరంలో సముద్రపు గడ్డి పచ్చిక భూములను పునరుద్ధించే ‘బ్లూ కార్బన్ ఎకో సిస్టం పయనీరింగ్’అను అంశంపై పరిశోధన చేసారు. స్టూడెంట్ సొసైటీ ఫర్ క్లైమేట్ ఛేంజ్ అవేర్నెస్ ( ఎస్ఎస్సీసీఏ) , సీడ్స్ ఆఫ్ పీస్ ( యూఎస్ఏ) సంస్థలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో 33 టీమ్లు పాల్గొనగా, బుల్లయ్య కళాశాల విద్యార్థ్ధులు చేసిన పరిశోధనలకు క్లైమేట్ ట్యాంక్ యాక్సిలరేటర్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి వెయ్యి డాలర్లు బహుమతిగా గెలుపొందారు. ప్రాజెక్టు తదుపరి అధ్యయనాల కోసం విద్యార్థులను 2025 ఫిభ్రవరిలో10 రోజుల ఫెలోషిప్ ప్రోగ్రామ్కు యూఎస్ఏ వెళ్లనున్నారు. పరిశోధన ఎలా సాగిందంటే.. హైదరాబాదుకు చెందిన ఎన్జీవో సంస్థ ఎస్ఎస్సీసీఏ, నూయార్క్ కు చెందిన సీడ్స్ పీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఎన్విరాన్మెంట్కు సంబంధించి ఆరు ఆంశాలపై పరిశోధనలకు విద్యార్థ్ధులకు అవకాశం కల్పించారు. బుల్లయ్య విద్యార్ధులు గ్లోబల్వార్మింగ్ తగ్గించడానికి క్లైమేట్కి సంబంధించిన టాపిక్ ఎంపిక చేసుకున్నారు. ఈ విధంగా దేశంలో వివిధ కళాశాలల నుంచి 33 టీమ్స్ ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈపోటీలో బుల్లయ్య కళాశాల నుంచి 3 టీమ్స్ పాల్గొనగా, ఒక టీమ్లో డిగ్రీ (బయోటెక్నాలజి) ఫైనలియర్ చదువుతున్న నలుగురు విద్యార్ధులు , వారికి గైడెన్స్గా ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మొదటి అంచెలో ఎంపిక చేసుకున్న టాపిక్పై పరిశోధన ఎలా చేలాయన్న విషయంపై ఓరియెంటేషన్ జరిగింది. రెండవ ఫేజ్లో ఎంపిక చేసిన టాపిక్పై డిస్క్రిప్టివ్ ఐడియాను సిద్ధం చేసారు. పరిశోధన నిమిత్తం సీడ్స్ సంస్థ 200 డాలర్లు అందజేసింది. మొదటి రెండు ఫేజ్లు పూర్తి అయిన తర్వాత పరిశోధనకు వాస్తవ రూపం కల్పించారు. తాము ఎంపిక చేసుకున్న గ్లోబల్వార్మింగ్ తగ్గించడానికి విద్యార్ధులు ఎన్నో పరిశోధన పత్రాలు చదవి ఒక ఐడియాకు వచ్చారు. విశాఖ సముద్రతీరంలో అంతరించిపోయిన 2 గడ్డి జాతిమొక్కలను మరల ఇక్కడ పునరుద్ధించి తద్వారా కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని తగ్గించేలా నమూనాలు తయారు చేసారు. ఒరిస్సాలోని చిలికా సరస్సు నుంచి ‘హలోఫిలా ఓవాలిస్, హలోడ్యూల్ ఫీనిఫోలియా’అను రెండు గడ్డి జాతి మొక్కలను తెచ్చారు. సాధారణ మొక్కల కంటే 33 శాతం అధికంగా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ పీల్చుకోవడం వీటి ప్రత్యేకత. తెచి్చన గడ్డి మొక్కలను కళాశాల ల్యాబ్లలో అవి పెరిగేలా సముద్ర వాతావరణం కల్పించారు. దీని కోసం చెక్కతో తయారు చేసిన ట్రేలలో కొబ్బరిపీచు, సముద్రపు నీరు,ఇసుక, గడ్డి ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. స్కూబా డ్రైవర్స్ సాయంతో తీరంలో మంగమారిపేట బీచ్లో 8 మీటర్ల లోతులో నాటారు. వెయ్యి డాలర్లు బహుమతి డిసెంబరు 12న హైదరాదులో జరిగిన సమావేశంలో విద్యార్ధులు రూపొందించిన వర్కింగ్ మోడల్ను యూఎస్ కాన్సులేట్ నుంచి వచి్చన జడ్జిలు పరిశీలించారు.ప్రాజెక్టు పని చేసే తీరును విద్యార్ధులు వారికి ప్రెజెంట్ చేసారు. ఈపోటీలో పాల్గొన్న 33 టీమ్లలో తుది దశకు 8 టీమ్లు చేరుకోగా అందులో బుల్లయ్య కళాశాల టీమ్ మొదటి స్థానంలో నిలిచి వెయ్యి డాలర్లు బహుమతి గెలుచుకున్నారు. -
ఎక్కడున్నా మొక్కపై నిఘా!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం పంట పొలాల్లో తిరగాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా వెళ్లి మొక్కల తీరును పరిశీలించి డేటాను సేకరించాలి. కానీ, పంటలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అధ్యయనం చేయ గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్రిశాట్లో ఉన్న ప్రత్యేక పరిశోధన క్షేత్రంలో వినియోగిస్తున్నా రు. పంటల వద్దకు వెళ్లకుండానే తామున్న చోట నుంచే పంటల తీరును పరిశీలించేందుకు వీలుండే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ‘హై థ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ’అనే అధునాతన ల్యా బ్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్న సైంటిస్టులు కూడా ఇక్కడి పంటల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆధునిక ప్రయోగశాలలో జొన్న పంటపై పరిశోధన జరుగుతోంది. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ.. ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని రామచంద్రాపురంలో ఉన్నప్పటికీ.. దీని ప్రాంతీయ కార్యాలయాలు కెన్యా, మాలి, నైజీరియా, మలావీ, ఇథియోఫియా, జింబాబ్వే తదితర ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు సైతం ఇక్కడి పరిశోధన క్షేత్రంలో పెరుగుతున్న మొక్కలను వీక్షించేందుకు, పరిశీలించేందుకు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. మొక్క ప్రతిస్పందనపై క్షణక్షణం నిఘా హైథ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ప్రస్తుతం జొన్న పంటకు సంబంధించి ఐదు వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ సెంటర్ మొక్క ప్రతి స్పందనను క్షణక్షణం రికార్డు చేస్తుంది. ఈ డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తుంది. మొక్క పత్రహరితానికి సంబంధించిన ఫ్లోరోసెన్స్, మొక్క 3డీ మాడలింగ్, ఆర్జీబీ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, థర్మల్ ఇమేజింగ్.. ఇలా మొక్కను పూర్తిస్థాయిలో స్కాన్ చేయగల ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. నీటి వాడకానికీ లెక్క ఉంటుంది.. మొక్క ఎప్పడు ఎంత నీటిని వాడుకుంటుందనే వివరాలు కూడా ఈ ల్యాబ్లో రికార్డు అవుతాయి. మొక్క ట్రే కింద ప్రత్యేకంగా లోడ్ సెన్సార్ ఉంటుంది. మొక్కకు పట్టిన నీళ్లు ఎన్ని ఆవిరయ్యాయి? ఎంత వినియోగమైంది? అనే వివరాలను సేకరిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మొక్క ఎంత ఒత్తిడికి గురవుతుంది? మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? అనే అంశాలను ఇమేజ్, వీడియో రూపంలో కూడా రికార్డు చేస్తుంది.మొక్కలు ఎంత నీళ్లు ఇస్తే తట్టుకోగలవు. నీళ్లు లేకపోతే ఎంత మేరకు అనుగడ సాధించగలవు? అనే అంశాలను పరిశీలించేందుకు వీలుంటుంది. తద్వారా నీటి కొరతను తట్టుకునే వెరైటీలు, అధిక వర్షాలకు తట్టుకునే వెరైటీలను కనుగొనే అవకాశం ఉంటుందని ఇక్రిశాట్ రిసెర్చ్ స్కాలర్ కల్పన తెలిపారు. -
హైదరాబాద్లో ఐసీఏఐ రిసర్చ్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిసర్చ్ హబ్ను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఆర్థిక అక్షరాస్యత, విధాన రూపకల్పనలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర, సులభతర వ్యాపారంతో కూడిన సుపరిపాలన తదితర అంశాలపై ఈ కేంద్రం లోతైన అధ్యయనాలను నిర్వహిస్తుందని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పరిశోధన కార్యక్రమాల ద్వారా వెల్లడైన అంశాలను ప్రభుత్వంతో పంచుకుంటామని వివరించింది. కాగా, సెంటర్ డైరెక్టర్, డీన్గా నుపుర్ పవన్ బంగ్ను ఐసీఏఐ నియమించింది. జైపూర్లోనూ ఐసీఏఐకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. కోల్కతలో ఇటువంటి కేంద్రాన్ని 2025 జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మరో ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను నెలకొల్పాలని ఐసీఏఐ యోచిస్తోంది. దాదాపు 9.85 లక్షల మంది విద్యార్థులు, 4 లక్షల మంది సభ్యులతో ఐసీఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థ కావడం విశేషం. -
మొక్కా.. మొక్కా..నీ పేరేంటి..
పీజీ చేసినా పెరటి మొక్క పేరు తెలియని విద్యార్థులు శాస్త్రీయ నామాలకే నేటి తరం పరిమితం..ఫార్మా పరిశ్రమలకు తగ్గుతున్న పరిశోధనలు బొటానికల్ ఇండియా సర్వేలో తేలిన వాస్తవాలుసాక్షి, హైదరాబాద్: పెరట్లో మొక్కలు.. వాటి పేర్లు, ఉపయోగాల గురించి చిన్నప్పుడు నాయనమ్మో.. అమ్మమ్మో చెబితే నేర్చుకునేవాళ్లు. బడికి వెళ్లాక టీచర్ మొక్కల శాస్త్రీయ నామాలు చెబుతుంటే.. ‘ఓ అదా.. మా పెరట్లోని జిల్లేడు చెట్టు.. పొలం మధ్యలో వావిలాల చెట్టు’ అని తేలికగా గుర్తుపట్టేవాళ్లు. ఇప్పుడు కాలం మారింది. వృక్ష శాస్త్రంలో పీజీ చేసిన విద్యారి్థకి కూడా ఇంట్లోని మందార చెట్టు పేరు తెలియడం లేదు. బొటానికల్ ఇండియా ఇటీవల చేసిన సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. విద్యార్థుల వైఖరి ఇలాగే కొనసాగితే వారిలో శాస్త్రీయ కోణమే లోపిస్తుందని బొటానికల్ ఇండియా శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కలపై అవగాహన పెంచాలని సూచించారు. సర్వేలోని కీలక విషయాలు ⇒ సర్వేలో భాగంగా పీజీ పూర్తిచేసిన 867 మందిని పెరటి మొక్కలపై ప్రశ్నలు అడిగితే.. సొంత ఊరిలో కనిపించే ఔషధ మొక్కల గురించి కూడా కనీస సమాచారం ఇవ్వలేకపోయారు. జిల్లేడు, తిప్పతీగ, బంతి మొక్కలను చూపిస్తే వంద మందిలో 28 మంది మాత్రమే తెలుగు పేర్లు చెప్పారు. మిగతా వాళ్లతా శాస్త్రీయ నామాలే చెప్పారు. కుండీల్లో పెరిగే మొక్కల గురించి ప్రశ్నలు వేసినప్పుడు వందకు 20 శాతం మంది వాటి ఉపయోగాలను వెల్లడించలేకపోయారు. ⇒ నాగజెముడును అనేక ఔషధాల్లో వినియోగిస్తున్నాయి. పల్లె వాకిట్లో తేలికగా దొరికే ఈ మొక్క గురించి వృక్షశాస్త్రంలో డిగ్రీ చేసిన 428 మందిని ప్రశి్నస్తే, 48 శాతం దీని ఆనవాలు తెలియదన్నారు. 26 శాతం ఇదో ఔషధ మొక్క... విదేశాల్లో పండిస్తారని చెప్పారు. 18 శాతం మంది మాత్రమే భారతీయ పల్లె పెరిగే మొక్కగా గుర్తించారు. ⇒ పదేళ్ల క్రితం వరకూ పల్లెల్లో విరివిగా కనిపించిన మంగళగిరి కంచె గురించి 60 శాతం బోటనీ విద్యార్థులకు అవగాహనే లేదు. కార్బన్–డై–ఆక్సైడ్ను నియంత్రించడంలో దీని పాత్ర గురించి అసలే చెప్పలేకపోయారు. ⇒ వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఉమ్మెత్త మొక్క గొప్పతనం తెలియడం లేదు. ఇంటర్లో బైపీసీ చదివిన 250 మందిని ఈ మొక్క గురించి ప్రశి్నస్తే.. 186 మంది అదేం మొక్క? అని ఎదురు ప్రశ్నించారు. ఫొటో చూశాక శాస్త్రీయ నామం చెప్పగలిగారు. ⇒ బతకమ్మ సందడి వల్ల తెలుగు విద్యార్థులు తంగేడు చెట్టును గుర్తుపడుతున్నారు. నూటికి 80 శాతం మంది ఇది తంగేడు పూల మొక్క అని చూడగానే చెప్పారు. ⇒ రకరకాల షాంపూల గురించి «గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగే ప్రస్తుత యువతరంలో 78 శాతం మందికి కుంకుడు చెట్టు గురించి ఇసుమంతైనా తెలియటంలేదు. ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయో సర్వేలో పాల్గొన్న 92 శాతం మందికి తెలియలేదు. కాల గర్భంలో ఎన్నో మొక్కలు (బాక్స్) విరిగిన ఎముకలు కట్టుకోవడానికి వాడే నల్లేరు.. కఫంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి నుంచి కాపాడే కరక్కాయ.. ప్రాణం పోయేలా అనిపించే తలనొప్పిని సైతం తగ్గించే శొంఠి.. కురుపు ఏదైనా ఆకుతోనే నయం చేసే జిల్లేడు.. చర్మవ్యాధుల పనిపట్టే మారేడు.. సర్వ రోగ నివారణి తులసి వంటి ఎన్నో అద్భుత ఔషధ మొక్కలు మన పెరటి వైద్యం నుంచి కని్పంచకుండా పోతున్నాయి. ఇలా అయితే కష్టం మొక్కలు, వాటి ప్రయోజనాలు తెలుసుకునే ఆసక్తి విద్యార్థి దశ నుంచే ఏర్పడాలి. లేకపోతే ఔషధ రంగం ఇతర దేశాల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పటివరకు 3.5 లక్షల మొక్క జాతులను వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో 2.78 లక్షల మొక్కలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. వీటిల్లో చాలా వరకు మన పల్లెల్లో ఒకప్పుడు కని్పంచినవే. –నవీన్ చావ్లా (ఫార్మా రంగ నిపుణుడు) విద్యలో మార్పు తేవాలి నేడు అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తున్నారు. వృక్షశాస్త్ర ప్రాధాన్యత తగ్గుతోంది. మొక్కల ప్రాధాన్యతను భావి తరాలకు చెప్పే బయో డైవర్సిటీ బోర్డులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. – డాక్టర్ కె తులసీరావు, డైరెక్టర్, గ్లోబల్ బయోడైవర్సిటీ. -
2030 నాటికి సేవల ఎగుమతులదే పైచేయి
న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో వస్తువులను సేవలు అధిగమించనున్నాయి. 2030 మార్చి నాటికి 618.21 బిలియన్ డాలర్లకు (51.92లక్షల కోట్లు) చేరుకుంటాయని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. అదే కాలంలో వస్తు ఎగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. 2018–19 నుంచి 2023–24 వరకు దేశ వస్తు ఎగుమతులు ఏటా 5.8 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందాయని, ఇదే కాలంలో సేవల ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2030 మార్చి నాటికి సేవల ఎగుమతులు 618.21 బిలియన్ డాలర్లకు, వస్తు ఎగుమతులు 613 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా కట్టింది. ఐటీ, సాఫ్ట్వేర్, ఓబీఎస్ హవా.. భారత సేవల రంగం వృద్ధిలో అధిక భాగం సాఫ్ట్వేర్, ఐటీ సేవలు, ఇతర వ్యాపార సేవల (ఓబీఎస్) నుంచే ఉంటోందని.. 2023–24 ఎగుమతుల్లో వీటి వాటా 86.4 శాతంగా ఉన్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. ఓబీఎస్ పరిధిలోని న్యాయ సేవలు, అకౌంటింగ్, పన్ను సంబంధిత సేవలు, మేనేజ్మెంట్ కన్సలి్టంగ్, మార్కెట్ పరిశోధన కలిపి 2023–24లో 10.28 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదైనట్టు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మొత్తం సేవలు ఎగుమతుల్లో ఓబీఎస్ వాటా 33.2 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత నైపుణ్య మానన వనరులు, అభివృద్ధి చెందుతున్న ఐటీ సదుపాయాలు అంతర్జాతీయ సేవల కేంద్రంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెరి్నంగ్(ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) భారత కంపెనీల అవకాశాలను అధికం చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘సాఫ్ట్వేర్, ఐటీ సేవలు అతిపెద్ద విభాగంగా ఉండగా, వృద్ధిలో ఈ విభాగాన్ని ఓబీఎస్ దాటిపోనుంది. ప్రత్యేకమైన సేవలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ వెలుపల ఐటీ సేవల విస్తరణ.. యూఎస్కు బయట ఐటీ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం మొదట చేయాల్సిన పనిగా జీటీఆర్ఐ పేర్కొంది. దేశ ఐటీ ఎగుమతుల్లో 70 శాతం యూఎస్కే వెళుతున్న నేపథ్యంలో, అక్కడి విధానాల్లో మార్పుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ‘‘ప్రెసిడెంట్గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఔట్సోర్స్ను విమర్శించడం, హెచ్–1బి వీసా పాలసీల కట్టడి తదితర విధానాలు ఈ రిస్్కలను గుర్తు చేస్తున్నాయి. ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) 40 శాతం మేర ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మార్కెట్లకు విస్తరించడం, డిజిటల్ పరివర్తిన, ఏఐ ఇంటెగ్రేషన్ యూఎస్పై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఓబీఎస్ ఎగుమతులను ప్రోత్సహించాలని జీటీఆర్ఐ నివేదిక సూచించింది. ఈ విభాగంలో ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నప్పటికీ, భారత సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగంచుకోవడం లేదని పేర్కొంది. ఇంజనీరింగ్, పరిశోధన, మేనేజ్మెంట్ నిపుణులకు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలపై అవగాహన పెరిగితే వృద్ధి అవకాశాలను మరింత ఇతోధికం చేసుకోవచ్చని తెలిపింది. -
పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు
సూళ్లూరుపేట: ఆకాశం వైపు గురిపెట్టి అంతరిక్ష ప్రయోగాలు చేయడానికే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రయాన్ పేరిట ఈ ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినా.. ఇంతటి సాంకేతికతను ఉపయోగించలేదు. 1980లోనే సముద్రాలపై అధ్యయనం చేయడానికి స్కూబా డైవింగ్ పద్ధతిలో అధ్యయనానికే పరిమితమయ్యారు.దేశం చుట్టూ 7 వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాలనే ఆలోచన పురుడు పోసుకుంది. 2019 నుంచి ఈ ప్రయత్నాలు సాగిస్తున్నా.. ఇప్పటికి దీనికి ఓ రూపం వచ్చింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో సుమారు 6వేల మీటర్ల లోతుకెళ్లి అధ్యయనం చేసేందుకు సముద్రయాన్ పేరుతో మత్స్య–6000 అనే సబ్మెర్సిబుల్ నౌకను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.సబ్మెర్సిబుల్ వాహనంలో.. ప్రపంచంలో మానవ రహిత జలాంతర్గాములు ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే మానవ సహిత జలాంతర్గామిని తయారు చేసిన చరిత్ర ఉంది. సముద్రయాన్ ప్రాజెక్ట్లో భాగంగా సముద్ర గర్భంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా సబ్మెర్సిబుల్ వాహనాన్ని ఎన్ఐఓటీ డిజైన్ చేసి అభివృద్ధి చేస్తోంది. ఈ వాహనానికి మత్స్య–6000 అని నామకరణం చేశారు. ఈ వాహనం 6 కిలోమీటర్ల లోతుకు వెళ్లినపుడు నీటి పీడనం 600 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.ఈ పీడనాన్ని తగ్గించేందుకు టైటానియం అలాయ్ను ఉపయోగించి నీటి పీడనాన్ని తట్టుకునేలా సబ్మెర్సిబుల్ వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు. 2022 డిసెంబర్లో ‘సాగర్ నిధి’ నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపిన విషయం తెలిసిందే. ఓషన్ మినరల్ ఎక్స్ప్లోరల్ పేరిట సముద్ర గర్భంలో 5,271 మీటర్ల లోతులో అన్వేషణ సాగించారు. అక్కడున్న మాంగనీస్పై పరిశోధించారు. ఇప్పుడు మత్స్య–6000 ప్రయోగంలో ముగ్గురు వ్యక్తులు వాహనంలో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఒకరు సబ్మెర్సిబుల్ వాహనం ఆపరేటర్ కాగా.. మిగిలిన ఇద్దరు పరిశోధకులు ఉంటారు. గంటల తరబడి సముద్రంలోనే.. ఈ వాహనం సముద్ర గర్భంలో 108 గంటలు ఉండేలా వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు. సముద్ర గర్భంలోకి పోవడానికి 3 గంటలు, మళ్లీ పైకి రావడానికి 3 గంటలు సమయం తీసుకుంటుందని ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థకు ఇస్రో కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. ఇస్రో చేసిన చంద్రయాన్–3 ప్రయోగం, భవిష్యత్లో చేయబోతున్న గగన్యాన్ మిషన్ ప్రయోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమేరకు వినియోగించుకుంటున్నారు. మత్స్య–6000 జలాంతర్గామిని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో తయారు చేశారు.ఈ వాహనం సంక్లిష్టమైన సమయంలో 96 గంటలు నీటిలోనే ఉండేందుకు వీలుగా 67 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతంలో 108 గంటలపాటు సముద్రంలోనే ఉండేలా మత్స్య–6000 డిజైన్ చేశారు. ఈ పరిశోధనల్లో సముద్ర గర్భంలో ఉన్న మాంగనీస్ కోబాల్ట్, నికెల్ లాంటి ఖనిజాల అన్వేషణలతో పాటు సముద్ర గర్భంలో వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకపోకలు లాంటి వాటిపై అధ్యయనం చేయడానికి ఇది దోహదపడుతుంది.ఖనిజాలు.. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి.. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓçషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంయుక్తంగా సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణ, సముద్రాల నుంచి వచ్చే రుతు పవనాలు, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మత్స్య–6000 అనే పేరుతో సముద్రయాన్ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. సముద్రపు అడుగున ఏముందో పరిశోధనలు చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. సుమారు రూ.4 వేల కోట్లతో 2026 నాటికి ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
‘హైపర్ లూప్’పై పరిశోధన
సాక్షి, చెన్నై: రవాణా వ్యవస్థలో అతి వేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ రైలు సేవల మీద ఐఐటీ తయ్యూరు క్యాంపస్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. చెన్నై మెట్రో రైలు, ఐఐటీ సంయుక్తంగా ఈ పరిశోధన మీద దృష్టి పెట్టింది. ఇది విజయవంతమైతే చెన్నై విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించబోతున్న పరందూరుకు 15 నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే అవకాశం ఉంది. చెన్నైకు ప్రత్యామ్నాయంగా కాంచీపురం పరిధిలోని పరందూరులో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో చెన్నై విమానాశ్రయం నుంచి పరందూరు వైపుగా మెట్రో సేవలకు సైతం ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పూందమల్లి వరకు ఉన్న మెట్రో రైలు సేవలను పరందూరు వరకు పొడిగించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు. మెట్రో మార్గంలో చెన్నై నుంచి పరందూరుకు గంట సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో అతివేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా చెన్నై–పరందూరు మధ్య 15 నిమిషాల్లో చేరుకునేలా కొత్తమార్గంపై దృష్టి పెట్టనున్నారు. ఈ టెక్నాలజీ మీద ఐఐటీ తయ్యూరు క్యాంప్ పరిశోధకులు, విద్యార్థులు కొంతమేరకు పరిశోధనలో ఫలితాలు సాధించినట్టు సమాచారం. అసలేంటీ ‘హైపర్ లూప్’లూప్ అనేది పైప్లైన్లాంటి మార్గం. పాట్ అనే రైలు పెట్టె లాంటి వాహనంలో వాయువేగంలో దూసుకెళ్లే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుంది. అయస్కాంతం సహకారంతో గాల్లో వేలాడుతూ గంటకు 600 కి.మీ వేగంతో ఈ హైపర్ లూప్ అతి వేగంగా దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ హైపర్ లూప్లో ఒకే సమయంలో 40 మంది ప్రయాణించేందుకు వీలుంటుందని సమాచారం -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తిమహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.నేడు వారణాసికి ప్రధాని మోదీ ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్ప్రదేశ్లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
ప్రతిష్ఠాత్మక ఐబీఆర్వో అధ్యక్షురాలిగా శుభా టోలే రికార్డ్ : ఆసక్తికర సంగతులు
బ్రెయిన్ అనేది రహస్యాల గని. భావోద్వేగాల ఫ్యాక్టరీ.‘ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తోంది ‘ఐబీఆర్వో’ అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్త అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐబీఆర్వో) అధ్యక్షురాలిగా ప్రముఖ శాస్త్రవేత్త శుభ టోలే నియమితురాలైంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యున్నత స్థానానికి ఎంపికైన తొలి శాస్త్రవేత్తగా ప్రత్యేకత సాధించింది...ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలు, ఫెడరేషన్లకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఐబీఆరోవో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన ‘ఐబీఆర్వో’ నినాదం: ప్రొవైడింగ్ ఈక్వల్ యాక్సెస్ టు గ్లోబల్ న్యూరోసైన్స్ గతంలో ‘ఐబీఆర్వో’ అధ్యక్షులుగా యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్వో’కు సంబంధించి అతిపెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభ టోలేకు వచ్చింది.‘అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్మెంట్లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటుంది శుభ.శుభ ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ–టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్గా పనిచేస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘ఉమెన్ ఇన్ సైన్స్’ కమిటీకి చైర్పర్సన్గా పనిచేసింది. విద్యావంతుల కుటుంబంలో ముంబైలో జన్మించింది శుభ. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్గా పనిచేశాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ చేసింది. చికాగో యూనివర్శిటీలో పోస్ట్–డాక్టోరల్ రీసెర్చి చేసింది.వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి స్వర్ణజయంతి ఫెలోషిప్ తీసుకొంది. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి జాతీయ మహిళా బయోసైంటిస్ట్ అవార్డ్, సొసైటీ ఫర్ న్యూరోసైన్స్, యూఎస్ నుంచి రీసెర్చ్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూరోసైన్సెస్ అవార్డ్ అందుకుంది.కథక్ డ్యాన్సర్ కూడాశుభ టోలే శాస్త్రవేత్తే కాదు కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్ ఏంజిల్స్లో పీహెచ్డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్ దగ్గర కథక్ నేర్చుకుంది. ‘కథక్ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేను, నా పెద్ద కొడుకు కథక్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలాప్రాక్టీస్ చేస్తుంటారు’ అంటుంది శుభ.శుభ భర్త సందీప్ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారనేది అపోహ మాత్రమే. పెయింటింగ్ నుంచి మ్యూజిక్ వరకు ఎన్నో కళల గురించి మాట్లాడుకుంటారు. ‘సైన్స్ అనేది ఒక సృజనాత్మక వృత్తి’ అంటుంది శుభ. -
105 ఏళ్లు బతుకుతానని చెప్పింది!
వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. అయితే టెక్నాలజీ మారిపోయింది. ఫలానా సమయంలో.. ఫలానా చోట.. ఇంత మొత్తంలో వర్షం పడుతుందని కూడా చెప్పేయ గలుగుతున్నాం. మరి చావు సంగతి? రోజుల్లో పోతారనుకున్న వాళ్లు నిక్షేపంగా ఏళ్లు గడిపేయడం మనం చూశాం. అలాగే రాయిలా దిట్టంగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిన వైనాలూ మనకు తెలుసు. అందుకే మరణాన్ని అంచనా వేయడం ఇప్పటికీ కష్టమే. కానీ.. మీ వివరాలు నాకివ్వండి.. మీరెంత కాలం బతుకుతారో చెప్పేస్తానంటోంది ఓ కృత్రిమమేధ సాఫ్ట్వేర్. ఆసక్తికరమైన ఆ వివరాలేమిటో చూసేద్దామా...!!!ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కృత్రిమమేధ సంచలనాల వార్తలే. అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబులు చెప్పడమే కాదు.. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, ఆసుపత్రుల్లో.. ఇలా అన్నిచోట్ల మనిషి పనిని మరింత సులువు చేసేస్తోంది ఈ కృత్రిమమేధ. ఆఖరకు మనం ఎంత కాలం బతుకుతామో చెప్పగలిగే స్థితికి చేరింది. నిజానికి చిరాయుష్షు.. అది కూడా ఆరోగ్యవంతమైన జీవితం అన్నది మనిషి యుగాలుగా కంటున్న కల. వైద్యులను అడిగితే, లేదా హెల్త్ వెబ్సైట్లు చూస్తే.... మంచి ఆహారం తీసుకోండి.. వ్యాయామం చేయండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఎక్కువ కాలం బతుకుతారని తెలుస్తుంది. ఇలా కాకుండా... ప్రస్తుతం మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటే.. అవే అలవాట్లు, ఆహారాన్ని కొనసాగిస్తే ఎంత కాలం బతుకుతామో ‘డెత్ క్లాక్’ వెబ్సైట్ (కథనం చివరలో లింక్ ఉంది) చెబుతుంది. మీరు చేయాల్సిందిల్లా సింపుల్. వెబ్సైట్లోకి ప్రవేశించి వివరాలు ఇవ్వడమే. డెత్ క్లాక్ వెబ్సైట్ను తెరవగానే... ‘‘నేను ఎప్పుడు చచ్చిపోతాను? అని మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా’’ అని కనిపిస్తుంది. కిందనే.. మీ ఆయుష్షు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అన్న టీజింగ్ ప్రశ్న కూడా కనిపిస్తుంది. దాని కింద...మీ పుట్టిన రోజు, స్త్రీ/పురుషుడు అన్న వివరం, ధూమపానం చేస్తారా? అన్న ప్రశ్నతోపాటు మరికొన్ని అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. అన్నింటి వివరాలు ఇచ్చేస్తే... కృత్రిమమేధ సాయం రంగంలోకి దిగుతుంది. మీరిచ్చిన వివరాల ఆధారంగా ఆయుష్షును లెక్కకడుతుంది.ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయండి మరి..లింక్.. (నోట్: ఇది కేవలం సరదా కోసం ఉద్దేశించింది మాత్రమే. ఇది కచ్చితంగా వాస్తవంగా జరుగుతుందని ఏమీ లేదు. మరణ తేదీని కచ్చితంగా చెప్పలేమని వెబ్సైట్ నిర్వాహకులు కూడా స్పష్టం చేసిన విషయాన్ని గమనించగలరు. ఇప్పటివరకూ ఈ వెబ్సైట్ ద్వారా ఆయుష్షును అంచనా వేసుకున్న వారి సంఖ్య.. 60,039,306)-జి.గోపాలకృష్ణ మయ్యా -
kaleshwaram commission: ‘తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం.. కమిషన్ ముందుకు తెలంగాణ రీసెర్చ్ అధికారులు హాజరయ్యారు. అయితే, కాళేశ్వరం కమిషన్ ముందు రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి వింత సమాధానాలు చెప్పారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ ఆమె చెప్పిన సమాధానాలకు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ షాక్ అయ్యారు. శ్రీదేవి పని చేసిన పిరియడ్లో ఏమి గుర్తుకు ఉందో చెప్పాలని కమిషన్ ఛైర్మన్ అడ్డగా.. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ శ్రీదేవి సమాధానాలు చెప్పింది.2017 నుంచి 2020 వరకు కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం సమయంలో పనిచేసిన శ్రీదేవి.. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? ఫ్లడస్ ఎప్పుడు వచ్చాయి అనే ప్రశ్నలకు తనకు గుర్తుకు లేదంటూ దాటవేసేందుకు యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్గా ఆమె పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.కాగా, మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అంటూ రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు కమిషన్కు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణాలు మొదలైనట్లు కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారు. మేడిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లేనని కమిషన్కు ఇంజనీర్లు తెలిపారు.ఇదీ చదవండి: ‘ఓటుకు నోటు కేసుపై రేవంత్కు రిపోర్ట్ చేయొద్దు’వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కమిషన్ ముందు చెప్పిన రీసెర్చ్ ఇంజనీర్లు.. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీలు డామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్కి సంబంధం లేదని రీసెర్చ్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు బ్యారేజీలలో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్.. రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది.అన్నారం గ్యారేజీ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా?. మూడు బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయాలని ఎవరి ఆదేశాలు ఉంటాయని కమిషన్ ప్రశ్నించగానిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు. లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక వైపు నిర్మాణం జరుగుతుండగానే... మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. -
బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
కీటోజెనిక్ లేదా కీటో డైట్ని మొట్టమొదటగా 1921లో మూర్చ వ్యాధికి ఉపయోగించేవారు. ఈ డైట్లో అధిక కొవ్వు, తగినంత ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఉంటాయి. ఇటీవల అంతా బరవు తగ్గడం కోసి రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ డైట్తో బరువు తగ్గడం జరుగుతుంది కానీ పరిశోధనలో ఈ డైట్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గట్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయని తేలింది. ఇది అంత ఆరోగ్యకరమైనది కాదని వెల్లడయ్యిందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండటానికి సమహయపడే డైట్ని అనుసరించడం ముఖ్యమని చెబుతున్నారు. అసలు ఈ డైట్ ఎలా మంచిది కాదో సవివరంగా చూద్దాం. కీటో డైట్ ఆరోగ్యానికి సురక్షితమైనదేనా కాదా? అని సుమారు 53 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. వారికి తక్కువ చక్కెరతో కూడిన ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఇవ్వగా వారి శరీరం కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజ్కి బదులుగా కాలేయం నిల్వ చేసిన కొవ్వులను ఇంధనంగా ఉపయోగించుకోవడాన్ని గుర్తించారు. దీన్ని కీటోన్ బాడీల ద్వారా కొవ్వులను కాల్చడం అని అంటారు. ఈ డైట్ ప్రకారం వారంతా 20 నుంచి 50 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలు తీసుకోవాలి. ఇలా కీటోసిస్ స్థితికి చేరడానికి కొన్ని రోజుల పడుతుంది. ఇందుకోసం అదిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది హానికరమేనని చెబుతున్నారు. ఇక్కడ కీటోడైట్లో తీసుకునే ఆహారాల్లో కొబ్బరి నూనె, వెన్న, చికెన్, గుడ్లు, అని కూరగాయలు, కాయధాన్యాలు, పిండి, వోట్స్, చిక్కుళ్ళు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, గింజలు, కాటేజ్ చీజ్, మేక, ఫెటా చీజ్ తదితరాలు ఉంటాయి. అలాగే ఈ డైట్ కోసం వోట్స్, కేకులు శుద్ధి చేసిన పిండితో చేసిన డెజర్ట్లు, అధిక కార్బ్ ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ కీటో డైట్ని అనుసరిచిన 12 వారాల తర్వాత సగటున శరీరంలో 2.9 కిలోల మేర కొవ్వు తగ్గుతుందన పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ చక్కెర నిరోధిత ఆహారం కారణంగా 2.1 కిలోల బరువు కోల్పోయేలా చేస్తుంది. అందువల్లే చాలామంది ఈ డైట్ని అనుసరించేందుకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ డైట్ వల్ల కొన్ని ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడించారు పరిశోధకులు. ఎదురయ్యే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు..ఈ కీటో డైట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ధమనులలో ఫలకం ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ డైట్ని అనుసరించే వారి రక్తంలో అననూకూల స్థాయిలో కొవ్వులు పెరిగినట్లు గుర్తించామన్నారు. ఇలా ఏళ్ల తరబడి ఈ డైట్ని ఫాలో అయితే దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్కు దారీతీసే ప్రమాదం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ తక్కువ చక్కెర ఆహారం చెడు కొలస్ట్రాల్ని గణనీయంగా తగ్గించింది కూడా అని చెప్పారు.కీటో డైట్ గట్ మైక్రోబయోమ్ కూర్పును మార్చింది. ముఖ్యంగా బిఫిడోబాక్టీరియాను తగ్గిస్తుంది. ప్రోబయోటిక్స్లో తరచుగా కనిపించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఇది. ఇది 'బీ' విటమిన్లను ఉత్పత్తి చేస్తుంది. వ్యాధికారక హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇలా గట్ బ్యాక్టీరియా తగ్గిపోతే ప్రకోప ప్రేగు వ్యాధి వంటి జీర్ణ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధకత తగ్గి దీర్ఘకాలికి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు పరిశోధకులు.కీటో డైట్ గ్లూకోస్ టాలరెన్స్ని తగ్గించింది. అంటే..శరీరం కార్బోహైడ్రేట్లను నిర్వహించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం. ఎప్పుడైన అధిక కార్బోహైడ్రేట్ తీసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణలు. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటే తక్కువ చక్కెర ఉన్న ఆహారాలు మంచివే కానీ ఫైబర్తో కూడిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు నిపుణులు.(చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
పరిశోధనలతో సమాజానికి మేలు
పరిశోధనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ స్పష్టం చేశారు. యువత పరిశోధన రంగంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. ఎంత ఎక్కువ మంది పరిశోధనా రంగంలోకి వస్తే అంత ఎక్కువ దేశానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జగదీశ్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు.సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ అన్నారు. వీరి నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి నాణ్యమైన పరిశోధనలు ఆశించలేమని. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారు నిబద్ధతతో పని చేయలేరని అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి తగిన విధంగా ఉంటే పరిశోధనల్లో ఆటోమేటిక్గా నాణ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. చాలా వర్సిటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకుండా, కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు కదా! అనే ప్రశ్నకు బదులిస్తూ..ఇది చాలా పెద్ద సమస్య అని, రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాలకు ఈ విషయంలో తాము చాలాసార్లు లేఖలు రాశామని చెప్పారు. తమ పరిధిలో ఉన్నంత వరకు తాము ప్రయత్నిస్తున్నామని, గత వారంలో కూడా దీనిపై చర్చించామని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేయకూడదు పరిశోధనా రంగంలోకి ఎక్కువ మంది యువత రావాలనే ఉద్దేశంతోనే.. పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల డిగ్రీ తర్వాత పీహెచ్డీ చేసే వెసులుబాటు కల్పించామని జగదీశ్కుమార్ వెల్లడించారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో విజయవంతంగా అమలవుతోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్డీ చేసిన వారికి జీవనోపాధి కష్టమవుతోందనే అభిప్రాయంపై మాట్లాడుతూ..‘పీహెచ్డీ అంటే ఏదో ఉద్యోగం కోసం చేసే కోర్సు కాదు. రీసెర్చ్పై ఆసక్తి (ప్యాషన్) ఉంటేనే ఈ రంగంలోకి రావాలి. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పీహెచ్డీ చేయాలి. అంతేకానీ ఉద్యోగం కోసం మాత్రం రావొద్దు. ఉద్యోగమే కావాలనుకుంటే పీజీ తర్వాత ఏదైనా వేరే కోర్సు చేసి స్థిరపడటం మంచిదని నా అభిప్రాయం..’ అని చెప్పారు. న్యాక్ గుర్తింపు తీసుకోవాలి తెలంగాణ సహా ఎక్కడైనా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఎప్పటికప్పుడూ వర్క్షాప్లు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని జగదీశ్కుమార్ తెలిపారు. న్యాక్ గుర్తింపు కోసం ముందుకు రావాలని విద్యా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలా రాకపోతే సమాజానికి మేలు చేయని వారిగానే పరిగణించాల్సి వస్తుందని, నాణ్యమైన విద్యను అందించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. -
ప్రకృతి సాగులో ప్రపంచ చాంపియన్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తెచి్చన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రకృతి సాగు విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్)కు ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ చాంపియన్గా నిలిచింది.పోర్చుగల్కు చెందిన కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏటా ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం 2023–24లో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల నుంచి 181 సంస్థలు నామినేషన్లు సమరి్పంచాయి. వాటిలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏపీసీఎన్ఎఫ్, ఈజిప్్టకు చెందిన సెకెమ్ సంస్థ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2023 – 24లో ఉన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ కృషి ఫలితమే ఈ అంతర్జాతీయ అవార్డు. అయినా, నెల క్రితమే అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ అవార్డు ఆయన గొప్పతనం వల్లేనని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. ఆంగ్ల పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో రాయించుకుంటున్నారు. ఈ వింత వ్యవ హారంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2019 తర్వాతే ఉద్యమ రూపంలో ప్రకృతి సాగు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు రైతు సా«ధికార సంస్థ ద్వారా చాలా ఏళ్ల క్రితం జీరో బేస్డ్ నేచురల్ ఫారి్మంగ్ (జెడ్బీఎన్ఎఫ్) పేరిట రాష్ట్రంలో ప్రకృతి సాగు మొదలైంది. కేంద్ర ఆరి్థక సహాయంతో పైలెట్ ప్రాజెక్టుగా 704 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో 50 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలైంది. 2018–19 నాటికి 1.76 లక్షల మంది రైతులు 2.33 లక్షల్లో ఈ సాగు చేసేవారు.2019లో అధికారంలోకి వచి్చన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా 2023–24కు వచ్చేసరికి 10.37 లక్షల మంది రైతులు 12.16 లక్షల ఎకరాలకు ఈ సాగును విస్తరించగలిగారు. గ్రామ స్థాయిలో ఘున, ద్రవ జీవామృతాలు, కషాయాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు 3,909 బయో ఇన్పుట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ ద్వారా ప్రకృతి సాగును గుర్తించడంతో పాటు రైతులకు పంట రుణాలు, సంక్షేమ ఫలాలన్నీ అందేలా కృషి చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగా విదేశీ సంస్థల నుంచి ఏపీసీఎన్ఎఫ్కు రూ.400 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. పులివెందులలో ప్రకృతి సాగుపై రీసెర్చ్ అకాడమీ ప్రకృతి సాగులో విస్తృత పరిశోధనల కోసం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెరి్నంగ్ను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా 15 శాతం ప్రీమియం ధరకు కొని, టీటీడీకీ సరఫరా చేశారు. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీక్లీ మార్కెట్లు ఏర్పాటు చేశారు. విదేశాలకు ఎగుమతి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రకృతి సాగు వేగంగా విస్తరించింది. ఏపీలో ప్రకృతి సాగుకు జరుగుతున్న కృషిని 2021–22లో సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్రం ప్రశంసించింది.2022–23 ఆరి్థక సర్వేలో నీతి అయోగ్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. 2022, 2023 వరుసగా రెండేళ్ల పాటు ఐదు విభాగాల్లో జైవిక్ ఇండియా అవార్డులు, 2022లో ఫ్యూచర్ ఎకానమీ ఫోరం అందించే లీడర్íÙప్ గ్లోబల్ అవార్డు, 2023లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, మారికో ఇన్నోవేషన్, ఎంఎస్ స్వామినాథన్ మెమోరియల్, స్త్రీ, కర్మవీరచక్ర వంటి గ్లోబల్ అవార్డులు వరించాయి. ఐదేళ్లలో 45 దేశాల ప్రతిని«ధి బృందాలు ఏపీలో ప్రకృతి సాగుపై అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ తదితర 12 రాష్ట్రాలు ప్రకృతి సాగు చేపట్టాయి.వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ సంస్కరణల విప్లవం2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన వెంటనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామస్థాయిలో సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో 16 వేల మంది గ్రామ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్ధక సహాయకులతో పాటు ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్లలో సరి్టఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్కు ముందే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు, అన్నదాతకు అందించిన ప్రోత్సాహంతో ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కని్పస్తోంది. ప్రకృతి సాగును ఉద్యమంలా తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వస్తే ఇదేదో తమ గొప్పతనం అంటూ సీఎం చంద్రబాబు బాకాలు ఊదడం పట్ల రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
అందం, ఆరోగ్యం అందించేది ఇదే..!
బేబీ క్యారెట్లు గురించి తెలియని వారుండరు. ఇది తినేందుకు కూడా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ క్యారెట్స్ కంటే ఈ బేబీ క్యారెట్లు తింటే ఎన్నో లాభాలు పొందొగలమని అమెరికా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అందం, ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ బేబీ క్యారెట్లని తేల్చి చెబుతున్నారు. అంత మేలు చేసే ఈ బేబీ క్యారెట్లను చిరుతిండిగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!శాకాహార ప్రియులకు బెస్ట్ స్నాక్ ఐటెంగా తీసుకునే కాయగూర బేబీ క్యారెట్లు. వీటిని స్నాక్ రూపంలో మరేదైన విధంగా తీసుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడుసార్లు తీసుకుంటే చర్మ కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయని పరిశోధనలో తేలింది. ఈ కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్ని తగ్గించగలవు. ఆక్సికరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెరుగైన చర్మం, రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగ్గా ఉంచుతాయి. అధిక స్థాయి కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ రక్షణతో సంబంధం కలిగి ఉన్నాయని, ఇవి గుండె జబ్బులు, కేన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పరిశోధకులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే..చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ చెందిన శాస్త్రవేత్తలు సుమారు 60 మంది యువకులపై అధ్యయనం నిర్వహించగా..స్కిన్ కెరోటినాయిడ్ స్కోర్లు గణనీయంగా 10.8% పెరిగినట్లు గుర్తించారు. సుమారు వందగ్రాములు బేబిక్యారెట్లు తీసుకుంటేనే మంచి ఫలితాలను చూపించిందని అన్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా వివరించారు. అవేంటంటే..దృష్టి లోపాన్ని మెరుగుపరుస్తుంది: చూపుని రక్షించడంలో సహాయపడుతుంది. వయస్సు సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. ఇది పిత్తస్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వృద్ధ జపనీస్ జనాభాలో దంతాల నష్టం రేటుని అధ్యయనం చేయగా బీటా కెరోటిన్ ఎక్కువగా తీసుకున్న వారిలో దంత సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. అయితే బేబి క్యారెట్లు సాధారణ క్యారెట్లు కంటే తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో అయితే సుమారు నాలుగు వారాల పాటు నిల్వ చేయవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్కే..!) -
పరిశోధనల్లో చైనాతో పోటీ పడగలమా?
అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక జర్నల్స్ అయిన ‘నేచర్’, ‘ఎకనమిస్ట్’లు శాస్త్రరంగంలో చైనా అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని ప్రకటించాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ కొనసాగిన విషయం తెలిసిందే. అణు, అంతరిక్ష, వ్యాక్సిన్ అభివృద్ధి రంగాల్లో భారత్ రాణించిందన్నదీ వాస్తవమే. కానీ చైనా పలు కీలక రంగాల్లో భారత్తోపాటు అమెరికా, యూరప్లను సైతం అధిగమించింది. అంతరిక్ష రంగంలో చైనా మన కన్నా కనీసం పదేళ్లు ముందుంది. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ టాప్–10 జాబితాలో భారతీయ పరిశోధన సంస్థలు లేవన్నది గమనార్హం. నిద్రాణంగా ఉన్న భారత్కు చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.ఉన్నత విద్యా రంగంలో భారత్ గతంలో ఎన్నడూ లేని స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైద్యం, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల పద్ధతి, ప్రామాణికత రెండూ లీకేజీల పుణ్యమా అని ప్రశ్నార్థకంగా మారాయి. నీట్తోపాటు భారతీయ విశ్వవిద్యాలయాల్లో, జాతీయ పరిశోధన సంస్థల్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యింది. పరిశోధన రంగంలో ప్రాథమిక స్థాయిలో చేరే విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీల వంటి సంస్థలు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్పై ఆధారపడుతూంటాయి. పీహెచ్డీల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. బోధన వృత్తుల్లో స్థిరపడే వారికి కూడా. ఈ పరీక్షలను విశ్వసనీయతతో, సకాలంలో నిర్వహించడం భారతదేశ ఉన్నత విద్య, పరిశోధన రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకపక్క ఈ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇంకోపక్క అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో చైనా కంటే భారత్ బాగా వెనుకబడిపోతూండటం గమనార్హం. పరిశోధన పత్రాల్లో టాప్ప్రపంచంలో ఒక దేశపు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సత్తాను నిర్ధారించేది ఉన్నత విద్య, పరిశోధన రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విస్తృతి ఎంత? అన్నది. ఎంత ఉత్పత్తి అవుతోంది? నాణ్యత ఏమిటి? అన్నది నిర్ధారించేందుకు చాలా మార్గాలున్నాయి. పరిశోధన వ్యాసాల ప్రచురణ, సాధించిన పేటెంట్లు, నోబెల్ వంటి అంతర్జాతీయ అవార్డులు, పారిశ్రామిక రంగానికి బదిలీ అయిన టెక్నాలజీలు, పరిశోధనల ద్వారా సమాజానికి ఒనగూరిన లబ్ధి... ఇలా చాలా మార్గాలున్నాయి. పరిశోధన పత్రాల ప్రచురణే ప్రధాన అంశంగా ఏటా రీసెర్చ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారి జాబితాను ‘నేచర్’ జర్నల్ ప్రచురిస్తుంటుంది. ఈ జాబితాలో అత్యున్నత స్థాయి పరిశోధన ఫలితాల ఆధారంగా 500 సంస్థలు ఉంటాయి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 145 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధన పత్రాలను పరిశీలించి, ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ జాబితాను సిద్ధం చేస్తుంది. నేచర్ ప్రచురించిన తాజా జాబితాలో దేశాల పరిశోధన సామర్థ్యాల ఆధారంగా అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ , ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాలను కూడా అధిగమించి చైనా అగ్రస్థానంలోకి చేరింది. భారత్ తొమ్మిదో స్థానంలో ఉంటూ... టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉన్నామన్న సంతృప్తి మాత్రమే మనకు మిగిల్చింది. భారత్ వంతు గత ఏడాది చైనా వంతు కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం. అయితే సంస్థల స్థాయిలో పరిశోధన పత్రాలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. అంతర్జాతీయంగా టాప్ పది పరిశోధన సంస్థల్లో ఏడు చైనావి కావడం... హార్వర్డ్ (రెండో స్థానం), మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ (మూడో స్థానం), ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఏడో స్థానం) మాత్రమే టాప్ 10లోని ఇతర సంస్థలు కావడం గమనార్హం. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలు సైతం 14, 15 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అగ్రస్థానంలో ఉంది. టాప్–10లో లేము!టాప్ సంస్థల్లో భారతీయ పరిశోధన సంస్థలు చాలా దిగువన ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 174వ స్థానంలో ఉంటే, ఐఐటీ–బాంబే 247లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 275లో, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 283వ స్థానంలోనూ ఉన్నాయి. హోమీ భాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్(296), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్కతా (321), ఐఐటీ–గౌహతి (355), ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(363), ఐసర్–భోపాల్(379), ఐఐటీ–కాన్పూర్(405), ఐఐటీ–మద్రాస్(407), ఐఐటీ–ఢిల్లీ (428), ఐసర్–పుణె (439), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(450), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్(487) ర్యాంకింగ్ కూడా దిగువలోనే ఉండటం గమనార్హం. ర్యాంకింగ్ల మాట ఇలా ఉంటే, పరిశోధనలు చేస్తున్న రంగాల విషయం చూద్దాం. భౌతిక, రసాయన, భూ, పర్యావరణ రంగాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా... అమెరికా, యూరప్ రెండూ జీవ, వైద్య శాస్త్రల్లో ముందంజలో ఉన్నాయి. అప్లైడ్ సైన్సెస్ రంగంలోనూ చైనా నుంచే అత్యధిక పరిశోధన పత్రాలు ప్రచురితమవుతుండటం విశేషం.చైనా కొన్ని భారీ సైన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్–అపెర్చర్ రేడియో టెలిస్కోపు అలాంటిదే. కృష్ణ పదార్థం ఉనికిని గుర్తించేందుకు చేపట్టిన భారీ భూగర్భ పరిశోధన ఇంకోటి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పలు చైనా సంస్థల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అంతరిక్ష రంగం విషయానికి వస్తే... చైనా మన దేశం కంటే కనీసం పదేళ్లు ముందుందని చెప్పాలి. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే జాబిల్లి నుంచి రాతి నమూనాలను విజయవంతంగా వెనక్కు తెచ్చిన రోబోటిక్ మిషన్ చేపట్టింది.మన స్పందన ఎలా ఉండాలి?శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చైనా పురోగతికి మనం ఎలా స్పందించాలి? పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నట్లే వీటిని తిరస్కరించడం సులువైన పని అవుతుంది. జాబితా తయారీలో పలు లోటుపాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని మార్చదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఈ జాబితాను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది కాబట్టి, దాని ఆధారంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. చైనా ఈ ఘనతలన్నీ సాధించేందుకు ఏం చేసింది? ఎక్కడ తప్పటడుగులు వేసిందన్నది నిజాయితీగా పరిశీలించి గుణపాఠాలు నేర్చుకోవాలి. ‘నైన్ లీగ్’ లేదా ‘ప్రాజెక్ట్ 211’లో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ప్రపంచస్థాయి పరిశోధన శాలలను అభివృద్ధి చేసేందుకు చైనా భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఐసర్ వంటి సంస్థల అభివృద్ధికి భారత్ చేసిన ప్రయత్నంతో ఎన్నో లాభాలు వచ్చినా ఈ విషయంలో చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిశోధన పత్రాల ప్రచురణకు చైనా నగదు బహుమతులను ప్రకటించి తప్పు చేసిందని చెప్పాలి. దీనివల్ల అనైతిక పద్ధతులు పెరిగిపోయాయి. భారత్ ఇలాంటి పని చేయకుండా ఉండటం అవసరం. భారత్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పురోగతిని అడ్డుకుంటున్న కొన్ని సాధారణ విషయాల్లో జీడీపీలో కొంత శాతాన్ని ఈ రంగాలకు కేటాయించకపోవడం కూడా ఉంది. నిధుల పంపిణీ పద్ధతులు, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం వంటివి స్తంభించిపోయి ఉన్నాయి. నేషనల్ సైన్స్ అకాడమీలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, టెక్నాలజీ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెల్ఫీ పాయింట్ల వద్ద విజయోత్సవాలను నిర్వహించడంలో బిజీగా ఉండిపోయాయి. నిద్రాణంగా ఉన్న ఇలాంటి వారందరికీ చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పేస్ట్రీ చెఫ్ నుంచి వెల్నెస్ గురుగా..!
ప్రతి రంగంలో మహిళలు పురుషులకు ధీటుగా విజయం సాధిస్తున్నారు. ఒకే టైంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతూ ఔరా..! అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే మాన్వి లోహియా. పేస్ట్రీ చెఫ్గా మొదలైన ప్రస్థానం న్యూట్రిషినిస్ట్, వెల్నెస్ నిపుణురాలిగా ఉన్నత స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది. ఎవరీమె? ఆమె జర్నీ ఎలా మొదలయ్యిందంటే..29 ఏళ్ల మాన్వి లోహియా తొలుత పేస్ట్రీ, బేకింగ్ వంటి పాక శాస్తంలో నైపుణ్యం సంపాదించి డిస్నీలో ఫడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్తో కెరీర్ని ప్రారంభించింది. సక్సెఫుల్ బిజినెస్ విమెన్గా దూసుకుపోతూ ఓ పక్క తనకు ఇష్టమైన వెల్నెస్పై దృష్టిసారించింది. అలా హర్వర్లో బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎపిడెమియాలజీ బయోస్టాటిస్టిక్స్లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఒకటిన్నర ఏడాది గాయం, గుండె మూత్రపిండాలు, జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లలో పనిచేసింది. కొన్నేళ్లు ఈ విభాగాల్లో పరిశోధనలు చేసింది. ఆ తర్వాత తన మాతృభూమి భారత్కు వచ్చి తన దేశ ప్రజల ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అలా ఆమె హరిద్వార్లో 'ఏకాంత' అనే వెల్నెస్ సెంటర్ని ప్రారంభించింది. మాన్వియా ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న రిజిస్టర్డ్ డైటిషియన్. పైగా దాదాపు 500 మందికి పైగా రోగులకు సేవలందించిన అనుభవం గలది. అంతేగాదు ఆమె ఆఫ్రికాలో కరోనా మహమ్మారి పరిస్థితుల్లో సర్టిఫైడ్ హెల్త్కేర్ వర్కర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంతోనే మాన్వియా ఏకాంత వెల్నెస్ సెంటర్ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమస్యలకు విశ్వసనీయమైన సలహాలు, పరిష్కారాలను అందిస్తోంది.తమ ఏకాంత వెల్నస్ సెంటర్లో ప్రజలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్య సంబంధిత సౌకర్యాలన్నింటిని పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు మాన్వి. "ప్రజలు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారికి సంప్రదాయ వైద్య చికిత్సలు మంచి ప్రభావాన్ని అందించ లేకపోతున్నాయి. ఈ దైనందిన బిజీ జీవితంలో మంచి ఆరోగ్యం కోసం ప్రశాంతత నుంచే స్వస్థత పొందే యత్నం చేయాలి. అది ఇలాంటి వెల్నెస్ సెంటర్తోనే సాధ్యం. అంతేగాదు ప్రశాంతత అనేది పచ్చదనంతో కూడిన అభయారణ్యంతోనే సాధ్యమని భావించి ఆ విధంగానే తన వెల్నెస్ సెంటర్ని తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడకు విదేశీయులు సైతం వచ్చి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకుంటారని చెబుతున్నారు మాన్వియా. చెప్పాలంటే ఇక్కడ మాన్వియా తన అభిరుచులకు అనుగుణంగా తన కెరీర్ని తీసుకువెళ్లింది. పాకశాస్త్రం, ఆరోగ్య సంరక్షణ రెండు విభిన్న రంగాలు. కానీ ఆమె ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్స్ తోపాటు వెల్నెస్ సెంటర్ రన్ చేయడమే గాక ఆరోగ్య నిపుణురాలిగా, న్యూటిషినిస్ట్గా ఉన్నారు. పట్టుదట, సంకల్పం ఉంటే ఏకకాలంలో విభిన్న రంగాల్లో విజయం సాధించగలమని నిరూపించారు మాన్వి.(చదవండి: చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..) -
గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు
ప్రపంచ బ్యాంకు ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’. అయితే గాజాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో నాశనమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు 90 మందికి పైగా ప్రొఫెసర్లు ఈ దాడుల్లో మరణించారు. గాజా పిల్లల విద్యావకాశాలను నిర్మూలిస్తూ... పాఠశాలలు, పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు ధ్వంసమయ్యాయి. పాలస్తీనా విజ్ఞానం, జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం కంటే తక్కువేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల ఆందోళనలకు కారణం అదే.గాజాలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలపై ఇజ్రాయెల్ దాడి పాలస్తీనా విజ్ఞాన, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, మొత్తం 12 విశ్వవిద్యాలయాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్ లక్ష్యాలలో అల్–అజహర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా (ఐయూజీ) ఉన్నాయి. దీని ఫలితంగా పాలస్తీనా అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధన ధ్వంసమైపోయింది.ఐయూజీ ప్రెసిడెంట్, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సుఫియాన్ తాయెహ్, ఆయన కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ క్యాంపస్పై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఐయూజీ అనేది గాజాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ప్రొఫెసర్ తాయెహ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధకుడు. అలాగే, కొనసాగుతున్న దాడిలో మరణించిన 90కి పైగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లలో ఐయూజీలో ఆంగ్ల సాహిత్యం బోధించే డాక్టర్ రెఫాత్ అలరీర్ మరొకరు.పాలస్తీనా విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 జనవరి 20 వరకు దాదాపు 4,400 మంది విద్యార్థులు మరణించారు, 7,800 మంది గాయపడ్డారు. 231 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరణించారు, 756 మంది గాయపడ్డారు. అలాగే 378 ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలతోపాటు, గాజాలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నిర్వహణలోని పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 2023 అక్టోబర్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 97 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలతోపాటు 35,000కు పైగా ప్రజలు మరణించారు.‘‘దాదాపు 90,000 మంది పాలస్తీనియన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు గాజాలోని విశ్వవిద్యాలయానికి హాజరు కాలేరు. 60 శాతానికి పైగా పాఠశాలలు, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, లెక్కలేనన్ని పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. గాజా పిల్లలు, యువకుల విద్యావకాశాలను నిర్మూలిస్తూ, యూనివర్సిటీల డీ¯Œ లు, ప్రముఖ పాలస్తీనా పండితులతో సహా... వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చంపబడ్డారు’’ అని దక్షిణాఫ్రికా న్యాయపరమైన అంశాల ప్రతినిధి బ్లిన్నె నీ ఘ్రాలే అంతర్జాతీయ న్యాయస్థానంలో వెల్లడించారు.ప్రజల చిహ్నాలను, డాక్యుమెంట్ చరిత్రను తుడిచిపెడుతూ లైబ్రరీలు, ఆర్కైవ్లు, మ్యూజియంలతో సహా అనేక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా మేధావులు దీనిని ‘చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని తుడిచివేయడానికి’ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్కు రాసిన లేఖలో కెనడాలోని మౌంట్ రాయల్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ ముహన్నద్ అయ్యాష్ దీనిని ‘రాజకీయ పటం నుండి పాలస్తీనాను తుడిచిపెట్టే ప్రయత్నం’గా పేర్కొన్నారు. ‘పాలస్తీనా విజ్ఞానం, విజ్ఞాన నిర్మాతలు మరియు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం(ఎపిస్టెమిసైడ్) కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.‘ఎపిస్టెమిసైడ్’ అంటే జ్ఞాన వ్యవస్థను చంపడం, మూగబోయేలా చేయడం, నాశనం చేయడం లేదా విలువ తగ్గించడం అని అర్థం. సోషియాలజిస్ట్ బోవెంచురా డి సౌసా శాంటోస్ ఈ పదాన్ని రూపొందించారు. ‘వలస పాలన, అణచివేత, మారణహోమాల కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా’ దీనిని ఆయన అభివర్ణించారు. ఇది సైనికపరంగా, సైద్ధాంతికపరంగా రెండు విధాలుగానూ ఉండొచ్చు. ఇది విముక్తి పేరుతో స్వాధీనం, శాంతి పేరుతో దురాక్రమణ, జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కులను ఉల్లంఘించే రూపంలో జరగవచ్చు.1948లో ఇజ్రాయెల్కు స్థానం కల్పించడం కోసం తాము వైదొలగాల్సి వచ్చిన తర్వాత పాలస్తీనియన్ విద్యావంతులైన ఉన్నతవర్గాలు పాలస్తీనా విద్యావ్యవస్థను పునర్నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. వారు విద్యను తమ జీవితాలను పునర్నిర్మించడానికి, పురోగతిని సాధించడానికి ఒక చోదకశక్తిగా భావించారు. అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడి, శాస్త్రీయ పురోగతి, చరిత్రపై అవగాహన, సృజనాత్మక సాహిత్య రచనలతో గాజాను పాలస్తీనా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రదేశంగా మార్చాలనే ఆశతో అనేక మంది పండితులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లారు. ఇందులో వారు విజయం సాధించారా లేదా అనేది చర్చనీయాంశం. కానీ కచ్చితంగా, పాలస్తీనా నేడు అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థుల తిరుగుబాటు వెనుక ఉన్న కారణం అదే. పాలస్తీనా విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రతిధ్వనులు విదేశాల్లోని క్యాంపస్లలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ద్రవ్య, సైనిక, దౌత్య, నైతిక మద్దతును నిరసిస్తూ అనేక విశ్వవిద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటైనాయి. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోకి పోలీసులను పిలిపించారు, 645 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మందిని తర్వాత విడుదల చేశారు. ఉన్నత స్థాయి కొలంబియా, బోస్టన్ విశ్వవిద్యాలయాలు నిరసనల కేంద్రాలుగా మారాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల క్యాంపస్ల నుండి 200 మందికి పైగా అరెస్టులు చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపులో గణనీయమైన సంఖ్యలో అధ్యాపకులు పాల్గొన్నారు లేదా మద్దతు ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాలనాధికారులు విరుచుకుపడ్డారు, వారిలో కొందరిని బహిష్కరించారు.లాస్ఏంజిల్స్లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,ఇతర ప్రదేశాలలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనకారుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాలస్తీనా విద్యను విధ్వంసకరమైన విభజన దురదృష్టాల నుండి రక్షించడానికి ప్రపంచం తన స్వరాన్ని పెంచాలి. జ్ఞాన వ్యవస్థను నాశనం చేయడానికి వారాలు పడుతుంది. కానీ దానిని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది.ఇజ్రాయెల్తో జట్టు కట్టిన దేశాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు దురదృష్టవశాత్తూ పాలస్తీనా సంస్థలతో విద్యా మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విముఖత చూపాయి. మరోవైపు, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల విద్యార్థులను అంతర్జాతీయ సహకారానికి చెందిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి సాదరంగా స్వాగతించారు. ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలు కెనడాకు చెందిన పోస్ట్–సెకండరీ సంస్థలతో ఇప్పటికే 60 విద్యా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, యూనియన్లు... అస్తవ్యస్తంగా ఉన్న పాలస్తీనా వ్యవస్థను పునర్నిర్మించడానికి వాగ్దానం చేయడంతో పాటు, యుద్ధాన్ని ముగించే వైపుగా ప్రజల అభిప్రాయాన్ని నిర్మించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
కాలం చెల్లిన బాబు నమూనా
ఫ్రెంచ్ వనిత డా‘‘ డెలాల్ బెన్బాబాలి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సోషల్ జాగ్రఫీ – ఆంత్రో పాలజీ స్కాలర్. ఆమె – ‘క్యాస్ట్ డామినెన్స్ అండ్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా: అండర్స్టాండింగ్ కమ్మాస్ సోషియో –స్పేషియల్ మొబిలిటీ’ అంశంపై పరిశోధన చేశారు. ఆమె తన పరిశోధనలో ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఆసక్తికరమైనది. ఒక భూభాగంపై ఆధిపత్యం చలాయించే విషయంలో జనాధిక్యత ఉండే కులాలకూ, ఆధిపత్య కులాలకూ మధ్యఉండే వ్యత్యాసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారామె. ‘హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కల్చర్ విస్తరించడంలో కొత్తగా వలస వచ్చినవారి పాత్ర,’ ‘సామాజిక ఊర్ధ్వ చలనానికి దోహదం చేస్తున్న వలసలు’ వంటి మరో రెండు పరిశోధనా పత్రా లను కూడా గమనిస్తే వాటిల్లో ‘కామన్’గా కనిపి స్తున్న అంశాలు మూడు ఉన్నాయి. అవి – భూమి, వలసలు, ఆధిపత్యం. ఈ అంశాలను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్వయించడం జరిగింది. ఆమె విదేశీ స్కాలర్ కనుక ఆమెకు ఇక్కడి రాజకీయాలు, కులాల విషయంలో ఇష్టాయిష్టాలకు ఆస్కారం లేదు. పైగా ఆమె పరిశోధనా వ్యాసాలు 2010కి ముందు కాలం నాటివి. కనుక ఆమె సూత్రీక రణలలోని నిజాయతీని అనుమానించడానికి ఆస్కారం కనిపించదు. అయితే, ఆమె తన మొత్తం పరిశోధనను – ‘ఆధిపత్యం’ వద్దకు తెచ్చి ఒక ముగింపు ఇవ్వడం, అందుకు ఆమె తీసుకున్న ఉదాహరణను ముందుగా మనం గుర్తించాలి. ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన చంద్రబాబు కులస్థులు హైదరాబాద్ నగరానికి పశ్చిమాన జూబ్లీ హిల్స్–కూకట్ పల్లికి మధ్య ఉన్న భూములను ఆవాసాలుగా చేసుకుని స్థిరపడ్డారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆప్రాంతంలో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారాన్ని ప్రోత్స హించి, దాన్ని ‘సైబరాబాద్’ అంటూ వారు ప్రయోజనం పొందే వ్యూహాన్ని అమలు చేశారు. అతని వ్యూహం మేరకు అది విజయవంతం అయినప్పటికీ, హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా స్థానికులు వీరి ‘ఆధిప త్యాన్ని’ ప్రశ్నించడంతో రాష్ట్ర విభజన జరిగింది. దాంతో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్ళీ అదే పాత ‘సైబరాబాద్’ వ్యూహాన్ని ఈసారి – ‘రాజధాని అమరావతి’ పేరుతో ఇక్కడ అమలుకు తెర తీశారు. బాబు దాని కోసం, భారత ప్రభుత్వం నియమించిన ‘శివరామ కృష్ణన్ కమిటీ’ నివేదికను సైతం పక్కనపెట్టి, అందుకు ‘ఎన్డీయే’లో టీడీపీ భాగస్వామ్యాన్ని అడ్డంగా వాడుకున్నారు. అమరావతి భూమి పూజకు 2016లో వచ్చిననరేంద్రమోదీ ఆ తర్వాత, బాబు ఏపీ తన సొంత జాగీరు అన్నట్టుగా, విదేశీ కంపెనీలతో నిర్మాణ ఒప్పందాలు, ‘అమరావతి’ భూముల్లో వాటాలు ఇచ్చినా, ఏనాడూ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? అని అడిగింది లేదు. బాబు నిజంగా ‘విజనరీ’ అయితే, కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం మొదటి ఐదేళ్లలో పూర్తి చేయగలిగిన ‘ప్లాన్’ మాత్రమే అమలు చేయాలి. అదే జగన్ మోహన్ రెడ్డి విషయంలో చూడండి. అన్ని ఆర్థిక స్థాయుల్లోని వర్గాలకు ‘సంక్షేమం’అందిస్తూనే, రెండున్నర ఏళ్ళ ‘కరోనా’ కాలాన్ని దాటి, తీరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి 16 వేల కోట్ల రూపాయలతో 4 పోర్టులు, రూ. 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లేండ్సెంటర్లు నిర్మిస్తున్నారు. అలా శ్రీకాకుళం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు సముద్ర తీరం వెంట సహజ ప్రకృతి వనరుల అభివృద్ధికి పెట్టుబడుల్ని వికేంద్రీకరించడం వల్ల; భవిష్యత్తులో ‘భూమి’ దాని సొంతదారు ‘ఆధిపత్యం’ వంటివి ఇకముందు లేకపోగా, ‘వలసలు’ కూడా ఇకముందు తగ్గుతాయి. డా‘‘ డెలాల్ బెన్బాబాలి తన పరిశోధనా వ్యాసాల్లో ప్రస్తావించిన – భూమి, వలసలు, ఆధిపత్యం అంశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి టర్మ్లోనే ‘అడ్రెస్’ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆమె పరిశోధనా వ్యాసాలు– కమ్మ కులం కేంద్రంగా ఉన్నప్పటికీ, రెడ్ల ప్రస్తావనను ఆమె వదిలి పెట్టలేదు. అయినా ఇక్కడ కులాలు ఏవి అనే ఆరా కంటే, ‘ఎప్పుడు’, ‘ఎవరు’ అనే దృష్టి మనకు ముఖ్యం. దేశం స్వతంత్రమై వందేళ్లకు చేరువ అవుతున్నప్పుడు, వనరుల పంపిణీ అన్ని ప్రాంతాలకూ, అన్ని సామాజిక వర్గాలకూ వారి వారి దామాషా మేరకు చేరే ప్రయత్నం మొద లయిందా లేదా అనేది ఇక్కడ కీలకం. తన మొదటి ఐదేళ్ల టర్మ్ లోనే 13 జిల్లాలను 26గా చేసి ప్రభుత్వాన్ని సూక్ష్మ స్థాయికి తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇప్పుడు జరుగుతున్న వనరుల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అనుమానం లేదు, అందువల్ల పేద వర్గాల జీవన ప్రమాణాలు మునుపటి కంటే చాలా బాగా మెరుగవుతాయి. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులుమొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్ ‘స్వర్’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) డైరెక్టర్ కే.ఎస్. గోపాల్ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్డిపి ఇండియా సంయుక్తంగా వాటర్ సస్టయినబిలిటీ అవార్డ్స్ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ‘ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్ సెక్టార్’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్ గోపాల్ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన స్వర్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం! -
తీర ప్రాంత శోధన కోసం ఎన్సీసీఆర్ కేంద్రం
పెదగంట్యాడ (విశాఖపట్నం): సముద్ర జలాల నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ (పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఎన్సీసీఆర్ ప్రధాన భూమిక పోషిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. మంగళవారం యారాడలోని డాల్ఫిన్ నోస్పై కొత్తగా నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్సీసీఆర్) కేంద్రాన్ని ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.78 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో మరో 6నెలల్లో రీసెర్చ్కు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తామన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విపత్తులు ఎక్కువయ్యాయని, ఇటీవల సంభవించిన తుపాన్ల వల్ల ముంబై, చెన్నై వంటి నగరాలు వణికిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, తీరం వెంబడి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా పరిశోధనలు చేయాలని మినిస్ట్రీస్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవిచంద్రన్ కోరారు. ఇప్పటివరకూ ఎన్సీసీఆర్ కేంద్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగంలో నిర్వహిస్తూ వస్తున్నామని, ఇకపై ఈ భవనంలోకి దానిని తరలించనున్నామని ఎన్సీసీఆర్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి చెప్పారు. అనంతరం ఈ కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ (ఐఐటీఎం), ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కృష్ణన్, ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ విజయ్కుమార్, సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ ఎం.వెంకటేశ్వరరావు, పలువురు శాస్త్రవేత్తలు, రీసెర్చ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
తీరాన్ని శోధించేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపానులు... రుతుపవన సీజన్లో వచ్చే వరదలు... సముద్రమట్టాల పెరుగుదల... మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల... పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు... కోతకు గురవుతున్న తీరప్రాంతాలు... ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధిస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్సీసీఆర్) ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తుతున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్పై రీసెర్చ్ సెంటర్ను నిర్మించింది. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్సీసీఆర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతోపాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది. లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించింది. దీనిని ఈ నెల 14న కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్సీసీఆర్ తాత్కలిక కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగం భవనంలో నిర్వహిస్తున్నారు. దీన్ని డాల్ఫిన్నోస్లో నిర్మించిన నూతన భవనంలోకి నెల రోజుల్లో తరలిస్తారు. ఎన్సీసీఆర్ ఏం చేస్తుందంటే... ♦ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న సమస్యలపై విశాఖలోని ఎన్సీసీఆర్ కేంద్రం పరిశోధనలు నిర్వహించనుంది. ♦ మొత్తం 972 కిలో మీటర్ల తీరం వెంబడి ఏయే సమస్యలు ఉన్నాయనేది ఎన్సీసీఆర్ స్వయంగా పరిశీలించనుంది. ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషిచేస్తుంది. ♦ సముద్ర తీరంలో ఎక్కడ, ఎంత మేర కాలుష్యమవుతోంది. దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది. కాలుష్యం వల్ల సముద్రంలో వస్తున్న మార్పులు, మడ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు వంటి వాటిపై నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తుంది. ♦ ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్సీసీఆర్... త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ను కూడా తయారు చేయనుంది. దీనిద్వారా ఏయే తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఇవ్వనుంది. దానిప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ♦ సముద్రజలాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం సర్వీస్, సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేస్తుంది. ♦సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై పరిశోధనలు చేసి నివేదికను రూపొందిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపడతారు. -
ఇంధన సామర్థ్య పరిశోధనల్లో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్న ఇంధన సామర్ధ్య సాంకేతికతలను ప్రోత్సహించే లక్ష్యంతో, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈఈడీసీఓ) ముందడుగు వేసింది. ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్ (ఐపీఎంఎస్ఎం) సాంకేతికతతో ఎనర్జీ ఎఫిషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్ను విజయవంతంగా తయారు చేసింది. దీని కోసం సబ్మెర్సిబుల్ వాటర్ పంపింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవ్ సిస్టమ్ డిజైన్ ప్రోటోకాల్ను ఆంధ్రా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్లోని మోడల్ మోటార్ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యుత్ సౌధలో శుక్రవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో పంపుసెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ఐపీఎంఎస్ఎం మోటార్ల ద్వారా ఈ రంగంలో విద్యుత్ను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిధులతో దాదాపు 20 వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్ఎం సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఏపీఈపీడీసీఎల్ను ఈ సందర్భంగా విజయానంద్ ఆదేశించారు. ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున్ రావు, ఏపీఎస్ఈఈడీసీఓ టెక్నికల్ హెడ్ శ్రీనివాసులుతో కలిసి మోటార్ పనితీరును ఏపీఎస్ఈసీఎం సీఈఓ కుమార రెడ్డి వివరించారు. ఐపీఎంఎస్ఎం మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయమని, ఇండక్షన్ మోటార్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మోటార్లకు 80 శాతం సామర్థ్యం ఉండగా, ఐపీఎంఎస్ఎం అనేది 90 శాతం ఉందని వెల్లడించారు. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లుకాగా, అధిక గ్రేడ్ మెటీరియల్స్ కారణంగా ఐపీఎంఎస్ఎం మోటార్ సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుందని చెప్పారు. తక్కువ నిర్వహణ వ్యయం,30శాతం తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన వివరించారు. -
విత్తన పరిశోధనకు మరో ముందడుగు
సాక్షి, అమరావతి: విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతోంది. కృష్ణాజిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. రైతులకు నాణ్యమైన సర్టీఫై చేసిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోనే తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ను తీసుకొచ్చింది. ఇక్కడ సర్టిఫై చేసిన విత్తనాలనే మార్కెట్లోకి విడుదల చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సరఫరా చేస్తోంది. మరోవైపు.. విత్తన పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేస్తోంది. ఈ తరహా పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో ఒక్క వారణాసిలో మాత్రమే ఉంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వపరంగా ఈ తరహా పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రయత్నాలు కూడా జరగలేదు. ఇప్పుడు గన్నవరంలోని విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల అంచనాతో తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గతేడాది మార్చిలో శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.18 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు పరిపాలనామోదం ఇవ్వగా, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. కొత్త రకాల విత్తనాలకు రూపకల్పన.. ఈ సంస్థ ఏర్పాటుతో రాష్ట్రంలో విత్తన నాణ్యత పరీక్షించే యంత్రాంగం బలోపేతం కానుంది. మానవ వనరుల అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సీడ్ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. వాతావర ణాన్ని తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల విత్తనాల రూపకల్పనతో పాటు సంకర జాతుల అభివృద్ధిలో ఈ సంస్థ భవిష్యత్తులో కీలక భూమిక పోషించనుంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థల సమన్వయంతో వ్యవసాయ పట్టభద్రులు, డిప్లమో హోల్డర్లకు కెపాసిటీ బిల్డింగ్ కింద శిక్షణ ఇవ్వనున్నారు. ఏటా కనీసం వెయ్యిమంది అగ్రి గ్రాడ్యుయేట్స్, రెండువేల మంది అగ్రి డిప్లమో హోల్డర్స్కు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అత్యాధునిక సౌకర్యాలు.. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రస్థాయి విత్తన జన్యు బ్యాంకుతో పాటు సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే.. ► విత్తనాలు నిల్వచేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మిస్తున్నారు. ► రైతుల శిక్షణ కోసం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిప్లమో చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించి ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగువేసే వారికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ భవన సముదాయాలు నిర్మిస్తున్నారు. ► ఇప్పటికే పరిశోధనా సంస్థ భవన సముదాయంతో పాటు ట్రైనింగ్ సెంటర్కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తికావచ్చింది. ► వచ్చే జూలై నాటికి వీటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు రైతులకు అధిగ దిగుబడునిచ్చే నాణ్యమైన, మేలు రకం వంగడాలు అందించేందుకు విస్తృత పరిశోధనలు చేసే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం జగన్ సూచనల మేరకు డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. సంస్థ సేవలు అందుబాటులోకి వస్తే విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోను న్నాయి. – డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
సోషల్ మీడియాలో.. 504 కోట్ల మంది
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని సోషల్ మీడియా ఊపేస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోని వివిధ యాప్లలో గంటలు గంటలు గడిపేస్తున్నారు. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ పరిశోధన ప్రకారం.. ప్రపంచ జనాభాలో ఏకంగా 62.30 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే 26.60 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్ మీడియాలోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా యూజర్ల సంఖ్య 504 కోట్లకు చేరిందని వెల్లడించింది. వీరిలో 46.50 శాతం మంది మహిళలు, 53.50 శాతం మంది పురుషులు ఉన్నారు. సగటున ఒక వ్యక్తి రోజువారీ సోషల్ మీడియా వినియోగం 2.23 గంటలుగా నమోదయ్యింది. ఇక ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో అత్యధికంగా 94.20 శాతం మంది సోషల్ మీడియాలోనే ఉంటున్నారని నివేదిక పేర్కొంది. అమెరికాలో యూట్యూబ్ టాప్ గతంలో సగటున ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లామ్ఫారమ్ల వినియోగం 6.9 శాతంగా ఉంటే ఇప్పుడు 6.7 శాతానికి తగ్గడం విశేషం. మరోవైపు టాప్–4 సోషల్ మీడియా ఫ్లామ్ఫారమ్లలో మూడు ‘మెటా’కు చెందినవే ఉన్నాయి. అగ్రస్థానంలో ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ కొనసాగుతున్నాయి. అమెరికాలో మాత్రం ఫేస్బుక్ను వెనక్కి నెడుతూ యూట్యూబ్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది. -
తిరుమల గిరుల్లో తులిప్ విరులు
తులిప్స్.. ఎన్నెన్నో రంగుల్లో మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. మగువలు సిగలో అలంకరించుకునేందుకు ఉపయోగపడకపోయినా.. వేడుకల అలంకరణలో మాత్రం రాజసాన్ని చాటుతాయి. నింగీనేలా చుంబించే లాలిలో ఓలలాడించే ఈ పుష్ప రాజాలు కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయి. కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో ఆహ్లాదాన్నిపంచే ఈ పుష్పాలు ఉద్యాన శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు తిరుమల గిరులపైనా విరబూస్తున్నాయి. సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న తులిప్ పూలను ఏపీలోనూ సాగు చేయించాలన్న తలంపుతో వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని సిట్రస్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వీటి సాగుకు తిరుమల గిరుల్లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు సత్ఫలితాలనివ్వడంతో భవిష్యత్లో మరిన్ని రకాల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. శీతల పరిస్థితులు గల ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యే ఈ పూల మొక్కలు జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తులిప్స్ రానున్న రోజుల్లో కలియుగ దైవం కొలువైన ఏడుకొండలపైనా ఇకపై కనువిందు చేయనున్నాయి. తులిప్స్ పూలకు ప్రత్యేకతలెన్నో..: లిలియాసీ (లిల్లీ) పూల జాతికి చెందిన ఈ పుష్పాలు ప్రపంచంలోనే టాప్–10 కట్ ఫ్లవర్స్లో ఒకటిగా ఖ్యాతి చెందాయి. తులిప్లో దాదాపు వందకు పైగా రకాలు ఉన్నాయి. వీటిని దుంపల ద్వారా సాగు చేస్తారు. తల్లి దుంపల(బల్బ్సŠ)ను నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. తల్లి దుంపల్ని 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో 3 నెలలపాటు ఫ్రీజ్ చేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వీటిని నాటుకుంటారు. దుంపకు దుంపకు మధ్యలో 8–10 సెం.మీ. దూరంలో దుంప సైజును బట్టి 5–8 సెం.మీ. లోతులో నాటుకోవాలి. మొక్కల మధ్య 15 సెం.మీ., వరుసల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూస్తారు. 20 చదరపు అడుగులకు 100 దుంపల చొప్పున ఎకరాకు 45 వేల దుంపల వరకు నాటుకోవచ్చు. ఏడాది పాటు భూమిలోనే ఉంచితే పిల్ల దుంపలు పుట్టుకొస్తాయి. వాటిని సేకరించి మరుసటి ఏడాది నాటుకోవచ్చు. పుషి్పంచే కాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. నాటిన 45–60 రోజుల్లో పుషి్పస్తాయి. పుష్పించే సమయంలో రాత్రి పూట 5–12 డిగ్రీలు, పగటి పూట 20–26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండాలి. 10 రోజుల పాటు తాజాగా..: రెండాకులు ఉండేలా పూలను కత్తిరించి, వాటి తాజాదనం కోల్పోకుండా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కత్తిరించిన తర్వాత కనీసం 5–10 రోజుల వరకు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. పూలు కోసిన తరువాత 10 రోజుల్లో మొక్క ఎండిపోతుంది. ఎండిన మొక్కను తొలగించి భూగర్భంలో ఉన్న దుంప బయటకు తీసి మళ్లీ ఫ్రీజ్ చేయాలి. మరుసటి ఏడాది సీజన్ ప్రారంభమైన తర్వాత మళ్లీ నాటుకోవాలి. ఎత్తైన మడుల్లో డ్రిప్ ఇరిగేషన్ సాయంతో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. వసంతకాలంలో 3–7 రోజుల పాటు వికసించే ఈ పూలు దాదాపు అన్ని రంగుల్లోనూ కనువిందు చేస్తాయి. మెజార్టీ రకాల పూలు ఒకే విధమైన ఆకృతిలో ఉంటాయి. అత్యంత ఖరీదైన ఈ పూల రెమ్మలను తింటారు. కొన్ని వంటకాల్లో ఉల్లికి బదులు వీటి రెబ్బలనే వాడుతుంటారు. మార్కెట్లో ఒక్కో పువ్వు రూ.50 నుంచి రూ.75 వరకు ధర పలుకుతుంది. ఫలించిన పరిశోధన తిరుపతిలోని మైదాన ప్రాంతాలతోపాటు సముద్ర మట్టానికి 980 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండ ప్రాంతాల్లో ప్రత్యేక నర్సరీ నెలకొల్పి వీటి సాగుపై అధ్యయనం చేశారు. ఏడీ రెమ్, డెన్మార్క్, డౌ జోన్స్, రాజవంశం, ఎస్కేప్, గోల్డెన్ పరేడ్, పింక్ ఆర్డోర్, పురిస్సిమా, పర్పుల్ ఫ్లాగ్ సూపర్ మోడల్ రకాలకు చెందిన తులిప్ దుంపలను డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో నాటారు. రెండుచోట్ల మొలకెత్తినట్టు గమనించినప్పటికీ తిరుమలలో మాత్రం నాటిన ప్రతి దుంప మొలకెత్తింది. డెన్మార్క్ రకం 10–12 రోజుల్లో పూర్తిగా పూలు విచ్చుకోవడాన్ని గుర్తించారు. తిరుమలలో తులిప్ పార్క్ అత్యంత శీతల ప్రాంతంలో సాగయ్యే ఈ పూల సాగుపై మేం చేసిన పరిశోధనలు ఫలించాయి. శ్రీనగర్ తరహాలోనే తులిప్ గార్డెన్స్ పెంచేందుకు తిరుమల గిరులు కూడా అనుకూలమని గుర్తించాం. భవిష్యత్లో టీటీడీ సౌజన్యంతో వీటి సాగు దిశగా సన్నాహాలు చేయబోతున్నాం. గుర్రం కొండతోపాటు ఇతర ఎత్తైన ప్రాంతాల్లో వీటి సాగును విస్తరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు గల అవకాశాలపై కూడా పరిశోధన చేస్తున్నాం. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి -
సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు
న్యూఢిల్లీ: బ్రిటన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏ) కింద ఆటోమొబైల్స్పై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీ పరిశ్రమకు ప్రతికూలం అవుతుందని ఆర్థికవేత్తల సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలు, జపాన్, కొరియాలతో ఉన్న ఎఫ్టీఏల్లో కూడా కార్లపై సుంకాలను భారత్ తగ్గించలేదని పేర్కొంది. ‘ఎఫ్టీఏల కింద ఎలక్ట్రిక్ వాహనాలు సహా ఆటోమొబైల్స్పై కస్టమ్స్ సుంకాలను భారత్ తగ్గించరాదు. అలా చేస్తే భారత్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆటో దిగ్గజాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవి సంస్థలను మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది‘ అని జీటీఆర్ఐ తెలిపింది. బ్రిటన్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో కార్లను అసెంబుల్ మాత్రమే చేస్తుంది కాబట్టి ఆ దేశానికి సుంకాలపరమైన మినహాయింపుని ఇచ్చేందుకు సరైన కారణమేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బ్రిటన్కి గానీ మినహాయింపులు ఇస్తే జపాన్, కొరియా వంటి ఇతరత్రా ఎఫ్టీఏ భాగస్వాములు తమకు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టారిఫ్ విధానాన్ని కొనసాగిస్తూ, అదనంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపరమైన మద్దతును పరిశ్రమకు అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని జీటీఆర్ఐ సూచించింది. పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయాలి.. 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు నుంచే ఉంటున్నందున ఎలక్ట్రిక్ వాహనాలనేవి భారత్లో అంతగా పర్యావరణ అనుకూలమైనవేమీ కాదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చే బదులు కొత్త తరం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశోధన కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని జీటీఆర్ఐ పేర్కొంది. దిగుమతి సుంకాలను క్రమంగా 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేయడంతో ఆ్రస్టేలియాలో చాలా మటుకు స్థానిక కార్ల కంపెనీలు మూతబడ్డాయని తెలిపింది. దానికి విరుద్ధంగా భారత్ అధిక సుంకాలను కొనసాగించడం వల్ల కార్ల పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. దీనివల్ల దేశీయంగా కార్లు, ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందగలదని పేర్కొంది. -
దానిపైనే కంపెనీల ఫోకస్.. కలవరపెడుతున్న ఇన్ఫోసిస్ రీసెర్చ్!
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాధాన్యం పెరిగింది. మరీ ముఖ్యంగా జనరేటివ్ ఏఐపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆసియా పసిఫిక్ కంపెనీలు ఉత్పాదక ఏఐ (GenAI)లో పెట్టుబడులను పెంచుతున్నాయి. భారత్ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, సింగపూర్లలో కంపెనీలు 2024లో జనరేటివ్ ఏఐపై పెట్టే ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరగనుందని, ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు 3.4 బిలియన్ డాలర్లు (రూ.28 వేల కోట్లకు పైగా) ఖర్చు చేయనున్నాయని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చేపట్టిన ఓ అధ్యయనం అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ.. కాగా జనరేటివ్ ఏఐపై ఖర్చు విషయంలో ఉత్తర అమెరికా దేశాల కంటే తక్కుగా ఉన్నప్పటికీ ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సాంకేతికతపై పరిశోధనలు, అభివృద్ధి అత్యధికంగా ఉన్నట్లు ఇన్ఫోసిస్ పరిశోధన విభాగమైన ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ (IKI) తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, భారతదేశం, సింగపూర్ దేశాల్లోని వెయ్యి మందికిపైగా బిజినెస్ లీడర్లు, ఏఐ పరిశోధకులతో ఇన్ఫోసిస్ ఈ సర్వే చేపట్టింది. జాబ్స్పై ప్రభావం ఉంటుందా? ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జనరేటివ్ ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంది. ఈ ఏడాది చైనా కంపెనీలు ఈ టెక్నాలజీపై పెట్టే ఖర్చు 160 శాతానికిపైగా పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అయితే దీని ప్రభావం జాబ్స్పై కచ్చితంగా ఉంటుందన్న ఆందోళన ఉద్యోగులను కలవపెడుతోంది. -
రాష్ట్రంలో డిపాజిట్లు పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిపాజిట్లు, క్రెడిట్ పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏపీలో డిపాజిట్ల వార్షిక సగటు వృద్ధి 9.4 శాతం ఉంటే.. అదే సమయంలో ప్రజలకు అవసరమైన క్రెడిట్ కూడా వార్షిక సగటు వృద్ధి 14.3 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఐదేళ్లలో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు సగటు వార్షిక వృద్ధి 9.4 శాతం నమోదవ్వడం అంటే ప్రజల ఆదాయాలు పెరగడమే నిదర్శనంగా కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు సత్ఫలితాలిచ్చాయనడానికి డిపాజిట్లలో వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక నవరత్నాలు ద్వారా అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. అలాగే, బ్యాంకుల ద్వారా పేదలతో పాటు రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, ఎంఎస్ఎంఈలతో పాటు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారి ఆదాయాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వార్షిక సగటు క్రెడిట్ వృద్ధి 14.3 శాతం నమోదైంది. ► అలాగే, ఇచి్చన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నావడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. ► అంతేకాక.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలను ఇప్పిస్తోంది. ► వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నావడ్డీకే రుణాలు ఇప్పిస్తోంది. ► ఇక వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆరి్థక సాయం అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడమే కాకుండా వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ► దీంతో ఈ వర్గాలన్నింటికీ బ్యాంకులు విరివిగా రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇలా రుణాలు తీసుకున్న వారు సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తున్నారు. -
ఎప్పుడు లేస్తామన్నదీ కీలకమే!
మా పక్కింటాయన నేను నిద్రలేచే సమయానికి చక్కగా స్నానం ముగించుకొని మరికొన్ని పనులు కూడా చేసి ఆనాటి పనికి సిద్ధంగా ఉంటాడు. అసలు మొదటి నుంచి త్వరగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున్నే త్వరగా లేచే వాళ్ళు, ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంటారని చెబుతారు. అయితే అందరికి ఆ రకంగా ఉండడం వీలు కాదు. కొంతమంది రాత్రి చాలాసేపు వరకు పని చేసి, ఉదయాన కొంచెం నెమ్మదిగా నిద్ర లేస్తారు. ఈ రకం తేడాలను పరిశోధకులు ‘క్రోనోటైప్’ అని గుర్తిస్తుంటారు. వారు మాత్రం త్వరగా నిద్రలేచేవారు గొప్పవారు, మిగతావారు కారు అన్న విషయాన్ని అంత సులభంగా అంగీకరించరు. అన్నిటికన్నా ముందు గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. కనీసం 60 శాతం మంది అటు రాత్రి పని చెయ్యరు, ఇటు ఉదయాన త్వరగా లేవరు. వాళ్ళ పద్ధతి రెండు పద్ధతుల కలగలుపుగా ఉంటుంది. క్రోనోటైప్స్ అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం, ఉదయాన నిద్ర లేవడం అన్న లక్షణాల మీదనే ఆధారపడి లేదు అంటున్నారు పరిశోధ కులు. ఇంగ్లీష్లో రాత్రి పనిచేసే వాళ్లను గుడ్లగూబలు, త్వరగా నిద్రలేచే వాళ్ళను భరత పక్షులు అంటారు. ఈ తేడాలకు రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలలో రాత్రి పని చేయవలసి వస్తుంది. కొంత మందికి అవసరం ఉండదు. పరిశోధకులు చెబుతున్న ప్రకారం సాధారణంగా ఆడవాళ్ళు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. మగవాళ్లు ఎక్కువగా ఉదయాన త్వరగా లేస్తారు అనే అర్థం అవుతున్నది. ఈ తేడాలకు మరొక కారణంగా వయసు కూడా ఉంది. కుర్రవాళ్లు గబ్బిలాలుగా రాత్రి ఎక్కువ సేపు మేల్కొంటారట. వయసు పెరుగుతున్న కొద్దీ, త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటు అవుతుందట. ఇంతకు నిద్ర, మెలకువల కారణంగా ఆనందంగా బతకడం గురించి చాలా పరి శోధనలు జరిగాయి. ఉదయాన త్వరగా లేచేవారు దినమంతా హుషారుగా, సాధార ణంగా ఆనందంగా ఉంటారు. టర్కీలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలో త్వరగా నిద్ర లేచే వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు తేలింది. విద్యార్థులు త్వరగా నిద్ర లేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారు అని కూడా తెలిసింది. విద్యార్థులలో 26.6 శాతం మంది గబ్బిలాలు (అంటే రాత్రి ఎక్కువ సేపు మెలకువగా ఉంటారు). అటువంటి వారికి ఆనందం తక్కువగా ఉందట. భరత పక్షులు అనిపించుకున్న పిల్లలు చురు కుగా ఉన్నారట. ఈ మధ్య ఒక జర్మన్ యూని వర్సిటీ పరిశోధనలో త్వరగా నిద్రలేచే వాళ్ళకు జీవితాలలో మంచి సంతృప్తి ఉంటుంది అని తెలిసింది. ఇక రాత్రి ఎక్కువ కాలం మెలకువ ఉండేవారిలో డిప్రెషన్, కాలానుగుణంగా మరికొన్ని మానసిక సమస్యలు, మత్తు పదార్థాల వాడకం వంటి సమస్యలు కనిపించాయి. విషయం అను కున్నంత సజావుగా లేదు. రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉన్న వాళ్లు, అసలు తక్కువ కాలం నిద్రపోతున్నట్టు తెలుస్తున్నది. త్వరగా నిద్రలేవడం కన్నా నిద్ర సమయం ఎక్కువ సమస్యగా ఉంటున్నది. త్వరగా నిద్రలేచే వారికీ తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్టు కూడా కనిపించింది. ఇంతకు నిద్రలో ఈ తేడాలు అసలు ఏ కారణంగా మొదలవు తాయి? సహజంగా ఉన్న ఈ పరిస్థితిని ప్రయత్నించి మార్చడానికి వీలు కుదురుతుందా అన్నది మరో ప్రశ్న. ఈ అంశం గురించి వార్విక్ విశ్వవిద్యాలయంలో వివరంగా పరిశోధనలు జరిగాయి. అక్కడ తమను తాము చక్కని క్రమశిక్షణతో నియంత్రించుకోగల వారు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారు అని గమనించారు. అసలు వ్యక్తిత్వంలో స్వయం నియంత్రణ, చక్కని క్రమపద్ధతి, ఆశాభావం ఉంటే నిద్ర వారి నియంత్రణలో ఉంటుంది అని గమనించారు. ఇక సులభంగా మనసును బయటపెట్టి గలగలా మాట్లాడే వారు, రహస్యాలు దాచుకోకుండా ఉండేవారు రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉంటున్నారని గమనించారు. జన్యుపరంగా వ్యక్తిత్వ లక్షణాలు వచ్చేవారు, దాని ఆధారంగా నిద్ర విషయంగా కూడా తేడాలు కనబరుస్తారని తెలిసింది. అన్నిటికీ మించి మరొక్క విషయం గుర్తించాలి. క్రోనోటైప్స్ అంటే గుడ్లగూబలు (రాత్రి పని చేసేవారు), భరత పక్షులు (త్వరగా నిద్రలేచే వారు) అన్న లక్షణాలు, శిలాక్షరాలుగా గట్టిగా నిలిచి ఉండవు అంటున్నారు. ఈ పరిస్థితి జన్యుపరంగా కాక మరెన్నో లక్షణాల కారణంగా స్థిరమవుతుంది. కేవలం జన్యు కారణాల వల్లనే కాక నిద్ర తీరు మీద మరెన్నో ప్రభావాలు ఉన్నాయి. కనుక ఈ లక్షణాలు కొంత ప్రయత్నిస్తే మారే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. త్వరగా నిద్ర లేవదలుచుకున్నవారు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పని చేయకుండా ఉండటం మంచిది అంటున్నారు. ఉదయాన త్వరగా నిద్ర లేచినందుకు చక్కని బహుమతి కూడా ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలని వారి సలహా. నిద్ర లేవగానే హాయిగా వేడి వేడి కాఫీ తాగడం కూడా అటువంటి బహుమతులలో ఒకటి కావచ్చు. లేదంటే త్వరగా లేచినందుకు హాయిగా వాకింగ్కు వెళ్లి రావచ్చు. వార్సా యూనివర్సిటీలో ఈ అంశం గురించి మరికొన్ని పరిశోధనలు జరిగాయి. రుతువుల ప్రకారం కూడా నిద్రపోయే విషయంలో మార్పులు వస్తాయి అని అక్కడ గమనించారు. దినమంతా చురుకుగా పని చేయాలి, బ్రతుకులో మంచి గమ్యాలు ఉండాలి. అప్పుడు సమయానికి నిద్ర వస్తుంది. కావాలనుకున్నప్పుడు మెలకువ కూడా వస్తుంది. అది చివరగా అర్థం చేసుకోవాల్సిన సూత్రం. వ్యాసకర్త సైన్స్ రచయిత డా‘‘ కె. బి. గోపాలం -
పీఎం స్వనిధిలోనూ అక్కచెల్లెమ్మలదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యున్నత లక్ష్యాల్లో ఒకటైన మహిళా సాధికారత ఈ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కళ్ల ముందు కనిపిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నారు. చిన్న వ్యాపారులు, సూక్ష్మ పరిశ్రమలకు కేంద్రం అందించే పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవడంలోనూ రాష్ట్ర మహిళలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలోని పీఎం స్వనిధి రుణ గ్రహీతల్లో 74 శాతం మహిళలే. పురుషులు 26 శాతం ఉన్నారు. జాతీయ స్థాయిలో 57 శాతం పురుషులు ఈ రుణాలు తీసుకుంటుండగా, మహిళలు 43 శాతమే ఉన్నారు. ఎస్బీఐ రీసెర్చి నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. ఈ రుణాలను చురుగ్గా సద్వినియోగం చేసుకోవడంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో రుణాలను చురుగ్గా ఖర్చు చేస్తున్న లబ్దిదారులు 22 శాతం మంది కాగా, ఏపీలో వీరు 28 శాతమని ఎస్బీఐ రిసెర్చి నివేదిక తెలిపింది. తొలి స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 32 శాతం మంది చురుగ్గా వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది. అతి తక్కువగా పశ్చిమ బెంగాల్లో 17 శాతం మంది, జార్ఖండ్లో 18 శాతం మందే చురుగ్గా వ్యయం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. లక్ష్యానికి మించి రుణాలు తొలి దశలో రూ.10 వేల చొప్పున దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి రుణాలివ్వాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, డిమాండ్ భారీగా ఉండడంతో 2023 డిసెంబర్ నాటికి 63 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం మూడు దశల్లో 88.5 లక్షల రుణాలివ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో తొలి దశలో 2,30,000 మందికి వర్తింపజేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 3,15,000కు పెంచింది. రెండో దశలో 1,34,200 మందికి, మూడో దశలో 18,900 మందికి రుణాలు లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటి వరకు మూడు దశల్లో కలిపి రాష్ట్రంలో 4,02,718 దరఖాస్తులకు రూ.528.85 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఈ రుణాలను 15 రోజుల్లోగా బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. దరఖాస్తుదారుల్లో సగటు వయస్సు 42 సంవత్సరాలుగా ఉంది. ఇదీ పథకం.. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి సమయంలో 2020 జూన్లో ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ని ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఈ రుణాలు అందజేస్తారు. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా తొలుత రూ.10 వేలు రుణ సాయం చేస్తారు. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించిన వారికి వ్యాపారాభివృద్ధి కోసం రెండో దశలో రూ. 20 వేలు, మూడో దశలో రూ. 50 వేలు మంజూరు చేస్తారు. వీరికి కేంద్రం వడ్డీలో ఏడు శాతం రాయితీ కూడా ఇస్తుంది. -
వ్యక్తిగత డేటా చౌర్యం సంగతే తెలియడం లేదు
న్యూఢిల్లీ: సైబర్ దాడుల బారిన పడినవారిలో చాలా మందికి తమ వ్యక్తిగత డేటా చోరీకి గురైన సంగతే తెలియడం లేదు. ప్రతి ముగ్గురిలో ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ రుబ్రిక్ తరఫున వేక్ఫీల్డ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కనీసం 500 మందికి పైబడి సిబ్బంది ఉన్న 1,600 పైగా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. గత 30 ఏళ్లుగా సైబర్ దాడులను నివారించడంపైనే పరిశ్రమ ఎక్కువగా దృష్టి పెడుతోందని రుబ్రిక్ సీఈవో బిపుల్ సిన్హా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులు తప్పకుండా జరిగే అవకాశాలే ఉన్నాయని భావించి, వాటిని దీటుగా ఎదుర్కొనే సన్నద్ధతను సాధించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా సైబర్ పరిశ్రమ ఏడాదికి 200 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తోంది. అయితే, రుబ్రిక్ జీరో ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరి డేటా చౌర్యానికి గురవ్వడమే కాకుండా ఆ విషయం వారికి కనీసం తెలియకపోవడమనేది ఆందోళనకర విషయం‘ అని సిన్హా పేర్కొన్నారు. నివేదికకు సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► ఈ ఏడాది జూన్ 30–జులై 11 మధ్య కాలంలో 10 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ► నివేదిక ప్రకారం సగం పైగా సంస్థల్లో (53 శాతం) గతేడాది కీలకమైన సమాచారం చోరీకి గురైంది. ప్రతి ఆరు కంపెనీల్లో ఒక సంస్థ (16 శాతం) పలు దఫాలుగా సైబర్ దాడులతో నష్టపోయింది. ► దేశీయంగా ఐటీ లీడర్లలో 49 శాతం మంది .. తమ సంస్థ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్లు అభిప్రాయపడ్డారు. వచ్చే 12 నెలల్లో తమ సంస్థల్లో కీలక డేటా చోరీకి గురయ్యే రిస్కులు అత్యధికంగా ఉన్నాయని 30 శాతం మంది తెలిపారు. ► సాధారణంగా కంపెనీల్లో డేటా గత 18 నెలల్లో మొత్తం మీద 42 శాతం పెరిగింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్ (సాస్) రూపంలో డేటా 145 శాతం, క్లౌడ్లో (73 శాతం), సంస్థ భౌతిక కార్యాలయాల్లో 20 శాతం మేర పెరిగింది. ► ఒక సాధారణ సంస్థ భద్రపర్చుకోవాల్సిన డేటా వచ్చే ఏడాదిలో 100 బీఈటీబీ (బ్యాక్–ఎండ్ టెరాబైట్)కి పెరుగుతుందని, వచ్చే అయిదేళ్లలో 7 రెట్లు వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది. ► డేటా వృద్ధితో సమానంగా రిస్కులను ఎదుర్కొనేలా డేటా భద్రతను పెంచుకోలేకపోతున్నట్లు 34 శాతం మంది దేశీ ఐటీ లీడర్లు తెలిపారు. కీలకమైన డేటాను కాపాడుకోవడంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం సానుకూల ప్రభావం చూపగలదని 54 శాతం దేశీ కంపెనీలు భావిస్తుండగా, ఏఐ ఎటువంటి ప్రభావం చూపదని 24 శాతం సంస్థలు భావిస్తున్నాయి. -
ఫన్సెర్చ్ను క్రియేట్ చేసిన గూగుల్.. ఇదే ప్రత్యేకత
కృత్రిమమేధ ఆవిష్కరణలతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సాంకేతికత ఆధారంగా గణిత, వైద్య, న్యాయ, మానసిక శాస్త్రాలు, కోడింగ్కు సంబంధించి అడిగే కఠిన ప్రశ్నలకు వెంటనే సమాచారం లభిస్తోంది. సమీప భవిష్యత్తులో సమాజానికి ఇది ఎంతో మేలు చేస్తుందని కొందరు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని కృత్రిమమేధ (ఏఐ) కొత్తపుంతలు తొక్కిస్తోంది. తాజాగా సంక్లిష్ట గణిత సమస్యలను వెంటనే పరిష్కరించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ ఫన్సెర్చ్ను గూగుల్ డీప్మైండ్ పరిశోధకులు క్రియేట్ చేశారు. క్లిష్టమైన గణిత సమస్యలను గూగుల్ ఫన్సెర్చ్ ఏఐ మోడల్ సులభంగా పరిష్కరిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ జవాబు దొరకని కొన్ని గణిత సమస్యలను పరిష్కరించేలా కృషి చేసినట్లు తెలిసింది. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్లు (ఎల్ఎల్ఎం)ను ఉపయోగించి ఈ ఆవిష్కరణలు చేసినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఎల్ఎల్ఎంలు ఇన్నిరోజులు కేవలం ఊహాత్మక కంటెంట్ను జనరేట్ చేస్తాయనే భావన ఉండేదని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ వాటిని సరైన రీతిలో వినియోగించుకుని మార్గనిర్దేశం చేస్తే అవి ఆవిష్కరణలకూ తెరతీస్తాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డీప్మైండ్ ప్రాథమిక గణితం, కంప్యూటర్ సైన్స్లోని చాలా సవాళ్లను ఫన్సెర్చ్ ద్వారా సాధించిందని సమాచారం. గూగుల్ డీప్మైండ్ వైస్ ప్రెసిడెంట్ పుష్మీత్ కోహ్లీ సారథ్యంలోని ప్రత్యేక పరిశోధక బృందం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడాలజీ ద్వారా గణితంలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరిస్తోందని తెలిసింది. ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాలంటే ఇప్పుడు కొనేయండి.. ఎందుకంటే? -
‘ఒంగోలు’ జాతి పరిరక్షణకు గుర్తింపు
సాక్షి, అమరావతి: అరుదైన, అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో కృషిచేస్తున్న శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరు లాంలోని పశుపరిశోధన స్థానాన్ని బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2023 వరించింది. జాతీయస్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషిచేసే పరిశోధన సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. గతేడాది పుంగనూరు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తున్న పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు లభించింది. ఈ ఏడాది ఒంగోలు జాతి పరిరక్షణకు కృషిచేస్తున్న పరిశోధన స్థానానికి ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును ప్రకటించారు. కిసాన్ దివస్ సందర్భంగా ఈ నెల 23న హరియాణలోని కర్నల్ళక్ష జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసాపత్రం, నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు ఒంగోలు జాతికి శతాబ్దాల చరిత్ర ఒంగోలు జాతి పశువుల స్వస్థలం ఒకప్పటి ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట తాలూకాలైనప్పటికీ వీటి పుట్టినిల్లు దక్షిణాన పెన్నా, ఉత్తరాన కృష్ణానదుల మధ్యకు వ్యాపించింది. 1900 దశకంలో ప్రతి రైతు దగ్గర నాలుగు నుంచి ఎనిమిది ఒంగోలు ఆవులుండేవి. కానీ క్రమేపీ ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరాయి. మంచి పాలసార కలిగిన జాతిగా ఇవి అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి, వ్యా«ధినిరోధక శక్తి కలిగి ఉండడంతో పాటు భారీ శరీరంతో ఆకర్షణీయంగా ఉండడంతో ఒంగోలు జాతిపశువులు విదేశీయులను విశేషంగా ఆకర్షించాయి. ఫలితంగా తొలుత 1875లో బ్రెజిల్, 1885లో అమెరికా వీటిని తమ దేశానికి తీసుకెళ్లాయి. క్రమంగా ఒంగోలు జాతి అక్కడి నుంచి లాటిన్ అమెరికా దేశాలకు విస్తరించింది. బ్రెజిల్లో ఒంగోలు జాతిని నెలోర్, సంబా ఒంగోలు జాతిగా పిలుస్తారు. మన ఒంగోలు, గిర్, కాంక్రెజ్ జాతుల కలయికతో ఇండుబ్రెజిల్ జాతిని అభివృద్ధి చేశారు. అలాగే జమైకాలో ఒంగోలు జాతి ద్వారా బ్రాహ్మన్, వెనెజ్యులాలో ప్రిడియన్, ఒంగోలు జాతుల కలయికతో ఒంక్యాంపో అనే కొత్తజాతిని అభివృద్ధి చేశారు. ఐవీఎఫ్ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధి 2019లో ‘ఐవీఎఫ్–ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ (ఐవీఎఫ్అండ్ఈటీ) ద్వారా మేలు జాతి ఆవుల అభివృద్ధి ప«థకానికి రూ.2.39 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యుత్తమ జన్యు లక్షణాలు, మంచి పాలసార గలిగిన దేశీ ఆవుల సంతతిని అభివృద్ది చేయుడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యుత్తమమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా మేలు జాతి ఒంగోలు, పుంగనూరు జాతి పిండాలు ఉత్పత్తి చేసి తద్వారా ఆ జాతుల పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ప్రస్తుతం 450 దేశీయ మేలుజాతి ఒంగోలు పశుసంపద కలిగిన లాం పశుపరిశోధన స్థానం ఒంగోలు జాతి ప్రత్యుత్పత్తి, జీవ సాంకేతికతలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఉంది. అవార్డుతో మరింత బాధ్యత ఒంగోలు జాతి పరిరక్షణ కోసం దశాబ్దాలుగా కృషిచేస్తున్నప్పటికీ.. నాలుగున్నరేళ్లుగా ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధితో విశేష గుర్తింపు లభించింది. గుంటూరు పశుపరిశోధన స్థానాం ద్వారా చేస్తున్న నిర్విరామ కృషికి గుర్తింపుగా హరియాణలోని కర్నల్లోగల ఐసీఏఆర్–నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రిసోర్సస్ (ఐసీఏఆర్ అండ్ ఎన్బీఏజీఆర్) నుంచి ‘జాతి పరిరక్షణ అవార్డు–2023’ లభించింది. ఈ అవార్డు ద్వారా ఒంగోలు జాతి పరిరక్షణ, అభివృద్ధి కోసం మరిన్ని పరిశోధనలు చేసేందుకు యూనివర్సిటీకి మరింత తోడ్పాటు లభించనుంది. – ప్రొఫెసర్ సర్జన్రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో భారీగా పెరిగిన ఒంగోలు జాతి పశుసంతతి మన దేశంలో వీటిసంఖ్య క్రమేపి తగ్గి అంతరించిపోతున్న వాటి జాబితాలో చేరడంతో ఒంగోలు జాతి గోవుల అభివృద్దికి శ్రీకారం చుట్టారు. 1926లో ఏర్పాటైన గుంటూరు లాంలోని పరిశోధన స్థానం 1972 నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తోంది. వంద మేలు జాతి ఒంగోలు ఆబోతుల నుంచి దాదాపు 11 లక్షల వీర్య మోతాదులు తయారు చేసి తెలుగు రాష్ట్రాల రైతులకు అందజేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఈ జాతి పశుసంపద అభివృద్ధి చెందింది. దేశంలో సుమారు ఏడులక్షల ఒంగోలు గోసంతతి ఉండగా, ఒక్క ఏపీలోనే నాలుగు లక్షలకుపైగా వీటి సంఖ్య పెరిగింది. ఇటీవల మేఘాలయ రాష్ట్ర సంవర్ధకశాఖకు ఒంగోలు జాతి వీర్యంతో పాటు కోడెదూడలను సరఫరా చేశారు. ఒంగోలు జాతి పరిరక్షణ కోసం వివిధ ప్రాజెక్టుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు శ్రీవేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం నిర్విరామ కృషిచేస్తోంది. -
Aditya-L1 mission: పని మొదలెట్టిన ఆదిత్య–ఎల్ 1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి దూసుకెళ్లిన ఆదిత్య–ఎల్ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ అనే పరికరం తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని రెండు విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయి’ అని ఇస్రో వెల్లడించింది. సంబంధిత వివరాలను ఇస్రో తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్చేసింది. ‘సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్’లో భాగమైన సూపర్థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పారి్టకల్ స్పెక్ట్రోమీటర్(స్టెప్స్)ను సెపె్టంబర్ పదో తేదీన, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్(స్విస్)ను నవంబర్ రెండో తేదీన యాక్టివేట్ చేయడం తెల్సిందే. ఈ రెండు భాగాలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్లో ఉన్న రెండు సెన్సార్లు 360 డిగ్రీలో చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పారి్టకల్స్లను ‘స్విస్’ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేíÙంచగలిగిందని ఇస్రో ప్రకటించింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్ట్రోగామ్ను పరిశీలించారు. దీంతో ప్రోటాన్, అయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పారి్టకల్స్లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల విలక్షణతపై ఇన్నాళ్లూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు. సౌర గాలుల్లోని అంతర్గత ప్రక్రియలు.. భూమిపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తాజా డేటా సహాయకారిగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్–1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది. -
రాగితో చౌకగా క్యాన్సర్ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు
ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్ను సులువుగా అమైన్గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం..
దేశరాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్రం ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఇక్కడి జనంలో చికాకు, కోపం, ఒత్తిడి తదితర సమస్యలు పెరుగుతున్నాయి. అత్యంత కలుషిత నగరాల్లో నివసించే జనం డిప్రెషన్, నిద్రలేమి, తలనొప్పి, ప్రవర్తనలో మార్పులు, మానసిక అలసట లాంటి సమస్యలను ఎదుర్కొంటారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాలుష్యం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మనిషిలో కోపం, హింసాత్మక ప్రవర్తన పెరుగుతుంది. విషపూరితమైన గాలిలో ఉండే హానికరమైన పదార్థాలు మనిషి మెదడుకు చేరి, దానిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాలుష్యపూరిత ప్రాంతాల్లో నివసించేవారు అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం అనేది మెదడును దెబ్బతీస్తుంది. నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్ను అడ్డుకుంటుంది. జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతుందని నిరూపితమయ్యింది. ఎవరైనా కలుషితమైన గాలిని పీల్చినప్పుడు, శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఈ హార్మోన్లు మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి. దాని సాధారణ పనితీరులో జోక్యం చేసుకుంటాయి. ఫలితంగా అసౌకర్యం, ఆందోళన, ఒత్తిడిని ఎదురవుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది. రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామంది బయటకు వెళ్లడం లేదు. మునుపటిలా స్నేహితులు, బంధువులను కలవడం తగ్గించేశారు. కనీసం పార్కుకు వెళ్లడం లేదా బయట నడవడం కూడా మానుకున్నారు ఫలితంగా ఒంటరితనం, నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా అలాంటి వారిలో చికాకు, కోపం పెరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి! -
మనిషి చెప్పులు వేసుకున్నది ఎన్నడు? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు!
నాగరకత తొలినాళ్లలో మనిషి తన శరీరాన్ని రక్షించుకునేందుకు దుస్తులు వాడటం మొదలుపెట్టాడు. మరి కాలికి వేసుకునే చెప్పులు, బూట్ల వాడకం మొదలైందెన్నడు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? దీనికి ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాధానం కనుగొన్నారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇది మానవజాతి చరిత్రలోని అత్యంత పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మానవులు మధ్య రాతి యుగంలోనే బూట్లు ధరించి ఉండవచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నాటి కాలాన్ని మెసోలిథిక్ టైమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికన్ పూర్వ చరిత్రలో ఒకనాటి కాలం. ఈ నూతన ఆవిష్కరణ 75 వేల నుంచి ఒక లక్షా 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రకారం పురాతన మానవులు.. మనం ఇంతవరకూ భావిస్తున్నదానికన్నా ఎంతో నేర్పరులని తేలింది. ఈస్ట్ హార్ట్ఫోర్డ్లోని గుడ్విన్ యూనివర్శిటీకి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రాండీ లైస్ట్ ఒక వ్యాసంలో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణల్లో షూస్ అంటే బూట్లు ఒకటని తెలిపారు. ఈ వివరాలు 2020 ఆగస్టులో ప్రచురితమయ్యాయి. కార్లు, పడవలు, రాకెట్ షిప్ల వంటి వాహనాలు భారీ పరమాణంలోని బూట్ల మాదిరిగా ఉంటాయని లైస్ట్ దానిలో పేర్కొన్నారు. బూట్ల ఆలోచన నుంచే ఇటువంటి ఇటువంటి సాంతకేతికత ఆవిర్భవించిందని లైస్ట్ భావించారు. మానవజాతి ప్రారంభ సాంకేతిక ఆవిష్కరణలలో బూట్లు ఒకటి. గత పురావస్తు పరిశోధనలలో బూట్లు దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివని, ఇవి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చాయని భావించారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్లో సాగిన నూతన పరిశోధనలు బూట్ల ఆవిష్కరణకు సంబంధించిన పాత సిద్ధాంతాలను తుడిచిపెట్టాయి. విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు బెర్న్హార్డ్ జిప్ఫెల్ వెల్లడించిన వివరాల ప్రకారం మధ్య రాతి యుగంలో కేప్ తీరం వెంబడి బీచ్లో పురాతన మానవుల పాదముద్రల శిలాజాలను పరిశీలించినప్పుడు, వారు బూట్లు ధరించి ఉండవచ్చని పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. సదరన్ కేప్ కోస్ట్ ఆ సమయంలో చాలా పదునైన రాళ్లతో ఉండేదని, ఇవి బాధ కలిగించకుండా ఉండేందుకు నాటి మానవులు పాదరక్షలను ఉపయోగించి ఉండవచ్చని ఆయన అన్నారు. అయితే పురాతన మానవులు ఏ రకమైన బూట్లు ధరించారనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు నేటికీ స్పష్టంగా ఏమీ తెలుసుకోలేకపోయారు. పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదరక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పరిశోధనలు సాగిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జిప్ఫెల్ స్పందిస్తూ నాటి పురాతన బూట్లు ఇంత కాలం ఉండకపోవచ్చని, నాటి మానవులు పాదముద్రల శిలాజాలు కనుగొనగలిగితే పూర్వీకులు ధరించిన పాదరక్షల గురించి అధ్యయనం చేయడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. నాటి మానవులు బూట్లు ధరించారా లేదా అనేదానిని తెలుసుకునేందుకు పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాలలో నాటి మనిషి ఎముకల ఆకారం, పరిమాణాన్ని విశ్లేషించారు. అక్కడ నివసించే ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా, తక్కువ దృఢంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. కాలి స్వరూపంలో ఈ మార్పు బూట్లు ధరించడం వల్ల సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. షూస్ అనేవి పదునైన రాళ్లు, ముళ్లు, పరాన్నజీవుల నుండి రక్షణను అందిస్తాయి. ఈ అధ్యయనం మధ్య రాతి యుగంనాటి మానవుల సాంస్కృతిక చరిత్ర, పరిజ్ఞానాలను మరింతగా తెలియజేలా ఉంది. ఆ కాలంలో జరిగిన బూట్ల ఆవిష్కరణ, వాటి ఉపయోగం నాటి విస్తృత సాంస్కృతిక మార్పులో భాగంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
గ్రాము ఖరీదు కోట్ల డాలర్లట!... ఏందబ్బా అది?
ఈ భూమండలంపై అత్యంత ఖరీదైన పదార్థమేమిటనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ప్లాటినం, వజ్రం లేదా బంగారం అని చెబుతుంటారు. అయితే వీటికి మించిన ఖరీదైన పదార్థం ఒకటుందనే సంగతి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆ పదార్ధం ఒక గ్రాము ధర 7,553 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) ఆ ఖరీదైన పదార్ధం పేరు యాంటీమాటర్. దీని గురించి ఎవరూ అంతగా వినివుండకపోవచ్చు. అయితే సైన్స్ ప్రపంచంలో ఇది ఒక రహస్యమైన, శక్తిమంతమైన పదార్ధం. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది పదార్థంతో సమానంగానే ఉంటుంది. కానీ ఇది సాధారణ పదార్ధానికి పూర్తిగా వ్యతిరేకం. యాంటీమాటర్లోని ఉప పరమాణు కణాలు సాధారణ పదార్థానికి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని 20 వ శతాబ్దపు ప్రథమార్థంలో కనుగొన్నారు. యాంటీమాటర్ను మొట్టమొదట ప్రపంచానికి 1928 లో శాస్త్రవేత్త పాల్ డిరాక్ పరిచయం చేశారు. న్యూ సైంటిస్ట్ పత్రిక ఈ మహనీయుడిని ‘సర్ ఐజాక్ న్యూటన్ తరువాత గొప్ప బ్రిటిష్ సిద్ధాంతకర్త’ అని అభివర్ణించింది. నాటి నుంచి యాంటీమాటర్ శాస్త్రవేత్తలకు సైతం ఉత్సుకత కలిగించే అంశంగా మారింది. యాంటీమాటర్ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రాము యాంటీమాటర్ 43 మెగాటన్నుల ట్రినిట్రోటోల్యూన్ (టీఎన్టీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జపాన్.. హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే మూడు వేల రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. యాంటీమాటర్ అంతరిక్ష ప్రయాణానికి సమర్థవంతమైన ఇంధనంగా లేదా మన గ్రహానికి అత్యధిక శక్తి వనరుగా కూడా ఉపయోగపడుతుంది. విశ్వం యొక్క మూలం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి యాంటీమాటర్ సహాయపడుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది అధిక సాంద్రత, ఉష్ణోగ్రత స్థితి నుండి ఉద్భవించింది. ఇక్కడ పదార్థం, యాంటీమాటర్ సమానంగా, సమృద్ధిగా ఉన్నాయి. అయితే ప్రారంభ విశ్వంలో పదార్థం, యాంటీమాటర్ మధ్య కొంత అసమానత లేదా అసమతుల్యత ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది యాంటీమాటర్ కంటే పదార్థం అధికంగా ఉండటానికి దారితీసింది. ఇది భౌతిక శాస్త్రంలో అతిపెద్ద పజిల్గా నిలిచింది. యాంటీమాటర్ను శాస్త్రీయ పరిశోధనలు, వైద్య అనువర్తనాలకు సాధనంగా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయిక పద్ధతులకు మించి మరింత ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునే రేడియేషన్ థెరపీకి ఉపయుక్తమవుతుంది. యాంటీహైడ్రోజన్ (యాంటీమాటర్తో తయారు చేసిన సరళమైన పరమాణువు) సమానత్వ సూత్రం, ఛార్జ్-పారిటీ-టైమ్ (సీపీటీ) సమరూపత వంటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను పరీక్షించడానికి యాంటీమాటర్ ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం యాంటీమాటర్ను సృష్టించడం, నిల్వ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్టికల్ యాక్సిలరేటర్లు, వాక్యూమ్ ఛాంబర్లు వంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు అవసరమవుతాయి. ప్రస్తుతం మనం స్వల్ప పరిమాణంలోని యాంటీమాటర్ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. దీనికి కూడా అధికంగా ఖర్చు అవుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది భూమిపై అత్యంత ఖరీదైన పదార్థం. శాస్త్రవేత్తలు భూమిపైనే లార్జ్ హాడ్రాన్ కొలైడర్ లాంటి అధిక శక్తి కణాల యాక్సిలరేటర్ల ద్వారా యాంటీ పార్టికల్ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని కోరుకుందాం. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
వరి ఆకారపు మిల్లెట్లు!
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్ డైట్ను ప్రోత్సహించేందుకుగాను తాము చేపట్టిన కార్యక్రమాల్లో మిల్లెట్లను బియ్యం ఆకారంలోకి మార్చడం ఒకటని న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ రావు తెలిపారు. సాయిల్ టు సోల్ అనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్కు విచ్చేసిన మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో డాక్టర్ రావు మాట్లాడారు. మిల్లెట్ డైట్పై అవగాహన కల్పించి, ఎక్కువ మంది వీటిని తమ డైట్లో భాగం చేసుకునేలా చేసేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి మిల్లెట్లు అన్నంలాగా కనిపిస్తాయి. బియ్యం ఆకారంలో తృణధాన్యాలను అందజేస్తాం. తద్వారా వాటికి ఆమోదయోగ్యం పెరుగుతుంది మూడు వేల సంవత్సరాల నాటి తృణధాన్యాల సమూహానికి మరింత యాక్సెప్టెన్స్ పెంచడానికి ఇది ఒక చొరవ. మిల్లెట్లను బియ్యంగా పునర్నిర్మించేటప్పుడు వాటి పోషక విలువలు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మిల్లెట్లను బియ్యం రూపంలోకి మార్చడం ద్వారా, మేము వాటి షెల్ఫ్-లైఫ్ను పెంచుతున్నాం. మిల్లెట్లు పురాతన ఆహార ధాన్యాలలో ఒకటని, వాటి సాగు దాదాపు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని ఆధారాలున్నాయి. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 19 %, ప్రపంచ ఉత్పత్తిలో 20%తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో సాగవుతున్న 18 మిల్లెట్లలో 11 భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. మిల్లెట్లు గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్ను నివారిస్తాయి. టైప్-2 డయాబెటిస్ను నిరోధించడంలో సహాయపడతాయి. బరువు తగ్గిస్తాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహిత ఆహారం. ఇది గర్భిణీ, బాలింతలకు మంచిది, పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. భారతదేశంలో మిల్లెట్ డిమాండ్ను పునరుద్ధరించడానికి ఐఐఎమ్ఆర్ కృషి చేస్తోంది. వాణిజ్యపరంగా ఐఐఎంఆర్లో న్యూట్రిహబ్ టీబీఐఎస్సీ ఉంది. ఇది మిల్లెట్స్కు ఒక బ్రాండ్ను క్రియేట్ చేసింది. ఇది గత ఐదు ఏళ్లలో 400 స్టార్టప్లతో సుమారు రెండు కోట్ల వరకు మూలధనాన్ని సేకరించాయి. ప్రస్తుతం వందకు పైగా స్టార్టప్లు ఇంక్యుబేట్ చేపడుతున్నాయి. ఇది దాదాపు 70 సాంకేతికతలను అభివృద్ధి చేసిందని డాక్టర్ బి. దయాకర్ రావు తెలిపారు. అంతకుముందు ఐసీఏఆర్- డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి మాట్లాడుతూ, “మనము ఆహరం పేరిట కేలరీలను మాత్రమే తింటున్నాము. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలతో ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా పయనిస్తున్నాం. మిల్లెట్ను సూపర్ఫుడ్గా ప్రదర్శించడం, మనం మర్చిపోయిన వంటకాలను పునరుద్ధరించడం తదితర వాటితో మిల్లెట్ పేద ప్రజల ఆహారం అనే కళంకాన్ని తొలగించే మన ప్రధాన ఆహారంలో భాగంగే చేసే యత్నం చేస్తోంది ఐఐఎంఆర్. ఇక మిల్లెట్ వాల్యూ చైన్లో 500కి పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయని, ఐఐఎంఆర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మరో 250 స్టార్టప్లను ప్రారంభించామని ఐసీఏఆర్ డైరెక్టర్ సత్యవతి అన్నారు. దాదాపు 66 స్టార్టప్లకు సుమారు రూ. 6.2 కోట్ల నిధులను పంపిణీ చేయగా, మిగిలిన 25 స్టార్టప్లుకు కూడా నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ రీతు షా మాట్లాడుతూ.. మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలమని అన్నారు. ఇది అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం కాబట్టి ఎఫ్ఎల్ఓ తమ సభ్యులకు మరిన్ని వ్యాపార అవకాశాలను లభించాలని ఆశిస్తోంది. అందుకే ఈ టూర్ ప్లాన్ చేశామని ఆమె తెలిపారు. మిల్లెట్స్లో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు అనేక ప్రశ్నలు సంధించి..వివరణలు పొందారు. ఇక ఈ కార్యక్రమం చివర్లో వారు పారిశ్రామికవేత్తల కోసంఐఐఎంఆర్ సృష్టించిన సౌకర్యాలను కూడా సందర్శించి పరిశీలించారు. (చదవండి: ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!) -
పగటి పూటా ఓ కునుకేయండి
సాక్షి, అమరావతి: చక్కటి నిద్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. అందులోనూ పగటిపూట తీసే చిన్నపాటి కునుకు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ మధ్యాహ్నం 15–30 నిమిషాలు రెప్పవాల్చితే చిత్తవైకల్య ప్రమాదం తగ్గడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పగటిపూట నిద్రించే వారిలో 2.6–7 సంవత్సరాల వరకు వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఉరుగ్వేలోని యూనివర్సిటీ ఆఫ్ రిపబ్లిక్ పరిశోధకులు క్రమం తప్పకుండా పగటిపూట నిద్రపోవడం వల్ల మెదడు కుచించుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. చురుకుదనాన్ని ప్రేరేపిస్తుందని తేల్చారు. ఫలితంగా జ్ఞాన సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని గుర్తించారు. అయితే.. పగటిపూట 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి 7 గంటల నిద్ర సంపూర్ణ ఆరోగ్యానికి సుమారు 7 గంటల మంచి నిద్రను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా భారత్లోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో నిద్ర లేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్య కేవలం అలసట ఒక్కటే కాదని.. తీవ్ర దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కలతలేని నిద్రతో అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ నియంత్రణలో ఉండి మానసిక ఉత్సాహంతో పని చేస్తారని చెబుతున్నారు. అయితే.. తక్కువ నిద్రపోయే వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువని అధ్యయనం వెల్లడించింది. అతి నిద్ర ప్రమాదకరం తక్కువ నిద్రతోనే కాదు.. అతి నిద్రతోనూ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజంతా అదే పనిగా నిద్రపోతే అధిక రక్తపోటు, స్ట్రోక్కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అతి నిద్ర అంతర్లీన నిద్ర రుగ్మతకు సంకేతమని భావిస్తున్నారు. ఈ రుగ్మతతో ఒత్తిడి, బరువును నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుందని తేల్చారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, టైప్–2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ సమయంతోనే ముప్పు స్క్రీనింగ్ సమయం నిద్రలేమి స్థాయిని పెంచుతుందని అధ్యయనం చెబుతోంది. నిద్రలేమితో బాధపడే వారిలో దాదాపు 54 మంది డిజిటల్, సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నట్టు గుర్తించింది. దాదాపు 87 శాతం మంది భారతీయులు పడుకునే ముందు తమ ఫోన్లను ఉపయోగిస్తుండటంతో తీవ్రమైన నిద్ర సమస్యకు దారితీస్తుందని పేర్కొంది. ఫలితంగా 56 శాతం మంది పురుషులతో పోలిస్తే 67 శాతం మంది మహిళలు పని సమయంలో నిద్రపోతున్నారని వెల్లడించింది. వీలైనంత వరకు మధ్యాహ్నం 2 గంటలలోపు కెఫిన్ ఉండే పదార్థాలను తగ్గించాలని.. మద్యం తాగి నిద్రపోవడం/నిద్రపోయే మూడు గంటల ముందు మద్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రవేళకు దగ్గర సమయంలో వ్యాయామం చేయడం కూడా నిద్రలేమికి కారణంగా భావిస్తున్నారు. -
మైక్రోప్లాస్టిక్పై ప్రత్యక్ష పరిశోధన
ఏయూ క్యాంపస్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. ఇప్పటి దాకా కంటికి కనిపించే ప్లాస్టిక్ ఒక ఎత్తయితే, కనిపించని సూక్ష్మ కణాలుగా మారిన మైక్రో ప్లాస్టిక్ మరింత భయపెడుతోంది. దీనికి కారణం సముద్రాలు సూప్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్గా మారడమే. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది, జలచరాల శరీరంలో చేరుతున్నాయి. సీఫుడ్ను మానవులు పెద్ద ఎత్తున ఆహారంగా తింటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్ క్రమేణా మానవుల శరీరాల్లోకి కూడా వచ్చి చేరుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం, యూరోపియన్ కమిషన్ సహాయంతో పరిశోధనలు చేపట్టింది. విస్తృత పరిశోధనకు శిక్షణ ఈ పరిశోధనల్లో భాగంగా సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్ను గుర్తించడం, గణించడం, అధ్యయనం చేయడం ప్రధానంగా జరుగుతోంది. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీ 50మందిని ఎంచుకుంది. విశ్వవిద్యాలయం పరిశోధకులు, అధ్యాపకులు, మత్త్స్య శాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులను భాగస్వాముల్ని చేసింది. ప్రత్యక్ష నైపుణ్య శిక్షణ అయితే ఈ శిక్షణను ఏయూ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తోంది. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష నైపుణ్య శిక్షణతో ప్రతి ఒక్కరిలో దీనిపై విస్తృత అవగాహన ఏర్పడుతోంది. మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండు రకాల చేపల్లో మైక్రో ప్లాస్టిక్స్ని అధ్యయనం చేశారు. ఐదు మైక్రాన్స్ కంటే తక్కువ మందం కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు సముద్రపు నీటిలో, ఇసుకలో, చేపల్లో ఉండటాన్ని ఈ శిక్షణలో ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. చేపల శరీర భాగాల్లో మైక్రోప్లాస్టిక్ గుర్తింపు నాచుపై చేరినప్పుడు చేపలు తినడంతో నాచు, మైక్రోప్లాస్టిక్ వాటి శరీరంలోని లివర్, కిడ్నీ, పేగుల్లో పెద్ద ఎత్తున చేరుతోంది. మూడు అంశాలపై శిక్షణ సేకరించిన సముద్రపు నీటిని వడబోసి, వ్యర్థాలను వేరుచేసి ఫొరియర్ ట్రాన్స్ఫామ్ ఇన్ఫ్రారెడ్ స్పెకోŠట్రస్కోపీ (ఎఫ్టీఐఆర్) సహాయంతో మైక్రోప్లాస్టిక్ పరిమాణాన్ని గణిస్తారు. ఇసుకలో ఉన్న మైక్రోప్లాస్టిక్ను ఇలాగే గణిస్తారు. చేపల్లో గుర్తించేందుకు శరీర భాగాలను వేరుచేసి జీవ పదార్థం జీర్ణమయ్యేలా రసాయనాల ప్రక్రియ చేపడుతున్నారు. మిగిలిన పదార్థాలను ఎండబెట్టి ఎఫ్టీఐఆర్లో పరీక్షిస్తారు. అయితే ప్రజలు ఎక్కువగా తింటున్న పండుగప్ప, కవ్వళ్లు చేపలతో ఈ ప్రయోగం చేయగా, లివర్, కిడ్నీల్లో పెద్ద ఎత్తున మైక్రోప్లాస్టిక్ను గుర్తించారు. మంచి ఆలోచన ఎంఎల్ఆర్ విభాగంలో మూడు రోజుల శిక్షణ మంచి ఆలోచన. వర్తమాన సమస్యల్లో ఇది ప్రధానమైన అంశం. మైక్రోప్లాస్టిక్ ప్రమాదం అన్ని జీవులపై ఉంటుంది. సముద్ర జీవుల్లో ఈ అధ్యయనం ఎంతో అభినందనీయం. – డాక్టర్ వి.హేమ శైలజ, ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగం విలువైన సమాచారం మూడు రోజుల శిక్షణలో విలువైన సమాచారం, జ్ఞానం పొందాం. నిపుణుల ప్రసంగాలు, ప్రత్యక్ష శిక్షణ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. – డాక్టర్ జి.శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, జీవీపీ కళాశాల కమిషన్ సహకారం మరువలేం యూరోపియన్ కమిషన్ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాం. సమాజ ఉపయుక్త అంశంలో పరిశోధన చేపట్టాలని యూరోపియన్ యూనియన్ సూచించిన విధంగా పరిశోధనలు చేస్తున్నాం. అదే సమయంలో కొంత మందికి శిక్షణ ఇస్తూ అవగాహన పెంచుతున్నాం. – ఆచార్య పి.జానకీరామ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ -
15.5 కోట్ల సంవత్సరాల క్రితం మాయం.. ఆసియా ఖండంలో ప్రత్యక్షం!
15.5 కోట్ల ఏళ్ల క్రితం మాయమైన ఖండాన్ని ఆసియా ఖండంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఆర్గోల్యాండ్’ (Argoland) అని పిలిచే ఈ ఖండానికి సంబంధించిన శకలాలను ఆగ్నేయాసియాలో కనుగొన్నారు. ఈ శకలాలు మొదట్లో ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా ఉండేవి. తర్వాత ఇండోనేషియా తూర్పు భాగం వైపు మళ్లాయి. ఒకప్పుడు 15.5 కోట్ల సంవత్సరాల పురాతన భూభాగంలో భాగంగా ఉండే ఈ ఖండం యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా చాలా పెద్దగా విస్తరించి ఉండేది. ఆర్గోల్యాండ్ శకలాల పరిశోధన ఏడేళ్లపాటు సాగిందని నెదర్లాండ్స్లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత ఎల్డర్ట్ అడ్వోకాట్ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే ఈ శకలాలు ఒకే భూభాగం నుంచి వేరుపడినవని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. ఈ శకలాల వరుసను ‘ఆర్గోలాండ్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇదంతా ఒకే భూభాగంగా ఉండేది. 15.5 కోట్ల ఏళ్ల నాటి ప్రస్థానం ఆగ్నేయాసియా భూభాగం ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల మాదిరిగా కాకుండా అనేక శకలాలుగా విచ్ఛిన్నమై ఉంటుంది. దీంతో ఆర్గోల్యాండ్ అనేక ముక్కలుగా విడిపోవడంతో దాని ఉనికి మరుగునపడిపోయింది. ప్రస్తుతం ఈ శకలాలకు సంబంధించి లభ్యమైన మ్యాప్ ఆధారంగా ఆర్గోల్యాండ్ అదృశ్యం కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు 15.5 కోట్ల నాటి ఆర్గోల్యాండ్ ప్రస్థానాన్ని గుర్తించారు. ఇది దృఢమైన ఒకే భూభాగం కాకుండా సూక్ష్మఖండాల శ్రేణి కాబట్టి ఈ ఖండానికి శాస్త్రవేత్తలు ఆర్గోల్యాండ్కు బదులుగా ‘ఆర్గోపెలాగో’ అని పేరు పెట్టారు. సైన్స్ జర్నల్ ‘గోండ్వానా రీసెర్చ్’లో అక్టోబరు 19న ప్రచురితమైన ఈ పరిశోధన భూ గ్రహం పరిణామం గురించిన ఆధారాలను అందించడమే కాకుండా ప్రస్తుత జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను కూడా వెలుగులోకి తెచ్చింది. Argoland was once part of the ancient supercontinent of Gondwana. Prior to the current scattered arrangement of continents, there existed supercontinents.@elonmusk pic.twitter.com/KSrK9q3JJk — JeepsyX (@JeepsyX) November 13, 2023 -
ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి..
చందమామపై నుంచి బలమైన తాడును ఆకాశం మీదుగా భూమి మీదకు వదిలితే.. మనం అంతరిక్షంలో ఈజీగా చెక్కర్లు కొట్టొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ‘స్పేస్ లైన్’ ఏర్పాటు ద్వారా అసాధ్యాలు సుసాధ్యమవుతాయని నొక్కివక్కాణిస్తున్నారు. ఇందుకు భారీగా ఖర్చు కూడా కాబోదని చెబుతున్నారు. ఇంతకాలం ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటున్న మనం ఇప్పుడు దానికి రివర్స్లో.. అంటే చంద్రునికి తాడు బిగించే ప్రయత్నం చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షయానానికి సంబంధించి శాస్త్రవేత్తలకు ఎదురవుతున్న అతి పెద్ద ప్రతిబంధకం భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అధిక వ్యయం కావడం. అయితే యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫిర్ పెనోయ్రే, న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ శాండ్ఫోర్డ్ల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రాకెట్ ఇంజిన్ల పనివిధానాల సూత్రాలే అంతరిక్ష ప్రయోగాలకు అధికవ్యయం అయ్యేందుకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతమున్న విధానంలో వ్యోమనౌక భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో ప్రయాణించేందుకు అవసరమయ్యే శక్తిని ఉత్పత్తి చేయడానికి గణనీయమైన మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. ఇందుకోసం అధికవ్యయం చేయాల్సివస్తుంది. దీనికి ప్రతిపాదిత పరిష్కారం స్పేస్ ఎలివేటర్ను నిర్మించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధానంలో భూమి ఉపరితలం నుండి నిర్ణీత కక్ష్య వరకు విస్తరించిన ఒక కేబుల్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి అధిరోహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ అందించే ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, అధిరోహణ ప్రక్రియ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అవకాశం కలిగివుండటం. తద్వారా అత్యధిక ఇంధన వినియోగం అవసరమవదు. అయితే స్పేస్ ఎలివేటర్ ఆపరేషన్ కోసం వినియోగించే కేబుల్ అసాధారణమైన బలాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలలో ఇందుకు అవసరమైన సామర్థ్యం లేదు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్ స్పేస్ ఎలివేటర్ భావనకు ప్రత్యామ్నాయంగా ‘స్పేస్లైన్’ అనే సంస్కరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించవచ్చని వారు అంటున్నారు. కాగా స్పేస్ ఎలివేటర్ ఏర్పాటులో భూమి లోతుల్లో ఒక కేబుల్ ఉంటుంది. అది భూమికి దాదాపు 42 వేల కిలోమీటర్లు (26,098 మైళ్ళు) దూరంలో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య దాటి విస్తరించి ఉంటుంది. ఈ రకమైన కేబుల్ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే స్పేస్ ఎలివేటర్ ప్రయోగం విజయవంతమవుతుంది. దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు తమ స్పేస్ ఎలివేటర్ ఆలోచనలకు ఊపిరి పోస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి తగిన సామర్థాన్ని అందించే పరికరాల లోపంతో ప్రయోగాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇంతలో శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్లు స్పేస్ ఎలివేటర్కు ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించిన ‘స్పేస్లైన్’ను సూచిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడిపై అత్యంత బలమైన తీగ(తాడు) లాంటిదాన్ని బిగించి, దాన్ని భూమి కక్ష్య వరకు వేలాడేలా చేయాలి. దీంతో భూమిపై నుంచి వెళ్లే రాకెట్లు ఈ బలమైన తీగ సహాయంతో అవతలి ఎండ్కు చేరుకుంటాయి. సరిగ్గా ఆ ఎండ్ దగ్గరే రాకెట్లు పార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లు ఈ తీగ వెంబడి మరో రాకెట్లో స్పేస్ ట్రావెల్ చేసి, ఈజీగా చంద్రుణ్ణి చేరుకోవచ్చు. సాధారణంగా రాకెట్ ద్వారా స్పేస్లో ప్రయాణించాలంటే ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. మధ్యలో ఎప్పుడైనా ఏ ఆస్టరాయిడ్ అయినా వచ్చి తగిలే అవకాశం ఉంటుంది. అదే ఈ బలమైన తీగ వెంబడి ప్రయాణిస్తే అటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాకుండా ఇటువంటి ప్రయోగం ద్వారా తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కూడా చెబుతున్నారు. పైగా ఇందుకు అవసరమయ్యే శక్తిని సౌరశక్తితో అప్పటికప్పుడే జనరేట్ చేసుకోవచ్చంటున్నారు. ఇటువంటి స్పేస్లైన్ను నిర్మించేందుకు కావాల్సిన అన్ని టెక్నాలజీలు, మెటీరియల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రునిపై పాగా వేయాలని చూస్తూ, అందుకు తగిన ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. ఇదే ఆలోచనతో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ ఇంకో నాలుగేళ్లలో అంగారకునిపై కాలనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్లో ఈ స్పేస్లైన్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే స్పేస్లో పలు అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని.. -
షుగర్ ఉందని స్వీట్స్కి దూరంగా ఉండాల్సిన పనిలేదు, ఎందుకంటే..
మనలో స్వీట్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరేమో. కానీ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా దేశంలోనే కాదు ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. దీంతో కృత్రిమ స్వీటెనర్ వాడకం కూడా పెరిగింది. చక్కెరకి ప్రత్యామ్నాయంగా వీటి వినియోగం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అయితే షుగర్ బదులు షుగర్-ఫ్రీ స్వీటెనర్స్ వాడడం వల్ల కేలొరీలు తగ్గుతాయి. సహజ ఉత్పత్తుల నుంచి తయారుచేసిన స్వీటెనర్స్ వాడడం వల్ల ఆహారంలో కేలొరీలు తగ్గుతాయి. దీని వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఉదాహరణకి స్టెవియా ఆధారిత స్వీటెనర్లు ఒక మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. ఈ మధ్యకాలంలో అలాంటి అల్లులోజ్ వాడకం బాగా పెరిగింది. అల్లులోజ్ను D-psicose అని కూడా పిలుస్తారు.ఇది 70% తీపిగా ఉన్న ఫీలింగ్ కలిగినప్పటికీ ఇందులో కేవలం 10% మాత్రమే కేలరీలను కలిగి ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా నాణ్యత విషయంలో పేలవంగా ఉందని కెనడా సహా మరికొన్ని దేశాల్లో అల్లులోజ్ వాడకంపై బ్యాన్ విధించారు. అయితే ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ (UC డేవిస్) సైంటిస్టులు అల్లులోజ్ క్వాలిటీపై జరిపిన పరీక్షల్లో ముఖ్యమైన పరోగతిని సాధించారు. అల్లులోజ్ చక్కెరకు గొప్ప ప్రత్యామ్నాయమని సైంటిస్టులు తెలిపారు. ఎందుకంటే ఇది గోధుమలు,అత్తిపండ్లు, ఎండుద్రాక్ష వంటి కొన్ని మొక్కలతో తయారుచేశారు. ఇందులో ఒక గ్రాములో కేవలం 0.4 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది, సుక్రోజ్లో గ్రాముకు నాలుగు కేలరీలు ఉంటాయి. అల్లులోజ్ను తిన్న తర్వాత 70% జీర్ణం అవగా, మిగతాది కేవలం 24గంటల వ్యవధిలోనే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి అల్లులోజ్ రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయదని పేర్కొన్నారు. -
అరుదైన మొక్కకు ‘రాజశేఖరుడి’ పేరు
విద్యా రంగానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఓ అరుదైన మొక్కకు ఆయన పేరు పెట్టి యోగి వేమన యూనివర్సిటీ(వైవీయూ) గౌరవించింది. దీనిని లండన్లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని పరిశోధక సంస్థలు ధ్రువీకరించాయి. వివరాలు.. వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎ.మధుసూదన్రెడ్డి, పరిశోధకుడు, ఢిల్లీలోని ఎస్వీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కె.ప్రసాద్ల బృందం 2020లో వైఎస్సార్ జిల్లా బాలుపల్లి అటవీ రేంజ్లోని మొగిలిపెంట ప్రాంతంలో ఓ మొక్కను గుర్తించింది. శాస్త్రీయ పరిశోధనల అనంతరం అరుదైన మొక్కగా గుర్తించి.. నిర్ధారణ కోసం లండన్లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, సౌత్ చైనా బొటానికల్ గార్డెన్, గౌన్డోంగ్ ప్రావిన్స్ సంస్థలకు పంపించింది. ఆయా సంస్థలు మొక్క శాస్త్రీయతను నిర్ధారించి.. అరుదైన మొక్కగా గుర్తింపునిచ్చాయి. న్యూజిలాండ్కు చెందిన సైంటిఫిక్ జర్నల్ ఫైటోటాక్సాలో దీనిని కవర్ పేజీగా ప్రచురించారు. ప్రపంచం మొత్తం మీద శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే మొక్కగా నిర్ధారణ అవ్వడంతో.. ఈ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టుకునే వెసులుబాటు లభించింది. దీంతో పరిశోధకులు, అధికారులు చర్చించి.. వైవీయూ వ్యవస్థాపకుడు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. ఔషధ విలువలు అధికం లెపిడోగాథిస్ జాతికి చెందిన ఈ మొక్కకు ప్రజాతిగా ‘రాజశేఖరే’(లాటిన్ భాష) పేరును కలిపి నామకరణం చేశారు. లెపిడోగాథిస్ జాతికి చెందిన మొక్కలు ప్రపంచవ్యాప్తంగా 144 ఉండగా.. ఇప్పుడు 145వ మొక్కగా ‘లెపిడోగాథిస్ రాజశేఖరే’ గుర్తింపు పొందింది. భారత్లో 34 మొక్కలు ఉండగా.. ఇది 35వది. ఏపీలో 8 మొక్కలు ఉండగా.. ఇది తొమ్మిదవది. ఈ జాతికి సంబంధించిన మొక్కలను స్థానిక భాషలో ముళ్లబంతి, సూర్యకాంతం తదితర పేర్లతో పిలుస్తారు. ఔషధ విలువలు కూడా ఉండటంతో.. సంరక్షించాల్సిన జాతుల కింద వీటిని గుర్తించారు. జ్వరం, ఎగ్జిమా, సోరియాసిస్, ఎపిలెప్సీ, దురద, మౌత్ అల్సర్, కీటకాల కాటు, దెబ్బలు తదితర చికిత్సలకు వీటిని వినియోగిస్తారని వైవీయూ వృక్షశాస్త్ర విభాగ ప్రొఫెసర్ డా.ఎ.మధుసూదన్రెడ్డి తెలిపారు. ఈ మొక్కలకు మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే పూలు పూస్తాయని చెప్పారు. వైవీయూలోని బొటానికల్ గార్డెన్లో సంరక్షిస్తున్నట్లు చెప్పారు. –వైవీయూ (వైఎస్సార్ జిల్లా) -
నాగకేసరి చెట్ల నుంచి జీవ ఇంధనం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆసక్తి, విషయ పరిజ్ఞానం, సాధించాలనే తపన ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిపుత్రిక. తల్లిదండ్రులు తనని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా, మొక్కవోని దృఢ సంకల్పంతో ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపారు రాజేంద్రపాలేనికి చెందిన దిబ్బ చంద్రవతి. ఆమె తల్లిదండ్రులు దిబ్బ సుందర్రావు, సింగారమ్మ కూలీలు. చంద్రవతి పదో తరగతి మండలంలోని పెదమాకవరం పాఠశాలలోను, ఇంటర్ పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ విశాఖలో చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రెండేళ్లు ఎంఫిల్ చేశారు. పీహెచ్డీలో భాగంగా ‘నాగ కేసరి చెట్ల నుంచి జీవ ఇంధన తయారీ’పై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ఆచార్యులు ఎస్బీ పడాల్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురణలు జరగడంతో ఆమెను డాక్టరేట్ వరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో విలువైన ఔషధాలు ఉన్నాయని తెలిపారు. ఆదిమజాతి గిరిజనులు వృక్షాలతో అన్యోన్యంగా ఉంటారని, వివిధ రకాల రోగాలకు వారి పరిసరాల్లో పెరిగే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. అడవిలో పెరిగే నాగ కేసరి చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను నూనెగా మార్చి జీవ ఇంధనంగా తయారు చేశామని ఆమె వివరించారు. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారు చేయవచ్చునని తెలిపారు. పరిశోధన పూర్తి కావడంతో ఏయూ ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నుంచి ఈనెల తొమ్మిదిన డాక్టరేట్ అందుకున్నట్టు ఆమె తెలియజేశారు. -
క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రీసెర్చ్
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి.అయితే క్యాన్సర్ నుంచి బయట పడేందుకు సైంటిస్టులు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ కణాల ఎదుగుదలకు, వ్యాప్తికి సాయపడే పోషకాల స్థానంలో ఉత్తుత్తి పోషకాలను అందిస్తే వ్యాధి వ్యాప్తి నిలిచిపోతుందని, కణితి సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బర్న్హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ జరిపిన ప్రయోగం ప్రకారం..ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణితి ఎదుగుదలకు, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పోషకాల స్థానంలో డమ్మీ పోషకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చు. క్యాన్సర్లలో ఎన్నో రకాలుంటాయన్నది తెలిసిందే. క్లోమగ్రంథి (పాంక్రియాటిక్)కి వచ్చే క్యాన్సర్ కొంచెం ముదురుటైపు. దీని బారిన పడ్డవారు కోలుకోవడం అసాధారణమే. ఏటా దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 35-39, 85-89 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చిన వారిలో మూడు-మూడున్నరేళ్లకు మించి జీవించి ఉండేవారు పది శాతానికి మించి లేరని పరిశోధనలో వెల్లడైంది. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అదే కీలకం క్లోమగ్రంథి క్యాన్సర్ సాధారణంగా గ్లుటామైన్ అనే పోషకంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని అందకుండా చేస్తే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. గ్లుటమైన్ అందుబాటులో లేనప్పుడు క్యాన్సర్ కణాలు ఆస్పరాజైన్తో సహా ఇతర పోషకాలపై కాబట్టి ఈ రెండు పోషకాలు అందకుండా చేస్తే వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు అచ్చం గ్లుటమైన్ మాదిరిగానే ఉండే 6-డయాజో-5-ఆక్సో-ఎల్-నార్లూసిన్ (DON)ను, ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్న L-ఆస్పరాగినేస్లను కలిపి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. L-ఆస్పరాగినేస్ అనేది ఆస్పరాజైన్ను విచ్ఛిన్నం చేసే కీమోథెరపీ ఔషధం. ఇది క్యాన్సర్ కణాలను వృద్ది చెందకుండా అడ్డుకుంటుంది. రెండింటినీ కలిపి వాడినప్పుడు ఎలుకల్లోని క్యాన్సర్ కణితి సైజు తగ్గిపోయినట్లు.. వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువ జరగనట్లు తేలింది. క్యాన్సర్ కణాల ప్రొటీన్ ఉత్పత్తికి, కొత్త కణాల తయారీకి ఆస్పరాజైన్ అవసరం. DONను ఇప్పటికే ఊపరితిత్తుల క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు కానీ... రెండింటినీ కలిపి వాడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇదే పద్ధతిని అంటే రెండు రకాల డమ్మీ పోషకాలను కలిపి వాడటం క్లోమగ్రంథి క్యాన్సర్ చికిత్సకూ వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైలంట్ కిల్లర్... ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి.అలసట, ఆకలి లేకపోవడం,ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు,అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం వెన్ను నొప్పి, కామెర్లు, విపరీతంగా కడుపునొప్పి వంటివన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం, మధుమేహం ఎక్కువగా సేవించడం, కుటుంబంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి.ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వ్యాధి తీవ్రం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ రకమైన క్యాన్సర్ చాలా తొందరగా శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు, కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. -
సింధు ప్రజల ముఖ ఆకృతి ఎలా ఉండేది? శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏమి తేలింది?
సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉండేవనే ఇన్నాళ్ల సందేహాలకు ఇప్పుడు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరిత నాటి ఒక స్మశానవాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, లోకం ముందు ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు ఎంతో ఆసకికరంగా మారింది. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత క్రీ.పూ. 3300 నుండి 2500 వరకు కొనసాగింది. ప్రముఖ పత్రిక నేచర్లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలోని వివరాల ప్రకారం సింధు లోయ నాగరికత 8000 సంవత్సరాల పురాతనమైనది. భారతదేశ చరిత్ర హరప్పా నాగరికతగా పేరొందినప్పటికీ, అది కూడా సింధు లోయ నాగరికతతో పాటు ప్రారంభమయ్యిందని చరిత్ర చెబుతోంది. మొహెంజొదారో, కలిబంగా, లోథాల్, ధోలావీరా, రాఖీగర్హి మొదలైనవి హరప్పా, సింధు లోయ నాగరికతలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణిస్తారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన నగరం 2014లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భిర్దానాలో కనుగొన్నారు. దీని స్థాపన సుమారు క్రీ.పూ. 7570 నాటిదని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత అని అంటారు. సింధు లోయ నాగరికతను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే సింధూ ప్రజల ముఖ రూపాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలేవీ నేటివరకూ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే తాజాగా పూరాతత్వ పరిశోధకులు క్రీ.పూ. 2273, 2616 నాటిదిగా అంచనా వేసిన సింధునాగరికత స్మశానవాటిక రాఖీగర్హి లో పరిశోధినలు సాగించారు. ఈ నేపధ్యంలో రాఖీగర్హిలో లభ్యమైన రెండు పుర్రెల కంప్యూటెడ్ టోమోగ్రఫీ డేటాను ఉపయోగించి క్రానియోఫేషియల్ రీకన్స్ట్రక్షన్ (సీఎఫ్ఆర్) విధానం ద్వారా సుమారు 4500 సంవత్సరాల క్రితం ఖననం చేసిన సింధు నాగరితక వ్యక్తులకు చెందిన ముఖాలను విజయవంతంగా పునర్నిర్మించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సింధు నాగరికుల ముఖ స్వరూపాన్ని అంచనావేసేందుకు శాస్త్రీయంగా జరిగిన మొదటి ప్రయత్నం ఇదేనని వారు పేర్కొన్నారు. ఈ వివరాలను అనాటమికల్ సైన్స్ ఇంటర్నేషనల్ వాల్యూమ్- 95లో శాస్త్రవేత్తలు జూన్ లీ, వసంత్ షిండే, డాంగ్ హూన్ షిన్ షోలు పొందుపరిచారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
TS History:1948 పోలీస్ యాక్షన్ – మరో కోణం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అది సృష్టించిన సాహిత్యం మన రాజకీయాల్లో, సాహిత్యంలో చివరకు మన జీవితాల్లోనూ విడదీయరాని భాగం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ఒక్క ప్రతినిధి కూడా లేడు. అయినప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష భావజాలమే ఇప్పటికీ బలంగా ఉంది. తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం ‘సామ్యవాద వాస్తవికత’ ప్రభావంలోనే ఉందంటే అతిశయోక్తి కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం వచ్చాక 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానం చాలా పెద్దది. అందులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని నల్లగొండ, వరంగల్ రెండు జిల్లాల్లో ప్రధానంగానూ, మరో ఒకటి రెండు జిల్లాల్లో స్వల్పంగానూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ఆనాటి చారిత్రక సంఘటనల మీద తమ అనుభవాలను గ్రంథస్థం చేసిన ఆ పోరాట అగ్రనాయకులు అందరూ తెలంగాణకు పరిమితమయ్యారు. తమ పుస్తకాలకు నిజాయితీగా ‘తెలంగాణ’ అనే శీర్షికలే పెట్టారు. మిగిలిన నిజాం సంస్థానాన్ని వదిలేశారు. దానికి రెండు కారణాలు. మొదటిది ఉర్దూ భాషా సమస్య, రెండోదిముస్లిం మత సమస్య.నిజాం పాలన గురించి మనకు, ముఖ్యంగా, తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. నిజాం సంస్థానంలో పెట్టుబడీదారీ అభివృద్ధి గురించి పరిశోధనలు చేసిన ప్రొఫెషనల్స్ కొందరు లేకపోలేదు. వారిలో ఒకడైన సివి సుబ్బారావు ఆ రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ వాగ్దానం చేసిన ఇండియాకన్నా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోని నిజాం సంస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి మెరుగ్గా ఉందనే నిర్ధారణకు వచ్చాడు.ఇంతకీ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమిటి? వాదన కోసం; నిజాం రాచరిక పాలననో, జాగీర్దార్ల భూస్వామ్యాన్నో వాళ్ళు అంతం చేసేశారు అనుకుందాము. భూస్వామ్య వ్యవస్థను అంతం చేశాక పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడుతుందని సాక్షాత్తు ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో కార్ల్ మార్క్స్– ఫ్రెడరిక్ ఏంగిల్స్ చెప్పారు. అంతేకాని భూస్వామ్య వ్యవస్థను కూల్చేస్తే సమసమాజం వస్తుందనో, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందనో, కనీసం ‘రైతు–కూలీ రాజ్యం’ వస్తుందనో వాళ్ళెక్కడా చెప్పలేదు.తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ రాచరిక – భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన తరువాత అక్కడ అత్యంత సహజంగానే పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడాన్ని మనందరం చూస్తున్నాం. 1940ల చివర్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానీ, 1980ల మొదట్లో నక్సలైట్ పార్టీలుగానీ ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా పెట్టుబడిదారులు పెరగడానికి కారణమయ్యారు. సమాజానికి తనదైన ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా అదలా సాగిపోతుందంతే. ఒక కఠోర చారిత్రక వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ సోషలిస్టు విప్లవం విజయవంతం కాలేదు. 1948 నాటి పోలీస్ యాక్షన్ గురించి కమ్యూనిస్టు నాయకులు చెప్పని ఇంకో పెద్ద నిజం కూడా ఉంది. జె.ఎన్. చౌధరి నాయకత్వంలోని ‘పోలీసు యాక్షన్’ కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో సాయుధపోరాటంలో మరణించిన 3 వేలకు ఓ పది రెట్లకు పైగా ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు. వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన నెహ్రూ వేసిన సుందర్ లాల్ బహుగుణ కమిటీ మాత్రమేకాక, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి అప్పటి పార్లమెంటరీ రాజకీయాల వేదికగా ఉన్న ‘పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ’(పీడీఎఫ్) నాయకులు కూడ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. సుందర్ లాల్ బహుగుణ నివేదికను జాతీయభద్రత దృష్ట్యా చాలాకాలం దాచిపెట్టారుగానీ ఇప్పుడు అది అందుబాటులో వుంది. ఇండో–అమెరికన్ రచయిత అఫ్సర్ మహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దం పాటు విçస్తృత పరిశోధనలు చేసి ఇప్పుడు ‘రీమేకింగ్ హిస్టరీ –1948 పోలీస్ యాక్షన్ అండ్ ది ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్’ శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ప్రచురించాడు. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్ బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి సిద్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంథం. ప్రపంచం అనేది చాలా పెద్దది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే స్పృహ చాలామందికి ఉండదు. ప్రపంచం మొత్తం తెలియకపోయినా మనదేశం గురించి, మన రాష్ట్రం గురించయినా తెలియాలి. హీనపక్షం మనతో వందల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సమూహాల మనోభావాలనైనా తెలుసుకోవాలిగా. దానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తాను. వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 9010757776 -
ఎలుక పాలు లీటరు 18 లక్షలా..!
ఇంతవరకు అత్యంత ఖరీదైన పాలంటే గాడిద పాలనే భావించేవారు. కానీ కాదట వాటికంటే ఓ చిన్న జీవి, మన వినాయకుడి వాహనం అయిన మూషికం పాలే ఖరీదైనవి. ఏకంగా లక్షలు పలుకుతోంది ధర. పైగా పరిశోధకలకు ఎంత ప్రియమైన జంతువట అది. ఇంతకీ ఎలుక పాలు ఎందుకంత కాస్టలీ? అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలే! షాకింగ్ అనిపిస్తున్నా ఇదే వాస్తవం. ఎలుకపాలు సంపాదించటం అంత ఈజీ కాదు. పైగా ఇది 30 నిమిషాల ప్రక్రియే అయినా ఎలుక నుంచి కొద్ది మొత్తంలోనే పాలు వస్తాయి. ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడానికి దాదాపు 40 వేల ఎలుకలు అవసరం. ఈ ఎలుకల నుంచి సేకరించిన ఒక లీటరు పాల ధర దాదాపు 23 వేల యూరోలు అంటే సుమారు 18 లక్షల రూపాయలు. దేనికీ ఈ పాలు.. ఎలుక పాలను పరిశోధనలకు ఓ సాధనంగా ఉపయోగిస్తారు. మలేరియా బ్యాక్టీరియాను చంపే మందులు తయారీలో ఈ ఎలుక పాలను ఉపయోగిస్తారు. అయితే శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఈ ఎలుక పాలేనే ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటే..ఎలుక డీఎన్ఏ ఇతర జంతువుల డీఎన్ఏకంటే ప్రభావవంతంగా ఉంటుంది. పైగా మానవ శరీరానికి సంబంధించింది. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా ఈజీ. ప్రయోగాలకు వేల జంతువులు అవసరం. అదే ఆవు అయితే వేల ఆవులను వినయోగించడం సాధ్యం కాదు. దానికంటే వేల ఎలుకలను ఉపయోగించడమే చాలా ఆచరణాత్మకమైనది, సులభమైనది కూడా. ఏ ఔషధాల్లో ఉపయోగిస్తారంటే.. మలేరియాను నయం చేసే మందుల్లోనే గాక రీసెర్చ్ మెటీరియల్గానూ ఈ పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధనల పరంగా అత్యంత ఖరీదైనవి. ఏజంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందంటే.. ఒక ఆవు ఏడాదికి దాదాపు 10 వేల లీటర్ పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని బరువు కంటే ఏడు రెట్లు ఎక్కువ. మేకలు ఏడాదికి వాటి బరువు కంటే 12 రెట్లు పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీవులన్నింటిలో బ్లూ వేల్ రికార్డును కలిగి ఉంది. నీలి తిమింగలం రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు చాలా కొవ్వుగా ఉంటాయి. కాబట్టి తిమింగలం పిల్ల రోజుకు 100 కిలోల బరువు పెరుగుతుంది. (చదవండి: వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..) -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్ధ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. నానాటికీ పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియ¯న్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. పన్నులు విధించాలి..పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, ప్రీ ప్యాకేజ్డ్ బెవరేజెస్, జ్యూసెస్, బేకరీ ఉత్పత్తులు, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరడం గమనార్హం. కాగా వీటి వినియోగాన్ని నియంత్రించేలా, నిరుత్సాహ పరిచేలా పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
కలవరపెడుతున్న కాంతి
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్.. వాయు కాలుష్యం. అలాగే శబ్ద కాలుష్యం గురించి కూడా మనకు తెలుసు. వీటితో తలెత్తే అనర్థాలపైన కూడా అవగాహన ఉంది. అయితే కాంతి కాలుష్యం (లైట్ పొల్యూషన్) గురించి మాత్రం అంతగా తెలియదు. అయితే దీనితో కూడా ప్రమాదమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాంతి కాలుష్యంపై తమ దేశంలో నిర్వహించిన పరిశోధనను చైనా తాజాగా వెల్లడించింది. కొన్ని లక్షల మందిపై పరిశోధన చేసి అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. ఇందులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ బాధితులుగా మారారని ఆ అధ్యయనం బాంబుపేల్చింది. వీరంతా చైనాలోని 162 నగరాల్లో నివసిస్తున్నారు. కాంతి కాలుష్యంతో ఏం జరుగుతుంది? అధిక కాంతి వల్ల కాంతి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు పండుగల సమయంలో రంగు రంగుల్లో మెరిసే దీపాలు మిరుమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతుంటాయి. ఇవి కాంతి కాలుష్యానికి కారణమవుతున్నాయి. అలాగే అన్ని రకాల కృత్రిమ కాంతి, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఎల్ఈడీ, కారు హెడ్లైట్, హోర్డింగ్ల నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి కూడా కాలుష్యాన్ని వెదజల్లుతోంది. ముఖ్యంగా ఈ కాంతి కాలుష్యం వ్యక్తి శరీరాన్ని క్రమంగా ప్రభావితం చేస్తోందని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా మధుమేహ బాధితులుగా మారుస్తోందని పరిశోధకులు వెల్లడించారు. వీధి దీపాలు, స్మార్ట్ ఫోన్లు వంటి అన్ని కృత్రిమ లైట్లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 25 శాతం పెంచుతాయని స్పష్టమైంది. రాత్రిపూట కూడా మనకు పగటి అనుభూతిని కలిగించే ఈ లైట్లు మానవుల శరీర చక్రాన్ని మారుస్తాయని.. అంతేకాకుండా క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మన శరీర సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 80% మంది రాత్రిపూట చీకటిలో కాంతి కాలుష్యం బారిన పడుతున్నారని కూడా తెలిపారు. పరిశోధన ప్రకారం.. చీకటిలో కన్నా ఎక్కువసేపు కృత్రిమ కాంతిలో ఉండేవారిలో 28 శాతం మందికి అజీర్తి సమస్యలు ఉన్నాయని తేలింది. శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ హార్మోన్ మన జీవక్రియ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఎక్కువసేపు వెలుతురులో ఉండడం వల్ల ఏమీ తినకుండానే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. మన దేశంలో తలసరి ఉద్గారాలు తక్కువే.. ప్రపంచంలో చైనా, అమెరికా, ఈయూల తర్వాత అధిక కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే మనదేశంలో అధిక జనాభా ఉండడం వల్ల తలసరి ఉద్గారాలు మిగతా ప్రధాన దేశాలతో పోలిస్తే తక్కువ. 2030 నాటికల్లా దేశ ఇంధన శక్తిలో 50 శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచే పొందాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అదే సంవత్సరానికి కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించాలని నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సౌర విద్యుత్పై దృష్టి సారిస్తోంది. దాదాపు 43,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంతి కాలుష్యంపైనా భవిష్యత్తులో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. -
పరిశోధనలపై దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దిగ్గజాలుగా ఎదగాలంటే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు పెద్ద పీట వేయాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. వినూత్న ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్తో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం కీలక యంత్రపరికరాలను తయారు చేయాలని అటు మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు సూచించారు. ఫార్మా–మెడ్ టెక్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, నవకల్పనలపై జాతీయ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు తమ లాభాల్లో 20–25 శాతాన్ని పరిశోధన, ఆవిష్కరణలపై వెచ్చిస్తుంటాయి. కానీ దేశీ కంపెనీలు సుమారు 10 శాతమే వెచ్చిస్తున్నాయి. మనం పరిశోధన ఆధారిత వినూత్న ఉత్పత్తులను తయారు చేయనంతవరకూ అంతర్జాతీయంగా ఈ విభాగానికి సారథ్యం వహించలేము‘ అని ఆయన చెప్పారు. 2047 నాటికి ఫార్మా పరిశ్రమ స్వావలంబన సాధించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. నాణ్యత కూడా ముఖ్యమే.. భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యతపై కూడా ఫార్మా పరిశ్రమ దృష్టి పెట్టాలని మాండవీయ చెప్పారు. మరోవైపు, ఫార్మా మెడ్టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకాన్ని (పీఆర్ఐపీ) కూడా కేంద్రం ఆవిష్కరించింది. ఈ స్కీము బడ్జెట్ రూ. 5,000 కోట్లని మాండవీయ చెప్పారు. పరిమాణంపరంగా 50 బిలియన్ డాలర్లతో భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో 120–130 బిలియన్ డాలర్లకు ఎదగగలదని అంచనాలు ఉన్నాయి. -
చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది?
చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో లేదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమి టెక్టోనిక్ ప్లేట్ల మాదిరిగా చురుకుగా లేవు. చంద్రునిపై భూకంపాలు వస్తుంటాయి. ఇటీవల చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడి భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. చంద్రునిపై వచ్చే భూకంపాలు భూమికి వచ్చే భూకంపాల కంటే శక్తివంతంగా ఉంటాయని, ఒక్కోసారి వాటి తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వివిధ రకాల సాధనాలు భూకంపాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చంద్రునిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాలలో సీస్మోమీటర్లను విడిచిపెట్టారు. చంద్రునిపై ఈ సీస్మోమీటర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చురుకుగా ఉన్నాయి. అయితే అవి ఆ సమయంలో 12 వేల భూకంపాల గురించిన సమాచారాన్ని అందించాయి. చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి లోతైన భూకంపం, మరొకటి తేలికపాటి లేదా నిస్సార భూకంపం, మూడవది ఉల్కా భూకంపం. నాల్గవది థర్మల్ భూకంపం. లోతైన భూకంపాలు లోతైన భూకంపాలు చంద్రునిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవించాయి. భూమిపైనున్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసిన విధంగా, చంద్రుని లోతైన రాతి కోర్పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని, ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కా భూకంపం చంద్రునిపై ఉల్కలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇదేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగానూ చంద్రునిపై ఉష్ణ భూకంపాలు సంభవిస్తాయి. రెండు వారాల పాటు చంద్రునిపై చీకటి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్కు తగ్గుతుంది. పగటిపూట +121 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుంది. ఈ హెచ్చుతగ్గుల కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. తేలికపాటి భూకంపం చంద్రునిపై సంభవించే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువగా ఉంది. చంద్రుని లోపలున్న టెక్టోనిక్ ప్లేట్, ఇటీవల ఏర్పడిన పెద్ద బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు ఎంతసేపు ఉంటాయి? భూమిపై భూకంపాలు 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటాయి. కొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయి. మరికొన్ని పది నిమిషాల పాటు ఉంటాయి. భూమితో పోలిస్తే చంద్రుని దృఢత్వం అధికం. అందుకే అక్కడ ప్రకంపనలు పది నిమిషాలకు పైగా ఉంటాయి. కొన్ని గంటలపాటు కూడా ప్రభావం చూపిస్తాయి. భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించడానికి చంద్రునిపై భూకంపాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో మరిన్ని మిషన్లు అక్కడ వివిధ పరికరాలను అమర్చర్చి భూకంపాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుంటాయి. నాసా సమీప భవిష్యత్తులో చంద్రునిపై అనేక సీస్మోమీటర్లను వ్యవస్థాపించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు? -
సూర్యుడిపై పరిశోధనల్లోనూ ఈసీఐఎల్ కీలకపాత్ర
కుషాయిగూడ: చంద్రయాన్–3 ప్రయోగానికి డీప్స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను అందజేసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సూర్యుడిపై పరిశోధనల కోసం చేపట్టిన ఆదిత్య–ఎల్1 శాటిలైట్ ప్రయోగానికి అవసరమైన యాంటెన్నాను సైతం ఇస్రోకు అందజేసి మరోమారు సత్తా చాటుకుంది. శనివారం ప్రయోగించిన ఆదిత్య–ఎల్1కు అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ యాంటెన్నా అందిస్తుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యాంటెన్నా 18 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నాయి. 15 లక్షల కి.మీ. దూరంలో కక్ష్యలో ఉన్న శాటిలైట్కు భూమి నుంచి నిర్థిష్టమైన సమాచారాన్ని చేరవేయడంలో యాంటెన్నా కీలకంగా వ్యవహరిస్తుందని వివరించాయి. బెంగళూరుకు 40 కి.మీ. దూరంలోని బైలాలు గ్రామంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఎంటీఏఆర్ సహకారం... ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయంలో హైదరాబాద్కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ సైతం కీలక సహకారం అందించిందని సంస్థ ఎండీ పర్వత శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పీఎస్ఎల్వీ–సీ57 మిషన్లో భాగంగా లాంచింగ్ వాహనం కోసం లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లు, ఎలక్ట్రో–న్యూమాటిక్ మాడ్యూల్స్, ప్రొపల్షన్ సిస్టమ్, శాటిలైట్ వాల్వ్లు, సేఫ్టీ కప్లర్లు, లాంచ్ వెహికల్ యాక్చుయేషన్ సిస్టమ్ల కోసం బాల్ స్క్రూలు, కనెక్టర్ అసెంబ్లీలు, యాక్చుయేషన్ సిస్టమ్స్ హార్డ్వేర్, నోస్ కోన్ వంటి వాటిని సరఫరా చేశామన్నారు. -
కొత్త వరి వంగడాలు ఆయన చలవే..
సాక్షి, అమరావతి : ‘2004లో వైఎస్ సీఏంగా బాధ్యతలు చేపట్టే సమయానికి నేను మార్టేరు పరిశోధనా కేంద్రంలో ప్రిన్సిపల్ ౖసైంటిస్ట్గా పనిచేస్తున్నా. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆయన మా కేంద్రానికి వచ్చారు. పరిశోధనలు బాగా పెరగాలి. వాటి ఫలాలు రైతులకు మరింత వేగంగా చేరాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పండన్నారు. రూ.100 కోట్లు ఇవ్వండి అని నేను అడగ్గానే పక్కనే ఉన్న మంత్రి రఘువీరారెడ్డి మన దగ్గర డబ్బుల్లేవన్నారు. భలే చెబుతావయ్య అంటూ అక్కడికక్కడే రూ.50 కోట్లు శాంక్షన్ చేశారు. వాటితో పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం. ఫలితంగా కొత్త రకాలను సృష్టించగలిగాం. ఉత్పత్తిని పెంచగలిగాం. ఈరోజు వందల సంఖ్యలో కొత్త రకాల విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇదంతా ఆయన చలవే’ అని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వపు వీసీ, ఐసీఏఆర్ గవర్నింగ్ బాడీ మాజీ సభ్యుడు ప్రొ. పోలి రాఘవరెడ్డి అన్నారు. మహానేత హయాంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా, వీసీగా సేవలందించిన డాక్టర్ రాఘవరెడ్డి ఆ మహానేతతో తనకున్న సాన్నిహిత్యం, ఆయన హయాంలో విద్యా రంగానికి జరిగిన మేలుపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఏటా అదనంగా వంద కోట్లు..: వర్సిటీలకు ఆనాడు రూ.400 కోట్ల బడ్జెట్ ఉండేది. ఇది ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పడంతో కేంద్రంౖపై ఒత్తిడి తెచ్చి వర్సిటీకి ఏటా రూ.100 కోట్లు అదనంగా మంజూరు చేయించారు. ‘విత్తన గ్రామాల’కు నాంది పలకడమే కాదు రివాల్వింగ్ ఫండ్ పేరిట రూ.20 కోట్లు ఇచ్చారు. ఉత్పత్తి చేసిన విత్తనాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో విస్తరణ కార్యక్రమాలు చేపట్టండి అని వైఎస్ సూచించారు. ఆ నిధులు ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా ఉన్నాయి. సాగులో రైతులకు తోడుగా నిలవాలన్న ఆలోచనతో దేశంలోనే తొలిసారి ల్యాబ్ టూ ల్యాండ్ అంటూ శాస్త్రవేత్తల బృందాలను పల్లెలకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొలం బడులకు నాంది పలికారు. వ్యవసాయ వర్సిటీలో సీట్ల పెంపు..: వ్యవసాయ విద్యను మెరుగుపర్చాలంటే ఏం చేయాలని ఓ రోజు వైఎస్ అడిగారు. ఆయన వచ్చేటప్పటికి వర్సిటీ పరిధిలో 400–500 సీట్లు మాత్రమే ఉండేవి. వాటిని 1,000 సీట్లకు పెంచాలని సూచించగానే క్షణం ఆలోచించకుండా పెంచేద్దామన్నారు. స్థానిక ప్రజలకిచ్చిన హామీ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యాన వర్సిటీ పెడదామని ఆయన అనగా.. అవసరంలేదని నేను చెప్పా. ‘లేదు రాఘవ.. నేను మాటిచ్చాను. పెట్టాల్సిందే’ అంటూ 250 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో వర్సిటీని ఏర్పాటుచేశారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ ఆయన హయాంలో ఏర్పాటైనవే. వైఎస్ హయాంలో రాజమండ్రి, జగిత్యాలలో కొత్త కళాశాలలు వచ్చాయి. బాపట్లలో మాత్రమే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ఉండేది. వైఎస్ హయాంలో కొత్తగా అనంతపురం జిల్లా మడకసిరి, రంగారెడ్డిలలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుచేశారు. పులివెందులలో కొత్తగా కాలేజ్ ఆఫ్ ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇక వర్సిటీ పరిధిలో సుమారు 5వేల మంది రైతు కూలీలు రోజువారీ వేతనాలతో పనిచేసేవారు. వీరికి క్లాస్–4 ఎంప్లాయిస్కు సమానంగా జీతభత్యాలు ఇవ్వడమే కాదు.. వారికి పింఛన్ సౌకర్యం కూడా కల్పించారు. రైతు మోములో చిరునవ్వులు చూడాలి. అవే మనకు గొప్ప అవార్డులు.. అన్న ఆయన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్ను, రోవర్ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో తొలినాళ్లలో ఎడ్లబండి, సైకిల్పై శాటిలైట్, రాకెట్ పరికరాలను తీసుకువెళ్లే స్థాయి నుంచి చంద్రుడు, అంగారకుడు గ్రహాల మీద పరిశోధనలు చేసేస్థాయికి చేరడానికి నాడు విక్రమ్ సారాభాయ్ వేసిన పునాదులే కారణమని షార్ శాస్త్రవేత్త ఆర్.ప్రీతా చెప్పారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకుని ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్షయానంపై స్థానిక గోకులకృష్ణ కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రీతా మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించి ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను చరిత్ర మరువలేనిదని చెప్పారు. నెల రోజుల్లో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ శ్రీనివాసబాబు, ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ కేంద్రంగా ‘హ్యుందాయ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా గ్రూప్ హ్యుందాయ్ మోటార్ భారత్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో నాయకత్వ స్థానం కోసం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో పోటీతత్వ ఈవీ మార్కెట్గా భారత్ అవతరిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. 2032 నాటికి దేశీయంగా అయిదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది. కొత్త ఈవీల పరిచయం, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 10 ఏళ్లలో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు 2023 మే నెలలో సంస్థ ప్రకటించింది. ఈవీలు, అటానమస్ సహా భవిష్యత్ మోడళ్ల పరిశోధన కోసం హైదరాబాద్లోని రిసర్చ్, డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్ను కేంద్ర బిందువుగా మార్చాలని గ్రూప్ యోచిస్తోంది. ఈ కేంద్రంలో భారతీయ భాషల్లో వాయిస్ రికగి్నషన్ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేస్తారు. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనిట్లను దాటుతుంది. వీటిలో ఎస్యూవీల వాటా 48 శాతం. ఆ సమయానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని హ్యుందాయ్ తెలిపింది. 2022–23లో భారత్లో అన్ని కంపెనీలవి కలిపి 48,104 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్ వ్యూహంపై.. ‘భారత విపణిలో కంపెనీ కార్ల విక్రయాలు పెరిగేందుకు హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అలాగే కొరియాలోని హుందాయ్–కియా నమ్యాంగ్ ఆర్అండ్డీ సెంటర్తో కలిసి భారత మార్కెట్ కోసం వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ కోసం కొత్త సదుపాయం నిర్మాణం గత సంవత్సరం ప్రారంభమైంది’ అని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్ యూసన్ ఛంగ్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్తోపాటు చెన్నైలోని తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహంపై కంపెనీకి చెందిన కీలక అధికారులతో చర్చించారు. భారీ లక్ష్యంతో.. ఎస్యూవీలలో నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం, ఈవీ మోడళ్లను విస్తరించడం ద్వారా పరిమాణాత్మకంగా వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హ్యుందాయ్ వెల్లడించింది. ‘నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్ సెంటర్ల సంఖ్యను 439కి చేర్చనున్నాం. గ్రూప్ కంపెనీ అయిన కియా 2025 నుండి భారత కోసం చిన్న ఈవీలను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఈవీ మోడళ్లతోపాటు వినియోగదార్లు కోరినట్టు కస్టమైజ్డ్ (పర్పస్ బిల్ట్ వెహికల్స్) అందిస్తుంది. కొత్త మోడళ్ల పరిచయం, ప్రస్తుతం ఉన్న 300 షోరూమ్లను రెండింతలు చేయాలన్నది కియా ప్రణాళిక. ప్రస్తుతం కియా మార్కెట్ వాటా 6.7% ఉంది. సమీప కాలంలో దీన్ని 10%కి చేర్చాలన్నది కియా 2.0 వ్యూహం’ అని హ్యుందాయ్ తెలిపింది. -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
అద్భుతం.. అన్నదాతల ధాన్యాగారం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అద్భుత ఫలితాలు సాధిస్తూ అన్నదాతల ధాన్యాగారంగా ప్రగతి పథం వైపు దూసుకుపోతున్నది. ఇక్కడ శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న వరి వంగడాలు నాణ్యమైన అధిక దిగుబడితో దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన పలు రకాల వరి వంగడాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సాగవుతున్నాయి. విదేశాలకు ఏటా లక్షల టన్నుల బీపీటీ రకాల సన్నబియ్యం ఎగుమతి అవుతూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. దీంతో ఈ పరిశోధన స్థానం ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగసింది. వరి పరిశోధన స్థానం నేపథ్యం.. 1961లో తెనాలిలో ప్రారంభమైన వరిపరిశోధన స్థానం 1973లో బాపట్లకు మార్చారు. అప్పటి నుంచి బాపట్ల వరి పరిశోధన స్థానంగా పనిచేస్తోంది. 2017లో వరి పరిశోధన స్థానం నుంచి వ్యవసాయ పరిశోధన స్థానంగా అప్గ్రేడ్ చేస్తూ.. 15 ఎకరాల నుంచి 40 ఎకరాలకు విస్తరించారు. కొత్త వంగడాల సృష్టి కేంద్రం.. 1982లో సోనామసూరి రకం ( బీపీటీ 3291), ధాన్యలక్ష్మి (బీపీటీ 1235), 1986లో సాంబమసూరి (బీపీటీ 5204) అనే సన్న రకం వంగడాన్ని కనుగొన్నారు. 1987లో బీపీటీ 4358, 2001లో బీపీటీ 1768 సన్నాలు, 2010లో బీపీటీ 2270 రకాల వంగడాలను సృష్టించారు. 2010లో బీపీటీ 2231, 2018లో బీపీటీ 2295 రకం ఉత్పత్తి చేయగా 2019లో బీపీటీ 2595 తేజ రకం ఉత్పత్తి చేశారు. 2020లో బీపీటీ 2782 భవతి, బీపీటీ 2411 సశ్య, 2023లో బీపీటీ 3050, బీపీటీ 2846, బీపీటీ 2841 నల్లబియ్యం, బీపీటీ 2848 హైప్రొటీన్ రకం వంగడాలను ఉత్పత్తి చేశారు. తెగుళ్లను తట్టుకునేలా నాణ్యతతో కూడిన విత్తనాలు ఉత్పత్తి చేయడం వల్లే అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇవి కాకుండా బీపీటీ 3082, 2858 రకాలు ఉత్పత్తి అయి మినీకిట్ దశలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకు.. వరి పరిశోధన స్థానం ఏర్పడి ఇప్పటికి 61 ఏళ్లు గడుస్తోంది. 2018 ఏడాది వరకు 57 ఏళ్ల కాలంలో కేవలం 7 వంగడాలను సృష్టించగా.. గడచిన 4 ఏళ్ల కాలంలోనే 9 రకాల కొత్త వరి వంగడాలు ఉత్పత్తి చేయడం గమనార్హం. వైఎస్ జగన్ప్రభుత్వం ప్రోత్సాహం, తోడ్పాటు వల్లే త్వరితగతిన నూతన వంగడాల సృష్టి సాధ్యమవుతున్నదని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త వంగడాలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన సీడ్ను ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. ఏటా 60 ప్రైవేటు కంపెనీలకు సీడ్ను అందిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఇక్కడ ఏడాదికి 600 క్వింటాళ్ల బ్రీడర్ సీడ్ తయారు చేస్తున్నారు. బీపీటీ విత్తనాల సాగు ఇలా బాపట్ల వరి పరిశోధన స్థానంలో సృష్టించిన బీపీటీ 5204 రకం విత్తనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా సుమారు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రైతుల కోసం నాణ్యమైన సీడ్ బాపట్ల వ్యవవసాయ పరిశోధన స్థానంలో నూతన వరి విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నది. ఇక్కడ సృష్టించిన బీపీటీ 5204 రకం దేశవ్యాప్తంగా 75 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండగా.. మరికొన్ని రకాల వంగడాలకు డిమాండ్ పెరిగింది. ఇవే కాకుండా బ్లాక్రైస్, హైప్రొటీన్రైస్ వంగడాలను సిద్ధం చేశాం. ఇవన్నీ తెగుళ్లు తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడినిచ్చి రైతులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. –బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన స్థానం -
3 కొత్త పొగాకు వంగడాల విడుదల
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీటీఆర్ఐ) ద్వారా దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాలకు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీటీఆర్ఐ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ గురువారం తెలిపారు. ఎఫ్సీఆర్–15 (సీటీఆర్ఐ శ్రేష్ట) వంగడం దక్షిణ తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది అధిక దిగుబడిని (హెక్టార్కు 3,000 కిలోలు) ఇస్తుందన్నారు. ఇది శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకమన్నారు. ఎఫ్సీజే–11 (సీటీఆర్ఐ నవీన) వంగడం ఉత్తర తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడినిచ్చే (హెక్టార్కు 3,300 కిలోలు) వంగడమని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామర్థ్యం కలిగిన బ్యారన్ పొగాకు రకమన్నారు. వైబీ–22 (విజేత) వంగడం అధిక దిగుబడినిచ్చే (హెక్టార్కు 2,900 కిలోలు), శీతాఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు రకమన్నారు. ఈ 3 వంగడాలను స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ (ఎస్వీఆర్సీ) విడుదల చేసిందన్నారు. ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్లో సీటీఆర్ఐలో లభ్యమవుతున్నాయని చెప్పారు. -
నిఖిల గోవతి పరిశోధనను సేవబాట పట్టించింది
డిగ్రీలు చేసి, ఉద్యోగాలు చూసుకొని స్థిరపడిపోవడం గురించి ఆలోచిస్తుంటారు చాలా మంది. తమ చదువు పేదలకు ఉపయోగపడితే ఎంతో మేలు అని ఆశిస్తుంటారు కొంతమంది. అలాంటి కోవకి చెందుతుంది కర్పూరం గోవతి నిఖిల. సికింద్రాబాద్ సీతాఫల్మండిలో ఉండే నిఖిల గుర్గావ్ మేదాంత ది మెడిసిటీ హాస్పిటల్లో డిస్ఫేజియా స్పెషలిస్ట్గా పరిశోధనలు చేస్తోంది. గోవతి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 5వేల మంది పేదవారికి కంటి, గుండె, క్యాన్సర్ చికిత్సలలో సహాయసహకారాలు అందించింది. ఈ యేడాది యంగెస్ట్ రీసెర్చర్ ఇన్ డిస్ఫేజియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, భారత్ గౌరవరత్న శ్రీ సమ్మాన్ కౌన్సిల్ అవార్డులు పొందింది. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలను ఇలా పంచుకుంది. ‘‘తెలియని తపన నన్ను ఓ కొత్త మార్గంవైపు నడిపించింది. పరిశోధనల వైపుగా అడుగులు వేయించింది. ఈ మూడేళ్లలో 5 వేల మందికి సాయం చేసేలా మార్చింది. బీఎస్సీ ఆడియాలజీ పూర్తయ్యాక ఎమ్మెస్సీలో చేరాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పూర్తవగానే మేదాంత హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది తమ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చేరమని. కాలేజీలో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచి వచ్చిన అవకాశమని తెలిసి చాలా ఆనందించాను. పరిశోధనలో.. అనేక ఆరోగ్య సమస్యలలో ముఖ్యంగా నిమోనియా, గుండెకు సంబంధించిన చికిత్సలు జరిగినప్పుడు కొన్నాళ్ల వరకు ఆహారాన్ని మింగడంలో కలిగే ఇబ్బందుల కారణంగా మరణాల రేటు పెరుగుతోందని మా పరిశోధనలో తేలింది. న్యూరో పేషంట్స్లో 80 శాతం డిస్ఫేజియా సమస్య ఉంటుంది. ఆహారాన్ని మింగే పద్ధతిలో తేడా ఉంటే ఆ ఆహారం నేరుగా లంగ్స్లోకి చేరి, ప్రమాదం కలుగుతుంది. అందుకని ఈ పేషెం ట్స్కు, వీళ్లను చూసుకునేవారికి ఏ విధంగా ఆహారాన్ని తీసుకోవాలనే విషయాల మీద గైడెన్స్ ఇస్తుంటాను. ఈ వైపుగా మన దగ్గర ఇంకా ఆలోచన పెరగలేదు. అమెరికాలో ఈ విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో ఈ విభాగంలో నాకు ఆసక్తి కలిగింది. లోతుగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాను. నాకు అడ్వైజ్ చేసే డాక్టర్లు, ప్రొఫెసర్ల సలహాలు మరెన్నో విషయాలను పరిచయం చేసింది. ఢిల్లీ సమీపంలోని హాస్పిటల్ కావడంతో వచ్చే పేషెంట్స్ సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి ఒక్క పేషెంట్ నుంచి వారి ఆరోగ్యసమస్యల ద్వారా తెలుసుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అలా నా పరిశోధనకు సంబంధించి 31 ఆర్టికల్స్ మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. జైపూర్, రాజస్థాన్, యూపీ నుంచి వచ్చే స్టూడెంట్స్కు సెషన్స్ కండక్ట్ చేస్తుంటాను. కరోనా నుంచి.. అవసరమైన వారికి సాధ్యమైనంత వరకు నా స్నేహబృందంతో సాయం అందిస్తూ వచ్చాను. అప్పటి నుంచి కంటి, గుండె చికిత్సలు, నిమోనియా, పార్కిన్సన్స్, నీ రీప్లేస్మెంట్, న్యూరో డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డాక్టర్లతో మాట్లాడి ఫీజు తగ్గింపులో సాయం చేస్తుండేదాన్ని. కోవిడ్ పేషెంట్స్పైన రీసెర్చ్ చేసినప్పుడు మరణాలు పెరగడానికి అందరికీ ఒకే విధమైన చికిత్స అందించడం సరికాదని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ భిన్నంగా చికిత్స చేయాలనే అంశాల మీద చేసిన రీసెర్చ్ పేపర్స్కి మంచి ప్రశంసలు అందాయి. ఈ సమయంలోనే ఫౌండేషన్గా సేవలను ఒక గ్రూప్కిందకు తీసుకురావాలనిపించింది. అందుకు, మా ప్రొఫెసర్లు, కుటుంబసభ్యుల సపోర్ట్ ఉంది. అభ్యర్థన మేరకు ప్రభుత్వ, కార్పోరేట్ హాస్పిటల్స్లోని డాక్టర్స్ నెట్వర్క్ నుంచి పరిచయాలు ఉన్నాయి. వారిని అభ్యర్థించి పేదవాళ్లలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు సూచించడం, వారి చేత హెల్త్ క్యాంపులు నిర్వహించడం చేస్తుంటాను. ఏయే సమయాల్లో క్యాంపులను నిర్వహించాలో ముందే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, దానిని అనుసరించి డాక్టర్లను అభ్యర్థిస్తుంటాను. మా నాన్న హరిరాజ్ కుమార్ రేషన్ షాప్ నిర్వహిస్తుంటారు. అక్కడకు వచ్చేవాళ్లలో దాదాపు పేదవాళ్లే ఉంటారు. వాళ్లకు అవసరమయ్యేలా క్యాంపులు నిర్వహించాను. నోటి మాట ద్వారా సాయం చేస్తూ వెళ్లడమే. దీని కోసం నేనేమీ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఎవరి నుంచీ సాయం తీసుకోవడం లేదు. నాకున్న నెట్వర్క్ ద్వారా నోటి మాట ద్వారా సాయం చేయడం ప్రస్తుతం చేస్తున్న పని. మెడిసిన్స్ అవసరం ఉన్న పేషెంట్స్కు జెనెరిక్ మెడిసిన్ ద్వారా సర్వీస్ చేయడం, నర్సుల సాయం తీసుకోవడం వంటివీ జరుగుతుంటాయి. నా టీమ్లో అందరూ స్వచ్ఛందంగా సేవ చేసేవారే. ఇంటి వద్ద ఉన్నప్పుడే కాదు గుర్గావ్లో ఉన్నా ఫోన్ కాల్ ద్వారా అవసరమైన వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తుంటాను’’ అని వివరించింది నిఖిల. ఒప్పించి.. మెప్పించాను.. అమ్మనాన్నలు ఇంజనీరింగ్ చేసి త్వరగా స్థిరపడిపోతే చాలు అనుకునేవారు. కానీ, అనుకోకుండా మెyì కల్ వైపుగా వచ్చాను. ఎమ్మెస్సీ తర్వాత గుర్గావ్లో ఇంటర్వ్యూ ఉందనే విషయం కూడా ఇంట్లో చెప్పలేదు, వద్దంటారు అనే ఆలోచనతో. అమ్మమ్మతో కలిసి ఢిల్లీ టూర్ వెళతాను అని ఒప్పించి వెళ్లాను. అక్కడ మెదంతాలో సీట్ వచ్చాక అప్పుడు విషయాన్ని చెప్పాను. నాకున్న ఆసక్తిని చూసి అమ్మనాన్నలు సరే అన్నారు. కూతురు అంత దూరంలో ఎలా ఉంటుందో అనే బెంగ వాళ్లను ఒప్పుకోనివ్వదని ఆ పని చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్కి, సర్వీస్కు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఇంత మంచి గుర్తింపు రావడం గర్వంగా భావిస్తుంటారు. – డా.కర్పూరం గోవతి నిఖిల -
ఏపీలో అమెరికా పూల సోయగాలు
సాక్షి, అమరావతి: లిసియాంతస్.. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పువ్వులు గులాబీలను పోలి ఉండే కట్ ఫ్లవర్స్. విభిన్న రంగుల్లో ఉండే ఇవి మైదాన, కొండ ప్రాంతాల్లోనే కాదు ఇంటి ఆవరణలో పూలకుండీల్లోనూ పెంచుకునేందుకు అనువైనవి. బొకేలు, అలంకరణకు ఉపయోగించే ఈ పూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఏపీలోనూ సాగు చేసేవిధంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. దేశంలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో లిసియాంతస్ పూల ను సాగు చేస్తున్నారు. వీటి సాగుకు ఆంధ్రప్రదేశ్లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలోని పాలీహౌస్లో 6 రకాల లిసియాంతస్పై పరిశోధనలు జరిపారు. పింక్, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, పికోటీ, చాంపేన్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లోను, కొండ ప్రా ంతాల్లో వేసవి కాలంలోనూ వీటిని సాగు చేయవచ్చని గుర్తించారు. ఇండోర్ డెకరేషన్కు ఉప యోగించే ఈ పూలు కనీసం ఐదారు రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటున్నాయి. అలంకరణ కోసం ఉపయోగించే ఈ పూలకు యూరోప్, చైనా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేíÙ యా, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రూ.40 లక్షల ఆదాయం వీటి పంట కాలం నాలుగు నెలలు. నర్సరీల్లో 70 నుంచి 75 రోజులు ఉంచాలి. నాటిన 60 రోజులకు పుష్పిస్తాయి. ఒక మొక్క మూడు కొమ్ములతో ఉంటుంది. కాండానికి 9 నుంచి 12 పువ్వులు వస్తాయి. సీజన్ బట్టి ఒక్కొక్క పువ్వు రూ.20 నుంచి రూ.35 వరకు పలుకుతుంది. రూ.24 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల నికర ఆదాయం పొందొచ్చు. మన ప్రాంతానికి రోసిట 3 బ్లూ పికోటీ వెరైటీ–2, ఎక్స్ కాలిబూర్ 3 బ్లూ పికోటీ, రోసిట 4 ప్యూర్ వైట్, రోసిట 3 పింక్ పికోటీ, రోసిట 4 గ్రీన్ రకాలు అనుకూలమని తేల్చారు. -
పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల గుట్టు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళ రహస్యాలను తేల్చే పరిశోధనలో భాగంగా.. పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల ఆధారాలను కనుగొన్న బృందంలో హైదరాబాద్ ఐఐటీ పరిశోదకులూ భాగస్వాములయ్యారు. ‘ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే (ఐఎన్పీటీఏ)’తోపాటు జపాన్, యూరప్ దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారని ఐఐటీ హైదరాబాద్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలోని ఆరు అత్యాధునిక రేడియో టెలిస్కోప్లను ఉపయోగించి ఖగోళాన్ని పరిశీలించామని.. పాలపుంతలో అతి తక్కువ పౌనఃపున్యం ఉన్న గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నామని తెలిపింది. ఈ వివరాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్లో ప్రచురితం అయ్యాయని పేర్కొంది. ఐఐటీ హైదరాబాద్ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ శంతన్దేశాయ్, అమన్ శ్రీవాత్సవ, ఫిజిక్స్ పీహెచ్డీ విద్యార్థి దివ్యనాశ్ కర్బందా, బీటెక్ విద్యార్థులు శ్వేత అర్ముగం, ప్రజ్ఞ మాండిపాక తదితరులు పరిశోధన బృందంలో ఉన్నారని వివరించింది. -
కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు
కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఐతే ఈ కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలో అత్యంత దుష్పరిణామాలకు దారితీస్తోంది. అందుకనే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకు మించి కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు కంపెనీలు కెఫిన్ లేని కాఫీ పొడిని తయారు చేస్తున్నాయి. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. ఆ సమస్యకు చెక్పెట్టి ఆరోగ్యకరమైన కాఫీని ఆస్వాదించేలా కెఫిన్ లేని కాఫీ గింజలను ఉత్పత్తి చేసేందుకు నాంది పలికారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు బ్రెజిలియన్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన రెండు దశాబ్దాల ప్రాజెక్టులో చాలా వరకు పురోగతి సాధించారు. ఈ పరిశోధనలు ప్రముఖ కాఫీ పరిశోధనా కేంద్రం ఇన్స్టిట్యూటో అగ్రోనోమికో డీ కాంపినాస(ఐఏఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే కాఫీ మొక్కలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. దీంతో బ్రెజిల్ వాణిజ్య పరంగా కాఫీ ప్రపంచ మార్కెట్లో పవర్హౌస్గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనేక ఏళ్లుగా కెఫిన్ కంటెంట్ తక్కువుగా ఉన్న వివిధ కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడమే గాక క్షేత్ర స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది గనుక విజయవంతమైతే అతి పెద్ద వినియోగదారులైన యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి వాటితో బ్రెజిల్కి సముచిత వాణజ్య మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక డీకాఫీన్(కెఫిన్ శాతం తగ్గించడం) తయారు చేస్తున్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించేందుకు మొగ్గు చూపతాయని అంటున్నారు. ప్రస్తుతం తాము బ్రెజిల్లో వివిధ ప్రాంతాల్లో ఈ డీకాఫిన్ మొక్కలను పెంచుతున్నామని, అవి గింజలను ఉత్పత్తి చేయడానికి సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల పడుతుందని చెబుతున్నారు. అందువల్ల తమ పరిశోధన మరింత విజయవంతం కావడానికి తాము ఇంకాస్త సమయం నిరీక్షించాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి సాధారణ కాఫీలో ఉండే కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడమే గాక రోజంతా మేల్కోని ఉండేలా శక్తినిస్తుంది. కానీ ఈ కెఫిన్ కడుపులో యాసిడ్లను పెంచి మంట లేదా గుండెల్లో నొప్పికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని నివారించేందుకే కెఫిన్ తక్కువగా ఉండే కాఫీ మొక్కలను అభివృద్ధి చేసే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ వంటి దేశాల్లో 10 శాతం కెఫిన్ ఉన్న కాఫీని తయారు చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించేందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం మాత్రం తమ పరిశోధనలు విజయవంతమవుతాయని ధీమగా చెబుతున్నారు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
అది నిగూఢ రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..
ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. వీటి రహస్యాల ముడి విప్పాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి అత్యంత వింత సరస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారిపోతున్నదో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపించినా, అవి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సమాధానాన్ని ఇవ్వలేదు. అదరగొట్టే ఉష్ణోగ్రత.. ఈ సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని కవాహ్ ఇజేన్ లేక్ అని అంటారు. ఇది చూసేందుకు ఇతర సరస్సుల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెబుతారు. ఈ నీరు 200 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగివుండటం విశేషం. ఉదయం వేళలో ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. మధ్యరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది. అలాగే మెరుస్తూ కనిపిస్తుంటుంది. ఇది ఎంతో ఆకర్షించే విషయమైనప్పటికీ, టూరిస్టులు ఇక్కడికి రాకపోవడం విశేషం. సరస్సులోని వేడి నీటి కారణంగా ఇక్కడికి వచ్చేవారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు. శాస్త్రవేత్తలు కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన రసాయన వాయువులే కారణమా? పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరస్సుపై లెక్కలేనన్ని పరిశోధనలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ ఈ నీటి వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలు తుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అగ్నిపర్వతాలు పేలడం వలన హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల రియాక్షన్ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా, రాత్రివేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదనే ప్రశ్న అలానే మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్.. ఆదాయంలో టాప్ వన్! -
ఏ కాలంలో బాగా నిద్రపడుతుందంటే..
ఎవరైనాసరే రోజంతా ఏవో ఒక వ్యాపకాలలో మునిగిపోయాక, రాత్రయ్యాక ఇంటికి చేరుకుని నిద్రిస్తారు. అయితే వాతావరణం మారినప్పుడు ఆ ప్రభావం నిద్రపై ఉంటుందనే సంగతి మీకు తెలుసా? ఈ అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికైనా సరే వేసవిలో అంత సులభంగా నిద్రరాదని, చలికాలంలో నిద్ర త్వరగా వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇంతకూ వాతావరణానికి, నిద్రకు మధ్యగల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకులు సంవత్సరంలోని వివిధ కాలాల్లో మనిషి నిద్రపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురించారు. చలికాలం ముగిసిన వెంటనే వేసవి కాలం వస్తుంది. ఈ తరుణంలో రాత్రి సమయం తగ్గి, పగటి సమయం పెరిగినట్లు అనిపిస్తుంది. దీనిని డే- లైట్ సేవింగ్ టైమ్ అని అంటారు. విపరీతమై చలికాలం ఉన్న సమయంలో రాత్రి సమయం పెరిగి, పగటి సమయం తగ్గుతుంది. దీనిని స్టాండర్డ్ టైమ్ అని అంటారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం డే-లైట్ సేవింగ్ టైమ్ నుంచి స్టాండర్డ్ టైమ్కు మారే సమయంలో చాలామందికి స్లీపింగ్ డిజార్డర్ సమస్య తలెత్తుతుంది. అయితే స్టాండర్డ్ టైమ్ నుంచి డే-లైట్ సేవింగ్ టైమ్నకు మారేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తదు. దీనిగురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెంబర్ రాన్ బీ పోస్టుమ్ మాట్లాడుతూ కాలాల మార్పు కారణంగా నిద్ర రావడంలో చాలా రోజుల పాటు మార్పులు రావు. ఇటువంటి మార్పు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ పరిశోధనలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు కలిగిన 30,097 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా నిద్రకు సంబంధించిన ప్రశ్నలను వీరిని అడిగారు. మీరు ఎంత సేపు నిద్రపోతారు? మీకు నిద్ర ఎంతసేపటిలో పడుతుంది? ఎంత ఘాడమైన నిద్ర వస్తుందనే ప్రశ్నలను వారిపై సంధించారు. వీటితో పాటు గడచిన నెలలో ఎన్నిసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందని కూడా ప్రశ్నించారు. అలాగే ఎన్నిసార్లు నిద్ర మధ్యలో లేచారు? అటువంటప్పుడు ఉదయం నిద్రపోయారా అనే ప్రశ్నలు వేశారు. ఈ పరిశోధనలో ఎవరైతే ఒకవారం వ్యవధిలో మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందో లేదా వారి నిద్ర చెదిరిపోయిందో లేదా ఉదయం త్వరగా మెలకువ వచ్చేస్తోందో వారంతా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. పరిశోధకులు కాలాల మార్పు కారణంగానూ నిద్రలో వచ్చే మార్పులపై అధ్యయనం చేశారు. వేసవిలో చక్కగా నిద్రపోయవారు 6.76 గంటలు నిద్రపోతారని, చలికాలంలో దీనికన్నా 5 నిముషాలు అధికంగా అంటే 6.84 నిముషాలు నిద్రపోతారని తేలింది. చదవండి: నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు -
అదే ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్.. 15 వేలమందిపై సర్వే.. ఆసక్తికర వివరాలు వెల్లడి!
మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాడని చెబుతారు. శాంతియుతంగా జీవించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఇదే ఉత్తమ మార్గమని పరిశోధకులు, నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ సలహాలు, సూచనల నేపధ్యంలోనే చాలామంది ప్రకృతితో మమేకమై జీవించాలనుకుంటారు. తాజాగా పరిశోధకులు ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలిపారు. సముద్రతీరంలో నివసించేవారు అరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ‘కమ్యూనికేషన్ అర్త్ అండ్ ఎన్విరాన్మెంట్’లో ప్రచురితమైన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్శిటీ ఆఫ్ వియానాకు చెందిన ఎన్విరాన్మెంటల్ సైకాలజీ గ్రూప్ చేపట్టింది. ఈ బృందానికి సాండ్రా జోయిగర్ సారధ్యం వహించారు. సముద్రతీరం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. అందుకే మనుషులు సాగరతీరంలో కాలం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చాలా దేశాలు సముద్రతీరం వెంబడి ఉన్నాయని, సాగరతీర ప్రాంతాల్లో ఉన్నవారు మిగిలినవారికన్నా ఆరోగ్యంగా ఉంటున్నట్లు తేలిందన్నారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం 1660వ సంవత్సరంలోనే దీనిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ కాలంలో ఆంగ్ల ఫిజీషియన్లు తమ దగ్గరకు వచ్చేవారికి సముద్ర స్నానం చేయాలని, సముద్రతీరంలో నడవాలని సూచించేవారు. ఈ దిశగా ప్రోత్సహించేవారు. అలాగే 19వ శతాబ్ధపు మధ్యభాగంలో యూరప్కు చెందిన ధనవంతులు సముద్ర తీరంలో సేదతీరేందుకు తహతహలాడిపోయేవారు. 20వ శతాబ్ధంలో ఈ దిశగా జనం ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడు తాజాగా పరిశోధకులు సముద్రతీరప్రాంతంలో పర్యటించడం ఆరోగ్యకరమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనకులు సముద్రతీర ప్రాంతాల్లో నివసించే 15 వేల జనాభా ఆరోగ్యంపై సర్వేచేశారు. దీనిని క్రోడీకరించి సముద్రతీరంలో నివాసం ఉండటం ఎంతో లాభదాయకమని తేల్చిచెప్పారు. -
కళ్లకు కట్టినట్టు సాక్ష్యాలు.. తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తోన్న మన చరిత్ర
సాక్షి, నాగర్కర్నూల్: తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లు, పురాతన మూలాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయా గ్రామాలకు ఉన్న పేర్లు ఎలా వచ్చాయి.. గతంలో ఎలాంటి చరిత్ర ఉండేదన్న ఆసక్తికరమైన అంశాలపై అధ్యయనం కొనసాగుతోంది. జిల్లాలో ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెబ్బేటి మల్లికార్జున్ను నియమించగా.. జిల్లాలోని డిగ్రీ కళాశాలల నుంచి ఆరుగురు అధ్యాపకులు సభ్యులుగా ఉన్నారు. వెలుగులోకి కొత్త చరిత్ర.. జిల్లాలో నెల రోజులుగా మన ఊరు– మన చరిత్ర కార్యక్రమ అధ్యయన బృందం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. వాటి చరిత్రను అవలోకనం చేసుకునేందుకు గ్రామాల్లో వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి ఫొటోలతో సహా పుస్తకాల్లో నిక్షిప్తం చేసే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామం చుట్టుపక్కల గొలుసుకట్టు చెరువులతోపాటు కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను గుర్తించారు. ఆలయాల వద్ద ఆనాటి కాలంలో తవ్విన పురాతన బావులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడి పురాతన ఆలయంలోని శివలింగం తెలుపు రంగులో ఉండటం విశేషం. అంతకు ముందు ఈ గ్రామం పేరు తుర్కలపల్లిగా ఉండగా ఈ శివలింగం కారణంగానే మహదేవునిపేటగా స్థిరపడినట్టు బృందం సభ్యులు గుర్తించారు. ఈ గ్రామంలో హిందు, ముస్లిం గురువులు వేర్వేరుగా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ అక్కడే సమాధి అయ్యారని తెలుసుకున్నారు. ఈ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని బృందం సభ్యులు అభివర్ణిస్తున్నారు. ● గంగారం సమీపంలోని గుట్టల నుంచి ఎత్తైన రాళ్లను పగులగొట్టి నందివడ్డెమాన్ ఆలయాలను నిర్మించినట్టు తెలుసుకున్నారు. వడ్డెమాన్లోని త్రికూట ఆలయాల వద్దనున్న బుద్ధుడి ప్రతిమను బట్టి అక్కడ బౌద్ధమతం సైతం విలసిల్లిందని అధ్యాపకులు భావిస్తున్నారు. గ్రామాల్లో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమం ‘ఇక్కడ కనిపిస్తున్నది బిజినేపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలోని అటవీప్రాంతం. చరిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందిన నందివడ్డెమాన్లోని ఆలయాలు, పురాతన కోట నిర్మాణం కోసం ఇక్కడి రాళ్లనే వినియోగించారు. ఈ ప్రాంతంలోని ఎత్తైన రాళ్లను పగులగొట్టిన ఆనవాళ్లు ఇప్పటికీ నాటి చరిత్రకు ఆధారంగా నిలుస్తున్నాయి’. ‘ఈ ఫొటోలో రాజసంగా కనిపిస్తున్న భవనం జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని పురాతన కోట. సుమారు 1625 సంవత్సరం నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు ఈ కోట కేంద్రంగా రెడ్లు పాలన సాగించేవారు. వట్టెం కేంద్రంగా కొంతకాలం పాటు రెడ్డి వంశస్తుల పాలన సాగిందని మన ఊరు– మన చరిత్ర పరిశోధన బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. మరింత లోతుగా పరిశోధన చేస్తే చాలా వరకు చరిత్ర బయటపడుతుందని వారు చెబుతున్నారు.’ ఆలయాలపై ప్రధాన దృష్టి.. గ్రామాల చరిత్రతోపాటు ఆయా గ్రామాల్లోని ఆలయాలపై సమగ్రంగా దృష్టిసారించి అధ్యయనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లిలో ఉన్న నారసింహుని ఆలయానికి సంబంధించిన 1171 నాటి శాసనాన్ని గుర్తించారు. 12వ శతాబ్దంలోనే 500 ఎకరాల భూమిని ఆలయానికి దానం ఇచ్చినట్టుగా శాసనంలో పేర్కొని ఉంది. ● ఒక గ్రామం గురించి అధ్యయనం మొదలుపెట్టినప్పుడు గ్రామానికి ఆ పేరెలా వచ్చింది.. గ్రామానికి ఉన్న ప్రధాన చారిత్రక మూలాలేంటి అన్నదానిపై పరిశోధన మొదలవుతుంది. క్రమంగా గ్రామ భౌగోళిక నైసర్గిక స్వరూపం, సమీపంలో ఉన్న వాగులు, సెలయేర్లు, చెరువులు, కొండల వంటి వివరాలను సమగ్రంగా తెలుసుకుని పొందుపరుస్తారు. ● గ్రామంలోని పురాతన ఆలయాలు, వాటి చరిత్ర, మతసామరస్యం వంటి అంశాలను తెలుసుకునేందుకు గ్రామంలోని వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామ పెద్దలు, పురోహితులు, ఔత్సాహికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆసక్తికర విషయాలు.. మన ఊరు– మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గ్రామాల వారీగా చరిత్రను తెలుసుకునేందుకు అధ్యయనాన్ని మొదలుపెట్టాం. క్షేత్రస్థాయి సందర్శనలో పలు గ్రామాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మనకు తెలియని ఎంతో చరిత్ర దాగి ఉంది. వివిధ వర్గాల సహకారంతో విడతల వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుత తరం వారిలో తమ ఊరి పట్ల మమకారం మరింత పెరుగుతుంది. – మల్లికార్జున్,ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ -
వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతన వైద్య విధానాలపై పరిశోధనలు చేసేలా వైద్యులు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పరిష్కారాలపై ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందుకు కళాశాలలో మల్టిడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(ఎంఆర్యూ)ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా వివిధ విభాగాల్లోని వైద్యులు, పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. అందుకయ్యే ఖర్చును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేయనుంది. అయితే ముందుగా పరిశోధనలకు కళాశాల ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొందాలి. ఇలా అనుమతి పొందిన పరిశోధనలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏం పరిశోధనలు చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తారు? ఏ అంశంపై చేస్తారు? అనే వివరాలను పేపర్ ప్రజెంటేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంది. వీటిని వైద్య కళాశాలలోని ఎథికల్ కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపుతారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక పరిశోధనలు ప్రారంభించవచ్చు. పలు విభాగాల్లో పరిశోధనలు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటికే ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేశారు. ప్రస్తుతం కమ్యూనిటీ మెడిసిన్(ఎస్పీఎం)లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అలాగే పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలకు ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది. క్లినికల్ రీసెర్చ్ సైతం.. ఔషధ రంగంలో కొత్తగా కనిపెట్టిన మందుల పనితీరుపై కూడా సిద్ధార్థ వైద్య కళాశాలలో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్నారు. ఆయా వ్యాధులకు మందులు ఎలా పనిచేస్తున్నాయి? వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటికి సైతం ముందుగా ఎథికల్ కమిటీ నుంచి అనుమతులు తప్పనిసరి. అలాగే రోగి అంగీకారం కూడా అవసరం. కాగా కళాశాలలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా సోకే వ్యాధుల జీన్స్, ఏ రకం వ్యాధి అనేది గుర్తించనున్నారు. కరోనాలో కొత్త వేరియెంట్లతో పాటు హెచ్3ఎన్2 వైరస్ వంటి వాటిని కూడా గుర్తించే సదుపాయం ఉంది. అందుబాటులోకి నూతన వైద్య విధానాలు ఇప్పటివరకు వివిధ వ్యాధులకు ఎక్కడో చేసిన పరిశోధనల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. అలా కాకుండా మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పద్ధతులపై ఇక్కడే పరిశోధనలు చేయడం ద్వారా నూతన వైద్య విధానాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు చేసే పరిశోధనల్లో వైద్య విద్యార్థులు సైతం భాగస్వాములు కానుండటంతో వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చదువుకునే సమయంలోనే పరిశోధనలపై పట్టు సాధించడంతో పాటు కొత్త విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కొత్త చికిత్సలపై అవగాహన పెరుగుతుంది.. వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో పరిశోధనలతో వైద్య విద్యార్థుల్లో పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. నూతన వైద్య విధానాలు, కొత్త చికిత్సలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తయ్యాయి. పరిశోధనల కోసం వైద్య కళాశాలలో ప్రత్యేకంగా మలీ్టడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ను ఏర్పాటు చేశాం. –డాక్టర్ కంచర్ల సుధాకర్, ప్రిన్సిపాల్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ -
అధిక దిగుబడి, అత్యధిక ప్రొటీన్ @ బీపీటీ 2848
సాక్షి ప్రతినిధి, బాపట్ల: దేశంలోనే మొదటిసారిగా అత్యధిక ప్రొటీన్ అందించే అరుదైన వరి వంగడాన్ని బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సృష్టించారు. 12 ఏళ్లపాటు విస్తృత పరిశోధనలు చేసి అధిక దిగుబడి.. అత్యధిక ప్రొటీన్ అందించే వరి వంగడాలకు రూపకల్పన చేశారు. వీటిని బీపీటీ 2848 పేరుతో పిలుస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్లో దీన్ని నమోదు చేశారు. ఇలా ఒక కొత్త వంగడాన్ని సృష్టించి నమోదు చేయడం ఇదే ప్రథమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి నల్ల రకం వరి విత్తనంగా బీపీటీ 2848ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆర్బీ బయో 2026/ఐఆర్జీసీ 48493 రకం వంగడాన్ని సంకరం చేసి ఈ కొత్త వంగడాన్ని సృష్టించారు. ఈ విత్తనాల పంట కాలం 125 నుంచి 130 రోజులు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే దేశీయ రకాల్లో నల్ల రకం ఉన్నా అవి ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి ఉండటం లేదు. సగటున 12 బస్తాలకు దిగుబడి మించే పరిస్థితి లేదు. పైగా ఇవి లావు రకాలు. కొత్తగా రూపొందించిన బీపీటీ 2848 సన్నరకం వంగడాలతో ఎకరానికి 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఈ సన్న రకం 1,000 బియ్యపు గింజల బరువు 13 గ్రాములు మాత్రమే ఉంటుంది. తినడానికి రుచిగా, అనువుగా ఉంటాయి. మిగిలిన వరి రకాల్లో ప్రొటీన్ల శాతం 6 నుంచి 7 శాతానికి మించదని.. బీపీటీ 2848 ముడి బియ్యంలో 13.7 శాతం ప్రొటీన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ముడి బియ్యాన్ని పాలిష్ చేసినా 10.5 శాతం తగ్గకుండా ప్రొటీన్లు ఉంటాయని పేర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో పరిశోధనలు.. బీపీటీ 2848 రకం వంగడంపై జాతీయ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో పరిశోధనలు చేశారు. అన్నిచోట్లా శాంపిల్స్ తీసి కటక్ (ఒడిశా)లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఆర్ఆర్ఐ)లో పరీక్షించారు. బీపీటీ 2848లో సగటున 10.5 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు స్పష్టమైంది. గతంలో ఒడిశాలో సీఆర్ధన్ 310 రకం వంగడాన్ని అక్కడి శాస్త్రవేత్తలు సృష్టించారు. దీంట్లోనూ 10.5 శాతం ప్రోటీన్లు ఉన్నాయి. అయితే అది లావు రకం గింజ. అన్ని ప్రాంతాల వారు దాన్ని తినలేరు. ఇందుకు భిన్నంగా బాపట్ల వరి పరిశోధన కేంద్రం బీపీటీ 2848 వంగడాన్ని సృష్టించింది. ఈ విత్తనాలను వచ్చే ఏడాది నుంచి రైతులకు అందించనుంది. అత్యధిక ప్రొటీన్లు అందించే రైస్.. బీపీటీ 2848 రకం కొత్త వంగడాన్ని 12 ఏళ్ల కృషితో బాపట్ల వరి పరిశోదన కేంద్రంలో సృష్టించాం. ఇది బ్లాక్ రైస్. దేశంలోనే అత్యధిక ప్రొటీన్లు అందించే సన్నరకం రైస్ ఇవే. తినటానికి అనువుగా ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన కేంద్రం -
రైతులకు అండగా వ్యవసాయ పరిశోధనలు
రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): వ్యవసాయ పరిశోధనలు రైతులకు అండగా నిలుస్తున్నాయని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐసీఏఆర్) శాస్త్రవేత్త డాక్టర్ కె.క్రాంతి అన్నారు. పంటల్లో నెమటోడ్స్(నులిపురుగులు) నివారణపై పరిశోధనలు చేస్తున్న ఆమె.. ఆలిండియా కోఆర్డినేటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రంపచోడవరం మండలం పెదపాడులో డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్–కొవ్వూరు నిర్వహించిన ‘ఉద్యాన పంటలను ఆశించే నులిపురుగుల నివారణ అవగాహన’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. దేశంలోని ఒకటి, రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా అన్ని చోట్లా నెమటోడ్స్పై పరిశోధన సెంటర్లు ఉన్నాయని చెప్పారు. 1977 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో సర్వే చేసి హాట్స్పాట్లను గుర్తించి.. వాటి నివారణకు కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు పంటలను పట్టిపీడిస్తున్న నెమటోడ్స్ నివారణకు 200 రకాల విధానాలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. నెమటోడ్స్తో భారీగా నష్టం.. నెమటోడ్స్ మొక్కల వేర్లపై బుడిపెలుగా వస్తాయని.. ఇవి మొక్క పై భాగానికి నీరు వెళ్లకుండా అడ్డుకుంటాయని వివరించారు. దీంతో మొక్కలు ఎండిపోతాయని తెలిపారు. ఉద్యాన పంటల్లో రూట్ నెమటోడ్స్ ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పాలీహౌస్, షెడ్ నెట్లలో పెంచే కూరగాయ పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లుతోందని చెప్పారు. పంజాబ్, హరియాణా, జమ్మూ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో రైతులు రూ.కోట్లు నష్టపోయారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో నెమటోడ్స్ వల్ల 90 శాతం పంట నష్టం జరుగుతుండగా.. ఏపీ, తెలంగాణలో నష్టం 10 శాతంగా ఉందని చెప్పారు. వీటిని నివారించాలంటే.. ఉత్తర భారతదేశంలో అయితే మే, జూన్ నెలల్లో, దక్షిణ భారతదేశంలో ఏప్రిల్, మే నెలల్లో పాలీహౌస్లలో కొద్దిగా తడి ఉండేలా 25 మైక్రాన్ మందం కలిగిన పాలిథిన్ కవర్లు పరచాలని సూచించారు. రెండు కేజీల బయో ఏజెంట్, పది గ్రాముల ఎఫ్ఐఎం పిచికారీ చేసి పాలీహౌస్ను మూసివేయాలన్నారు. క్రాప్కు ముందు రెండు నెలలపాటు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పంట మారి్పడి, కూరగాయల పంట మధ్యలో పూల మొక్కలు నాటడం ద్వారా కూడా వీటిని అడ్డుకోవచ్చన్నారు. -
వాన దంచికొడితే ఆగమాగమే! మరి 20 లక్షల ఏళ్లపాటు కురిస్తే.. ఏంటి పరిస్థితి?
వాన అంటే అందరికీ ఇష్టమే. అదీ రెండు, మూడు రోజులు పడితే ఓకే.. మరి వారం పాటు దంచికొడితే!? అమ్మో.. అంతా ఆగమాగమే అంటారు కదా! అదే కొన్నేళ్లపాటు వానలు పడితే.. అలా వేలు, లక్షల ఏళ్లపాటు కురుస్తూనే ఉంటే.. వామ్మో అనిపిస్తోందా? కానీ ఇది నిజమేనని, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అంత వాన ఎక్కడ పడింది? ఎందుకు పడింది? దాని వల్ల ఏం జరిగిందనే సంగతులు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమి పొరలను పరిశీలిస్తుండగా.. 1970వ దశకంలో కొందరు శాస్త్రవేత్తలు భూఉపరితలానికి సంబంధించి పరిశోధనలు చేస్తుండగా.. పురాతన రాళ్లలో అసాధారణమైన బూడిద రంగు పొరలను గమనించారు. అవి సిలికా (ఇసుక), మట్టితో ఏర్పడ్డాయని.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఇలా ఉన్నాయని గుర్తించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి.. సుమారు 23 కోట్ల ఏళ్ల కింద ఆ పొరలు ఏర్పడినట్టు తేల్చారు. అవి ఇసుక, మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురై ఏర్పడినట్టు నిర్ధారించారు. ఈ పొరల మందం, అవి మొదలై, ముగిసిన సమయాన్ని అంచనా వేసి.. సుమారు 20 లక్షల ఏళ్ల పాటు నిరంతరం వాన కురవడంతో అలా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా ఒకే ఖండంగా ఉన్నప్పుడు.. 23 కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే అతిపెద్ద ఖండం ‘పాంజియా’గా ఉండేది. అప్పటిదాకా వానలు తక్కువగా ఉండి.. వేడి వాతావరణం కొనసాగింది. ఆ సమయంలో గ్రహ శకలాలు ఢీకొనడం, భూమి పైపొరలోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలు తీవ్రమై అతిభారీ స్థాయిలో అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరిగాయి. వాతావరణంలోకి చేరిన పొగ, దుమ్ము, ధూళి వల్ల ఒక్కసారిగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. సముద్రాల్లో నీరు వేడెక్కి ఆవిరై.. గాలిలో ఆవిరి శాతం (హ్యూమిడిటీ) బాగా పెరిగింది. ఆ గాలులు ‘పాంజియా’ వైపు వీయడం, చల్లబడి వానలు కురవడం మొదలైంది. ఇదిలా 20 లక్షల ఏళ్లపాటు కొనసాగింది. ఈ పరిస్థితులు, తర్వాతి పరిణామాలకు ‘కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్’గా పేరుపెట్టారు. తొలుత నాశనం.. ఆ తర్వాత సృష్టి.. కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ మొదట్లో జీవరాశుల నాశనానికి దారి తీసింది. ఉష్ణోగ్రతలు, విషవాయువులు పెరగడంతో మొక్కలు, చెట్లు, జంతువులకు సమస్యగా మారింది. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన విషవాయువులు, దుమ్ము మేఘాల్లో కలిసి ఆమ్ల వర్షాలు (యాసిడ్ రెయిన్స్) కురిశాయి. అటు సముద్రాల్లో నీరు వేడెక్కడం, ఆమ్లత్వం పెరగడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో జలచరాలూ తగ్గిపోయాయి. మొత్తంగా దాదాపు 80శాతానికిపైగా జీవరాశి అంతరించినట్టు అంచనా. అయితే కార్నియన్ ఈవెంట్ చివరిదశకు వచ్చేప్పటికి ఖండాలు విడివడటం మొదలై.. అగ్ని పర్వతాల విస్ఫోటనాలు తగ్గిపోయాయి. భూమ్మీద వేడి తగ్గిపోయింది. వానలు ఒక క్రమానికి పరిమితమై.. జీవానికి అనుకూలమైన, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఇది మొక్కలు, జంతువులు సహా ఎన్నో కొత్త జీవరాశుల పునరుత్థానానికి దారితీసింది. డైనోసార్ల ఆధిపత్యానికి తోడ్పడి.. కార్నియన్ ఈవెంట్ మొదలయ్యే నాటికే డైనోసార్లు, పలు ఇతర జీవరాశుల ఎదుగుదల మొదలైంది. ఈవెంట్ నాటి పరిస్థితులను బాగా తట్టుకోగలిగిన డైనోసార్లు.. ఈవెంట్ తర్వాత బాగా ప్రయోజనం పొందాయి. వాటిలో ఎన్నో ఉప జాతులు ఉద్భవించి జీవరాశిపై ఆధిపత్యం చలాయించాయి. ఇదే సమయంలో జీవ పరిణామం బాగా వేగం పుంజుకుంది. తాబేళ్లు, మొసళ్లు, బల్లులు వంటివాటితోపాటు పాలిచ్చి పెంచే వివిధ రకాల జీవులు (మమ్మాల్స్) అభివృద్ధి చెందాయి. భూమ్మీద ఇప్పుడున్న జీవంలో చాలా వరకు ‘కార్నియన్ ఫ్లూవియల్ ఈవెంట్’ నాటి పరిస్థితులే తోడ్పడ్డాయని భూతత్త్వ, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త అలస్టేర్ రఫెల్, పురాతత్త్వ శాస్త్రవేత్తలు (పేలియోన్విరాన్మెంటిస్ట్స్) జకొపో డాల్ కోర్సో, పాల్ విగ్నల్ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలు ఇటీవల న్యూసైంటిస్ట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అక్కడ 20 లక్షల ఏళ్లుగా వానలే లేవు.. ఒకప్పుడు 20 లక్షల ఏళ్లు వాన పడితే.. అసలు గత20 లక్షల ఏళ్లుగా చుక్క వాన పడని ప్రాంత మూ ఒకటుంది తెలుసా.అంటార్కిటికాలో మెక్మర్డో డ్రైవ్యాలీగా పిలిచేచోట దాదాపు 20 లక్షల ఏళ్లుగా వాన, మంచు వంటివేవీ కురవలేదని శాస్త్రవేత్తలు గత ఏడాదే నిర్ధారించారు. అతి తక్కువ హ్యూమిడిటీ, డ్రైవ్యాలీకి చుట్టూ ఉన్న పెద్ద కొండలు, గాలులు వీచే దిశ వంటివి దీనికి కారణమని తేల్చారు. -
ప్రొఫెసర్ సాహసం.. నీటి అడుగులో 100 రోజులు! అన్నీ అక్కడే..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ కళాశాల ప్రొఫెసర్ ఓ పరిశోధన కోసం నీటి అడుగున నివసిస్తున్నారు. 55 చదరపు మీటర్ల నీటి ఆవాసం, ఉపరితలం నుండి దాదాపు 30 అడుగుల లోతున జీవిస్తున్నారు. మానవ శరీరం దీర్ఘ కాలంపాటు విపరీతమైన ఒత్తిడికి గురైతే ఎలా స్పందిస్తుందనే విషయంపై అధ్యయనంలో భాగంగా ఈ సాహసం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈయన సూపర్ హ్యూమన్గా అవతరించి అరుదైన ఘనత సాధించనున్నారు. వినూత్న పరిశోధన చేస్తున్న ఈ ప్రొఫెసర్ పేరు జోసెఫ్ డిటూరి. వయసు 55 ఏళ్లు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తరగతులను బోధిస్తున్నారు. ఇంతకుముందు 28 ఏళ్ల పాటు అమెరికా నౌకాదళంలో డైవర్గా పనిచేశారు. 2012లో కమాండర్గా పదవీ విరమణ చేశారు. అయితే గతంలో ఒకరు 73 రోజుల పాటు నీటి అడుగున జీవించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టి 100 రోజులు నీటిలోనే జీవించాలని జోసెఫ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రయోగం 30 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ప్రొఫెసర్ ఆరోగ్యాన్ని, ముఖ్యమైన అవయవాల పనితీరును వైద్యులు ఎప్పటికప్పడు నిశితంగా గమనిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే తరచూ వైద్య పరీక్షలు కూడా చేస్తూ ప్రొఫెసర్ ఆరోగ్యంపై డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. 'మిలిటరీలో తన తోటి సైనికులు చాలా మంది బాధాకరమైన మెదడు గాయాలకు గురయ్యారు. హైపర్బారిక్ ప్రెజర్ సెరిబ్రల్ రక్త ప్రవాహాన్ని పెంచుతుందని వారికి బాగా తెలుసు. మెదడు గాయాలకు చికిత్స చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. వారికి ఎలా సహాయం చేయాలో నేర్చుకోవాలనుకున్నా. సముద్రంలో కనుగొనబడని జీవులలో అనేక వ్యాధులకు చికిత్స దొరుకుతుందని అనుకుంటున్నా' అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ ప్రయోగాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇది విజయవంతం అయితే సరికొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్ చేశారు. చదవండి: చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్కే మద్దతు అని ప్రకటన -
రాష్ట్రంలోవిత్తన పరిశోధన, శిక్షణ సంస్థ
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలి విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల వ్యయంతో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ విత్తన పరిశోధన, శిక్షణా కేంద్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి విత్తన జన్యు బ్యాంక్, సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, విత్తనాలు నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మించనుంది. రైతుల కోసం ట్రైనింగ్ సెంటర్తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిపొ్లమా చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగు వేసే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సంస్థ లక్ష్యాలివే.. రాష్ట్రంలో విత్తన నాణ్యతను పరీక్షించే నెట్వర్క్ను బలోపేతం చేయడం, మానవ వనరుల అభివృద్ధి, సీడ్ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థలతో సమన్వయం చేసుకోవడం, ఏటా కనీసం 1,000 మంది అగ్రి గ్రాడ్యుయేట్స్, 2 వేల మంది అగ్రి డిపొ్లమా విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ఈ కేంద్రం సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాగా, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు మాట్లాడుతూ.. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగేలా, అధిక దిగుబడులనిచ్చే కొత్త రకాల విత్తనాలను రూపొందించడంలో, సంకర జాతులను అభివృద్ధి చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. -
6జీ.. భారత ఆత్మవిశ్వాస ప్రతీక: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ సంఘం(ఐటీయూ) ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్ సెంటర్ను బుధవారం ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ దేశంలోకి 5జీ సేవలు మొదలైన 6 నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధన మొదలవుతోంది. ఇది భారత ఆత్మవిశ్వాసానికి దర్పణం పడుతోంది. 4జీ కంటే ముందు టెలికం సాంకేతికతలో భారత్ కేవలం ఒక యూజర్గా ఉండేది. కానీ ఇప్పుడు భారీ టెలికం టెక్నాలజీని ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా అభివృద్ధిని సాధించిన టెక్నాలజీ వైపు ప్రపంచం దృష్టి సారించింది. ఇది భారత సాంకేతిక దశాబ్దం ‘సమ్మిళిత సాంకేతికత వల్లే డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ, జన్ధన్, ఆధార్, బ్రాడ్బ్యాండ్ సేవలు సాధ్యమయ్యాయి. టెలికం టెక్నాలజీ భారత్లో కేవలం శక్తి మాధ్యమం మాత్రమేకాదు సాధికారతకు సోపానం. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 85 కోట్లకు పెరిగింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో మొత్తంగా 25 లక్షల కి.మీ.ల ఆప్టికల్ ఫైబర్ వేశాం. త్వరలో వంద 5జీ ల్యాబ్లు ఏర్పాటుచేస్తాం. దేశీయ అవసరాల తీర్చేలా 5జీ అప్లికేషన్లను ఇవి అభివృద్ధిచేస్తాయి. దేశంలో 5జీ సేవలు మొదలైన 120 రోజుల్లోనే 125 నగరాలకు విస్తరింపజేశాం. ఈ దశాబ్దం భారత సాంకేతికదశాబ్దం(టెక్ఏడ్)’ అని మోదీ అభివర్ణించారు. -
ఎలుకలు కరోనా వేరియంట్ని వ్యాప్తి చేస్తాయ్! అధ్యయనంలో వెల్లడి
గత రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడి యథాస్థితికి వస్తోంది. ఐతే అసలు ఈ వైరస్ ఎలా వచ్చింది అనే దానిపై ఇప్పటికే శాస్తవేత్తలు పలు ఆసక్తికర పరిశోధనలు చేస్తునే ఉన్నారు. ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా ఈ పరిశోధనలు చేయమని ప్రోత్సహించడమే గాక తద్వారా భవిష్యత్తులో ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా బయటపడొచ్చు అని సూచించింది. అందులో భాగంగానే చేసిన పరిశోధనల్లో ఎలుకలు కరోనా మహమ్మారిని వ్యాప్తి చేయగలవని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు పరిశోధకులు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎలుకలు మూడు రకాల కోవిడ్ వేరియంట్లకు లోనైనట్లు పేర్కోన్నారు. ఈ విషయాన్ని అమెరికన్ సోసైటీ ఫర్ మైక్రోబయాలజీ ఓపెన్ యాక్సెస్ జర్నల్ వెల్లడించింది. పరిశోధనల్లో ఎలుకలకు సార్క్ కోవిడ్2, ఆల్ఫా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అందుకోసం మురుగునీటి ప్రదేశాలు ఉన్న ప్రాంతాల నుంచి సేకరించిన ఎలకలను బంధించి పరిశోధనలు నిర్వహించారు. ఆ పరిశోధనల్లో సుమారు 79 ఎలుకల్లో దాదాపు 13 ఎలుకలకు సార్స్ కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో యూఎస్ ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ఈ ఎలుకలు అంటువ్యాధులను వ్యాప్తి చేయగలవని తమ అధ్యయనంలో తేలిందని డాక్టర్ హెన్రీ వాన్ చెప్పారు. అలాగే ఈ పరిశోధనలు.. ఎలుకల్లో కరోనా ఎలా పరిణామం చెందుతుంది, అది మానువులకు ప్రమాదం కలిగించేలా రూపాంతరం చెందే అవకాశం ఉందా? అనేదాని గురించి తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని చెప్పారు. ఎలుకలకు వచ్చిన కరోనా మహమ్మారి మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మానవులను ప్రభావితం చేసిన ఈ కరోనా మహమ్మారి విషయంలో జంతువులు కూడా కీలక పాత్ర పోషిస్తాయనే దానిపై అధ్యయనం చేయడం ద్వారా మానవులతోపాటు జంతువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలమని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, జంతువుల నుంచి మానవులకు కరోనా సంక్రమించడం అత్యంత అరుదని సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. కరోనాకు కారణమైన సార్స్ కోవిడ్2 ప్రజలకు వ్యాప్తి చేయడంలో జంతువులు ముఖ్యపాత్ర పోషిస్తాయనేందుకు సరైన ఆధారాలు మాత్రం లేవని సీడీసి వెల్లడించింది. కానీ ఈ మహమ్మారి సోకిన క్షీరద జంతువులతో సంబంధం ఉన్న ప్రజలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు వెల్లడించాయని సీడీసీ తన వెబ్సెట్లో పేర్కొంది. ఇంతకుముందు హాంకాంగ్, బెల్జియంలో ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో కరోనా వైరస్ బారిన పడినట్లు కనుగొన్నారు శాస్తవేత్తలు. కానీ కరోనా వేరియంట్కి సంబంధించిన అధ్యయనాల్లో మాత్రం పూర్తి స్ధాయిలో స్పష్టత రావాల్సి ఉంది. అలాగే పిల్లులు, కుక్కలు, ప్రైమేట్స్, హిప్పోలు, జింకలు, యాంటియేటర్లు వంటి వాటికి కరోనా సోకినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి కూడా! (చదవండి: వరదలతో అతలాకుతలమైన కాలిఫోర్నియా..ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్) -
చీమలు పెట్టవు... పాములు ఉండవు!
చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లని సుమతీ శతకకారుడు బద్దెన సెలవిచ్చినా నిజానికి చీమలు పుట్టలను తయారు చేయవు.. పాములూ వాటిని ఆక్రమించి నివసించవు. పుట్టలు చెదపురుగుల ఆవాసాలు. కొన్ని రకాల చీమలు చెదపురుగులను ఆహారంగా తీసుకునే క్రమంలో పుట్టల్లోకి చొరబడతాయి. పాములు, ఇతర సరీసృపాలు రక్షణ కోసం తాత్కాలికంగా పుట్టల్లో తలదాచుకుంటాయి. – (సాక్షి, ఏపీ నెట్వర్క్, ఆత్మకూరు రూరల్) మండు వేసవిలోనూ గది ఉష్ణోగ్రత.. పంట పొలాలు, అడవుల్లో భిన్న ఆకారాల్లో పుట్టలు సాధారణం. పిరమిడ్ ఆకారం, భూమికి కొద్ది ఎత్తులో మట్టి కుప్పల్లా పుట్టలు ఏర్పడుతుంటాయి. పైకి ఎంత ఎత్తులో కనిపిస్తాయో భూగర్భంలోనూ అంతే లోతులో గదులుంటాయి. మండు వేసవైనా, ఎముకలు కొరికే చలి కాలమైనా పుట్టల్లో కచ్చితంగా 24 డిగ్రీల సాధారణ గది ఉష్ణోగ్రత ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. కుండపోత వర్షాలకు సైతం ఒక్క చుక్క నీరు కూడా పుట్టల్లోకి వెళ్లకపోవడం, మట్టితో నిర్మించినవే అయినా కరిగిపోకుండా ఉండటం మరో విశేషం. పుట్టల నిర్మాణంపై శాస్త్రవేత్తలు ఇప్పుడు విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ.. అడవుల్లో వృక్షాలకు అవసరమైన సేంద్రియ పోషకాలను పుట్టల్లో ఉండే చెద పురుగులే అందిస్తాయి. చెదపురుగులు కీటక విభాగానికి చెందిన జీవులు. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 వేల జాతులున్నాయి. రాలిపోయిన ఆకులు, పడిపోయిన చెట్ల భాగాలను అత్యంత వేగంగా తింటూ విసర్జకాలను విడుస్తుంటాయి. తద్వారా వృక్షాలకు కంపోస్టు ఎరువు లభ్యమవుతుంది. కొన్ని రకాల వృక్ష జాతుల కణజాలంలోని సెల్యులోజ్ను ఆహారంగా తీసుకోవడం ద్వారా వాటిలో పరిమితికి మించి పీచు (ఫైబర్) పదార్థం పెరగకుండా నిరోధిస్తాయి. సరీసృపాలకు రక్షణ దుర్గాలు.. సరీసృపాలైన పాములు, తొండలు, బల్లులు, ఉడుములు తమ సహజ శతృవులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునేందుకు మాత్రమే పుట్టల్లో తలదాచుకుంటాయి. ఎలుగుబంట్లు పుట్టలను తవ్వి చెదలను ఆహారంగా తీసుకుంటాయి. ప్రకృతి ఇంజనీరింగ్.. జింబాబ్వే రాజధాని హరారేలో ఓ సంస్థ తన కార్యాలయం, షాపింగ్ మాల్ కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవనంలో సాధారణ ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఎలాంటి విద్యుత్ ఉపకరణాలను వినియోగించకుండా నిర్మాణం పూర్తి చేసింది. సివిల్ ఇంజనీర్ మైక్ పియర్స్ పుట్టలను అధ్యయనం చేసి ప్రకృతి ఇంజనీరింగ్ను అనుసరించడంతో ఇది సాధ్యమైంది. భూతాపం, కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇప్పుడు ప్రపంచమంతా ఏసీలు, హీటర్లు అవసరం లేని ఇళ్ల నిర్మాణం వైపు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో పుట్టల నిర్మాణంలో దాగున్న ప్రకృతి ఇంజనీరింగ్ విధానాలను అధ్యయనం చేస్తున్నారు. పర్యావరణానికి జీవధాతువులు ప్రకృతి పచ్చగా ఉందంటే వృక్షాలే కారణం. ఎవరూ ఎరువులు వేయకుండా అడవుల్లో అపార వృక్ష సంపద విస్తరించటానికి కారణం పుట్టలు, అందులో ఉండే చెద పురుగులే. రాలిన ఆకులు, వృక్ష సంబంధ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి చెట్లకు అందించడంలో చెద పురుగులు అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. వృక్షాల ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలన్నీ చెద పురుగులు అందించే సేంద్రియ ఎరువుల్లో ఉన్నాయి. – అలెన్ చోంగ్ టెరాన్, డిప్యూటీ డైరెక్టర్, టైగర్ప్రాజెక్టు, ఆత్మకూరు పుట్టలు ధ్వంసం చేయొద్దు పుట్టల్లో పాములుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. పొలం గట్లపై ఉండే పుట్టలను రైతులు ధ్వంసం చేస్తుంటారు. అది సరికాదు. పుట్టల్లో ఉండే చెదలు వ్యర్థాలను సేంద్రియాలుగా మార్చి సాగు భూమిని సారవంతం చేస్తాయి. – విజయకుమార్, డైరెక్టర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -
వయాగ్రా అంత డేంజరా? ట్యాబ్లెట్ వేసుకుని మందు తాగిన వ్యక్తి 24 గంటల్లోనే..
న్యూఢిల్లీ: వయగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24 గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి భారత పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి రెండు వయగ్రా ట్యాబ్లెట్లు వేసుకుని అదే సమయంలో ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురు సభ్యులతో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు దీనిపై కేస్ రిపోర్ట్ను గతేడాది సెప్టెంబర్లో రూపొందించారు. దీన్ని ఈ వారమే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ నివేదిక ప్రచురణకు కూడా ఆమోదం పొందింది. అయితే పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత జర్నల్లో ప్రచురించనున్నారు. వయగ్రా తీసుకుని మద్యం తాగడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనే విషయంపై ఈ పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఈ ఘటనలో మరణించిన 41 ఏళ్ల వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి శస్త్రచికిత్సలు కూడా జరగలేదని గుర్తించారు. ఇతడు చనిపోవడానికి ముందు రోజు తన స్నేహితురాలితో హోటల్లో ఉన్నాడు. రెండు వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం వల్లే అతను చనిపోయినట్లు తేలింది. మెదడులో గడ్డకట్టిన రక్తం 300 గ్రాములు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అలాగే అతని హార్ట్ వాల్స్ గట్టిపడటంతో పాటు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన అవసరం.. దీంతో వైద్యుల సూచన లేకుండా వయగ్రా వాడకూడదని పరిశోధకులు హెచ్చరించారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయంపైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం ఏంది నాయనా..? -
ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎక్కువగా ఆలోచించడం వంటి ఇతరత్రా కారణాల వల్ల కొంతమందికి రాత్రివేళ త్వరగా నిద్రపట్టదు. ఒక్కోసారి తీరకలేక రోజంతా మెళకువతో ఉండి నిద్రకు దూరమవుతారు. ఇలా ఒక్క రోజు నిద్రలేకపోతే ఏమవుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు చేసిన పరోశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మనిషి ఒక్కరోజు నిద్రకు దూరమైతే మెదడు నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఓ పరిశోధన వెల్లడించింది. మన వయసు 1-2 ఏళ్లు పెరిగనట్లుగా మెదడు వ్యవహరిస్తుందని ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ఈ పరిశోధనలో తేలిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. నిద్ర లేనప్పుడు మెదడులో వచ్చిన మార్పులు, మళ్లీ గాఢంగా నిద్రపోతే యథావిధిగా మారుతాయని వెల్లడైంది. అంటే మనం ఒక రోజు నిద్రపోకపోతే వచ్చిన మార్పులు.. ఆ తర్వాత రోజు బాగా నిద్రపోతే తొలగిపోతాయి. మెదడు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ పరిశోధనను 'జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్' ఇటీవలే ప్రచురించింది. అయితే రోజుకు కనీసం మూడు, ఐదు, 8 గంటలు నిద్రపోతే మెదడులో ఎలాంటి మార్పులు కన్పించలేదని ఈ పరిశోధన స్పష్టం చేసింది. కానీ తక్కువ నిద్రవల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈ పరిశోధనలో మొత్తం 134 మంది ఆరోగ్యవంతమైన వలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో 42 మంది మహిళలు కాగా.. 92 మంది పురుషులు. వయసు 19-39 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరందరినీ ఐదు బ్యాచ్లుగా చేసి ఒకరోజు మొత్తం నిద్రలేకపోతే ఎలా ఉంటుంది? రోజులో మూడు గంటలు, ఐదు గంటలు, 8 గంటలు మాత్రమే పడుకున్నప్పుడు ఎలా ఉంటుందని పరిశోధన జరిపారు. దీనికోసం మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ఉపయోగించారు. చదవండి: వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్ -
గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా! ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: గుంజీలు.. ఈ తరం పిల్లలకు పెద్దగా తెలియనప్పటికీ నిన్నటితరం వారికి మాత్రం ఈ పేరు చెప్పగానే బడిలో ఉపాధ్యాయులు విధించిన ‘శిక్ష’ గుర్తొస్తుంది. అయితే నాటి ‘దండన’ వెనకున్న శాస్త్రీయతను చాలా మంది అపార్థం చేసుకోవడంతో ఇదో పెద్ద పనిష్మెంట్గాగా ముద్రపడినా పాశ్చాత్య దేశాలు మాత్రం దీని అంతరార్థాన్ని, విద్యార్థులకు కలిగే ఉపయోగాలను గుర్తించాయి. దీన్ని ‘సూపర్ బ్రెయిన్ యోగా’గా పిలుస్తూ నిత్యం గుంజీలు తీయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు ఇది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పెంచే విధానమంటూ ఆధునిక పరిశోధకులు సైతం రుజువు చేశారు. జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత పెరుగుతాయి.. చదువుపై శ్రద్ధ, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమస్య పరిష్కారం, అభ్యసన మెరుగవ్వడం గుంజీల వల్లే సాధ్యమని నిరూపించారు. కరోనా తర్వాత విద్యార్థుల్లో పరీక్షలంటే భయం, ఏకాగ్రత కోల్పోవడం, బోధన సమయంలో ధ్యాస లేకపోవడం వంటివి వేధించే సమస్యలు. గుంజీల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. గతంలోనే శాస్త్రీయంగా నిర్ధారణ... ఆలోచన శక్తికి కేంద్ర బిందువు మెదడే. చెవి కొనలు మెదడుకు రిమోట్ కంట్రోల్లా పనిచేస్తాయి. రెండు చెవి కొనలను పట్టుకొని లాగుతూ గుంజీలు తీయడం వల్ల నాడులు స్పందిస్తూ మెదడుకు సంకేతాలు వెళ్తాయి. గుంజీలు తీసేటప్పుడు తీసుకొనే శ్వాస, ఆక్యుప్రెషర్ క్రియల వల్ల మెదడు కుడి భాగాలు ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా పిట్యూటరీ గ్రంథి శక్తివంతమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పాల్ నోగియర్ గతంలోనే శాస్త్రీయంగా నిరూపించారు. గుంజీల వల్ల మెదడులోని ఆల్ఫా తరంగాలు క్రియాశీలత పెరిగి, భావోద్వేగ స్థిరత్వం, మానసిక స్పష్టత, మెరుగైన సృజనాత్మకతకు దోహదపడుతుందని, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తేల్చారు. పరిశోధనలేం చెప్పాయి? ► కాలిఫోరి్నయో రేడియాలజీ డాక్టర్ జోయ్ పి జోన్స్ పరిశోధన ప్రకారం... మెదడుకు చెందిన ఆక్యుప్రెషర్ బిందువులు చెవి భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. గుంజీలు తీయడం వల్ల మెదడులోని నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మెదడు కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ద్వారా నిరూపించారు. ► ఫిలిప్పీన్స్కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌ కాక్ సూయ్ గుంజిలపై పరిశోధన ద్వారా... జీవం ఉన్న బ్యాటరీగా పిలిచే మెదడు గుంజీల ద్వారా రీచార్జ్ అవుతుందని తేల్చాడు. ► మైసూరు యూనివర్సిటీ, మహారాజ కాలేజీకి చెందిన శాస్త్రవేత్త శ్రీకాంత్, లాన్సీ 2017లో 6–18 ఏళ్ల వయసున్న 1,945 మంది పాఠశాల విద్యార్థులపై మూడు నెలలు గుంజీలపై పరిశోధన చేశారు. దీనివల్ల 86% మంది విద్యార్థుల్లో పరీక్షల భయం పోయిందని, 75.9% మంది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగిందని, 70.5% మందిలో ఏకాగ్రత గణనీయంగా పెరిగిందని తేల్చారు. గుంజీలకు గుర్తింపు కోసం తెలంగాణ బిడ్డ పోరుబాట నిజామాబాద్కు చెందిన అందె జీవన్రావు గుంజీలపై విస్తృత పరిశోధన చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నప్పట్నుంచీ ‘సూపర్ బ్రెయిన్ యోగా’(గుంజీలు తీయడం)పై అనేక ప్రయోగాలు చేశారు. పదవీవిరమణ పొందినా బ్రెయిన్ ట్రైనర్గా దేశవ్యాప్తంగా గుంజీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 150 విద్యా సంస్థల్లో విద్యార్థులకు గుంజీలు తీయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కేంద్రంలోని ఎన్సీఈఆర్టీ, రాష్ట్రంలోని ఎస్సీఈఆర్టీకి దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి దీన్ని అమలులోకి తేవాలని ఆయన ఉద్యమిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 2 వరకూ అస్సాంలోని బోడోలాండ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సూపర్ బ్రెయిన్ యోగాపై పరిశోధన పత్రాన్ని సమరి్పంచేందుకు సిద్ధమయ్యారు. శిక్షగా కాకుండా, విద్యార్థి వికాసానికి తోడ్పడే గుంజీల శాస్త్రీయతను ప్రభుత్వాలు గుర్తించాలని, అప్పటివరకూ అవిశ్రాంతంగా పోరాడతానని ఆయన ‘సాక్షి’ప్రతినిధికి చెప్పారు. చదవండి: బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు! -
మీ కన్నయ్య మన్ను తింటున్నాడా?
కొందరు పిల్లలు తల్లిదండ్రుల కళ్లు కప్పి మట్టి, బలపాలు, గోడకు ఉండే సున్నపు బెత్తికలు తింటూ ఉంటారు. మరికొందరు పెద్దవాళ్లు కూడా బియ్యంలో మట్టిగడ్డలు తినడం చూస్తుంటాం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్లు చిన్నప్పుడే పిల్లల్లో ఉండే మట్టి తినే అలవాటును మాన్పించకుంటే వారి ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మట్టితినే అలవాటు మాన్పించడం ఎలాగో చూద్దామా? ఎందుకు తింటారంటే..? చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్లు, ఇలా రకరకాల తినుబండారాలు ఉండగా వాటన్నింటికీ బదులు లేదా వాటితోపాటు అప్పుడప్పుడు ఇలా మట్టి ఎందుకు తింటారో తెలుసా? ... విటమిన్ల లోపమే అందుకు కారణం. శరీరంలో ఉండవలసిన దానికన్నా బాగా తక్కువ పరిమాణంలో ఈ విటమిన్లు ఉండటం లేదా అసలే లేకపోవడం వల్ల పిల్లలు మట్టితింటూ ఉంటారు. కాల్షియం, ఐరన్ తగినంత లేకపోవడం వల్ల పిల్లలు ఇలా మట్టి తినడానికి అలవాటు పడతార ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న పదార్థాలు తినేలా చూడాలి. పిల్లలకు మట్టి, బలపాలు తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6 -7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలచేత తాగించండి. అవసరం అనుకుంటే దీనికి కొద్దిగా తేనె కలిపినా మంచిదే. అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు. -
షాకింగ్.. హైదరాబాద్ వాసుల్లో విటమిన్ 'డీ' లోపం..
‘డీ’ మన శరీరంలో ఉండాల్సిన ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, ఫాస్పరస్ వంటి ఇతర పోషకాలను శరీరం గ్రహించడంలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది. మన ఎముకలలో 99% ఉన్న కాల్షియంను పునరుద్ధరించడానికి, సరిగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కండరాల కదలికకు, మెదడు.. నరాల అనుసంధానానికి దోహదపడుతుంది. అంటువ్యాధులు, క్యాన్సర్, హృదయ, శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, చిత్తవైకల్యం వంటి వ్యాధుల బారిన పడకుండా కూడా తోడ్పడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక రోగనిరోధక వ్యవస్థ సక్రమ పనితీరుకు ఇది చాలా ముఖ్యమైనది. కరోనా కాలంలో ఇతరత్రా ఔషధాలతో పాటు డీ విటమిన్ను వైద్యులు సిఫారసు చేయడం గమనార్హం. ఇంతటి కీలకమైన విటమిన్ ‘డీ’లోపం హైదరాబాద్ నగరవాసుల్లో తీవ్ర స్థాయిలో ఉందని టాటా ఐఎంజీ లాబ్స్ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 75 శాతానికి పైగా ప్రజలు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటని తేల్చింది. హైదరాబాద్లో 76% మంది ప్రజలు ‘డీ’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. నగరాల్లో.. యువతలో.. అధ్యయనం ప్రకారం.. వదోదర (89%), సూరత్ (88%) అహ్మదాబాద్ (85%) నగరాలకు చెందిన ప్రజలు అత్యధికుల్లో విటమిన్ డీ లోపం ఉంది. అంతేకాదు పెద్దవారితో పోలిస్తే యువతలో ఈ లోపం ఎక్కువగా ఉంది. 25 ఏళ్లలోపు వారు 84% మందిలో, 25–40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 81% మందిలో ‘డీ’ విటమిన్ సరిగా లేదని అధ్యయనం తేలి్చంది. నేటి తరం పిల్లలు, యువకులు ఎండ తగలకుండా ఎక్కువ సమయం ఇళ్లు, కార్యాలయాల్లోపలే గడుపుతుండడం, సరైన ఆహార నియమాలు పాటించక పోవడమే ఇందుకు కారణమని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. నగరాల్లో అత్యధికులు కరోనా కారణంగా చాలాకాలం పాటు నాలుగ్గోడల మధ్యే గడిపారు. అంటే విటమిన్ డీ లోపానికి పరోక్షంగా కరోనా కూడా కారణమైంది. ఇటీవల పెద్ద సంఖ్యలో యువకులు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, నిస్సత్తువతో ఆసుపత్రులకు వస్తున్నారని, వీరిలో ఎక్కువమంది అవుట్ డోర్ యాక్టివిటీ తగ్గిపోయినవారేనని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. విటమిన్ డీ లోపం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గిపోయి బోలు ఎముకల వ్యాధికి లేదా ఆ్రస్టియోపోరోసిస్కు దారి తీస్తోందని, ఇది ఇటీవలి సంవత్సరాలలో వయసులకు అతీతంగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధుల భారాన్ని విటమిన్ డీ లోపం రెట్టింపు జేస్తుందని వివరిస్తున్నారు. కీళ్ల నొప్పులకు, రక్తంలో చక్కెర శాతం పెరగడానికి కూడా కారణమవుతోందని అంటున్నారు. సహజసిద్ధంగానే భర్తీ చేసుకోవాలి వీలైనంత వరకు సహజమైన పద్ధతుల్లోనే విటమిన్ డీ లోటును భర్తీ చేసుకోవాలి. కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. – డా.గౌరీశంకర్ బాపనపల్లి, మెడికల్ డైరెక్టర్ ఎస్ఎల్జీ ఆసుపత్రి, హైదరాబాద్ ఇంకెలా పొందగలం? కొన్ని రకాల ఆహార ఉత్పత్తుల ద్వారా స్వల్పంగా విటమిన్ డీని పొందవచ్చు. పాలకూర వంటి ఆకుకూరలు, సోయా బీన్స్, వైట్ బీన్స్, సాల్మన్, రెయిన్బో వంటి కొవ్వుతో కూడిన చేపలు, నారింజ రసం, ఓట్ మీల్ వంటి వాటితో విటమిన్ డీ లభిస్తుంది. అలాగే విటమిన్ డీలో కీలకమైన డీ3, డీ2లు సప్లిమెంట్స్ (టాబ్లెట్లు) రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండూ విటమిన్ డీ లోపాన్ని సరిచేయడంలో సహాయపడతాయి, అయితే ప్రభావంతంగా పని చేస్తుందని వైద్యులు ఎక్కువగా డీ3ని సిఫారసు చేస్తారు రెండు దశల జీవ రసాయన ప్రక్రియ కీలకం సూర్యరశ్మి లేదా సప్లిమెంట్ నుంచి విటమిన్ డీని పొందిన తర్వాత దానిని క్రియాశీల విటమిన్ డీగా మార్చడానికి రెండు దశల జీవ రసాయన ప్రక్రియ దోహదపడుతుంది. ఇది కాలేయం నుంచి మొదలై మూత్రపిండాల్లో ముగుస్తుంది. మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు అడ్వాన్స్ దశలో ఉన్న వారు ఇది గమనంలో ఉంచుకోవాలి. శరీరం విటమిన్ డీని సరిగా సంగ్రహించలేనప్పుడు దాని లోపం ఏర్పడుతుంది. తగినంత విటమిన్ డీ లేకపోతే శరీరం ఆహారం నుంచి కాల్షియంను గ్రహించదు. సగటు ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎముకల నుంచి ప్రతిరోజూ 500 మిల్లీగ్రాముల కాల్షియంను కోల్పోతాడు అదే మొత్తాన్ని డీ విటమిన్ ద్వారా ఉత్పత్తి చేసుకున్న కాల్షియంతో భర్తీ చేసుకుంటాడు. విటమిన్ డీ లోపం ఉన్నప్పుడు కాల్షియం తగినంతగా భర్తీ కాదు. ఇది ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారడానికి దారితీస్తుంది. చదవండి: ఆహా ఏమి రుచి.. అంకాపూర్ దేశీ కోడి కూరకు 50 ఏళ్లకు.. -
ప్రకృతి సాగులో రీసెర్చ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తోన్న నెదర్లాండ్స్ వాసి
-
పెళ్లి అయితే బరువు పెరుగుతారా?
పెళ్లి తర్వాత బరువు పెరుగుతుంటారు చాలా మంది. ఇది కేవలం మన దేశంలో మాత్రమే కనిపించేది కాదని, మానవ సమాజాల్లో ఎక్కడైనా పెళ్లి తర్వాత బరువు పెరగడం చాలా సాధారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే పెళ్లి తర్వాత బరువు పెరగడం అనేది మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో కొంచెం ఎక్కువ అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 8000 మందిపై జరిపిన పరిశోధన ప్రకారం పెళ్లైన ఐదేళ్ల తర్వాత ఆడవాళ్లు సరాసరిన 11 కిలోలు బరువు పెరగగా, పెళ్లి కాని ఆడవారు ఐదేళ్లలో సరాసరిన 7 కిలోలు మాత్రమే బరువు పెరిగారు. ఇదే సమయంలో పెళ్లైన మగవారు దాదాపు 7–8 కిలోలు మేర బరువు పెరిగినట్లు తెలిసింది. పైగా పెళ్లైన జంటలో ఒకరు బరువు పెరిగితే మరొకరు బరువు పెరిగే అవకాశాలు 37 శాతం అధికమని తేలింది. ఇందుకు కారణం జంటలో ఒకరి అలవాట్లు మరొకరికి తొందరగా సోకడమే. అంటే ఒకరికి ఎక్కువ తినే అలవాటుంటే వారి భాగస్వామిలో కూడా తినే అలవాటు బాగా పెరుగు తుందన్నమాట. అలాగే పెళ్లి తర్వాత బంధువుల ఇళ్లలో విందులు, సొంతింట్లో కొసరి కొసరి తినిపించుకోవడాలు.. ఇలా తెలియకుండానే జంట బరువు పెరుగుతారు. పెళ్లి కానంత వరకు శరీర సౌందర్యం పై శ్రద్ధ పెట్టిన వాళ్లు జంటగా మారిన తర్వాత ఇద్దరిలోనూ పెరిగే భద్రతా భావం కారణంగా శరీరంపై కొంతమేర అశ్రద్ధ వహించడం జరుగుతుంది, దీనితోపాటు పైన చెప్పినట్లు తినడం పెరగడం వల్ల కూడా క్రమంగా లావవుతారు. ఈ ప్రక్రియను అడ్డుకోవాలంటే కలిసి తిన్నట్లే కలిసి ఎక్సర్సైజులు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
ఫోన్.. ఆటబొమ్మ కాదండోయ్
స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల్లో మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటోంది. ఫలితంగా విద్యార్థులు చదువుల్లోనూ వెనుకబడిపోతున్నారు. ఈ అలవాటు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తాజాగా వెలుగు చూస్తున్న సర్వేలలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్ల వినియోగం పాఠశాలలు, కాలేజీ స్థాయి పిల్లల్లో విపరీతమైన మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతోందని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విచ్చలవిడిగా మారడం, సరైన పర్యవేక్షణ లేమితో విద్యార్థులలో అత్యధిక శాతం మంది పక్కదారి పట్టే ప్రమాదం ఏర్పడుతోందని సర్వేలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై అతి ప్రేమ లేదా ఇవ్వకుంటే ఏమి చేసుకుంటారోనన్న భయంతో స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. ఆటపాటలతో ఇంట్లో సందడి చేయాల్సిన పసి పిల్లలకు సైతం స్మార్ట్ ఫోన్లను అలవాటు చేయడం ఇలాంటి దుష్పరిణామాలు మరింతగా పెరగడానికి కారణమవుతోంది. పిల్లలు మారాం చేస్తున్నారనో.. అల్లరి చేయకుండా ఉంటారనో వారికి ఆట బొమ్మలకు బదులుగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం ఇటీవల పెరిగిపోయింది. చిన్నతనం నుంచే ఇలా చేయడం వల్ల పిల్లల్లో మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క పాఠశాల పిల్లల్లో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, డేటా ప్యాక్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి వినియోగం కాస్తా వ్యసనంగా మారిందని ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో విద్యార్థులు, యువత మానసిక, ఆరోగ్యపరమైన సమస్యలకు లోనవుతున్నారని తేల్చిచెప్పింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ఇది తీవ్రరూపం దాల్చింది. అవసరం లేకున్నా పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలు చేరుతుండటం, పెద్దల పర్యవేక్షణ కరవవటంతో విపరిణామాలకు దారితీస్తోందని సర్వే సందర్భంగా నిపుణులు స్పష్టం చేశారు. టీనేజ్ పిల్లల్లో 71 శాతం ఫోన్లలోనే.. ► 9 నుంచి 13 ఏళ్లలోపు పిల్లలు పాఠశాల సమయం తరువాత ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో తేలింది. ► 13 నుంచి 17 మధ్య వయసు పిల్లల్లో 71 శాతం మంది పాఠశాలలతోపాటు బయట కూడా ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో చాటింగ్ చేస్తున్నారని వెల్లడైంది. ► 9 నుంచి 13 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియాలో వీడియోలను, ఆన్లైన్ గేమ్లతో గంటలకొద్దీ గడిపేస్తున్నారు. తల్లిదండ్రుల మాట అసలు వినడం లేదు. ► గట్టిగా చెబితే తమపై తిరగబడే పరిస్థితులు ఎదురవుతున్నాయని 47 శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు. ► 13 ఏళ్లలోపు వారు కూడా సోషల్ మీడియా ఖాతాలు తెరిచి చాటింగ్, ఇతర వ్యవహారాల్లో మునిగిపోతున్నారు. ► కేంద్ర ప్రభుత్వం 2017లో మెంటల్ హెల్త్ కేర్ చట్టాన్ని తెచ్చినా.. ఇంటర్నెట్ వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు నిర్దిష్ట రక్షణ చర్యలు పొందుపర్చకపోవడంతో పరిస్థితి చేయి దాటుతోందని సర్వేలో వివరించారు. ► ఐటీ చట్టంలోనూ అనేక సవరణలు చేయాల్సిన అవసరముందని వారు పేర్కొంటున్నారు. ► పబ్జి వంటి గేమ్స్ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తి కొన్నిసార్లు హింసా ప్రవృత్తికి కారణమవుతోందని పేర్కొంటున్నారు. అవాంఛనీయ సైట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని తెలిసో తెలియకో చూసి అనుసరించే పిల్లలు వాటిలో నిమగ్నమవుతూ మానసిక, శారీరక సమస్యలకు లోనవుతున్నారని వివరించారు. ► స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు వినియోగిస్తూ గేమ్స్ వంటి వాటిలో విద్యార్థులు నిమగ్నం అవుతున్నందున పాఠ్యాంశాలపై దృష్టి పెట్టలేకపోతున్నారని సర్వే పేర్కొంది. దీనివల్ల చదువుల్లో వెనుకబడిపోతున్నారని వివరించింది. ► స్మార్ట్ ఫోన్ల వల్ల సామాజిక సంబంధాలకు దూరంగా ఉండిపోతున్నారని, ఇది మెదడులో జన్యుపరమైన సమస్యలకు దారితీస్తోందని వైద్య నిపుణులు పేర్కొన్నారని సర్వే తెలిపింది. ఇది పిల్లల్లో ‘నో మొబైల్’ ఫోబియా అనే కొత్త రుగ్మతను తెచ్చిపెట్టిందన్నారు. ► ఫలితంగా పిల్లలు ఆందోళన, నిరాశ, చిరాకు, ఒంటరితనం ఎక్కువై మానసిక వైకల్యంలో పడుతున్నట్టు స్పష్టం చేశారు. ► స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల 8–18 ఏళ్లలోపు పిల్లలు నిద్ర లేమికి గురవుతున్నారని.. ఫలితంగా వారిలో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతోందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ఇది భారత్పై జరిగిన దాడి: గౌతమ్ అదానీ
గాంధీనగర్: హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన హేయమైన ఆరోపణల్ని బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఖండించింది. ఈ ఆరోపణలను కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడి కాదని, దేశం (భారత్) పైన, దేశాభివృద్ధికి పాటుపడుతున్న సంస్థలపై దురుద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రణాళికతో కూడిన దాడిగా అభివర్ణించింది. సదరు సంస్థ చేసిన ఆరోపణల్లో అబద్ధం తప్ప మరేమీ కాదు అని అదానీ గ్రూప్ పేర్కొంది.ఈ మేరకు 413 పేజీలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ఆరోపణలతో తమ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పడగొట్టి.. హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందని విమర్శించింది. ఇది నాపై దాడి కాదు.. భారత్పై దాడి ఆర్థిక లాభాలను పొందేందుకు వీలుగా దురుద్దేశ్యంతో తప్పుడు మార్కెట్ను సృష్టించడం కోసమే హిండెన్బర్గ్ ఇలా చేస్తుందని అదానీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది కేవలం గౌతమ్ అదానీ సంస్థలపైన చేసిన దాడి కాదని, దేశం, స్వాతంత్ర్యం, సమగ్రత, నాణ్యత, ఆర్ధిక వృద్ధిపై దాడి అని చెప్పింది. హిండెన్బర్గ్ పై అనుమానం ఈ సందర్భంగా అదానీ గ్రూప్.. హిండెన్బర్గ్ విశ్వసనీయత, నైతికతను ప్రశ్నించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల సమీకరణకు చేపట్టిన ఎఫ్పీవో శుక్రవారమే(27న) ప్రారంభమైంది. ఇష్యూ మంగళవారం(ఫిబ్రవరి 1న) ముగియనుంది. ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్పై అనుమానం వ్యక్తం చేసింది. ఆరోపణలు నిరాధారం హిండెన్బర్గ్ లేవనెత్తిన 88 ప్రశ్నలలో 65 ప్రశ్నలకు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు అన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయని తెలిపింది. మిగతా 23 ప్రశ్నల్లో 18 పబ్లిక్ షేర్హోల్డర్లు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని వెల్లడించింది. మిగతా ఐదు ప్రశ్నలు నిరాధారమైనవని తెలిపింది. తమ కంపెనీలన్నీ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నట్టు అదానీ గ్రూప్ మరోసారి స్పష్టం చేసింది. చదవండి👉 అదానీకి హిండెన్బర్గ్ షాక్, మరో బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు -
‘స్పేస్’లో మన ప్రగతి గర్వకారణం!
సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వంటి స్వదేశీ సంస్థల ప్రగతి భారతీయులందరూ గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అయితే పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరినప్పుడే వాటికి సార్థకత అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని భూభౌతిక పరిశోధన కేంద్రం (ఎన్జీఆర్ఐ)లో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ స్పేస్ సెక్టార్: న్యూ ఇండియా’ పేరిట జరిగిన ఒకరోజు సదస్సులో గవర్నర్ మాట్లాడారు. అంతరిక్ష రంగంలో ఇస్రో ఘనతలను కొనియాడారు. అంతరిక్ష రంగంలో జరిగిన పరిశోధనలు వివిధ రూపాల్లో సామాన్యుడికి ఉపయోగపడ్డాయని వివరించారు. హైదరాబాద్కు చెందిన స్టార్టప్లు స్కైరూట్, ధ్రువ స్పేస్లు దేశంలోనే మొదటిసారి ప్రైవేటుగా రాకెట్, ఉపగ్రహాలను విజయవంతంగా పరీక్షించడాన్ని గవర్నర్ అభినందించారు. 2026 నాటికి అంగారకుడిపైకి మనిషి.. అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంకో మూడేళ్లలోనే మనిషి అంగారక గ్రహంపైకి అడుగుపెట్టినా ఆశ్చ ర్యం లేదని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ చెప్పారు. ప్రపంచంలో పౌర అవసరాలు తీర్చేందుకు అంత రిక్ష ప్రయోగాలు చేపట్టిన తొలి దేశంగా భారత్కు రికార్డు ఉందని, స్పేస్ టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించుకున్నదీ మన మేనని తెలిపారు. ప్రస్తుతం సుమారు 50 ఉపగ్రహాలు దేశానికి సేవలు అందిస్తున్నాయని.. పెరుగుతు న్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య రెండు వందలకుపైగా ఉండాలని పేర్కొన్నారు. అరగంటలో ఖండాలు దాటేయవచ్చు.. అంతరిక్ష రంగంలో రానున్న పదేళ్లు చాలా కీలకమని దేశంలో తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సీఈవో పవన్కుమార్ చందన తెలిపారు. ప్రపంచంలోని 90కిపైగా దేశాలకు తమవైన ఉపగ్రహాలు లేవని, యాభై శాతం జనాభాకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదని వివరించారు. మరో పది, ఇరవై ఏళ్లలో కేవలం అరగంట సమయంలోనే ఖండాలను దాటేసేందుకు రాకెట్లను ఉపయోగించే పరిస్థితి రానుందని చెప్పారు. విమానాల మాదిరిగానే రాకెట్లను కూడా మళ్లీమళ్లీ వాడుకునే దిశగా స్కైరూట్ పరిశోధన చేపట్టిందని తెలిపారు. సెమినార్లో ధ్రువస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో నెక్కంటి సంజయ్, అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ మోహనరావు, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ విభాగం కార్యదర్శి ఎం రవిచంద్రన్ పాల్గొన్నారు. -
ఆధునిక భారతదేశ చరిత్రపై విస్తృత పరిశోధనలు చేయాలి
న్యూఢిల్లీ: ఆధునిక భారతదేశ చరిత్రపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆ అంశంపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు పిలుపునిచ్చారు. అలాగే ప్రఖ్యాత సామాజిక సంస్కర్త స్వామి దయానంద సరస్వతి, 1875లో ఏర్పాటైన ఆర్యసమాజ్ అందించిన సేవలను వెలుగులోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో విద్యా, సాంస్కృతిక సంస్థలు చొరవ తీసుకోవాలని అన్నారు. సోమవారం ఢిల్లీలోని నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్) వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. విస్తృత పరిశోధనల ద్వారా ఆధునిక భారతదేశ చరిత్ర గురించి నేటి తరానికి మరిన్ని విషయాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. -
కరోనా పుట్టుకకు అగ్రరాజ్యమే కారణం...వెలుగులోకి షాకింగ్ నిజాలు
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ అంతా డ్రాగన్ దేశాన్ని ఆడిపోసుకున్నారు. కానీ అసలు కారణం అగ్రరాజ్యం అని యూఎస్కి చెందిన ఒక పరిశోధకుడు తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. చైనాలోని ప్రుభుత్వ నిధులతో నిర్వహిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధన కేంద్రం నుంచే కరోనా వైరస్ లీకైందని పేర్కొంది కూడా ఈ శాస్త్రవేత్తే. ఈ మేరకు యూఎస్ పరిశోధకుడు ఆండ్రూ హఫ్ తాను రాసిన 'దిట్రూత్ అబౌట్ వ్యూహాన్' అనే పుస్తకంలో ఈ విషయాల గురించి వెల్లడించాడు. చైనాలో రిసెర్చ్ సెంటర్లోని కరోనా వైరస్ పరిశోధనలకు యూఎస్ ప్రభుత్వమే నిధులందిస్తోందని చెప్పారు. ఐతే చైనా ల్యాబ్లో పరిశోధనలకు తగినంత భద్రత లేకపోవడంతోనే ఈ వైరస్ లీక్ అయినట్లు తెలిపారు. ఇది మానవ నిర్మిత వైరస్ అని తేల్చి చెప్పారు. ఈ పరిశోధనలు అత్యంత రిస్క్తో కూడినవని, వీటికి సరైన భద్రత తోపాటు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే నియంత్రించ గలిగేలా ల్యాబ్లో తగినంత కట్టుదిట్టమైన చర్యలు లేవన్నారు. అంతేగాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) అనేది అమెరికా ప్రభుత్వం ప్రాథమిక ఏజెన్సీ. ఈ ఎన్ఐహెచ్ అంటువ్యాధులపై అధ్యయనం చేసే లాభప్రేక్ష లేని ఎకోహెల్త్ అలియన్స్ అనే సంస్థకు గబ్బిలాలతో వివిధ కరోనా వైరస్లపై అధ్యయనం చేసేందుకు దశాబ్దాలకుపైగా నిధులు సమకూర్చిందని చెప్పారు. పైగా ఈ సంస్థ వ్యూహాన్ ల్యాబ్తో టైఅప్ అయ్యి ఈ కరోనా వైరస్పై మరింతగా పరిశోధనలు చేసిందని, ఫలితంగానే ఈ వైరస్ లీక్ అయ్యిందని చెప్పారు. శాస్త్రవేత్త హాఫ్ 2014 నుంచి 2016 వరకు ఈ ఎకోహెల్త్ అలియన్స్ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఈ ఎకోహెల్త్ సంస్థ ఈ కరోనా వైరస్ను సృష్టించే పరిశోధన పద్ధతులను మరింతగా అభివృద్ధి చేయడంలో వ్యూహాన్ ల్యాబ్కు సాయం చేసినట్లు తెలిపారు. ఇది జన్యు పరంగా సృష్టించిన వైరస్ అని చైనాకు ముందు నుంచే తెలుసునని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రమాదకరమైన బయోటెక్నాలజీ చైనాకు అందించింది యూఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పరిశోధనలకు నిలయంగా మారింది. ఐతే వ్యూహాన్ పరిశోధన సంస్థకు వనరుల కొరత ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయిని పెంచుకునేలా అధికస్థాయిలో శాస్త్రీయ పరిశోధనలు జరగాలంటూ చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ విపరీతమైన ఒత్తిడిని తీసుకొచ్చినట్లు శాస్త్రవేత్త హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..) -
మతిమరుపు బాధితులకు ‘లెసానెమాబ్’
లండన్: మనుషుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు (అల్జీమర్స్) తలెత్తడం సహజం. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా దీనితో బాధపడుతున్నారని అంచనా. బ్రిటన్లోని అల్జీమర్స్ రీసెర్చ్ సంస్థ లెసానెమాబ్ పేరుతో నూతన ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీనితో మతిమరుపు పెరుగుదల నెమ్మదిస్తుందని సైంటిస్టులు చెప్పారు. అల్జీమర్స్ చికిత్సలో ఇదొక కీలక మలుపన్నారు. క్లినికల్ ట్రయల్స్లో 1,795 మందిపై సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. వారికి 18 నెలలపాటు చికిత్స అందిస్తే మతిమరుపు పెరుగుదల నాలుగింట మూడొంతులు తగ్గిపోతుందని చెప్పారు. అల్జీమర్స్కు ప్రధాన కారణమైన బీటా–అమైలాయిడ్ అనే ప్రొటీన్ను ఈ ఔషధం కరిగించేస్తుందని పేర్కొన్నారు. మెరుగైన అల్జీమర్స్ చికిత్సల కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని, ఈ దిశగా లెసానెమాబ్ డ్రగ్ ఒక ఉత్తమమైన పరిష్కారం అవుతుందని పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ హర్డీ తెలియజేశారు. -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
నేరేడు పండ్లలోనే కాదు.. ఆకుల్లోనూ గుణాలు.. పరిశోధన చేశారిలా..
సాక్షి, విశాఖపట్నం: ఇప్పటి వరకు నేరేడు పండ్లలోనే ఔషధ గుణాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ నేరేడు ఆకుల్లోనూ ఔషధ గుణాలున్నట్లు కనుగొన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల విద్యార్థులు. సమాజానికి ఉపయుక్తంగా నిలిచే అంశంపై అధ్యయన ప్రక్రియలో భాగంగా నేరేడు ఆకుల్లో ఔషధ గుణాలను అన్వేషించే ప్రాజెక్ట్ను వీరు చేపట్టారు. హెచ్వోడీ ఎ.కృష్ణమంజరి పవార్ పర్యవేక్షణలో నందిన, శ్రీదేవి, అనూష, కళ్యాణ్, రాజ్సుశితశ్రీ , శిరీష తమ పరిశోధనల్లో నేరేడు ఆకుల్లో రెండు ఫ్లావనాయిడ్స్ను గుర్తించారు. దాదాపు 50 గ్రాముల ఆకుల పొడిలో కొర్సిటిన్ 0.342 మైక్రో గ్రాములు, రూటిన్ 1.397 మైక్రో గ్రాములున్నట్లు తేల్చారు. ఈ ఫ్లావనాయిడ్స్ మధుమేహం, క్యాన్సర్ నియంత్రణకు ఉపకరిస్తాయి. పరీక్ష చేశారిలా.. తొలుత కొన్ని నేరేడు ఆకులను తీసుకుని ఆరబెట్టారు. వాటిలో తేమ పూర్తిగా ఆరిపోయాక పొడి చేసి.. సన్నని జల్లెడతో వడగట్టారు. అనంతరం నేరేడు ఆకుల పొడి ఇథనాల్, మిథనాల్లలో కరుగుతోందని గుర్తించారు. ఇన్ఫ్రారెడ్ కిరణాలలో ఈ పొడిని పరిశీలించారు. ఈ పరీక్షతో ఆ పొడిలో ఫ్లావనాయిడ్స్ ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా నిలుస్తాయి. మలినాలను తొలగించే వ్యవస్థగా పనిచేస్తాయి. తదుపరి దశలో సినోడా టెస్ట్ చేసి దానిలో ఉన్న ఫ్లావనాయిడ్స్ రకాన్ని గుర్తించారు. టీఎల్సీ (థిన్ లేయర్ క్రొమెటోగ్రఫీ) చేసి కొర్సిటిన్, రూటిన్లు ఉన్న శాతాన్ని గుర్తించారు. విద్యార్థులు తమ రిపోర్టును వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డికి అందజేశారు. సమాజ ఉపయుక్త అంశంపై పనిచేస్తున్న విద్యార్థులను వీసీ అభినందించారు. గతేడాది ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఫోర్టిఫైడ్ రైస్పైన ఇదే విధంగా అధ్యయనం చేశారు. విశ్వవిద్యాలయంలో జరిపే ప్రతి పరిశోధన సమాజానికి ఉపయుక్తంగా ఉండేలా అధికారులు కృషిచేస్తున్నారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
గృహ విక్రయాలు: పశ్చిమ, ఉత్తరాదిలోనే జోరు!
సాక్షి, సిటీబ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఫలితంగా హైదరాబాద్లో పశ్చిమ, ఉత్తరాది ప్రాంతాలలో ఇళ్ల కొనుగోళ్లు, సరఫరా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ (క్యూ3)లో నగరంలో 11,650 గృహాలు విక్రయం కాగా.. ఇందులో ఈ రెండు జోన్ల వాటానే 92 శాతంగా ఉంది. అలాగే 15,500 యూనిట్లు లాంచింగ్ కాగా.. వెస్ట్, నార్త్ జోన్ల వాటా 91 శాతంగా ఉందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో విక్రయమైన గృహాలలో భాగ్యనగరం వాటా 13 శాతంగా ఉంది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 4 శాతం వృద్ధి. వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలలో హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో 73 శాతం వృద్ధి నమోదయింది. జోన్ల వారీగా చూస్తే.. క్యూ3లో నగరంలో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం వెస్ట్ జోన్లోనే జరిగాయి. గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్, మణికొండ, కూకట్పల్లి, కోకాపేట, పటాన్చెరు వంటి ప్రాంతాలు ఉండే ఈ జోన్ వాటా 49 శాతంగా ఉంది. మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట, యాప్రాల్, షామీర్పేట వంటి ప్రాంతాలు ఉండే నార్త్ జోన్ 43 శాతం అమ్మకాల వాటా కలిగి ఉంది. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం ఈ రెండు జోన్లలో విక్రయాలు 1 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో తూర్పు, సెంట్రల్ జోన్లలో విక్రయాలు 1 శాతం మేర పెరిగాయి. క్యూ3లోని హైదరాబాద్లోని గృహ విక్రయాలలో హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, ఘట్కేసర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ఈస్ట్ జోన్ వాటా 3 శాతం, అమీర్పేట, పంజగుట్ట, సోమాజిగూడ, హిమాయత్నగర్ వంటి ప్రాంతాలు ఉండే సెంట్రల్ జోన్ వాటా 1 శాతం, శంషాబాద్, ఆదిభట్ల, మహేశ్వరం, షాద్నగర్, రాజేంద్రనగర్ వంటి సౌత్ జోన్ 3శాతం వాటాతో ఉన్నాయి. నగరానిది 17 శాతం వాటా.. గృహ ప్రారంభాలలోనూ హైదరాబాద్ హవా కొనసాగింది. క్యూ3లో ఏడు ప్రధాన నగరాలలోని లాంచింగ్స్లో 17 శాతం వాటాతో నగరం రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే మాత్రం నగరంలో లాంచింగ్స్ 2 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన మాత్రం 6 శాతం వృద్ధిలో ఉంది. నివాస ప్రారంభాలలోనూ పశ్చిమ జోన్దే జోరు. క్యూ3లో హైదరాబాద్లో జరిగిన లాంచింగ్స్లో ఈ జోన్ వాటా 53 శాతం. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 2 శాతం క్షీణత. అలాగే క్యూ2తో పోలిస్తే నార్త్ జోన్లో లాంచింగ్స్ 6 శాతం వృద్ధి రేటుతో 32 శాతం నుంచి 38 శాతానికి పెరిగాయి. సౌత్ జోన్ 5 శాతం, ఈస్ట్ జోన్ 4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కొత్తగా ప్రారంభమైన గృహాలలే లగ్జరీవే అత్యధికం. క్యూ3లో ప్రారంభమైన ఇళ్లలో 54 శాతం ఈ తరహా నివాసాలే. 30 శాతం వాటా మధ్యస్థాయి గృహాలున్నాయి. అఫర్డబుల్ ఇళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్యూ2లో లాంచింగ్స్లో అందుబాటు గృహాల వాటా 3 శాతం కాగా.. క్యూ3 నాటికి 1 శాతానికే పరిమితమయ్యాయి. -
7 ఖండాలు కాదు ఏక ఖండమే..!
భూమ్మీద ఇప్పుడున్నవి ఏడు ఖండాలు.. కావాలంటే గబగబా పేర్లు కూడా చెప్పేస్తుంటారు. అందులో పెద్ద ఖండం ఏదంటే ఆసియా అని టక్కున చెప్పేస్తారు.. మరి భవిష్యత్తులో అతిపెద్ద ఖండం ఏమిటో తెలుసా ‘అమేషియా’. ఇప్పుడు వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఖండాల కన్నా పెద్దగా అతిపెద్ద ఖండంగా అది నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. పసిఫిక్ మహాసముద్రం మూసుకుపోయి.. భూమ్మీద భవిష్యత్తు పరిణామాలు, ఖండాలపై ఆస్ట్రేలియాకు చెందిన న్యూ కర్టిన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. భూమ్మీద సుమారు 20, 30 కోట్ల ఏళ్లలో పసిఫిక్ మహా సముద్రం మూసుకుపోయి.. ఖండాలన్నీ కలిసి అతిపెద్ద ఖండం ఏర్పడుతుందని వారు చెప్తున్నారు. దానికి ‘అమేషియా’ అని పేరుపెట్టారు. సూపర్ కంప్యూటర్ సాయంతో.. భూమ్మీద ఒకప్పుడు ఖండాలన్నీ ఒకే దగ్గర ఉండేవని.. తర్వాత విడిపోయాయని తెలిసిందే. ఇప్పటికీ ఖండాలు కదులుతూనే ఉన్నాయి కూడా. ఈ క్రమంలో సముద్రాల అడుగున ఉన్న భూభాగాలు పైకి తేలడం, ఇప్పుడున్న భూభాగాలు మునగడం జరుగుతుందని అంచనా. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్ సాయంతో.. భవిష్యత్తులో భారీ ఖండాలు ఎక్కడ ఏర్పడవచ్చన్న దానిపై పరిశోధన చేశారు. అందులో గత పది కోట్ల ఏళ్లలో ఏర్పడిన అట్లాంటిక్, హిందూ సముద్ర ప్రాంతాల కంటే.. బాగా పురాతనమైన పసిఫిక్ ప్రాంతానికి పైకితేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేశారు. ప్రతి 60 కోట్ల ఏళ్లకోసారి కొత్త ఖండాలు భూమి ఏర్పడి సుమారు 200 కోట్ల ఏళ్లు అయిందని అంచనా. అప్పటి నుంచి ప్రతి 60 కోట్ల ఏళ్లకోసారి భూమిపై ఉన్న ఖండాలు కదులుతూ, ఢీకొడుతూ కొత్తగా ఖండాలు ఏర్పడుతుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పుడున్న ఖండాలు ఏర్పడి ఇప్పటికే 30, 40 కోట్ల ఏళ్లు అయిందని.. మరో 20, 30 కోట్ల ఏళ్లలో కొత్త ఖండాలు ఏర్పడుతాయని చెబుతున్నారు. ‘అమేషియా’ పేరే ఎందుకు? ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు కదిలి వచ్చి ఆసియాను ఢీకొట్టడం వల్ల పసిఫిక్ మహా సముద్రం మూసుకుపోయి కొత్త భారీ ఖండం ఏర్పడుతుందని శాస్త్రవేత్తల అంచనా. ఆస్ట్రేలియా ఖండం ఈ రెండింటి మధ్యకు వచ్చి ఇరుక్కుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, ఆసియా పేర్లు కలిసేలా ‘అమేషియా’ అని కొత్త ఖండానికి పేరు పెట్టారు. సముద్రాలు తగ్గిపోయి.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి.. అమేషియా అతి భారీ ఖండంగా ఏర్పడినప్పుడు.. భూమిపై సముద్రాల ఎత్తు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారీ ఖండం కావడం వల్ల చాలా ప్రాంతాలు సముద్రానికి దూరంగా ఉంటాయని.. ఆయా చోట్ల ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువ స్థాయికి చేరుతాయని పేర్కొంటున్నారు. ఇంతకు ముందూ ఇలాంటి థియరీ కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే భూభాగంగా ఉండేవి. దాన్ని పాంజియాగా పిలుస్తుంటారు. భవిష్యత్తులోనూ అలా ఖండాలన్నీ కలిసి ‘పాంజియా ప్రాక్సిమా’గా ఏర్పడతాయని 1982లో అమెరికన్ భూతత్వ నిపుణుడు క్రిస్టోఫర్ స్కాటిస్ ప్రతిపాదించారు. అయితే సముద్రాలు, ఖండాల కలయిక ఎలా ఉంటుందన్న అంచనాలేమీ వెలువరించలేదు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!
వాషింగ్టన్: కరోనా ఎంఆర్ఎన్ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ జనరల్ డా.జోసెఫ్ లడాపో వెల్లడించారు. ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై(సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. టీకాల భద్రతను పరీక్షించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగించడం గమనార్హం. ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ విశ్లేషణలో తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కల్గిస్తోంది. అయితే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని డా.జోసెఫ్ సూచించారు. ముఖ్యంగా మ్యోకార్డిటిస్, పెరికార్డిటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తతో ఉండాలని చెప్పారు. ఏ ఔషధాన్నైనా, వ్యాక్సిన్నైనా అభివృద్ధి చేసేటప్పుడు వాటి భద్రత, సమర్థతపై పరిశోధనలు అత్యంత కీలకమని డా.జోసెఫ్ పేర్కొన్నారు. కరోనా టీకాల వచ్చినప్పుడు ఎన్నో ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కానీ వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పుడు నిర్వహించిన కీలక అధ్యయనం తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అయితే భారత్లో ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పారేద్దామనుకున్న టికెట్కు 1.6 కోట్లొచ్చాయి -
ఫస్ట్ వరల్డ్ వార్ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత...
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తిగా ధ్వసంమై సముద్ర గర్భంలో పడి ఉన్న వందేళ్ల నాటి జలాంతర్గామిని శిథిలాల పరిశోధకుడు డైవర్ ఎరిక్ పెట్కోవిక్ కనుగొన్నాడు. ధ్వంసమై సముద్రంలో పడి ఉన్న బోట్లపై డైవర్ ఎరిక్ పెట్కోవిక్ పరిశోధనలు చేస్తుంటాడు. ఈ జలాంతర్గామిని వర్జీనియా తీరంలోని కేవలం 400 అడుగుల లోతుల్లో గుర్తించాడు. వాస్తవానికి ఈ జలాంతర్గామి మొదటి ప్రపంచ యుద్ధంలో 1922లో అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో సుమారు 1600 అడుగుల లోతుల్లో పడిపోయింది. ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబందించి ఐదు జలాంతర్గాములు, రెండవ ప్రపంచ యద్ధానికి సంబంధించి ఎనిమిది జలంతర్గాములను కనుగొన్నారు. అయితే ఈ యూ-111 జలంతర్గామి కూడా వర్జినియాలోనే మునిగిపోయినట్లు పరిశోదకులు గుర్తించలేకపోవడమే కాకుండా కనుగొన లేకపోయారు కూడా. అదీగాక సముద్రంలో ఉండే ఉప్పు కారణంగా మునిగిపోయిన ఓడలు, జలాంతర్గాములు వేగంగా క్షీణిస్తాయి. సముద్రంలో ఉండే కొన్ని రకాల పురుగులు కలపను తినేస్తాయి. అయినప్పటికీ ఈ జలంతర్గామి శిధిలాలు సజీవంగా కనుగొనడం విశేషమే. 1985లో తొలిసారిగా రాబర్ట్ బల్లార్డ్ అనే పరిశోధకుడు టైటానిక్ ఓడల శిధిలాలను కనుగొన్నాడు. అతని తర్వాత డైవర్ ఎరిక్ పెట్ కోవిక్ ఈ ధ్యంసమైన నౌకలను పరిశోధించడం ప్రారంభించాడు. ఈ పరిశోధకుడు తన మిత్రుడు రస్వీ సాయంతో ఎక్స్ప్లోరర్ డైవింగ్ నౌకను ఉపయోగించి ఈ జలాంతర్గామి శిథిలాలను వెలికితీశాడు. (చదవండి: Viral Video: సాధారణ తాడుపై సాహసమేముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక) -
ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్
అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్ అండ్ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. భరించలేని వెన్నునొప్పితో బాధ పడిన షాలిని తన పరిశోధనలో భాగంగా తెలుసుకున్న విషయం... హెంప్ మొక్కకు వెన్నునొప్పిని తగ్గించే శక్తి ఉంది అని. అది ప్రయోగాత్మకంగా నిరూపణ కావడంతో హెంప్ ఉత్పత్తుల విలువను ప్రపంచానికి పరిచయం చేయడానికి సోదరి జయంతి భట్టాచార్యతో కలిసి ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’కి శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది. షాలిని భట్టాచార్య నిలకడగా ఒకచోట ఉండే రకం కాదు. స్పెయిన్లో ఉంటున్న శాలినికి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం అంటేనే ఎక్కువ ఇష్టం. అలాంటి షాలినికి కష్టం వచ్చిపడింది. భరించలేని వెన్నునొప్పి! బయట అడుగు వేయలేని పరిస్థితి. చిన్న బ్యాగ్ను ఇటు నుంచి అటు పెట్టాలన్నా వీలయ్యేది కాదు. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం మొదలైంది. ఏదో కాస్త తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉంటున్న సోదరి జయంతితో కలిసి తన సమస్యకు పరిష్కారాన్ని వెదకడానికి పరిశోధన మొదలుపెట్టింది. ఈ పరిశోధన క్రమంలో వారికి ఎప్పుడో విన్న హెంప్ (ఒక రకమైన కనబిస్ మొక్క) గుర్తుకు వచ్చింది. వేసవి సెలవులు వస్తే చాలు...కొండకోనల్లో తిరగడం తమ అలవాటు. అలా వెళ్లినప్పుడు అక్కడి మొక్కల గురించి స్థానికుల నుంచి ఆసక్తికరమైన వివరాలు తెలుసుకునేవారు. ఒకసారి హిమాలయాలో విస్తారంగా పెరిగే, విస్తృత ఔషధగుణాలు ఉన్న హెంప్ గురించి విని ఉన్నారు. ఆ జ్ఞాపకంతో హెంప్ గురించి లోతైన పరిశోధన ప్రారంభించారు. వెన్నునొప్పిని తగ్గించే సామర్థ్యం ఈ మొక్కకు ఉన్నట్లు ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. ఆ సమయంలోనే వారికి ఒక ఆలోచన వచ్చింది... అజ్ఞాతంగా ఉన్న హెంప్ను ప్రజల్లోకి తీసుకువెళ్లి దాని ఔషధశక్తి ఏమిటో తెలియజేయాలని. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం ఇండియా హెంప్ అండ్ కంపెనీ. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ హెంప్ ట్రేల్ మిక్స్, హెంప్ హార్ట్, ప్రొటీన్ పౌడర్, హెంప్ ఆయిల్... మొదలైన న్యూట్రీషన్–ప్యాక్డ్ హెంప్ ప్రాడక్స్ను తీసుకువచ్చింది. ‘షార్క్ ఇండియా రియల్టీ షో’ నుంచి ఆహ్వానం అందడాన్ని ఔత్సాహిక వ్యాపారవేత్తలు గొప్పగా భావిస్తారు. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఒక విశాలవేదికగా షార్క్ ఇండియా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫండింగ్ విషయంలో మేలు జరుగుతుంది. ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’ కో–ఫౌండర్గా జయంతి భట్టాచార్యకు షార్క్ ఇండియా నుంచి ఆహ్వానం లభించింది. అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న జయంతికి తమ ఉత్పత్తుల గురించి ఎలా ప్రచారం చేసుకోవాలో అనేది తెలియని విషయమేమీ కాదు. ఆమె ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది. రకరకాల దేశాల నుంచి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. అయితే సరిౖయెన డీల్ కుదరకపోవడంతో వాటిని ఆమోదించలేదు. ఫండింగ్ మాట ఎలా ఉన్నా ‘షో’కు వచ్చిన ప్రముఖుల సూచనలతో బ్రాండింగ్ స్ట్రాటజీని మార్చుకున్నారు. ఆ తరువాత సరిౖయెన ఇన్వెస్టర్లు వచ్చారు. కంపెనీ విజయపథంలో దూసుకెళుతుంది. నిజానికి హెంప్ ఉత్పత్తులను మార్కెట్ లో సక్సెస్ చేయడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. మన దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెంప్ సాగు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట అనుమానం మిగిలే ఉంది. దీన్ని తీసివేయడానికి ప్రచార రూపంలో గట్టి ప్రయత్నాలు ప్రారంభించి విజయం సాధించారు ఈ డైనమిక్ సిస్టర్స్. ‘ప్లానెట్ ఫ్రెండ్లీ ప్లాంట్ అయిన హెంప్పై మాకు ఉన్న నమ్మకం వృథాపోలేదు. మా వ్యాపారం విజయవంతమైంది అనేదానికంటే, ఇండియా హెంప్ అండ్ కంపెనీ ద్వారా హెంప్లోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలుసుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది షాలిని. -
శాస్త్రవేత్తల విజయాలను గుర్తించాలి
అహ్మదాబాద్: పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్ను ప్రపంచానికి కేంద్ర స్థానంగా మార్చేందుకు కృషి చేయాలని సైంటిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పురోగతి కోసం ఆధునిక విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల్లో సైంటిస్టుల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని విచారం వ్యక్తం చేశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను మనం గుర్తించడం లేదని అన్నారు. భారత శాస్త్రవేత్తల విజయాలు, ఘనతలను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో శనివారం ప్రారంభమైన సెంటర్–స్టేట్ సైన్స్ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మన పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాలని మోదీ చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల్లో మన దేశాన్ని గ్లోబల్ సెంటర్గా మార్చడానికి కలిసి పనిచేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ ల్యాబ్ల సంఖ్య భారీగా పెరగాలన్నారు. ‘‘2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్లో భారత్ స్థానం 81. కేంద్రం కృషి వల్లే ఇప్పుడు 46కు చేరింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు మాతృభాషల్లో బోధించేలా ప్రయత్నాలు జరగాలి. ప్రపంచస్థాయి ప్రయోగశాలల ఏర్పాటుకు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహకరిస్తుంది’’ అని ప్రధాని చెప్పారు. -
భావి ఇంధనం గ్రీన్ హైడ్రోజన్.. ఒకసారి నింపితే చాలు సుదీర్ఘ ప్రయాణం..
(సాక్షి ప్రతినిధి, అమరావతి): విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ను ముందుకు తెస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిని భవిష్యత్ ఇంధనంగా కూడా చెబుతున్నారు. విద్యుత్ వాహనాల్లో గ్రీన్ హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించుకొని నడిచే ఫ్యూయల్ సెల్ ఆధారిత వాహనాల మీదా పలు దేశాలతోపాటు మన దేశంలోనూ ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ మీద నడిచే వాహనాలనూ (ఫ్యూయల్ సెల్ ఎల్రక్టానిక్ వెహికల్స్) (ఎఫ్సీఈవీ) దేశంలో తయారు చేశారు. కాలుష్య రహితంగా రవాణా రంగం రూపు మార్చడానికి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదే సమయంలో కొన్ని సవాళ్లనూ మన ముందు ఉంచింది. చదవండి: గుజరాత్లో మూడుముక్కలాట.. కేజ్రీవాల్ కింగా? కింగ్ మేకరా? ఇదీ సాంకేతికత హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ వల్ల విద్యుత్ పుడుతుంది. ఈ శక్తిని వాడుకుని ఇంజన్ నడుస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో వాడే ముడిపదార్థాల లభ్యత మన దేశంలో తక్కువగా ఉండటం మనకు సమస్య. కానీ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే ముడి పదార్థాల సమస్య మనకు లేదు. రానురాను తక్కువ ధరకే ఇంధనం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పన్ను రాయితీలతో పాటు ఇతర రాయితీలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి ధరలు తగ్గుతున్నందున, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ధరలు కూడా క్రమేణా తగ్గుతాయని నీతి ఆయోగ్ ‘హార్నెసింగ్ గ్రీన్ హైడ్రోజన్’ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ ఒక కిలో ఉత్పత్తి చేయడానికి 2030లో 1.6 డాలర్లు, 2050కి 0.7 డాలర్లు అవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో ప్రయోజనాలు ఇవీ.. ♦ఒకసారి హైడ్రోజన్ నింపితే సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వాహనాలతో పోలిస్తే దీని రేంజ్ బాగా ఎక్కువ ♦రీ ఫ్యూయలింగ్ సులభం. వేగంగా పూర్తి చేయొచ్చు. చార్జింగ్ అవసరం లేదు. బ్యాటరీ చార్జ్ అయ్యే వరకు వేచి చూసే అవసరం ఉండదు. ♦కాలుష్యం వెలువడదు ♦దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అందువల్ల హైడ్రోజన్ను ప్రభుత్వాలు చౌకగా అందించే అవకాశం ఉంది. చౌకగా లభ్యమయితే వ్యయమూ బాగా తగ్గుతుంది. సవాళ్లూ ఉన్నాయి.. ♦హైడ్రోజన్కు మండే స్వభావం ఎక్కువ. నిల్వ చేసిన ట్యాంకు లోహాన్ని పెళుసుగా మార్చే గుణం ఉంటుంది. ఫలితంగా లీకేజీకి అవకాశాలు ఉంటాయి. ♦హైడ్రోజన్ ఉత్పత్తి అత్యంత జఠిలమైన ప్రక్రియ. ఉత్పత్తి వ్యయాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. గ్రీన్ హైడ్రోజన్ కాకపోతే ఉత్పత్తి సమయంలో కాలుష్యం వెలువడుతుంది. సంప్రదాయ శిలాజ ఇంధనాలను ఉత్పత్తికి వాడితే వ్యయం తక్కువగా ఉంటుందని ఆశించలేం. ♦ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం.. హైడ్రోజన్ నిల్వ, రవాణా కష్టమైన అంశాలు. అందువల్ల రవాణా కూడా ఖరీదే. ♦దేశంలో డిమాండ్కు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి చాలా సమయం పడుతుంది. వాహనాల తయారీతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి టెక్నాలజీ మీద ఏకకాలంలో పనిచేయాలి. హైడ్రోజన్ పలు రకాలు ఉత్పత్తి విధానాన్ని బట్టి హైడ్రోజన్ను 6 రకాలుగా విభజించారు 1. గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో పవన, సౌర విద్యుత్ లాంటి పునరుత్పాదక వనరులు వాడతారు. ఈ విధానంలో కాలుష్యానికి చోటు లేదు. 2. వైట్ హైడ్రోజన్ (సహజ హైడ్రోజన్) శిలాజ ఇంధనాలు, సహజ వాయువు లభించినట్లుగానే హైడ్రోజన్ కూడా భూమిలో లభిస్తుంది. సహజ వాయువు ఉత్పత్తి మాదిరే డ్రిల్లింగ్ పద్ధతిలో హైడ్రోజన్ను వెలికితీయవచ్చు. అయితే వాణిజ్యపరంగా ఇది ఖరీదైన వ్యవహారం. పరిశోధనలకు మాత్రమే ఈ విధానాన్ని శాస్త్రవేత్తలు వాడుతున్నారు. 3. బ్లూ హైడ్రోజన్ బయోగ్యాస్ను బయోమీథేన్గా మార్చి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో కార్బన్ డై ఆక్సైడ్ అత్యంత కనిష్ట స్థాయిలో వెలువడుతుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ (ఐఈఏ) అంచనా ప్రకారం.. క్లీన్ ఎనర్జీరంగంలో 2050 నాటికి హైడ్రోజన్ ఉత్పత్తికి ఇదొక్కటే విధానం అనుసరిస్తారు. 4. పింక్ హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ను న్యూక్లియర్ ఎనర్జీ నుంచి తీసుకుంటారు. 5. యెల్లో హైడ్రోజన్ ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. సంప్రదాయ విధానంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను దీనికి వాడతారు. 6. బ్లాక్, బ్రౌన్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బొగ్గు వాడితే బ్లాక్, లిగ్నైట్ వాడితే బ్రౌన్ హైడ్రోజన్ అంటారు. ఇది కాలుష్యకారకమైన విధానం. హైడ్రోజన్ కారు తయారయింది టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ (ఐసీఎటీ) పైలెట్ ప్రాజెక్టు కింద హైడ్రోజన్ ఇంధన వాహనాన్ని తయారు చేశాయి. ‘టయోటా మిరాయ్’ పేరిట రూపొందించిన ఈ కారును కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విడుదల చేశారు. ఇన్టేక్ గ్రిల్ ద్వారా గాలిలోని ఆక్సిజన్ తీసుకొని, ఇంధన ట్యాంకులోని హైడ్రోజన్తో సంయోగం చెంది.. ఇంజన్ నడవడానికి కావాల్సిన శక్తిని విడుదల చేస్తుంది. పొగ గొట్టం నుంచి పొగ కాకుండా, నీరే వస్తుంది. పుణేలో రోడ్డెక్కిన తొలి హైడ్రోజన్ బస్సు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), పుణేలోని మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ సంస్థ కేపీఐటీ కలిసి హైడ్రోజన్తో నడిచే బస్సును తయారు చేసి గత వారం రోడ్డెక్కించాయి. దేశంలో ఇదే తొలి హైడ్రోజన్ బస్సు. సాధారణ డీజిల్ బస్సు ఏడాది పాటు తిరిగితే కనీసం 100 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తుందని సీఎస్ఐఆర్ తెలిపింది. డీజిల్ బస్సులు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని వాటి నుంచి వెలువడే కాలుష్యం అత్యధికమని పేర్కొంది. -
తాటి.. పోషకాల్లో మేటి
రంపచోడవరంలో డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ‘తాటి’పై జరుగుతున్న పరిశోధనలు సత్పలితాలనిస్తున్నాయి. అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా 1993 నుంచి చేపట్టిన పరిశోధనల ద్వారా తాటి నీరా(అప్పుడే తీసిన తాటి కల్లు)తో అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించారు. సాధారణంగా తాటికి సంబంధించి అందరికీ తెలిసింది తాటి బెల్లం మాత్రమే. అయితే హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ సీవీ వెంగయ్య తన ప్రయోగాలతో తాటి ద్వారా అనేక పదార్థాలు తయారు చేయవచ్చని నిరూపించారు. ఈ మేరకు ఐసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్)కు తన ప్రయోగ ఫలితాలను సమర్పించారు. ఏజెన్సీలో గిరిజనులకు తాటి చెట్ల ద్వారా ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో ఈ పరిశోధనలు చేసినట్లు వెంగయ్య తెలిపారు. తాటి తాండ్ర తయారీ ఇలా.. 1993 నుంచి తాటిపై పరిశోధనలు భారతదేశంలో తాటిపై పరిశోధనలు సాగిస్తున్న రీసెర్చ్ స్టేషన్ పందిరిమామిడిలోనే ఉంది. 1993 నుంచి ఇప్పటి వరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 270 రకాల తాటి చెట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల తాటి చెట్లు ఉంటాయని ఒక అంచనా. 2019 సంవత్సరంలో తాటి కల్లు నుంచి నీరా(హెల్త్ డ్రింక్) తయారు చేసే యూనిట్ను నెలకొల్పారు. దీని ద్వారా తాటి నుంచి కల్లు సేకరించి నీరా తయారు చేస్తారు. జనవరి నుంచి నీరా తయారీ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం తాటి పండ్లు నుంచి గుజ్జును సేకరించి తాటి తాండ్రను తయారు చేసి విక్రయిస్తున్నారు. తాటి గుజ్జును సేకరించేందుకు ఒక యంత్రాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేశారు. తాటి పండ్లు, తాటి తేగలు, తాటి కల్లు ద్వారా తాటి బెల్లం, జెల్లీ, నూక, పిండి, సిరప్లు, తాండ్ర తయారు చేస్తున్నారు. తాటికి సంబంధించి తెలంగాణ, బిహార్, తమిళనాడుకు చెందిన అనేక మంది రైతులు హెచ్ఆర్సీ వచ్చి శిక్షణ పొందుతున్నారు. తాటి తాండ్ర డీఎస్టీకి ప్రతిపాదనలు గ్రామస్థాయిలో తాటి ఉత్పత్తులు తయారీపై శిక్షణ ఇచ్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రతిపాదనలు పంపించాం. టీఎస్పీ నిధులు రూ.కోటి కేటాయించాలని కోరాం. గ్రామస్థాయిలో శిక్షణ ఇస్తే తాటిపండ్ల వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం మనకు లభిస్తున్న తాటి చెట్లు నుంచి 2 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నాం. :::సీవీ వెంగయ్య, శాస్త్రవేత్త, ఫుడ్ అండ్ టెక్నాలజీ, హెచ్ఆర్ఎస్, పందిరిమామిడి తాటి బెల్లం తాటి సిరా -
Parenting Tips: పంచతంత్రం.. పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? అంటే..
పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఆస్ట్రేలియాలోని లా ట్రోంబే యూనివర్సిటీ పరిశోధకులు కొన్ని సూచనలు చేశారు. ‘హౌ టు రైజ్ సక్సెస్ఫుల్ కిడ్స్’ అనే అంశం మీద వాళ్లు ప్రధానంగా ఐదు అంశాలను చెప్పారు. అందులో ఎమోషనల్ ఇంటలిజెన్స్ను ప్రధానంగా ప్రస్తావించారు. వాటిని పరిశీలిద్దాం. బంధాల అల్లిక... పరిశోధకులు చెప్పిన మొదటి అంశం... కేర్... కేర్... కేర్. సెల్ఫ్ కేర్... తమను తాము సంరక్షించుకోవడం. అదర్స్ కేర్... ఇతరులను పట్టించుకోవడం. పెట్ కేర్... ఇంట్లో ఉన్న పెంపుడు జంతువుల సంరక్షణ. స్థూలంగా వాళ్లు చెబుతున్న విషయం ఏమిటంటే... పిల్లల్ని తమ పనులు తాము చేసుకునే విధంగా తయారు చేయాలి. అలాగే తల్లిదండ్రులకు లేదా గ్రాండ్ పేరెంట్స్ ఇతర కుటుంబ సభ్యులకు చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం వంటివి కూడా అలవాటు చేయాలి. పిల్లలను శ్రామికులుగా మార్చడం అని కాదు వాళ్లు చెబుతున్నది. పెద్దవాళ్లకు మందుల పెట్టె అందించడం, మందులు వేసుకునేటప్పుడు నీళ్లు తెచ్చి ఇవ్వడం వంటి పనులు చేస్తూ ఉంటే ఇతరులను పట్టించుకోవడం అనే మంచి లక్షణం పిల్లలకు ఒంటపడుతుంది. పెంపుడు జంతువు పట్ల ఇష్టం ఉండడం– పెట్ సంరక్షణ పట్ల బాధ్యత కలిగి ఉండడం రెండూ భిన్నమైనవి. పెట్ను ముద్దు చేయడంతోపాటు వాటి బాగోగులు పట్టించుకోవడం కూడా అలవాటు చేస్తే ప్రేమవాత్సల్య బంధాలను స్వయంగా అనుభవంలో తెలుసుకుంటారు. స్ఫూర్తిమంత్రం ... రెండవ అంశంగా మర్యాదపూర్వకమైన ప్రవర్తన గురించి చెప్పారు. ఇతరుల నుంచి సహాయం కోరేటప్పుడు వినయంగా అడగడం, సహాయం పొందిన తర్వాత చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలియచేయడం, ఇతరులకు సహాయం చేయడంలోనూ వినమ్రత పాటించడం వంటివి ఇంట్లో పదేళ్లలోపే అలవడాలని పరిశోధకుల నివేదిక సారాంశం. మూడవ అంశంగా ఎమోషనల్ ఇంటలిజెన్స్ను ప్రస్తావించారు. బాల్యంలో ఎమోషనల్ ఇంటలిజెన్స్ను వృద్ధి చేసుకున్న వాళ్లు చదువులో మందు ఉండడాన్ని గమనించినట్లు చెప్పారు. అలాగే మంచి ఉద్యోగంలో స్థిరపడడంతోపాటు జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నట్లు పరిశోధకుల అధ్యయనం. రేచల్ కాట్జ్, హెలెన్ ష్వే హదానీ తమ అధ్యయనాల సారాంశాన్ని క్రోడీకరిస్తూ ‘ఎమోషనల్ ఇంటలిజెంట్ చైల్డ్: ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫర్ పేరెంటింగ సెల్ఫ్ అవేర్, కో ఆపరేటివ్ అండ్ వెల్ బాలెన్స్డ్ కిడ్స్’ అనే పుస్తకం రాశారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ వృద్ధి చేసుకున్న పిల్లలు చదువులో చురుగ్గా ఉంటారని, ఒక సమస్యను సమయస్ఫూర్తితో పరిష్కరించగలిగిన నేర్పు కూడా అలవడుతుందని వారి అభిప్రాయం. అదే విషయాన్ని మరింత వివరంగా చెప్పారు డాక్టర్ సుదర్శిని. ‘‘భావోద్వేగాలు చాలా విలువైనవి. వాటిని సరిగ్గా వ్యక్తీకరించడం కూడా చాలా ముఖ్యం. ఒక ఇంట్లో తల్లిదండ్రులు భావోద్వేగాల వ్యక్తీకరణ ఎంత సమర్థంగా చేయగలుగుతారో వాళ్ల పిల్లలు కూడా అదే ధోరణిని ఒంటపట్టించుకుంటారు. సంతోషాన్ని వ్యక్తం చేసే క్రమంలో ‘నిన్న పార్కులో చాలా సంతోషంగా ఆడుకున్నాను. ఈ రోజు సాయంత్రం పార్కుకు వెళ్తున్నాను, ఇప్పటి నుంచే చాలా ఎక్సైటింగ్గా ఉంది’ అని చెప్పడం రావాలి. ప్రతి ఫీలింగ్నీ వ్యక్తం చేయడానికి ఒక పదం ఉంటుంది. ఆ పదాలను నేర్పించాలన్న మాట. అలాగే పాజిటివ్, నెగెటివ్ ఎమోషన్స్ రెండింటికీ తేడా వివరించాలి. కోపం నుంచి కామ్డౌన్ కావాలనే స్పృహను కలిగించాలి. కోపం లేదా దుఃఖభరితంగా ఉన్నప్పుడు దాన్నుంచి బయటపడడానికి జోక్స్ బుక్ లేదా డ్రాయింగ్ అండ్ కలరింగ్ కిట్ తీసి వాళ్ల ముందు పెట్టాలి. కామ్డౌన్ కావడానికి తనకు ఇష్టమైన వ్యాపకం దోహదం చేస్తుందని వాళ్లకు అర్థమవుతుంది’’ అన్నారామె. బుర్రకు పని ... యూరప్లో వేలాది మంది పిల్లల మీద నిర్వహించిన అధ్యయనంలో టీవీ స్క్రీన్కు అతుక్కుపోతున్న అలవాటు గురించి తల్లిదండ్రులకు గట్టి హెచ్చరికలే చేశారు. అయతే పరిశోధకులు ఈ విషయంలో వీడియో గేమ్లకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ చూస్తూ మెదడును బద్దకంగా ఉంచడంతో పోలిస్తే మెదడును పాదరసంలా స్పందింపచేసే వీడియో గేమ్లను కొంత వరకు ప్రోత్సహించారు. ఎప్పుడూ ఒకేరకమైన ఆటలకే పరిమితం కాకుండా కొత్త కొత్త ఆటలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మెదడు చురుగ్గా ఉంటుంది. అలాగే వీడియో గేమ్కు పరిమితమైన సమయం కేటాయించమనే సూచన కూడా చేశారు. అభిరుచి ... ఐదవ అంశం మరింత ప్రధానమైనది. అది పిల్లల అభిరుచిని గుర్తించడం, గౌరవించడం. పిల్లల్ని తమ అభిరుచులను వ్యక్తం చేయనివ్వాలి. వాళ్లు చెప్పడం మొదలు పెట్టగానే అడ్డు తగులుతూ అది మంచిదో చెడ్డదో నిర్ణయించేసి తీర్పు చెప్పడం సరికాదు. పిల్లల్లో ఒక విషయంలో విపరీతమైన ఇష్టం ఉంటే పేరెంట్స్ కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సిందే. క్రీడాకారులు అలా తయారైన వాళ్లేనన్నారు అధ్యయన కారులు. సక్సెస్కి దారి తీసే అనేక కారకాల్లో ప్యాషన్ను మించినది మరొకటి ఉండదు. ఏ రంగంలోనయినా కీలకంగా ఎదిగిన వాళ్లను పరిశీలిస్తే వాళ్లలో ఆ వృత్తి పట్ల ఉన్న అభిరుచి, అంకితభావాలు అర్థమవుతాయనేది పరిశోధకుల అభిప్రాయం. భావోద్వేగాల పరిచయం ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే... ఎదుటి వాళ్ల భావాలను గౌరవిస్తూనే మన అభిప్రాయాలను వ్యక్తం చేయడం, పరిస్థితిని సానుకూల పరచడం అన్నమాట. పిల్లలు తమకు ఏదైనా కావాలంటే పేచీ పెట్టడం, ఏడవడం, నేలమీద దొర్లడం చూస్తుంటాం. ఎమోషనల్ ఇంటలిజెన్స్ ప్రాక్టీస్ అయిన పిల్లలైతే తమ భావాలను తల్లిదండ్రులకు చక్కగా మాటల్లో వివరించగలుగుతారు. భావోద్వేగాలను వ్యక్తం చేసే వొకాబులరీని పిల్లలకు నేర్పించాలి. అప్పుడు తమ అసంతృప్తి, ఆగ్రహం, ఆవేదన, సంతోషం, ఆనందాలను మాటల్లో వ్యక్తం చేయగలుగు తారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ ప్రాక్టీస్ ఉన్న వాళ్లు పర్సనల్ లైఫ్లోనూ, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా సంతోషంగా, చలాకీగా దూసుకుపోగలుగుతారు. – డాక్టర్ సుదర్శిని, చైల్డ్ సైకాలజిస్ట్ --- వాకా మంజులారెడ్డి చదవండి: Best Tips: ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? బ్యాక్టీరియా ఎలా పోతుంది? -
తారల తళుక్కులను చూసేద్దాం!
సాక్షి, అమరావతి: కాంతి కాలుష్యానికి (లైట్ల వెలుతురు పెద్దగా లేని ప్రాంతం) దూరంగా చీకటి ఆకాశంలో టెలీస్కోప్ల సాయంతో నక్షత్రాలను వీక్షించడమే ఆస్ట్రో పర్యాటకం. ఇది ఎత్తైన కొండలు, దట్టమైన కోనలు, హిమ పర్వతాల ప్రాంతాల్లో సాంకేతికతతో కూడిన ఎకో టూరిజంగా ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇందులో పర్యాటకులు స్పష్టమైన రాత్రి ఆకాశాన్ని అన్వేషిస్తూ (నైట్ స్కై టూరిజం) గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఖగోళ వస్తువులు, ఉల్కాపాతాలను వీక్షించవచ్చు. ఆస్ట్రో–ఫొటోగ్రఫీ నేర్చుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు సైతం ఆకాశంపై పరిశోధనలకు రాత్రి శిఖరాగ్ర ప్రదేశాల్లోనే ఎంచుకొంటారు. ఉపాధి వనరుగా.. ఆస్ట్రో టూరిజం స్థానిక వర్గాలకు బలమైన ఆర్థిక, సామాజిక ఉపాధి వనరుగా మారుతోంది. లద్ధాఖ్లో స్థానిక మహిళలకు ఆస్ట్రో టూరిజంలో టెలిస్కోప్ల వినియోగంలో శిక్షణ పొంది నక్షత్రాలు, నక్షత్ర రాశులను గుర్తించడంలో పర్యాటకులకు గైడులుగా వ్యవహరిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆస్ట్రో–స్టే పేరిట స్థానిక గృహాల్లోనే పర్యాటకులకు బస కల్పించి ఉపాధి పొందుతున్నారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్ల్లో ఖగోళ పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టుల కోసం గుడిసెలు ఏర్పాటు చేస్తూ.. భోజనాలు అందిస్తూ..సంగీత కచేరీలతో అలరిస్తూ సంపాదిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని బెనిటల్ ఆస్ట్రో గ్రామంగా మారింది. ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘ఆస్ట్రో విలేజ్ పార్టీలు’ పెడుతున్నారు. దేశంలో ఇలా.. దేశంలో తొలి సారిగా రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 33 జిల్లాల్లో ఆస్ట్రో టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి జిల్లాలో టెలిస్కోప్లు ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీలోని బికనీర్ హౌస్లో కూడా ఆస్ట్రో టూరిజం కోసం కేంద్రాన్ని నిర్వహిస్తోంది. రాజధాని జైపూర్లోనే 4 నక్షత్ర వీక్షణ కేంద్రాలను పెట్టింది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పుదుచ్చేరి, కర్ణాటకలోని విరాజ్పేట, మడికేరి, గోవా, కేరళలోని మున్నార్లో ఆస్ట్రో ఫోటోగ్రఫీ సెషన్లు, ప్లానెటరీ పెరేడ్, ‘మెస్సియర్ మారథాన్’ పేరుతో చీకటి ఆకాశాన్ని వీక్షించేందుకు మొబైల్ అబ్జర్వేటరీలు నడుస్తున్నాయి. తమిళనాడులో తక్కువ జనసాంద్రత కలిగిన ఏలగిరి కొండలు, ఊటీకి ఖగోళ పర్యాటకం పెరుగుతోంది. లద్ధాఖ్కు ప్రత్యేక గుర్తింపు! ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో లద్ధాఖ్లోని హన్లే గ్రామం ఒకటి. ఈ ప్రాంతాన్నే ఇటీవల మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్గా ప్రకటించారు. ఇది శీతల ఎడారి ప్రాంతం కావడంతో ఏడాది పొడవునా పొడి వాతావరణంతో ఆకాశంలో పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే పరిశోధనల కోసం రాత్రిపూట ఆకాశాన్ని కాంతి కాలుష్య కారకాల నుంచి పరిరక్షించే దిశగా ప్రత్యేక బృందం కృషి చేస్తోంది. -
ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా?
వాషింగ్టన్: కరోనా వైరస్ చూసి ప్రపంచమంతా భయపడుతున్న వేళ..ఇతర రకాల వైరస్ల సామర్థ్యంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వైరస్లు ఇతర జీవుల చర్మ వాసనలను సైతం మార్చేసి దోమలు కుట్టేందుకు ప్రేరేపించేలా చేయగల శక్తి ఉందని తాజాగా తేలింది. కనెక్టికట్ యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంగ్వా వాంగ్ ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. దోమల ద్వారా సంక్రమించే మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, జికా, గున్యా జ్వరాలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతున్నారు. ఈ బాధితులను కుట్టిన దోమ ఆ వైరస్ని, అది కుట్టిన మరో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఇలా అతిథేయిపై వాలి కుట్టేందుకు దోమలను ప్రేరేపించే అంశాలను పెంగ్వా వాంగ్ గుర్తించారు. వైరస్ బాధిత జీవి చర్మంపై తయారయ్యే అసిటోఫెనోన్ అనే ఒక సువాసన తయారవుతుందని, దీనివల్లనే ఆరోగ్యవంతుల కంటే 10 రెట్లు ఎక్కువగా దోమలు బాధితులనే కుడుతున్నట్లు గుర్తించారు. పేగులు, చర్మంపై నుండే బాసిల్లస్ బ్యాక్టీరియానే అసిటోఫెనోన్ తయారీలో కీలకం. డెంగ్యూ, జికా వైరస్లు చర్మంపై నుండే బాసిల్లస్ బ్యాక్టీరియా రెల్మా అనే కణ తయారీని అడ్డుకుని అసిటోఫెనోన్ను పెంచుతోంది. ప్రయోగంలో చివరిగా వైరస్ బాధిత ఎలుకలకు ఎల్మాను ప్రేరేపించే విటమిన్ ఏను అందజేసి, వాటి శరీరంపై బాసిల్లస్ బ్యాక్టీరియాను తగ్గించినప్పుడు తిరిగి ఆరోగ్యవంతంగా మారాయి. మనుషులపైనా ఇవే ప్రయోగాలను చేపట్టి, ఫలితాల ఆధారంగా అంతిమంగా వాటిని బాధితులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తామని పెంగ్వా వాంగ్ చెప్పారు. తమ ప్రయోగాలు పలు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు ఎంతో మేలుచేస్తాయన్నారు. -
రీసెర్చ్ కారిడార్గా తిరుపతి
తిరుపతి రూరల్: కేంద్ర పరిశోధన సంస్థలతో పాటు దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా తొమ్మిది యూనివర్సిటీలున్న తిరుపతిని రీసెర్చ్ కారిడార్గా తీర్చిదిద్దుతామని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్, కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన కార్యదర్శి డాక్టర్ సతీష్రెడ్డి తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యా సంస్థలు నూతన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్(ఐఎస్టీఎఫ్)ను శనివారం ఆయన ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. పలు కాలేజీలు, యూనివర్సిటీలను నాలెడ్జ్ పాట్నర్స్గా చేసుకుని వారికి సర్టిఫికెట్లు అందించారు. యువకులు, అ«ధ్యాపకులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పరిశోధనల పరంగా తిరుపతిని అభివృద్ధి చేసేందుకు చాలా అవకాశాలున్నాయని చెప్పారు. వాతావరణ పరిశోధన కేంద్రంతో పాటు.. వేలాది మంది యువత ఈ నగరానికి అదనపు బలమని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశంలో గత పదేళ్లలో ఊహించని పురోగతి సాధించినట్లు తెలిపారు. ఐఐటీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఉపాధి కోసం గతంలో 75 శాతం మంది విదేశాలకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు వారంతా దేశంలోనే ఉంటున్నారని తెలిపారు. 70 వేలకు పైగా నూతన ఆవిష్కరణలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయ్యాయని, ఇది మన పురోగతికి నిదర్శనమన్నారు. నూతన ఆవిష్కరణలకు ఇండెక్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ విభాగాల ద్వారా డీఆర్డీవో రూ.కోటి నుంచి రూ.15 కోట్ల వరకూ ఫండింగ్ చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 60 నూతన ఆవిష్కరణలకు ఫండింగ్ చేశామని, ఈ ఏడాది కనీసం 5 వేల వరకూ పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, పరిశోధనలపై ఆసక్తి కలిగిన వారు రక్షణ రంగం అందిస్తున్న ఈ ఫండింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో దేశం సంపదను సృష్టిస్తోందని, రానున్న రోజుల్లో 39,475 వేల కోట్ల ఎగుమతులే లక్ష్యమన్నారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాలంటే అన్ని రంగాల్లోనూ అధునాతన పరిశోధనలు అవసరమని, వీటిని ప్రోత్సహించే ఇంక్యూబేషన్ సెంటర్లు, విద్యా సంస్థలు, రీసెర్చ్ సంస్థలకు అన్ని విధాలా ప్రోత్సాహకాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు సరికొత్త వేదికగా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని, ఈ సందర్భంగా దాని రూపకర్త డాక్టర్ నారాయణరావును డాక్టర్ సతీష్రెడ్డి అభినందించారు. నూతన ఆవిష్కరణలకు వేదిక.. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు వేదికగా ఐఎస్టీఎఫ్ ఫౌండేషన్ను ప్రారంభించినట్టు దాని అధ్యక్షుడు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రో–వైస్ చాన్సలర్ ఆచార్య నారాయణరావు చెప్పారు. తిరుపతిలో డీఆర్డీవో ల్యాబ్, ఐఐటీలో సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ కోరారు. ఐఎస్టీఎఫ్ మూడు దశల్లో సేవలందించాలని సూచించారు. స్కూల్ స్థాయి విద్యార్థులకు క్షేత్ర స్థాయి పరిశీలన, కళాశాల స్థాయి విద్యార్థులకు.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్న ఉపాధిపై, రీసెర్చ్ స్థాయి విద్యార్థులకు నూతన ఆవిష్కరణల రంగంపై శిక్షణ, వారికి తోడ్పాటు వంటి అంశాలపై ఫౌండేషన్ దృష్టి పెట్టాలని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ గణేష్ సూచించారు. కార్యక్రమంలో గాదంకి ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ ఏకే పాత్రో, ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ, మోహనబాబు వర్సిటీల వీసీ ఆచార్య రాజారెడ్డి, జమున, నాగరాజన్, ఫౌండేషన్ కోశాధికారి వాసు, విజయభాస్కరరావుసభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై ఉన్న వకుళమాత అమ్మవారిని, తిరుమల శ్రీవారిని డాక్టర్ సతీష్రెడ్డి దర్శించుకున్నారు. -
ఈ రోడ్డుపై నీళ్లు నిలవవు!
కాజీపేట అర్బన్: ఏ చిన్నపాటి వాన కురిసినా రోడ్లపై నీళ్లు నిలుస్తాయి. వచ్చిపోయే వాహనాలతోపాటు పాదచారులకూ నరకమే. అదే భారీ వర్షాలు కురిస్తే రోడ్లపై నీళ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు తోడ్పడే ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్లు, పేవ్మెంట్ల నిర్మాణంపై వరంగల్ నిట్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోయే ఈ తరహా రోడ్లను.. విదేశాల్లో పలుచోట్ల పార్కింగ్ స్థలాలు, ఉద్యానవనాలు వంటి చోట్ల ఇప్పటికే వినియోగిస్తున్నారు. దీనిని మన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై నిట్ సివిల్ విభాగం ట్రాన్స్పోర్ట్ డివిజన్ ప్రొఫెసర్ ఎస్.శంకర్, పీహెచ్డీ స్కాలర్ గుమ్మడి చిరంజీవి పరిశోధన చేస్తున్నారు. ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్లు/పేవ్మెంట్లతో నీరు నిల్వ ఉండకపోవడం వల్ల దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందవని.. రోగాలు ప్రబలకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు నీటిని పీల్చేసుకుని.. ♦సురక్షితమైన ప్రయాణానికి వీలు కల్పించే తారు, సీసీ రోడ్డు మాదిరిగానే ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్డు ఉంటుంది. సాధారణంగా తారు, సీసీ రోడ్లను నాలుగు దశల్లో మట్టి, కంకర, తారు లేదా సిమెంట్ వినియోగించి నిర్మిస్తారు. ఇవి పూర్తిగా గట్టి పొరలా ఉండిపోయి.. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తాయి. ♦‘పోరస్ ఆస్ఫాల్ట్’ పేవ్మెంట్/రోడ్డును 16 దశల్లో వేర్వేరుగా నిర్మిస్తారు. వివిధ పరిమాణాల్లో ఉన్న కంకరను వినియోగిస్తారు. రోడ్డు దృఢంగా ఉంటూనే.. పెద్ద సంఖ్యలో చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడేలా చూస్తారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా రంధ్రాలు ఉండేలా చూస్తారు. ♦వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు నీటిని పీల్చుకుని భూగర్భంలోకి పంపేస్తాయి. వెంట వెంటనే నీళ్లు ఇంకిపోవడం వల్ల నిల్వ ఉండటం, ముంపునకు కారణం కావడం వంటివి ఉండవు. ♦పట్టణాల్లో ఇలాంటి రోడ్లు/పేవ్మెంట్లను నిర్మించినప్పుడు వాటి దిగువ నుంచి నీళ్లు డ్రైనేజీల్లోకి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తారు. దానితో ఎంతగా వానపడ్డా నీళ్లు నిలవవు. ముంపు నివారణ కోసం.. నిట్ వరంగల్ క్యాంపస్లో తొలుత పోరస్ ఆస్ఫాల్ రోడ్డును 50 మీటర్ల మేర ఏర్పాటు చేయనున్నాం. దానిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తాం. గ్రేటర్ వరంగల్లో వాన ముంపును నివారించేందుకు ఈ విధానాన్ని అందజేస్తాం. సైడ్ డ్రెయిన్స్ లేని ప్రాంతాల్లో, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. – శంకర్, ప్రొఫెసర్, సివిల్ విభాగం -
ఆకాశం నుంచి పడుతున్న మిస్టరీ బాల్స్.. తల పట్టుకున్న అధికారులు
Mysterious metal balls raining..ఆకాశం నుంచి అంతుచిక్కని రీతిలో లోహపు గోళాలు భూమిపై పడుతున్నాయి. తీరా వాటి దగ్గరికి వెళ్లి చూశాక అవి ఈకల రూపంలో తీగలు బయటకు రావడం కలకలం సృష్టించింది. గుజరాత్ వరుసగా ఇలాంటి గోళాలు పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, సురేంద్ర నగర్ జిల్లాలోని సాయిలా గ్రామంలో సోమవారం కొన్ని లోహపు గోళాలు కనిపించాయి. ఈ లోహపు గోళాలు అక్కడ పడిపోయాయని సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. కాగా, గోళాలు ఈకల రూపంలో తీగలుగా ఉండటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక, చాలా వరకు ఈ లోహపు గోళాలు నిర్మానుష్య ప్రాంతంలో ఒకే చోట పడిపోవడంతో అవి ఆకాశం నుంచే పడ్డాయన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో, ఈ వ్యవహారాన్ని తేల్చడానికి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ నిపుణులను సమాచారం అందించారు. ప్రభుత్వ పరిధిలోని ఈ సంస్థ నిపుణులు అంతరిక్షంపై స్పేస్ సైన్స్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ నిపుణులు లోహపు గోళాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇవి భూమికి సమీప కక్షలో తిరుగుతున్న శాటిలైట్ శకలాలే అయి ఉంటాయని వారు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. 'It's a bird. It's a plane...': Mysterious metal balls raining in Gujarat puzzles locals pic.twitter.com/RGKEpPQyoO — Times No1 (@no1_times) May 16, 2022 ఇదిలా ఉండగా.. కొద్ది రోజల క్రితం గుజరాత్లో ఆనంద్ జిల్లాలోని భలేజ్, ఖంబోలాజ్, రాంపుర గ్రామాల్లో సుమారు 5 కిలోల బరువున్న మెటల్ బాల్స్ మొదటిసారిగా ఆకాశం నుంచి భూమిపై పడ్డాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. Meteorite Or An Alien? Mysterious Metal Balls Fall From Space Video Goes Viral https://t.co/U3dhPxmofB — Trends302 (@Trends_302) May 13, 2022 ఇది కూడా చదవండి: ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్ -
సాగును లాభసాటిగా మార్చాలి
ఏజీ వర్సిటీ: దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ రంగంలో జరిగే ప్రతి పరిశోధన అంతిమ లక్ష్యం వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం, వాతావరణ మార్పుల నుంచి పంటలను రక్షించుకోవడం, అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం, దేశ ఆహార భద్రతను కాపాడటమే కావాలన్నారు. వెంకయ్య శనివారం రాజేంద్రనగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (ఐసీఏఆర్–ఎన్ఏఏఆర్యం) స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహమివ్వాలని కోరారు. ప్రతి రైతును సంప్రదాయ విధానం, ఆధునాతన సాంకేతిక పద్ధతులతో కలిసి పనిచేసేలా చైతన్యపరచాల్సిన బాధ్యతను వ్యవసాయ విద్యాలయాలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే విషయంలోనూ స్థానిక భాషలోనే శాస్త్రవేత్తలు వారికి బోధించాలని చెప్పారు. జెనోమిక్స్, మాలిక్యులర్ బ్రీడింగ్, నానోటెక్నాలజీ మొదలైన రంగాలపై దృష్టిసారించాలన్నారు. డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి సాంకేతికతనూ వ్యవసాయానికి మరింత చేరువ చేయడంలో ఐసీఏఆర్ మరింత కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వారు వ్యవసాయాన్ని సంఘటిత రంగంగా మార్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. వాతావరణ సమస్యలు, ఇతర అనేక ఇబ్బందులు ఎన్నున్నా అన్నదాత తన బాధ్యతను విస్మరించకుండా ఆహారోత్పత్తికోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని వెంకయ్య చెప్పారు. కరోనా సమయంలోనూ దేశంలో ఆహారోత్పత్తి ఏమాత్రం తగ్గకపోగా ఉత్పత్తి పెరిగిందని, ఇది అన్నదాతల అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు. -
ఆర్వీ నగర్కు రానున్న కాఫీ పరిశోధన స్థానం
కాఫీ రైతులకు శుభవార్త. కాఫీ పరిశోధనస్థానం వెనక్కి రానుంది. గతంలో ఆర్వీనగర్లో ఉన్న కాఫీ పరిశోధన స్థానం భవనాలను మావోయిస్టులు పేల్చేయడంతో మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అక్కడ నుంచి శాస్త్రవేత్తలు సేవలందిస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్ తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా నియమించడంతో కాఫీ రైతులకుమరింత మేలు జరగనుంది. గూడెంకొత్తవీధి : కాఫీ పరిశోధన స్థానం సేవలు రైతుల చెంతకే రానున్నాయి. ఇప్పటివరకు నర్సీపట్నంలో ఉన్న ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆరింటిలో ఒకటి.. కాఫీ సాగుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆరు కేంద్ర కాఫీ పరిశోధన కేంద్రాలు ఉండగా వాటిలో ఒకదానిని జీకేవీధి మండలం ఆర్.వి.నగర్లో నెలకొల్పారు. కాఫీకి సంబంధించి మేలు రకాలను గుర్తించి వాటిని రైతులకు అందించడం, ఏయే రకాలు మన్యానికి అనుకూలమనే విషయాలపై ఇక్కడ కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర కాఫీబోర్డు ఆధ్వర్యంలో విస్తరణ విభాగం ఉంది. కాఫీ తోటలను విస్తరించడం, రైతులకు అవసరమైన విత్తనాలను, యంత్రాలను, కాఫీ కల్లాలను ఈ విభాగం సమకూరుస్తోంది. మావోయిస్టులు పేల్చేయడంతో.. ఆర్వీనగర్లో ఉన్న ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని 18 ఏళ్ల క్రితం మావోయిస్టులు ల్యాండ్మైన్తో పేల్చేశారు. దీంతో భవనాల కొరత ఏర్పడింది. అప్పటి అవసరాల రీత్యా శాస్త్రవేత్తలు పరిపాలన సౌలభ్యం, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అప్పటి నుంచి 18 ఏళ్లుగా ఈ కార్యాలయం నుంచే శాస్త్రవేత్తలు పరిశోధనలు, విధులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ డీడీ స్థాయి అధికారితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుతో ఇప్పటికే మైదాన ప్రాంతాల్లోని కార్యాలయాలన్నీ మన్యానికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన సంస్థ, కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధన స్థానం అల్లూరి జిల్లాలోనే కొనసాగించనున్నారు. శాస్త్రవేత్తల సేవలు మరింత చేరువ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టడం పరిశోధన స్థానం వెనక్కి రావడానికి అనుకూలమైన అంశంగా పలువురు పేర్కొంటున్నారు. లక్షన్నర ఎకరాల్లో సాగు కాఫీ సాగుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. సుమారు 1.3 లక్షలకు పైగా కుటుంబాలు లక్షన్నర ఎకరాల్లో కాఫీని వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు. ఏటా పదివేల టన్నుల వరకు కాఫీ గింజలను ఉత్పత్తి చేస్తున్నారు. పోడు వ్యవసాయం నిరోధించి గిరిజనులతో కాఫీసాగు చేపట్టడం ద్వారా అడవులను రక్షించవచ్చని భావించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర కాఫీబోర్డు ద్వారా కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఈ పరిస్థితుల్లో పరిశోధనస్థానం మళ్లీ ఆర్వీ నగర్కు వచ్చే అవకాశం ఉండటంతో గిరి రైతులకు మేలు చేకూరనుంది. శాస్త్రవేత్తల సహకారం అవసరం ఇప్పటికే మన్యం కాఫీకి మంచి గుర్తింపు ఉంది. కాఫీ సాగులో మేలైన దిగుబడులతో పాటు శాస్త్రీయ విధానాలు ఆచరించేందుకు వీలుగా శాస్త్రవేత్తల సహకారం అవసరం. వారి సేవలను పూర్తిస్థాయిలో కాఫీ రైతులకు చేరువ చేస్తాం. మన్యం కాఫీకి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో మన్యం కాఫీకి మరింత పేరు దక్కేలే తమవంతు కృషిచేస్తా. – గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ, కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలు కాఫీ సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు రానున్న మూడేళ్లలో కాఫీ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకు జి.మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి మండలాల్లో ఎకో పల్పింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోంది. విస్తీర్ణం పెంపుతో పాటు దిగుబడులు పెంపు ద్వారా గిరిజనుల ఆదాయం రెట్టింపు అవుతుంది. తద్వారా గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత కాఫీ రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐటీడీఏ సంపూర్ణ సహకారం అందిస్తోంది. వ్యక్తిగతంగా కాకుండా కాఫీ రైతులంతా సంఘటితంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడుతున్నాం. ఎఫ్పీవో ప్రోత్సహిస్తుంది. పరిశోధన స్థానం ఆర్వీ నగర్కు తిరిగి వస్తే గిరి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – అడపా విష్ణుమూర్తి, కాఫీ రైతుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, జి.కె.వీధి మండలం -
శాస్త్ర సాంకేతికతపై యుద్ధం పిడుగు
ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టి నెల రోజులు అవుతోంది. ఈ యుద్ధ ఫలితంగా వేలాదిమంది శరణార్థులుగా మారడంతో అతిపెద్ద మానవీయ సమస్య తలెత్తుతోంది. యుద్ధ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు, ఎరువులు, ఆహారపదార్థాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రష్యా దాడుల ప్రభావం ప్రపంచ శాస్త్ర పరిశోధన రంగంపై భారం మోపుతోంది. యుద్ధ కారణంగా కీలక ప్రాజెక్టులు రద్దు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ మానవ శాస్త్ర సాంకేతిక పురోగతిని దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధారంభం నుంచి ఇంతవరకు ప్రభావితమైన సైన్సు సంబంధిత అంశాలు ఇలా ఉన్నాయి.. మార్స్ మిషన్ రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్ మిషన్ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇరు పక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సిఉంది. కేవలం ఎక్సోమార్స్ మిషన్ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టుల్లో రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమాస్తో బంధాలను తెంచుకుంటున్నట్లు యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఇంధన రంగం ఉక్రెయిన్పై దాడితో ముందెన్నడూ చూడనటువంటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ముంచుకువస్తోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరీకరణకు ఈ ఏజెన్సీని 1973లో నెలకొల్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ సంక్షోభం తొలగిపోవాలంటే మిగిలిన దేశాలు ఉత్పత్తి పెంచితే సరిపోదని, ఇంధన పొదుపును అన్ని దేశాలు పాటించాలని ఏజెన్సీ సూచించింది. ఇందుకోసం ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, విమానయానాలను తగ్గంచడం, కార్పూలింగ్ను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని వేగంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. దీంతోపాటు ఫార్మా, ఆహార రంగాల్లో పలు పరిశోధనలు యుద్ధం కారణంగా అటకెక్కనున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇంతవరకు మానవాళి సాధించిన సైన్సు విజయాలను ధ్వంసం చేస్తాయని ప్రపంచ పరిశోధకులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఐఎస్ఎస్ నిర్వహణ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నిర్మాణంలో రష్యా, అమెరికా కలిసి పనిచేశాయి. తాజా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఆవేశాలు పెరిగాయి. దీని ప్రభావం అంతరిక్ష ప్రయోగాలపై పడనుంది. ఇక మీదట ఇరుదేశాల ఉమ్మడిపాత్రపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఐఎస్ఎస్లో ఉన్న అమెరికా ఆస్ట్రోనాట్ మార్క్ వాండే మరో ఇద్దరు రష్యన్ కాస్మోనాట్స్తో కలిసి భూమి మీదకు రష్యా అంతరిక్ష వాహనంలో రావాల్సిఉంది. ప్రస్తుతానికి ఈ ప్రయోగం వరకు సహకరించుకునేందుకు రష్యా, అమెరికా అంగీకారానికి వచ్చాయి. కానీ ఇకపై అమెరికాకు రాకెట్ విక్రయాలు చేపట్టమని రష్యా ప్రకటించింది. రష్యా దాడికి నిరసనగా అన్నట్లుగా రష్యన్ వ్యోమగాములు తమ ఐఎస్ఎస్ ప్రయాణంలో పసుపురంగు సూట్లు ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్యా దాడికి నిరసనగా ఉక్రెయిన్కు చెందిన ఈ రంగును కాస్మోనాట్లు వాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాము సాధారణంగానే ఈ రంగును ఎంచుకున్నట్లు కాస్మోనాట్లు చెబుతున్నారు. ముందుముందు ఐఎస్ఎస్పై రష్యా పట్టు తొలగిపోవచ్చన్న అనుమానాలున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
అమితా ‘బుద్ధుడి’పై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: పులికాట్ సరస్సులోని ఓ దీవిలో ఉన్న అమితాభ బుద్ధుడి రహస్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు పరిశోధన ప్రారంభిస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కుంతూరు పల్లె శివారులో నాలుగడుగుల బుద్ధుడి విగ్రహం చాలాకాలంగా ప్రశ్నార్థకంగా ఎదురుచూస్తోంది. తధాగతుడి రూపాల్లో అమితాభుడి అవతారం ఒకటి. ఆగ్నేయాసియా దేశాల్లో అమితాభ బుద్ధుడి ఆరాధన ఎక్కువ. పులికాట్ దీవిలో అమితాభ బుద్ధుడి విగ్రహం పరిశోధకులను ఆకట్టుకుంటోంది. మన దేశంలో ఈ తరహా శిల్పాలు అరుదు. ఈ ప్రాంతం ఇసుక దిబ్బలతో ఆర డుగుల ఎత్తుతో ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో బౌద్ధ స్థూపం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇక్కడ శాతవాహనుల కాలానికి చెందిన పెద్దపెద్ద ఇటుకలు వెలుగుచూశాయి. ‘1991 ప్రాంతంలో నేను శ్రీవెంకటేశ్వర వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పరిశోధించి బుద్ధుడి విగ్రహాన్ని గుర్తించా. ఆ సమయంలో కొన్ని ఇటుకలూ వెలుగుచూశాయి. అవి క్రీ.శ. 1–2 శతాబ్దాల కాలానికి చెందినవిగా అనిపించాయి’అని హెచ్సీయూ ప్రొఫెసర్ డాక్టర్ కేపీరావు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఏడాది క్రితం మళ్లీ కుంటూరుకు వెళ్లాం. బుద్ధుడి విగ్రహం అలాగే ఉంది. అక్కడి దిబ్బ ప్రాంతంలో ఈనెల 24 నుంచి దాదాపు నెలన్నరపాటు తవ్వకాలు జరపాలని నిర్ణయించాం’అని తెలిపారు. ఇటుక గోడ నిర్మాణ జాడలు ‘బుద్ధుడి విగ్రహమున్న ప్రాంతంలో గతంలో భారీ ఇటుకలతో గోడ ఉండేదని, కొందరు త వ్వి ఇటుకలు తీసుకెళ్లారని స్థానికులు చెప్పా రు. అమితాభ బుద్ధుడి శిల్పం ఇక్కడ ఎందుకుందో తవ్వకాల్లో తెలుస్తుంది. ఆగ్నేయాసియాతో ఈ ప్రాంతానికి సంబంధముందా కూడా తెలుస్తుంది’ అని కేపీరావు చెప్పారు. -
అద్భుతాలు సృష్టించి వాటికే బలైన.. ఆ శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా?
సాక్షి సెంట్రల్ డెస్క్: ఏదోచేశాం లే అన్నట్టు ఉండకుండా.. ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న శాస్త్రవేత్తలు వారు. ప్రపంచ గతినే మార్చిన ఆవిష్కరణలకు తోడ్పడినవారు. కానీ వారి విషయంలో విధి చిత్రమైన రాత రాసింది. మంచి మంచి ఆవిష్కరణలు, పరిశోధనలు చేసినవారిని.. ఆ ఆవిష్కరణలతోనే బలి తీసుకుంది. అలాంటి కొందరు శాస్త్రవేత్తలు, వారి పరిశోధనలు ఏమిటో తెలుసుకుందామా? చదవండి: పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్ యుద్ధం! సైకిల్ నుంచి బైక్ను తయారు చేసి.. దాదాపు 120 ఏళ్ల కింద.. దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లాలంటే కాలినడక లేదంటే సైకిల్ మాత్రమే దిక్కు. పెట్రోల్ కార్లు, ఇతర వాహనాలు అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న ఆ సమయంలో.. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఉద్యోగి విలియం నీల్సన్ సరికొత్త ఆవిష్కరణ చేశాడు. పెట్రోల్తో నడిచే చిన్నపాటి ఇంజిన్, మోటార్ను అభివృద్ధి చేసి.. మోటార్ సైకిల్ (బైక్)ను తయారు చేశాడు. కొన్నిసార్లు బాగానే టెస్ట్ డ్రైవ్ చేశాడు. కానీ 1903 అక్టోబర్లో మరో సారి టెస్ట్ చేస్తూ పడిపోయి చనిపోయాడు. రేడియేషన్ గుట్టు తేల్చినా.. కొత్తగా ఏదైనా కనిపెట్టాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలనూ పణంగా పెట్టాల్సి వస్తుంది. అలాంటి శాస్త్రవేత్త మేరీ క్యూరీ. కొత్త మూలకాలపై పరిశోధనలు చేసిన ఆమె.. రేడియం, పోలోనియం మూలకాలతోపాటు అణుధారి్మకత (రేడియేషన్)నూ గుర్తించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఏకంగా నోబెల్ బహుమతులు కూడా పొందారు. చివరికి తాను పరిశోధన చేసిన మూలకాల రేడియేషన్ కారణంగా ‘అప్లాస్టిక్ ఎనీమియా (ఎముకమజ్జ దెబ్బతిని రక్తం ఉత్పత్తి తగ్గిపోవడం)’కు గురై 1934లో చనిపోయారు. రాకెట్ టెక్నాలజీకి మార్గం చూపుతూ.. ప్రస్తుతం స్పేస్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. భారీ రాకెట్లతో ఉపగ్రహాలను పంపడమే కాదు. మనుషులూ అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఈ రాకెట్ టెక్నాలజీ అభివృద్ధిలో కీలకపాత్ర వహించిన వారిలో ఆ్రస్టియాకు చెందిన మాక్స్ వాలియర్ ఒకరు. రాకెట్ ఇంజిన్లపై ప్రయోగాలు చేసిన ఆయన.. 19వ శతాబ్దంలో జర్మన్ స్పేస్ఫ్లైట్ సొసైటీని స్థాపించారు. ఆ సొసైటీతో ఒక్కచోట చేరిన శాస్త్రవేత్తలే రాకెట్ టెక్నాలజీకి ఆద్యులు. చిత్రమేమిటంటే.. మాక్స్ వాలియర్ తాను అభివృద్ధి చేసిన రాకెట్ ఇంజిన్తో కారును తయారుచేసి, టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా పేలిపోయి చనిపోయారు. టైటానిక్కు రూపకల్పన చేసి.. ప్రపంచ ప్రఖ్యాత టైటానిక్ ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అంత విలాసవంతమైన భారీ నౌకను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ల బృందం ఇన్చార్జి థామస్ ఆండ్రూ. టైటానిక్ నిర్మాణంలో ఉన్నంత కాలం దగ్గరుండి చూసుకున్నారు. 1912 ఏప్రిల్ 14న టైటానిక్ ప్రమాదానికి గురై మునిగిపోతున్నప్పుడు..ప్రయాణికులకు సాయం చేస్తూ నౌకలోనే ఉన్నారు. చివరికి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. రక్త మార్పిడి గుట్టు తేల్చబోయి.. ఏదైనా ప్రమాదం జరిగి బాగా రక్తం పోతే.. బయటి నుంచి రక్తం ఎక్కించాల్సిందే. వందేళ్ల కింద.. ఆధునిక వైద్యం ఇంకా అభివృద్ధి చెందుతున్న సమయంలో రక్తం ఎక్కించడమంటే పెద్ద టాస్కే. ఆ సమయంలో రష్యాకు చెందిన అలెగ్జాండర్ బొగ్డనోవ్ అనే డాక్టర్.. రక్త మారి్పడిపై విస్తృతంగా ప్రయోగాలు చేశాడు. 1925లో మరికొందరితో కలిసి హెమటాలజీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇన్స్టిట్యూట్నూ స్థాపించాడు. ప్రయోగాల్లో భాగం గా 1928లో మలేరియా, టీబీ సోకిన ఓ రోగి రక్తాన్ని తాను ఎక్కించుకున్నాడు. తన రక్తాన్ని ఆ రోగికి ఎక్కిం చాడు. ఆ రోగి కోలుకున్నా.. బొగ్డనోవ్ కొద్ది రోజులకే ఆ రెండు వ్యాధులతో చనిపోయాడు. ఆయన సంస్థ, పరిశోధనలు రక్త మార్పిడిలో కొత్త ఆవిష్కరణలకు దారి వేశాయి. -
తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!
సాక్షి, హైదరాబాద్: భూమ్మీద క్షీరదాల (పాలిచ్చి పెంచే జీవుల) ఉనికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అవి తొలుత ఎక్కడ పుట్టాయి? ఎక్కడెక్కడ తిరిగాయి? అనేదానిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అలా ఇప్పటివరకు ఎక్కడో అర్జెంటీనాలో తొలినాళ్ల క్షీరదాల ఆధారాలు దొరకగా.. ఆ తర్వాత మన దేశంలో మన రాష్ట్రంలోనే వాటి గుట్టు బయటపడింది. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో పరిగి మండలం పరిధిలోని నష్కల్లో తొలినాళ్ల క్షీరదాల ఆధారాలు లభించాయి. అమెరికా కేంద్రంగా వెలువడే ప్రఖ్యాత సైన్స్ జర్నల్ పేలియోజియోగ్రఫీ, పేలియోక్లైమటాలజీ, పేలియోఎకాలజీ (పేలియో3) ఈ వివరాలను తమ ఆన్లైన్ జర్నల్స్లో ప్రచురించింది. ఏప్రిల్లో ముద్రణగా దీన్ని ప్రచురించనుంది. తొలినాళ్ల క్షీరదాలేమిటి..? కోట్ల ఏళ్ల కింద భూమిపై రాక్షస బల్లులు, ఇతర సరీసృపాలదే రాజ్యం. ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం అవి అంతరించిపోయాయి. ఆ సమయంలోనే క్షీరదాల (పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులు) ఉనికి మొదలైంది. చిన్నగా ఎలుకల పరిమాణంలో ఉండే క్షీరదాలు కలుగుల్లో, చెట్ల పొదల్లో మనుగడ సాగించాయి. డైనోసార్లు అంతమయ్యాక వాటికి శత్రువులు తగ్గి.. పరిణామం చెందాయి. ఇప్పుడున్న చాలా రకాల జంతువులుగా మారాయి. నాటి తొలితరం క్షీరదాల ఆధారాలు మొదట్లో అర్జెంటీనా దేశంలో వెలుగు చూశాయి. చాలా ఏళ్లపాటు ప్రపంచానికి ఆ వివరా లే దిక్కయ్యాయి. తర్వాత మన నష్కల్ ప్రాంతంలో ఆధారాలు బయటపడ్డాయి. స్వాతంత్య్రానికి పూ ర్వం 1930 దశాబ్దంలో ప్రఖ్యాత జియాలజిస్టు శర్మ.. ఈ ప్రాంతంలో రాక్షస బల్లుల శిలాజాలతోపాటు ఇతర జీవుల జాడలు గుర్తించారు. చదవండి: (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..) తర్వాత 1970ల్లో ఎన్వీబీఎస్ దత్త మరికొన్నింటిని గుర్తించారు. ఇలా నష్కల్, దానికి చేరువలో ఉన్న బసిరెడ్డిపల్లి, రంగాపూర్ మధ్య జీవ మహాయుగం (మోసోజోయిక్ పీరియడ్) నాటి జీవ పరిణామానికి సాక్ష్యంగా నిలిచాయి. ఈ క్రమంలో 1980ల్లో సహానీ, జీవీఆర్ ప్రసాద్ల బృందం తొలిసారి పురాతన క్షీరదాల ఆధారాలు సేకరించింది. ఆ వివరాలు ఇప్పటికే ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి. ఇక 1990 దశకంలో ప్రఖ్యాత జి యాలజిస్టు అనంతరామన్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం.. నష్కల్ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధన చేసి.. పురాతన సూక్ష్మ క్షీరదాలకు చెందిన దంత శిలాజాలను సేకరించింది. వాటిపై విస్తృతంగా పరిశోధన చేసి.. అవి డైనోసార్లు అంతరించే కాలానికి చెందిన, తొలితరం క్షీరదాలని తేల్చింది. ఈ వివరాలు అంతర్జాతీయ సైన్స్ జర్నల్ పేలియో3లో ప్రచురితం అవుతున్నాయి. ఎంతో తృప్తినిచ్చింది తొలితరం క్షీరదం జాడకు సంబంధించి నష్కల్ ప్రాంతంలో ఆధారాలు దొరికాయి. ఇక్కడ చేసిన పరిశోధన ఎంతో తృప్తినిచ్చింది. మరింత పరిశోధన చేస్తే ఎన్నో రహస్యాలకు సమాధానం చెప్పే ఆధారాలు దొరకవచ్చు. – అనంతరామన్, పరిశోధన బృందం సభ్యుడు గొప్ప పరిశోధనకు గొప్ప గుర్తింపు నష్కల్ ప్రాంతం ఎన్నో జియోలాజికల్ రహస్యాలను ఛేదించే ఆధారాలకు కేంద్రం. క్షీరదాల పుట్టుక ఆధారాలు మొదట్లో అర్జెంటీనాలోనే వెలుగుచూశాయి. మన దేశంలో తొలి సారి నష్కల్లోనే బయటపడ్డాయి. ఇక్కడ తొలితరం క్షీరదాల దవడ శిలాజాలు సేకరిం చాం. వాటిపై అనంతరామన్ బృందం విస్తృత పరిశోధన చేసింది. ఈ వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమవడం సంతోషం. – చకిలం వేణుగోపాలరావు, జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
తక్కువ ముళ్లు.. ఎక్కువ రుచి! అప్పలు చేప.. లాభాలు గొప్ప!
కష్టాలకు ఎదురీదుతూ చేపలు పడుతూ.. కడుపు నింపుకొంటున్న గంగపుత్రులకు సంద్రమంత లాభాలు తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త కొత్త వంగడాలు సృష్టిస్తూ.. జలపుష్పాలు పెంచేందుకు నీలివిప్లవం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా తీరాల్లో లాభాల పంట పండిస్తున్న అప్పలు చేపను విశాఖ మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సముద్ర మత్స్య పరిశోధన కేంద్ర సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) చేస్తున్న ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. సాక్షి, విశాఖపట్నం : లుట్జానిడే కుటుంబానికి చెందిన జాన్ స్నాపర్ (అప్పలు చేపలు) ఇండో–వెస్ట్ పసిఫిక్లో తూర్పు ఆఫ్రికా నుంచి ఫిజీ వరకు, దక్షిణాన ఆస్ట్రేలియా వరకు విస్తరించిన సముద్ర జలాల్లో విరివిగా పెరుగుతుంటాయి. మన దేశంలోనూ ఈ చేపలు పశి్చమ, తూర్పు తీరాల్లోనూ అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ చేపలు ఎక్కువగా పగడపు దిబ్బలు, రాళ్లు, లోతైన సముద్రాల్లో పెరుగుతుంటాయి. వేగవంతమైన వృద్ధి, పరిస్థితులకు సులభంగా పెరిగే స్వభావం వీటి సొంతం. అందుకే విశాఖతో పాటు తమిళనాడు, కొచ్చి తీర ప్రాంతంలో ప్రజలకు పెంపకానికి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు. నాలుగేళ్లుగా పరిశోధనలు.. విశాఖలోని సీఎంఎఫ్ఆర్ సంస్థ అప్పలు రకం చేపను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వేటకు వెళ్లే వారికి చాలా అరుదుగా దొరికే ఈ చేపల్లో తక్కువ ముళ్లు, ఎక్కువ రుచితో ఉండే ఆయా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. కేజీ రూ.450 నుంచి రూ.500వరకు ధర పలుకుతోంది. ఈ కారణంగా వీటిని పెంచేందుకు మత్స్యకారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగపుత్రులకు అప్పలు అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. నాలుగేళ్ల క్రితం ఏడాది పాటు శ్రమించి 100కిపైగా ఆడ జాన్ స్నాపర్స్, మగ జాన్ స్నాపర్స్ని సముద్రం నుంచి సేకరించారు. ఇందులో 20 మేలుజాతి జతల ద్వారా పరిశోధనలు చేపట్టారు. సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ రితేశ్ రంజన్, డాక్టర్ శుభదీప్ ఘోష్, డాక్టర్ శేఖర్ బృందం కలిసి భారత బయో టెక్నాలజీ విభాగం నుంచి ఒక ప్రాజెక్టుకు అర్హత సాధించారు. సేకరించిన అప్పలు చేపలను కృత్రిమంగా పెంచే విధానంపై పరిశోధనలు ప్రారంభించారు. చివరి దశకు చేరుకున్న పరిశోధనలు ప్రయోగశాలలో ఉంచిన సముద్రపు నీటిలో అప్పలు చేపలు పెరుగుదల ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. పెరుగుదలతో పాటు ఉత్పత్తి కూడా అద్భుత ఫలితాల్ని ఇచ్చినట్లు గుర్తించారు. నాలుగేళ్ల కాలంలో అప్పలు చేపలకు వివిధ రకాల ఆహారాల్ని అందించి ఏ ఆహారం సులువుగా జీర్ణమవుతుందోనని పరీక్షలు నిర్వహించి అన్నివిధాలుగా సఫలీకృతులయ్యారు. ఇందుకోసం ఆడ,మగ చేపలు ఒకదానికొకటి ఆకర్షితులయ్యేలా ప్రత్యేక ఇంజక్షన్లు ఇచ్చి ఉత్పత్తిని పెంచేలా చేసిన పరిశోధనలు సత్ఫలితాలిచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 42 గంటల్లో ఆడమగ చేపలు ప్రేరిపితమై సంతానోత్పత్తికి సిద్ధమైనట్లు గుర్తించారు. గుడ్లు పెట్టేలా చేయడంలోనూ సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ గుడ్లను పిల్లలుగా మారేందుకు ప్రయోగశాలల్లో ప్రత్యేకంగా ఉన్న 2 టన్నుల సామర్థ్యం కలిగిన హేచరీల్లో అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేశారు. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో 14 గంటల లార్వా నుంచి బయటికి వచ్చినట్లు వెల్లడించారు. తర్వాత వేల సంఖ్యలో చేప పిల్లలు బతకడంతో పాటు పెద్దవిగా పెరిగాయి. 42 రోజుల పెంపకం తర్వాత 3.67% మనుగడ రేటు సాధించినట్లు గుర్తించారు. సాధారణంగా ఏడాది వ్యవధిలో కిలోకి పైగా బరువు పెరగడాన్ని గమనించారు. ఒక్కోచేప మూడున్నర కేజీల వరకూ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా 125 టన్నుల వరకూ చేపల్ని పెంచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనలు చివరి దశకు వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలోనే మత్స్యకారులకు ఈ అప్పలు చేపలను పెంపకానికి అందిస్తామని వెల్లడించారు. తీరాలలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ విధానంలో వీటిని పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ చేపల పెంపకం విజయం సాధిస్తే.. మత్స్యకారులకు అప్పలు చేపలు లాభాల పంట పండించినట్లే. -
మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే!
How does coronavirus reach brain?: ప్రాణాంతక కరోనా వైరస్ మానవ శరీరాల్లో సుదీర్ఘకాలం మనుగడ సాగించడానికి గల కారణాలను యూఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు తాజాగా విడుదల చేశారు. సాధారణంగా కరోనా వాయుమార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఐతే ఇది అనతికాలంలోనే శరవేగంగా ఊపిరితిత్తుల్లో మత్రమేకాకుండా మెదడుతో సహా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని, ఎక్కువకాలం కోవిడ్ మనుగడకు కారణమిదేనని వీరి అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా వైరస్ బారినపడ్డవారు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వైరస్ ఒక అవయవం నుండి మరొక అవయవానికి ప్రయాణిస్తుంది. అందుకే సుదీర్ఘ కాలంపాటు బాధపడే కోవిడ్ బాధితుల్లో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించి మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. అందుకు గల కారణాలను అధ్యయనం చేయడం కోసం అమెరికాలో కరోనావైరస్ బారిన పడి మరణించిన 44 మంది రోగులపై శవపరీక్షల సమయంలో తీసిన కణజాలాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. కోవిడ్ బారినపడి 230 రోజులు దాటిన తర్వాత కూడా వైరస్ తాలూకు ఆనవాలు మెదడుతో సహా శరీరంలో వివిధ భాగాల్లో కనుగొన్నట్టు పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలం కోవిడ్తో బాధపడేవారి అవయవ వ్యవస్థ ఎందుకు ప్రభావితం అవుతుందో కనుగొనేందుకు చేసిన పరిశోధనలు సత్ఫలితాల్నిచ్చాయని మిస్సోరీకి చెందిన క్లినికల్ ఎపిడెమియాలజీ సెంటర్ డైరెక్టర్ జియాద్ అల్-అలీ అన్నారు. కాబట్టి కరోనా వైరస్ ప్రయాణించగల అవయవాలు కేవల ఊపిరితిత్తులు మాత్రమేకాదు. ఇది మెదడుతో సహా మొత్తం శరీరం అంతటా సోకుతుంది. అధిక శాతం శ్వాసనాళాలు, ఊపిరితిత్తులలో ఉంటుంది. చదవండి: New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది! -
కరోనా వచ్చి వెళ్లాక.. వదలని బాధలు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబళించిన కరోనా మహమ్మారి దాని బారినపడి కోలుకున్న బాధితుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జుట్టు రాలడం మొదలు పళ్లు కొరకడం వరకు ఎన్నో కొత్త సమస్యలు సృష్టించిందని తేలింది. ఆపాదమస్తకమంతా మనిషి శరీరంలో కరోనా తెచ్చిన మార్పులు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం. జుట్టు ►కరోనా బారినపడిన 2–3 నెలల్లోనే బాధితులకు విపరీతంగా జుట్టు రాలినట్లు ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. టెలోజెన్ ఎఫ్లువియమ్ అనే పరిస్థితే ఇందుకు కారణమని తేల్చింది. ►శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, ఆకలి లేకపోవడం, వైరస్ బారిన పడ్డామన్న ఆందోళన, లాక్డౌన్ల విధింపుతో ఒత్తిడి లేదా మహమ్మారి వ్యాప్తితో జీవనశైలిలో వచ్చిన మార్పులు కేశాల సాధారణ ఎదుగుదల, అవి రాలే కాలచక్రంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ►అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏమిటంటే రాలిన జుట్టులో చాలా వరకు లేదా మొత్తమంతా తిరిగి వస్తుందని రిచర్డ్ స్పెన్సర్ అనే ట్రైకాలజిస్ట్ తెలిపారు. మానసిక ఆరోగ్యం ►క్వారంటైన్, భౌతికదూరం నిబంధనలు బాధితుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఈ పరిణామం వారిలో ఆందోళన, ఉద్రేకం, కుంగుబాటు, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీసింది. ►కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల్లోనే ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు మానసిక అనారోగ్యానికి గురైనట్లు ఒక అధ్యయనం తెలిపింది. ►ప్రతి ముగ్గురు కరోనా రోగుల్లో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడ్డట్లు మరో సర్వే తేల్చింది. కళ్లు ►కరోనా వ్యాప్తితో సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువ కావడం వల్ల చాలా మంది కళ్లు పొడిబారడం, దురదపెట్టడం, ఎర్రబడటం, మసకబారడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. తెరలపై ఉండే నీలికాంతి ప్రభావమే ఇందుకు కారణం. ►పలు అధ్యయనాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 11 శాతం మంది కళ్ల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో చాలా మందికి తరచుగా సోకుతున్నది కళ్లకలక. ఉదరం ►కొందరు గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం... కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే పేగుల సంబంధ వ్యాధి కేసులు పెరిగాయి. పొత్తికడుపులో నొప్పి, విరేచనాలు, మలబద్ధకం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కరోనా బాధితులకు తలెత్తాయి. ►ఒత్తిడి, ఆందోళన కారణంగా ఐబీఎస్ వంటి రోగాల సంఖ్య పెరిగాయని ఓ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అభిప్రాయపడ్డారు. పళ్లు ►కరోనా వ్యాప్తి మొదలయ్యాక పళ్లు కొరకడం, బిగపట్టడంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. ఏడీఏ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం 2,300 మంది డెంటిస్టుల్లో 71 శాతం మంది ఇదే విషయాన్ని తెలియజేశారు. బ్రక్సిజం అని పిలిచే ఈ వ్యాధి మనిషి తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వస్తుందన్నారు. ►జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకా రం ఇదే కాలంలో పంటి, దవడ నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. బరువు ►కరోనా మహమ్మారిని వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్లు/క్వారంటైన్ నిబంధనలతో ప్రజల బరువులో మార్పులు చోటుచేసుకున్నాయి. తక్కువగా తినడం, శారీరక శ్రమ తగ్గడం లేదా ఒత్తిడి ఇందుకు కారణం కావొచ్చు. ►ఒక అధ్యయనం ప్రకారం కరోనా రోగుల్లో 39 శాతం మంది బరువు పెరిగారు. కాలేయం ►కరోనా వ్యాప్తి కాలంలో తీవ్ర మద్యపాన సేవనం వల్ల తలెత్తే హెపటైటిస్ అనే కాలేయ వ్యాధి కేసుల సంఖ్య భారీగా పెరినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని చికిత్స కోసం బాధితులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ►కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కొందరు బాధితుల్లో కాలేయ ఆమ్ల ద్రవాల స్థాయి సైతం పెరిగింది. పాదాలు ►పాదాల సంబంధ వ్యాధుల వైద్యురాలు ఎమ్మా కొన్నాకీ ప్రకారం ప్రజల్లో కండరాలు పట్టేయడం, మడమలు నొప్పిపెట్టడం వంటి సమస్యలు పెరిగాయి. పాదాలకు ఆసరా కల్పించే పాదరక్షలు ధరించే పరిస్థితి లేకపోవడం ఈ సమస్యకు ఒక కారణమై ఉండొచ్చని ఆమె అంచనా వేశారు. ►అరికాలు, చీలమండ, దాని వెనుకాల నొప్పితో బాధపడే వారి కేసుల సంఖ్య కూడా పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. చర్మం ►కరోనా నుంచి కోలుకున్న బాధితులు ఎదుర్కొన్న అతిసాధారణ చర్మ సంబంధ సమస్యల్లో దద్దుర్లు ఒకటి. ►కాళ్లు, చేతులు ఎరుపెక్కడం, నొప్పి రావడం, చర్మం దురదపెట్టడం దీని లక్షణాలు. ఈ పరిస్థితిని ‘కోవిడ్ టోస్’గా పేర్కొంటారు. -
పుస్తకం హస్తభూషణం
‘వెర్బా వోలంట్, స్క్రిప్టా మానెంట్’ అని లాటిన్ సామెత. అంటే మాట అశాశ్వతం, రాత శాశ్వతం అని అర్థం. రోమన్ సెనేటర్ కేయస్ టైటస్ సెనేట్లో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్య ఇది. ఆయన మాటే తర్వాతి కాలంలో సామెతగా నిలిచిపోయింది. మాటలదేముంది, తేలికగా గాలిలో కలిసిపోతాయి. అవి ఎంతోకాలం జ్ఞాపకం ఉండవు. మరపు మరుగున పడి కాలప్రవాహంలో కనుమరుగైపోతాయి. రాతలే చరిత్రలో శాశ్వత సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. అవి శిలా శాసనాలైనా కావచ్చు, మట్టి పలకలైనా కావచ్చు, తాళపత్ర, భూర్జపత్ర గ్రంథాలైనా కావచ్చు, అచ్చుయంత్రం వచ్చాక అందరికీ తేలికగా అందుబాటులోకి వచ్చిన పుస్తకాలైనా కావచ్చు, ఇప్పటి ఇంటర్నెట్ తరంలోని ఈ–పుస్తకాలైనా కావచ్చు– మాటలకు లిఖితరూపమైన అక్షరాలే శాశ్వతం. అలాంటి అక్షరాలను ఇముడ్చుకునే పుస్తకాలు జ్ఞాన భాండాగారాలు, తరతరాలకు దిక్సూచికలు. మనిషి మాట నేర్చుకోవడం, మాటకు అక్షరరూపమిచ్చి లిపిబద్ధం చేయడం, అక్షరాలను తేలికగా నిక్షిప్తపరచుకునేందుకు తాళపత్ర, భూర్జపత్రాలు, రాగిరేకులు, తోలుపత్రాల పుస్తకాల దశను దాటి, ఆధునిక అచ్చుయంత్రాలతో ముద్రించిన పుస్తకాల వరకు ఎదగడం ఒక సుదీర్ఘ పరిణామక్రమం. రాత శాశ్వతత్వాన్ని గుర్తించినా, రాత పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన చరిత్ర స్పష్టమైన ఆధారాలతో అందుబాటులో లేదు. ప్రాచీన ఈజిప్టు, మెసపొటేమియా, సింధులోయ, చైనా నాగరకతల ప్రజలకు వారి వారి లిపులు ఉండేవి. ఈ లిపులు వేటికవి స్వతంత్రంగా అభివృద్ధి చెందాయా, లేదా పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయా అనేది తేల్చిచెప్పగలిగే ఆధారాలు లేవు. చాలామంది మేధావులు చరిత్రను పుస్తకాలకెక్కించారే తప్ప, పుస్తక చరిత్రను పుస్తకాలకెక్కించిన సందర్భాలు చాలా తక్కువ. వాట్ ఈజ్ బుక్ హిస్టరీ?’ పేరిట అమెరికన్ చరిత్రకారుడు రాబర్ట్ డార్న్టన్ 1982లో ఒక పరిశోధనా వ్యాసం రాశాడు. పుస్తక చరిత్ర రచనలో దీనినొక మైలురాయిగా పరిగణిస్తారు. పుస్తక చరిత్ర అధ్యయనానికి విధి విధానాలను రూపొందించిన వారిలో డార్న్టన్ ప్రముఖుడు. డార్న్టన్ సహా మరికొందరు చరిత్రకారుల కృషి ఫలితంగా కొన్ని పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో పుస్తక చరిత్ర అధ్యయనం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి. మన దేశంలో ఏ ఒక్క విశ్వవిద్యాలయమూ దీనిని పట్టించుకున్న దాఖలాల్లేవు. భారతీయ భాషల్లో పుస్తకచరిత్ర గురించి చెదురు మదురు రచనలు వచ్చినా, అవన్నీ అచ్చు పుస్తకాల చరిత్రకే పరిమితమయ్యాయి. ఇప్పుడీ పుస్తక ప్రస్తావన ఎందుకంటే, మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతోంది. జనవరి మొదట్లో విజయవాడలోనూ పుస్తకాల పండగ ఉంది. పుస్తక ప్రదర్శనలు ప్రపంచంలో ఎక్కడ జరిగినా, అవి పుస్తక ప్రియులకు వేడుకలే! ‘కరోనా’ కారణంగా ఏడాది అంతరాయం తర్వాత ఈసారి జరిగే పుస్తక ప్రదర్శనల్లో పాఠకుల ప్రతిస్పందన రెట్టింపు స్థాయిలో ఉంటుందని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో తొలి పుస్తక ప్రదర్శన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగింది. ఐదువందల ఏళ్లకు పైగా ఫ్రాంక్ఫర్ట్లో ఏటా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతూనే ఉంది. మన దేశంలో కోల్కతాలో గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఏటా జరుగుతోంది. అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలు మన దేశంలోని మరిన్ని నగరాల్లో కూడా నిర్వహించేట్లయితే, పుస్తక ప్రియుల జ్ఞానతృష్ణ మరింతగా తీరగలదు. ‘కరోనా’ కాలంలో ప్రజల్లో పఠనాభిలాష పెరిగినట్లు రకరకాల గణాంకాలు చెబుతున్నాయి. సాంకేతికత పెరిగి, ఈ–పుస్తకాలు, ఆడియో పుస్తకాలు వంటివి అందుబాటులోకి వచ్చినా, మన దేశంలో అచ్చుపుస్తకాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు సరికదా, ‘కరోనా’ కాలంలో గణనీయంగా పెరిగింది. పుస్తకాల అమ్మకాలు కూడా పెరిగాయి. ‘కరోనా’ లాక్డౌన్ కాలానికి ముందు పాఠకులు వారానికి సగటున తొమ్మిది గంటల సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే, లాక్డౌన్ కాలం నుంచి ఈ సమయం పదహారు గంటలకు పెరిగిందని ‘అమెజాన్’ అధ్యయనంలో తేలింది. గడచిన ఏడాది కాల్పనిక సాహిత్యానికి చెందిన పుస్తకాల విక్రయాల్లో 21.4 శాతం, కాల్పనికేతర సాహిత్య పుస్తకాల్లో 38.3 శాతం పెరుగుదల నమోదైనట్లు ‘నీల్సెన్’ నివేదికలో వెల్లడైంది. పుస్తకాలకు మంచిరోజులు మళ్లీ మొదలయ్యాయనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం.‘లాక్డౌన్ కాలంలో జనాలకు బాగా తీరిక దొరికింది. టీవీ సీరియళ్లు, ఓటీటీల్లో నానా సినిమాలు, వెబ్సిరీస్లు చూసి చూసి విసిగి వేసారిన జనం ఈ కాలంలో నెమ్మదిగా వివిధ కళల్లో తమ ప్రతిభా పాటవాలను మెరుగుపరచుకోవడం వైపు, పుస్తక పఠనం వైపు మళ్లారు. దాని ఫలితంగానే పుస్తక పఠనం మళ్లీ పుంజుకుంది’ అని ‘సేజ్’ పబ్లికేషన్స్ ఇండియా డైరెక్టర్ ఆర్తీ డేవిడ్ అభిప్రాయపడ్డారు. లక్షలాది ప్రాణాలను కబళించిన ‘కరోనా’ మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నా, పుస్తక పఠనం విషయానికొస్తే దీనివల్ల కొంత మేలు కూడా జరిగింది. ‘కరోనా’కు ముందు బిజీ బిజీ జీవితాల్లో పుస్తకాలకు దూరమైన జనాలు మళ్లీ పుస్తకాలను చేతుల్లోకి తీసుకోవడం మొదలుపెట్టారు. తమ అభిరుచులకు సంబంధించిన పుస్తకాలకోసం అన్వేషణ సాగించి మరీ కొనుగోళ్లు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. పాఠకులలో వచ్చిన ఈ మార్పు రచయితలకు, ప్రచురణకర్తలకు కొత్త ప్రోత్సాహాన్నిస్తోంది. హైటెక్ అరచేతుల్లో స్మార్ట్ఫోన్లే అలంకారంగా మారిపోయిన ఈ కాలంలో ఇదొక శుభ పరిణామం. ‘పుస్తకం హస్తభూషణం’ అనే నానుడి మళ్లీ నిజమవుతోంది. -
మనుషులిద్దరు... గుండెచప్పుడు ఒకటే
భార్యాభర్తల బంధమంటే... ఇద్దరు మనుషులు ఒక జీవితమని తెలుసు. కానీ ఇద్దరు మనుషులు.. ఒకటే గుండె చప్పుడని ఇప్పుడు రుజువైంది. ఇష్టమైన వాళ్లు దగ్గరగా వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం చాలా సినిమాల్లో కనిపించే సీన్. ఎక్కువకాలం బంధంలో ఉన్న స్త్రీ, పురుషుల గుండె చప్పుడు కూడా ఒకటే అవుతోందని ఇలినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ప్రొఫెసర్ ఓగోస్కీ నేతృత్వంలో జరిగిన ఈ పరశోధనా ఫలితాలు ఇటీవల ‘సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఎక్కువకాలం రిలేషన్లో ఉన్న కొన్ని జంటలను తీసుకుని.. వాళ్ల మధ్య దూరం, వారిద్దరి గుండె చప్పుడును లెక్కించారు. 64 నుంచి 88 మధ్య వయసుండి... 14 నుంచి 65 ఏళ్లపాటు రిలేషన్షిప్లో ఉన్న పది జంటలను పరిశోధకులు రెండు వారాలపాటు పరీక్షించారు. ‘‘దూరంగా ఉన్నప్పుడు ఒకలా ఉన్న గుండెకొట్టకునే తీరు... ఇద్దరూ సమీపంలోకి వచ్చినప్పుడు క్రమంగా ఒక్కటి అవుతోంది. అంటే ఇద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి గుండె మరొకరి గుండెను ప్రభావితం చేస్తోంది. ఒకసారి భార్య గుండె భర్త గుండెపై ఎఫెక్ట్ చూపిస్తే... మరోసారి భర్త గుండె భార్య గుండెను ప్రభావితం చేస్తోంది. ముప్ఫై, నలభై ఏళ్లు కలిసి జీవించిన జంటల హృదయం సైతం ఒకరికోసం ఒకరు అన్న అంకితభావంతో పనిచేస్తోంది’’అని ఒగోస్కీ చెప్పారు. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
కుంకుమ పువ్వుకు రెట్టింపు ధర లభిస్తోంది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ‘ఇటీవల జమ్మూ, కశ్మీర్ పర్యటన సందర్భంగా ‘కుంకుమ పువ్వు’ల సాగు కేంద్రంలో ఓ రైతు నాతో మాట్లాడుతూ గతంలో తమకు కిలో కుంకుమపువ్వుకు రూ.లక్ష వరకూ అందేదని, ‘కేసర్ పార్క్’ఏర్పాటైన తరువాత, సాగు, మార్కెటింగ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చిన తరువాత రెట్టింపు ధర లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశార’ని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (2023) వేడుక సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లావు బియ్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని విలేకరులు అడగ్గా.. ‘‘ఎఫ్సీఐ ద్వారా సేకరించే బియ్యం మళ్లీ ప్రజలకే పంచుతున్నాం. ఈ క్రమంలో సేకరించే బియ్యం నాణ్యమైందా? కాదా? అన్నది చూస్తాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం’’అని అన్నారు. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చే ప్రయత్నం చేస్తారా? అన్న ప్రశ్నపై మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ సరఫరా చేయాలని నిర్ణయిస్తే, కేంద్రం అనుమతి పొందితే తాము సేకరించేందుకు సిద్ధమే’’అని తెలిపారు. చదవండి: సోనూసూద్పై ఐటీ దాడులు మరింత ఉధృతం -
క్యాన్సర్పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
లండన్: కేన్సర్ అంటే అందరికీ భయం కలిగించే వ్యాధితో పాటు అత్యధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. దీంతో క్యాన్సర్ అంటే ప్రతి ఒక్కరికి వెన్నులోంచి భయం పుట్టుకొస్తుంది. కానీ బ్రిటన్కి చెందిన నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్(ఎన్హెచ్ఎస్) నిర్వహించిన పరిశోధనల్లో సామాన్యుడు సైతం వైద్యం చేయించుకోగలిగే రీతిలో సరికొత్త చికిత్స విధానాన్ని తీసుకు వచ్చింది. ఎన్హెచ్ఎస్ ప్రపంచంలోనే 'గ్యాలరీ రక్త పరీక్షకు" సంబంధించిన అతి పెద్ద పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలు ఎంతగా విజయవంతమయ్యాయి అంటే క్యాన్సర్ లక్షణాలు కనిపించేక మునుపే 50 రకాల క్యాన్సర్లను గుర్తించగలదు. దీంతో భారత్తో సహా అన్ని దేశాలు కేన్సర్ గుర్తింపు, చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఎన్హెచ్ఎస్ తెలిపింది. (చదవండి: పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్) లక్షణాలు కనిపించక మునుపే..... ఈ సందర్భంగా ఎన్హెచ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా ప్రిట్ చార్డ్ మాట్టాడుతు...."ఇది అత్యంత త్వరితగతిన గర్తించే సరళమైన రక్త పరీక్ష . ఈ ప్రయోగం కేన్సర్ చికిత్సా విధానంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. అలాగే కేన్సర్ లక్షణాలు కనిపించక మునుపే గుర్తించడం వల్ల వైదులు రోగులకు మెరుగైన వైద్యం అందించగలరు. దీంతో కేన్సర్ బాధితుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది." అని అన్నారు. ఈ క్రమంలో యూకే కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ మమతరావు మాట్లాడుతూ...."ప్రపంచ దేశాలన్నింటికీ ఈ పరిశోధనలు ఎంతగానో ఉపకరిస్తాయి . కేన్సర్ లక్షణాల కనపడవ ముందే గుర్తిచడం అంటేనే తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఆ వ్యాధి నుండి బయటపడగలం" అని అన్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ 2018లో ప్రపంచ వ్యాప్తంగా సూమారుగా 17 మిలియన్ల మంది క్యాన్సర్తో పోరాడుతున్నారని, దాదాపు 9 మిలియన్ల మంది చనిపోయినట్లు తెలిపింది. 2025 కల్లా అందరికీ అందుబాటులో..... భారత్లోని నేషనల్ కేన్సర్ రిజిస్టర్ ప్రోగ్రాం ప్రతి 68 మంది పురుషులలో ఒకరు ఊపితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారని, ప్రతి 29 మంది మహిళలలో ఒకరు బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో భారత వైద్యురాలు డాక్టర్ ప్రీత అరవింద్ మాట్లాడుతూ... "ఈ ప్రయోగాలు ఎంతో ప్రాధాన్యత గలిగినవి. కొన్ని రకాల కేన్సర్లని గుర్తించడానికి స్క్రీనింగ్ టెస్ట్లు చేయడం సాధ్యం కాదు. ఈ సరికొత్త చికిత్స విధానం ఆ సమస్యను పరిష్కరించింది" అని అన్నారు. అయితే ఈ చికిత్స విధానాన్ని 2023 కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నహలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎన్హెచ్ఎస్ 2025 కల్లా దాదాపు ఒక మిలియన్ల మంది ప్రజలకు ఈ చికిత్స విధానం అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు వేస్తోంది. 2026 కల్లా ఈ చికిత్స విధానం అన్ని దేశల ప్రజలకు అందే అవకాశం ఉంటుందని యూకే వైద్యురాలు డాక్టర్ మమతరావు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై) -
వారి ఆయుః ప్రమాణం క్షీణిస్తోంది.. జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం కారణంగా మానవుడి ఆయుఃప్రమాణం తొమ్మిదేళ్లకు పైగా తగ్గుతోందని అమెరికా రీసెర్చ్ గ్రూప్ తన నివేదికలో తెలిపింది. భారత రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని తూర్పు, ఉత్తర, మధ్య రాష్ట్రాల్లో దాదాపు 480 మిలియన్లకు పైగా ప్రజలు వాయు కాలుష్యం బారిన పడుతున్నట్లు చికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపిక్) బుధవారం వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక వాయుకాలుష్యం ఢిల్లీలోనే ఉందని, అక్కడ ప్రజలు ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలో పేర్కొంది. అత్యధిక స్థాయిలో వాయు కాలుష్యం భౌగోళికంగా విస్తరిస్తోందంటూ ఈపిక్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, వాయు కాలుష్యాన్ని నియంత్రించటం కోసం భారత్ 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి.. ప్రజల ఆయుః ప్రమాణం పెంచేలా తగు చర్యలు తీసుకుందంటూ ప్రశంసలు కురిపించింది. అదే విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ సైతం వాయు కాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకుందని ఈపిక్ నివేదికలో ప్రశంసించింది. చదవండి: ఆటోమేకర్స్కి సర్కార్ షాక్ ! మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన -
ముప్పును తగ్గించే కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష!
తినే ఉప్పు.. శాస్త్రీయ నామం సోడియం క్లోరైడ్ ఎక్కువైతే ముందు రక్తపోటు.. జాగ్రత్తలేవీ తీసుకోకపోతే.. కొంత కాలం తరువాత గుండెజబ్బులు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అనేక శాస్త్ర పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి ఈ విషయాన్ని. కానీ మనకే కాదు.. ప్రపంచం మొత్తమ్మీద ఉప్పులేని వంటకం తినడం దాదాపు ఎవరికీ ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? ఉప్పులో సోడియం క్లోరైడ్ తగ్గించి.. పొటాషియం క్లోరైడ్ పెంచితే సరి అంటున్నారు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, చైనాలతోపాటు భారత్లోనూ కేంద్రాలున్న ఈ స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ ఇటీవలే ఒక భారీస్థాయి అధ్యయనం ఒకదాన్ని నిర్వహించింది. ఉప్పులో సాపేక్షంగా పొటాషియం క్లోరైడ్ను ఎక్కువ చేసి ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని నిర్ధారించింది. అంతేకాదు.. ఈ కొత్త రకం ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం వంటివి కొంతమేరకు తగ్గుతాయని కూడా ఈ పరిశోధన చెబుతోంది. -సాక్షి, హైదరాబాద్ ప్రాణాలకు రక్ష! కొత్త రకం ఉప్పును అందరూ వాడటం మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రూస్ నీల్ చెబుతున్నారు. అవసరానికి మించి ఉప్పు తినడం ఇప్పుడు అన్నిచోట్ల ఎక్కువ అవుతోందని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రత్యామ్నాయాల (సైంధవ లవణం వంటివి)ను ఉపయోగించడం ఖరీదైన వ్యవహారం అవుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోడియం క్లోరైడ్ తక్కువగా, పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఉప్పును తయారు చేసి, పంపిణీ చేయడంతోపాటు, వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించడం ఎంతైనా అవసరమని, పైగా ఈ కొత్త రకం ఉప్పు ఖరీదు తక్కువేనని వివరించారు. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిని మినహాయించి మిగిలిన వాళ్లు ఎవరైనా ఈ కొత్తరకం ఉప్పును వాడవచ్చునని చెప్పారు. ఇదీ పరిశోధన... ప్రత్యామ్నాయ ఉప్పు ప్రభావాన్ని, సమర్థతను అంచనా వేసేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ చైనాలో దాదాపు 21 వేల మందిపై పరిశోధన నిర్వహించింది, గుండెపోటు లేదా అదుపులో లేనంత ఎక్కువ రక్తపోటు ఉన్న వారిని దాదాపు 600 గ్రామాల నుంచి ఎంపిక చేసింది. 2014 ఏప్రిల్లో మొదలుపెట్టి 2015 జనవరి వరకూ అంటే దాదాపు తొమ్మిది నెలలపాటు వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ ఉప్పు మరికొందరికి సాధారణ ఉప్పు అందించింది. ఒక్కో వ్యక్తికి రోజుకు 20 గ్రాముల చొప్పున ఈ ప్రత్యామ్నాయ ఉప్పును అందించి వంట, నిల్వ (ఊరగాయ లాంటివి)లకు వాడేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ తరువాత అంటే 2015 నుంచి ఐదేళ్లపాటు ఈ గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వచ్చింది. ఐదేళ్ల కాలంలో మూడు వేల మంది గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రత్యామ్నాయ ఉప్పును తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 14 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. గుండెకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే 13 శాతం తగ్గుదల నమోదు కాగా... అకాల మృత్యువు బారిన పడే అవకాశం 12 శాతం వరకూ తగ్గింది. చదవండి: హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు సిద్దిపేటలోనూ పరిశోధన ప్రత్యామ్నాయ ఉప్పును వాడటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందనేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ భారత్లో జరిపిన ఒక పరిశోధన తార్కాణంగా నిలుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం వెలువడ్డ ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. ప్రత్యామ్నాయ ఉప్పు వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో తాము 502 మందిపై ఈ పరిశోధన నిర్వహించామని వీరిలో కొంతమందికి 70 శాతం సోడియం క్లోరైడ్, 30 శాతం పొటాషియం క్లోరైడ్ల మిశ్రమమైన ప్రత్యామ్నాయ ఉప్పును, మరికొందరికి వంద శాతం సోడియం క్లోరైడ్ ఇచ్చామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సుధీర్ రాజ్ థౌట్ తెలిపారు. చదవండి : మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’ మూడు నెలల తరువాత పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ ఉప్పును వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 4.6 యూనిట్లు తగ్గిపోగా, డయాస్టోలిక్ బ్లడ్ప్రెషర్లో, మూత్రంలో ఉప్పు అవశేషాల విషయంలోనూ సానుకూల మార్పులు కనిపించాయని వివరించారు. ఈ ఫలితాలు రక్తపోటు నివారణకు ఉపయోగించే మాత్రల ప్రభావంతో పోల్చదగ్గదిగా ఉందన్నారు. చదవండి : జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు -
ప్రజల జీవితాలను మార్చేలా పరిశోధనలు
సాక్షి, బెంగళూరు: వాతావరణ సమస్యలు మొదలుకొని వ్యవసాయం, వైద్యం, ఔషధ రంగం వరకు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల దిశగా విస్తృతమైన పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం బెంగళూరులోని జవహార్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్ సీఏఎస్ఆర్)ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు, వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేం దుకు పరిశోధనలు జరగాలన్నారు. శాస్త్రీయ సమాజం, వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తూ అద్భుతాలు సృష్టించే దిశగా పని చేస్తున్న స్టార్టప్స్ను ప్రోత్సహించడంతో పాటు 300కు పైగా పేటెంట్ హక్కులను సాధించారని జేఎన్సీఏఎస్ఆర్ శాస్త్రవేత్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గహ్లోత్, సీఎం బసవరాజ బొమ్మై, జేఎన్సీఏఎస్ఆర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జీయూ కులకర్ణి, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు పాల్గొన్నారు. -
లావా చెక్కిన ‘స్తంభాలు’
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి గండరాతి శిలలు.. కానీ సాధారణ రాయితో ఏర్పడ్డవి కాదు. భూపొరల నుంచి ఉప్పొంగిన లావా ఘనీభవించి ఇలా రాతిగా మారాయి. లావాతో ఏర్పడ్డ రాతి పొరలు సహజంగానే కనిపిస్తుంటాయి. కానీ ఉలితో శిల్పి చెక్కినట్టుగా ఇలా ఒకేరకం కడ్డీలుగా ఏర్పడటం మాత్రం కొంత అరుదే. వాటిని కాలమ్నార్ బసాల్ట్గా పిలుస్తారు. ఇలాంటి అరుదైన లావా రాతిస్తంభాలు ఆసిఫాబాద్ అడవుల్లో వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గతంలో విస్తారంగా కనిపించిన ఈ లావా స్తంభాలు తెలంగాణ లో తొలిసారి కనిపించడం విశేషం. ఇలాం టి రాతిస్తంభాలు కొన్ని ప్రాంతాల్లో చాలా పొడవుగా ఉంటాయి. అలాంటి స్తంభాలతో ఏర్పడ్డ గుట్టలు కూడా ఉన్నాయి. ఆసిఫాబాద్ అభయారణ్యంలో వెలుగుచూసిన లా వా ‘రాతికడ్డీలు’ భూ ఉపరితలంలో చిన్న విగానే కనిపిస్తున్నా భూగర్భంలో మరింత పొడవుగా ఉండి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలో జీఎస్ఐ విభాగం పరిశోధన జరిపితే మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం.. దక్కన్ పీఠభూమి చాలా వరకు లావా ప్రవహించిన ప్రాంతమే. దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలోని పొరల్లో చోటుచేసుకున్న చర్య ఫలితంగా లోపలి నుంచి లావా ఉప్పొంగి మహారాష్ట్ర పూర్తి భాగం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కొంతభాగం చొప్పున ఆవరించిందని, వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలు అలా ఉప్పొంగిన లావా ఘనీభవించి ఏర్పడ్డవేనని ఔత్సాహిక పరిశోధకులు చెబుతున్నారు. చేవెళ్ల మీదుగా వికారాబాద్, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర వైపు ఇలా లావాతో రాతి పొరలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల చదరపు కి.మీ. మేర ఇవి ఏర్పడటం గమనార్హం. ఈ సాధారణ రాతి పొరలే కాకుండా కొన్ని ప్రత్యేక ఒత్తిళ్ల వల్ల అవి నిర్దిష్ట ఆకృతిలో స్తంభాలుగా ఏర్పడ్డాయి. వాటినే కాలమ్నార్ బసాల్ట్గా పేర్కొంటారు. – సాక్షి, హైదరాబాద్ జీఎస్ఐ పరిశోధన చేపట్టాలి... కొందరు ఔత్సాహికులు కొంతకాలం క్రితం ఆసిఫాబాద్ అభయారణ్యంలో పరిశోధించి ఈ రాళ్లను గుర్తించారు. ఆ చిత్రాలను నేను జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్కు పంపగా అవి కాలమ్నార్ బసాల్ట్గా ఆయన నిర్ధారించారు. ఈ అరుదైన రాళ్లకు సంబంధించి ఆ ప్రాంతంలో జీఎస్ఐ వెంటనే పరిశోధన చేపట్టాలి. – శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ తెలంగాణలో తొలిసారే... మహారాష్ట్రలోని యావత్మాల్లో ఇటీవల రోడ్డు నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో భారీ కాలమ్నార్ బసాల్డ్ పొర వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవిలో కనిపించిన శిలాస్తంభాల చిత్రాలు చూస్తే అవి కాలమ్నార్ బసాల్ట్గానే అనిపిస్తోంది. జీఎస్ఐ పరిశోధించి వాటిని అధికారికంగా తేలిస్తే తెలంగాణలో మొదటిసారి అలాంటి శిలారూపాలు రికార్డయినట్టవుతుంది. – చకిలం వేణుగోపాల్,జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ -
అరుదైన పరిశోధన: సైంటిస్టులకు పాముల సాయం
అణు ప్రమాదాలు కలగజేసే నష్టం మామూలుగా ఉండదు. రేడియేషన్ ప్రభావం కొన్ని వందల ఏళ్లపాటు ఆ ప్రాంతాలను పట్టి పీడిస్తుంది కూడా. ఉక్రెయిన్లో చెర్నోబిల్, జపాన్ ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాదాలు.. ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో కళ్లారా చూసి ఉన్నాం. అలాంటప్పుడు ఇంక అక్కడ మనుషులు అడుగుపెట్టేది ఎప్పుడు? ఇది కనిపెట్టేందుకే సైంటిస్టులు పాముల సాయం తీసుకోబోతున్నారు. ఫుకుషిమా సైంటిస్టులు ఈ అరుదైన పరిశోధనలకు సిద్ధపడినట్లు ‘ఇచ్థైయోలజీ అండ్ హెర్పెటోలజీ’ అనే జర్నల్ కథనం ప్రచురించింది. అలాగని పాముల్ని హింసించడం లాంటివి చేయరు. సింపుల్గా వాటిని బయోఇండికేటర్లుగా ఉపయోగించుకుంటారు. సాధారణంగా మట్టి, గాలి, నీటితో మమేకమై ఉండే వృక్ష, జీవ రాశులన్నింటినీ బయోఇండికేటర్లుగానే గుర్తిస్తారు. వీటి జీవన విధానాన్ని పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు.. చెట్ల మీద మొలిచే నాచు, గాల్లో ఉండే విషవాయువుల మోతాదును ఇది సూచిస్తుంది. ఎలాగంటారా?.. గాలి నుంచే నాచుకి ఎక్కువ శక్తి లభిస్తుంది కాబట్టి. ఒకవేళ గాల్లో గనుక విష వాయువుల ప్రభావం ఎక్కువగా ఉంటే.. నాచు రంగు మారుతూ నాశనమవుతుంటుంది. చదవండి: వంద గ్రాముల విషంతో.. వంద మంది ఖతం! ఇప్పటిదాకా మొక్కలను, చెట్లను మాత్రమే బయోఇండికేటర్లుగా ఉపయోగించిన సైంటిస్టులు.. ఫస్ట్ టైం పాములపై ఈ ప్రయోగం చేస్తున్నారు. పాములను ప్రత్యేకించి జెర్రి పోతు(గొడ్డు) పాములను ఈ ప్రయోగాలకు వాడుకోబోతున్నారు. ఎందుకంటే.. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించవు. మట్టితో బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. పైగా దగ్గర దగ్గరగా జీవిస్తుంటాయి. అందుకే వీటిని ఎంచుకున్నారు సైంటిస్టులు. ఇక ఈ పరిశోధనలో.. ఫుకుషిమా రేంజ్లో బతుకుతున్న సుమారు 1700 పాముల్ని నిరంతరం పర్యవేకక్షించబోతున్నారు. వాటిపై రేడియేషన్ ప్రభావం, ఫుకుషిమా ప్రాంతంలో వాటి జీవనవిధానం ఆధారంగా రేడియేషన్ లెవల్ను లెక్కగడతారు. ఎప్పుడైతే మట్టిలో రేడియేషన్ ప్రభావం తగ్గుతుందో.. అవి అప్పుడు యాక్టివ్గా సంచరిస్తుంటాయి. అలా రేడియేషన్ ప్రభావాన్ని లెక్కగట్టబోతున్నట్లు ప్రొఫెసర్ హన్నా గెర్కె వెల్లడించారు. ఇక వీటి ట్రాకింగ్ కోసం జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించబోతున్నారు. -
ఈ నత్త గుళ్లల వయసు ఆరున్నర కోట్ల ఏళ్లు..
సాక్షి, హైదరాబాద్: ఈ చిత్రంలోని నత్తగుళ్లల వయసు ఎంతో తెలుసా..? ఏకంగా ఆరున్నర కోట్ల సంవత్సరాలు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీ రేంజ్ పరిధిలోని గోయెనా గుట్టల మీద ఈ నత్తగుల్లల శిలాజాలను గుర్తించారు. ‘పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా)’ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాసన్, ఫారెస్టు రేంజ్ అధికారి, ప్రిహా సభ్యుడు టి.ప్రణయ్, సిబ్బంది తాజాగా వీటిని గుర్తించారు. గతం లో ఈ ప్రాంతంలో మంచినీటి సరస్సు ఉండేదని, భూమి పొరల నుంచి లావా ఉబికి ఆ సరస్సు ప్రాం తాన్ని కమ్మివేయటంతో అందులోని జీవరాశులు ఇలా శిలాజాలుగా మారి ఉంటాయని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల తర్వాత.. సంగారెడ్డి జిల్లా తేర్పోల్ శివారులో 30 ఏళ్ల కిందట జియాలజిస్టు అయ్యస్వామి పరిశోధించి ఈ తరహా నత్త శిలాజాలను గుర్తించారు. దీంతో వాటిని ఆ గ్రామం పేరుతో ‘పైజా తిర్పోలెన్సిస్’ అని నామకరణం చేశారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన నత్త శిలాజాలు కూడా అదే ప్రజాతికి చెందినవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావు నిర్ధారించినట్టు శ్రీనివాసన్ తెలిపారు. ఈ 3దశాబ్దాల కాలంలో ఇప్పటివరకు స్థానికంగా మరెక్కడా నత్త శిలాజాలు వెలుగు చూడలేదని పేర్కొన్నారు. అప్పుడు ఎడమ.. ఇప్పుడు కుడి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నత్తగుళ్లలు కుడివైపు తెరుచుకుని కన్పిస్తుంటాయి. అరుదుగా మాత్రమే ఎడమవైపు తెరుచుకుంటాయి. ఈ శిలాజాల్లో మాత్రం ఎడమవైపు తెరుచుకుని ఉన్నాయి. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో నత్త శిలాజాలుండటం విశేషం. ఒకే రాతి ముక్కలో 18 నత్తగుళ్లలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని ఆధారంగా ఇది సరస్సు ఉండే ప్రాంతమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో పొడవైన సున్నపురాతి గుహలను కూడా గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో ఇక్కడ పరిశోధనలు చేసి ఎన్నో శిలాజాలను గుర్తించింది. వెరసి ఈ ప్రాంతాన్ని ఫాజిల్(శిలాజ) పార్కుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దీనివల్ల శిలాజాల చరిత్రను భావితరాలు తెలుసుకునేందుకు అవకా శం చిక్కుతుందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి శాంతారం, ఎస్డీవో దినేశ్ ప్రోత్సాహంతో ఈ శిలాజాలను గుర్తించినట్టు అటవీ శాఖ అధికారి ప్రణయ్ పేర్కొన్నారు. -
మన తీరం.. విదేశీ బంధం..
సాక్షి, హైదరాబాద్: నెల్లూరులోని కొత్తపట్నం.. ప్రస్తుతం చేపలు పట్టేవారితో కూడిన ఓ చిన్న గ్రామం. కానీ ఒకప్పుడు ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించిన నౌకాశ్రయం. ఇటీవలే పరిశోధకులు దీని గుట్టు తేల్చారు. క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 16వ శతాబ్దం వరకు భారీ విదేశీ నౌకల లంగరుతో ఈ పోర్టు బిజీగా ఉండేదని గుర్తించారు. ఎన్నో దేశాలతో భారతదేశానికి ఉన్న వాణిజ్యంలో ఈ నౌకాశ్రయం కీలకంగా వ్యవహరించేదని చెబుతున్నారు. అయితే ప్రకృతి విపత్తులు, భౌగోళిక మార్పులతో ఇది నామరూపాల్లేకుండా పోయింది. ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించిన పరిశోధకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కె.పుల్లారావు ఒకరు. ఇప్పుడు ఆయన మరోసారి ఈ పోర్టుకు సంబంధించిన కీలక విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు సమాయత్తం అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తీరం వెంట సముద్రమార్గం ద్వారా జరిగిన విదేశీ వాణిజ్యం, ఆయా దేశాలతో సంబంధాలు, సాంస్కృతిక మైత్రీ తదితర అంశాలపై ఆయన ఆధ్వర్యంలోని బృందం విస్తృత పరిశోధనలు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ బృహత్తర పరిశోధన శనివారం నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో.. భారతదేశం తన సువిశాల సముద్ర తీరంతో అనాదిగా ప్రపంచదేశాలతో వాణిజ్యం నిర్వహిస్తోంది. వేల ఏళ్లుగా సాగిన ఈ వాణిజ్యంతో ఆర్థికపరంగానే కాకుండా, సాంస్కృతికంగా కూడా ఆయా దేశాలతో మైత్రి ఏర్పడింది. ఇక్కడి కొన్ని సాంస్కృతిక అంశాలను ఆయా దేశాలు తమలో కలుపుకోగా, విదేశీ సంప్రదాయాలు కొన్ని మనలో మమేకమయ్యాయి. క్రీస్తు పూర్వం నుంచి ఈ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. అలాంటి ప్రత్యేకతలను వెలికి తీయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ప్రాజెక్టు మౌసమ్’పేరుతో బృహత్తర పరిశోధన ప్రారంభించింది. ఇది కొత్తపట్నంలో అంతరించిన పోర్టు వద్ద లభించిన 14వ శతాబ్దం నాటి చైనా మింగ్ వంశం చక్రవర్తి టైజాంగ్ జారీ చేసిన నాణెం కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. భారత్తో సముద్రతీరాన్ని పంచుకుంటున్న 39 దేశాలతో తిరిగి వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంతో పాటు, ఆయా దేశాల ఆర్థిక సాంస్కృతిక వైవిధ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మైత్రీ పటిష్టం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా తీరం వెంట ఉన్న చారిత్రక, పురావస్తు ప్రాధాన్యమున్న ప్రాంతాలు, అలనాటి నౌకాశ్రయాలున్న చోట పరిశోధనలు జరుపుతారు. గతంలో జరిగిన పరిశోధనల్లో వెలుగు చూసిన అంశాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇతర దేశాల తీర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వెలుగు చూసిన ఈ తరహా పరిశోధన వివరాలపై అధ్యయనం చేస్తారు. అలా మన దేశంలో తీర ప్రాంతమున్న రాష్ట్రాలకు ప్రత్యేక నిపుణులను కేటాయించారు. తమిళనాడు, కేరళ, ఒడిశా, బెంగాల్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో ఈ పరిశోధన మొదలుకానుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.పుల్లారావు ఆధ్వర్యంలో శనివారం నుంచి నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో ఈ అన్వేషణ ప్రారంభం కానుంది. 70 అంశాలను పరిశీలిస్తాం కె.పుల్లారావు ‘క్రీస్తు పూర్వం నుంచి మనదేశం ఇతర దేశాలతో సముద్ర వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక మైత్రి నెరుపు తోంది. దాన్ని ఇప్పుడు బలోపేతం చేయాలన్నది కేంద్రం ఆలోచన. అందుకే ప్రాజెక్టు మౌసమ్లో మేం 70 రకాల అంశాలను పరిశీలిస్తాం. తొలి విడత పరిశోధన నెల్లూరు జిల్లా కొత్తపట్నం పురాతన పోర్టు ఉన్న ప్రాంతంలో మొదలవుతుంది. చారిత్రక, మానవ మనుగడ, ఆర్థిక పరిస్థితులే కాకుండా వృక్ష, జంతు జీవ వైవిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం’ -
పాముకే విషమిచ్చి చంపేస్తే!!
సాక్షి, హైదరాబాద్: విషముండే పాములకే విషమిచ్చి చంపేస్తే.. దాని బాడీని ద్రవరూపంలోకి మార్చేసుకుని.. జ్యూస్ తాగినట్లు తాగేస్తే.. ఇవన్నీ చేస్తోంది.. మనం చాలా లైట్ తీసుకునే సాలె పురుగులే. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం తెలుసుకుని డంగైపోయారు. ఇదేదో ఒకట్రెండు సంఘటనలంటే మామూలుగా తీసుకోవచ్చు. వారు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశీలనలు చేసిన తర్వాత విడోస్ స్పైడర్ వంటి 90 జాతుల సాలెపురుగులు పాములను చంపేసి తినేస్తున్నాయని గుర్తించారు. స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్కు చెందిన సాలెపురుగు ఎక్స్పర్ట్ మార్టిన్ నీఫ్లర్ జరిపిన పరిశోధనల్లో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాములు, సాలెపురుగులు ఎదురై.. ఘర్షణ పడితే.. 87 శాతం కేసుల్లో సాలెపురుగుదే పైచేయి అయిందట. ఇలాంటివి వాళ్లు ఓ 300 ఘటనలను చూశారట. మిగిలిన వాటిల్లోనూ పాములు గెలవడం లేదట. ఎవరైనా వచ్చి వాటిని రక్షించడం ద్వారా అవి బతికిపోతున్నాయట. థెరిడీడే కుటుంబానికి చెందిన సాలెపురుగులు ఉత్పత్తి చేసే సాలె గూళ్ల దారాలు చాలా గట్టిగా ఉంటాయని, పెద్ద పెద్ద పాములు సైతం అందులో ఇరుక్కుపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. గూళ్లలో చిక్కుకోగానే అవి తమలోని విషాన్ని పాములకు ఎక్కిస్తాయి. దీంతో అవి పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. తర్వాత వాటి శరీరంలోని భాగాలను ద్రవ రూపంలోకి మార్చుకుని ఆ ద్రవాలను పీల్చుకు తినేస్తున్నాయని మార్టిన్ వివరించారు. స్పైడర్ ఏమో చిన్నది.. పాము కాస్త పెద్దది కదా.. దాంతో వారాలపాటు వాటికి వంటావార్పూ లాంటి పనులు ఉండవట. ఒక్కపామునే రోజులపాటు తింటూ పండుగ చేసుకుంటాయట. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కళ్లు లేకున్నా కాంతిని గ్రహిస్తాయి!
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: కళ్లు లేకుండా కాంతిని గ్రహించవచ్చా? అంటే.. అవును అంటోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధన బృందం. కొన్ని క్రిములు (ప్లానేరియన్ ఫ్లాట్వారమ్స్) కళ్లు లేకుండానే కాంతిని గ్రహించగలుగుతున్నాయని హెచ్సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఆకాష్ గుల్యాని నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రిమి శరీరం అంచుల్ని అంటిపెట్టుకుని ఉన్న ప్రొటీన్లతో కూడిన ఒక కంటి- స్వతంత్ర వ్యవస్థ (ఎక్స్ట్రాక్యులర్) ఇందుకు తోడ్పడుతున్నట్లు వారు గుర్తించారు. ఈ మేరకు హెచ్సీయూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తలను తొలగించినప్పటికీ ప్లానేరియన్లు బతికి ఉండగలవని, అంతేకాకుండా తక్కువ మోతాదుల్లో అతి నీలలోహిత వెలుగు పడినప్పుడు, ఆ కాంతి వనరు నుంచి పక్కకు వెళ్లిపోగలవని ఇంతకుముందు జరిగిన పరిశోధన స్పష్టం చేసింది. తాజాగా పరిశోధకులు.. దృష్టి లోపంతో బాధ పడుతున్నవారికి కంటి చూపునిచ్చేందుకు, అలాగే కాంతి సహాయంతో కణాల అంతర్గత పనితీరును నియంత్రించేందుకు, ఈ సహజ కాంతి గ్రాహక ప్రొటీన్లు ఉపయోగపడతాయా అని తెలుసుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈ క్రిములు కళ్లు లేకుండా కాంతిని ఎలా గ్రహించ గలుగుతున్నాయి, అవి కాంతిని గ్రహించేందుకు ఇతర కాంతి గ్రాహక వ్యవస్థ ఏదైనా ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే గుల్యానీ నేతృత్వంలోని బృందం.. ఫ్లాట్వార్మ్స్ శరీర అంచుల వెంబడి ఉన్న కంటి–స్వతంత్ర వ్యవస్థ (ఐ–ఇండిపెండెంట్ సిస్టమ్ (ఎక్స్ట్రాక్యులర్), తల లేని క్రిమి సైతం తల ఉన్న క్రిమి మాదిరి నమ్మశక్యంకాని సమన్వయంతో కదిలేలా చేస్తోందని కనిపెట్టినట్లు ప్రకటన వెల్లడించింది. -
దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు!
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయంతో ప్రపంచమంతా గుండెలరచేతిలో పట్టుకుని బతుకు జీవుడా అని కాలం గడుపుతోంటే.. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. మానవుడి జీవిత కాలాన్ని 120 సంవత్సరాల వరకూ పెంచే మార్గం సుగమం కానుందని, ఈ మేరకు తమ పరశోధనలు కొత్త ఊపిరిలూదుతున్నాయని చెబుతున్నారు. వృద్ధాప్య ప్రక్రియలో సాధారణంగా క్షీణించే ఎస్ఐఆర్టీ-6 అనే ప్రోటీన్ సరఫరాను పెంచడం ద్వారా మనిషి దీర్ఘం కాలం మనిషి దీర్ఘకాలం జీవించే మార్గాన్ని గుర్తించామని బార్-ఇలాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. పరిశోధకులు 250 ఎలుకలపై పరిశోధన గావించి వాటి ఆయుర్దాయం పెంచారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించబడిన పీర్-రివ్యూ పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించింది. ఆయుర్దాయంపై పురోగతి ప్రయోగశాల పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న హైమ్ కోహెన్ మాట్లాడుతూ, ఎలుకల ఆయుర్దాయం 23 శాతం పెంచడానికి ఒక మార్గాన్ని కనుగొన్నామన్నారు. ఎలుకలలో తామె చూసిన మార్పులు మానవులకు అనువదించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రయోగం ఆడ, మగ ఎలుకలపై నిర్వహించగా ఆడ ఎలుకలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. మగ ఎలుకల వయస్సు ఎక్కువ పెరిగిందని వివరించారు. మగ ఎలుకల జీవితకాలం 30 శాతం, ఆడవారి జీవితకాలం కేవలం 15 శాతం పెరిగిందని చెప్పారు. అలాగే ఈ ప్రోటీన్ తక్కువ కొలెస్ట్రాల్ను కలిగి ఉంటుందని, క్యాన్సర్ నుండి రక్షించడానికి కూడా పనిచేస్తుందని తెలిపారు. కోహెన్ ప్రకారం, వృద్ధాప్య ఎలుకలలో వయస్సుతో శక్తి సాధారణంగా తగ్గుతుంది. కాని వాటి శరీరంలో ఈ ప్రోటీన్ పెరగడం వల్ల శక్తి పెరిగింది. అయితే జన్యుపరంగా మార్పు చేయడం ద్వారా ఎలుకలలో ఎస్ఐఆర్టీ-6 అనే స్థాయిలను అతను సులభంగా పెంచగలిగినప్పటికీ, మానవులలో ప్రోటీన్ను పెంచడానికి మందులు అవసరం. రెండు మూడు సంవత్సరాలలో మానవులలో ఫలితాలను ప్రతిబింబించగలదని కోహెన్ చెప్పారు. దీని స్థాయిలను పెంచే చిన్న అణువులను అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ప్రోటీన్లను మరింత చురుకుగా చేయనున్నారు. వృద్ధాప్యాన్ని పరిష్కరించడానికి భవిష్యత్తులో వీటిని ఉపయోగించవవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి : కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్ -
Lakshmi Venkatesh: చిన్నప్పట్నుంచీ ఉంది
నలభై మూడేళ్లు లక్ష్మీ వెంకటేశ్కి ఇప్పుడు. కర్ణాటకలోని దావణగెరె ఆమెది. బెంగళూరులోని ‘ఇండిజీన్’ కంపెనీ డేటా అండ్ ఎనలిటిక్స్ విభాగంలో సీనియర్ మేనేజర్. విషయం ఏంటంటే.. ఆరేళ్ల వయసులో ఆమె ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు లక్ష్మి! అవును. అలా లేకుంటే ఇప్పటికీ ఆమె డెంటిస్టుగానే ఉండిపోయేవారు. ఆమెను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అనిపించవచ్చు. అందుకు కారణం.. ఆమె నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ కనిపించడమే! నేర్చుకోవడంలో కిక్ ఉంది అంటారు లక్ష్మి. ఆరేళ్ల వయసులో తొలిసారి తల్లితో కలిసి యోగా సాధనకు వెళ్లింది లక్ష్మి. ఆసనాలన్నీ నేర్చుకున్న దశకు వచ్చాక ఇక ఆ అమ్మాయికి కొత్త ఆసనాలపైకి ధ్యాస మళ్లింది. అవీ నేర్చుకున్నాక ఇంకా ఏవైనా కొత్తవి ఉన్నాయా అన్నట్లు పచ్చికలో చాపను పరుచుకుని కూర్చొని యోగా గురువు కోసం ఎదురు చూస్తుండేది. నేర్చుకోవడమే జీవితం అన్నట్లుగా ఆనాటి నుంచి ఈనాటికి ఇండిజీన్ వరకు వచ్చేశారు లక్ష్మి. ఇండిజీన్ హెల్త్కేర్ సంస్థ. డెంటిస్టుగా జీవితం బాగా అలవాటైపోయి, డేటా ఎనలిస్టుగా ఇటువైపు వచ్చేశారు లక్ష్మి. 2000లో ఆమె దావణగెరెలోని బాపూజీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి డెంటల్ సైన్స్లో డిగ్రీ చేశారు. తర్వాత బెంగళూరులో డెంటల్ క్లినిక్ పెట్టి ఎనిమిదేళ్లు నడిపారు. రూట్ కెనాల్స్ చెయ్యడం, పళ్లు పీకడం, ఇతర దంత సమస్యల చికిత్స.. ఇదంతా బాగా బోర్ కొట్టేసింది డాక్టర్ లక్ష్మికి. ప్రాక్టీస్ బాగానే ఉంది. డబ్బు సమృద్ధిగానే వస్తుంది. కానీ అవి ఆమెను డెంటిస్టుగా కొనసాగేలా చేయలేకపోయాయి. ప్రొఫెషన్ వదిలేశారు. హాస్పిటల్ మేనేజ్మెంట్లో కోర్సు చేసి, తర్వాత రెండేళ్లపాటు క్లినికల్ రిసెర్చ్ చేశారు. ‘‘కొత్త కెరీర్లోకి వెళ్లడం కోసం కాదు. కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఇష్టం’’ అంటారు లక్ష్మి. నేర్చుకోవడం ఆమెకు సంతృప్తిని ఇస్తుందట. క్లినికల్ రిసెర్చ్లో ఉండగా 2009 లో ఆమె ఇండిజీన్లో ఎనలిస్టుగా సెలక్ట్ అయ్యారు. ఆమెకు పడిన మొదటి అసైన్మెంట్.. ‘ట్రైయల్ పీడియా’ను అభివృద్ధి పరచడం. అన్ని క్లినికల్ డేటాలకు అది ఊపిరితిత్తుల వంటిది. ఆ టాస్క్ని లక్ష్మి, ఆమె బృందం విజయవంతంగా పూర్తి చేశారు. మూడేళ్ల ఆ ప్రాజెక్టు మీద ఉన్నాక ఆమె డేటా ఎనలిటిక్స్ వైపు వెళ్లారు. తమ సంస్థ తరఫున అనేక ఫార్మా కంపెనీలకు ప్రాజెక్టులు చేసి పెట్టారు. వాటి కచ్చితత్వం కోసం లక్ష్మి, ఆమె టీమ్ కొత్త విషయాలను నేర్చుకోవలసి వచ్చింది. అది ఆమెకు ఇష్టమైన విద్యే కదా. ఇప్పుడు తను సీనియర్ మేనేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డేటాను ప్రాసెస్ చేస్తున్నారు. ఆ రంగంలోని కొత్త ఆవకాశాల కోసం కాదు కానీ, కొత్తగా నేర్చుకోవలసిన వాటి కోసం చూస్తున్నారు! -
కరోనా వైరస్ ప్రధాన లక్ష్యం మనిషిలోని ఆ భాగాలే..
లండన్: కరోనా వైరస్ ప్రధాన లక్ష్యం మనిషి ఊపిరితిత్తులే. ఈ వైరస్ వల్ల చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. వైరస్ బారినపడి, చికిత్సతో కోలుకున్న తర్వాత కూడా 3 నెలలపాటు ఊపిరితిత్తులు దెబ్బతినే ఉంటాయని యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని షెఫీల్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో తేలింది. కొన్ని కేసుల్లో ఈ వ్యవధి మరింత ఎక్కువ కాలం.. 9 నెలల వరకూ కొనసాగే ప్రమాదం ఉంటుందని వెల్లడయ్యింది. అంటే కరోనా నుంచి కోలుకున్నాక లంగ్స్ పూర్తిగా సాధారణ స్థితికి చేరాలంటే 3 నెలలకు పైగానే సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటిదాకా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా అనంతరం ఊపిరితిత్తులకు కొనసాగుతున్న నష్టాన్ని సాధారణ సీటీ స్కాన్, క్లినికల్ పరీక్షల ద్వారా గుర్తించలేమని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించడానికి పరిశోధకులు ఇమేజింగ్ అనే ఆధునిక విధానాన్ని ఉపయోగించారు. కరోనా బారినపడినప్పటికీ ఆసుపత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందినవారిలో దీర్ఘకాలం శ్వాస సమస్య ఉంటే వారి ఊపిరితిత్తులు ఇంకా కోలుకోనట్లే భావించాలని వారు వెల్లడించారు. అయితే, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. ఈ స్టడీ వివరాలను రేడియాలజీ జర్నలిజంలో ప్రచురించారు. హైపర్పోలరైజ్డ్ జినాన్ ఎంఆర్ఐ (జిఎంఆర్ఐ) పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల్లో అపసవ్యతలను తెలుసుకోవచ్చని పరిశోధకులు సూచించారు. -
Jyotsna Bose: కరోనా వారియర్.. సడలని పిడికిలి
కార్మిక సంఘాల పోరుబాటలో జీవిత చరమాంకం వరకు పిడికిలి బిగించి ముందు వరుసలో నడిచిన జ్యోత్స్న బోస్.. కరోనా పై పోరులో మరణానంతరం కూడా యోధురాలిగానే నిలిచిపోయారు. కరోనాతో మరణించిన జ్యోత్స్నపై ‘పేథలాజికల్ అటాప్సీ’ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగడంతో.. దేశంలోనే తొలిసారి కరోనా ప్రభావాల పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. జ్యోత్స్న కోల్కతాలోని బెలెఘటలో ఉంటారు. ఆమెకు కరోనా సోకినట్లు ఈ నెల 10న ఆమె కుటుంబం గుర్తించింది. ఆమె మనువరాలు తీస్తా బసు వైద్యురాలు. ప్రాథమిక చికిత్సతో నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో జ్యోత్స్నను ఆమె మే 14 న బెలెఘటలోనే ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 16న ఆమె మర ణించారు. తను చనిపోతే తన అవయవాలను దానం చేయాలని పదేళ్ల క్రితమే ఆమె అనుమతి పత్రంపై సంతకాలు పెట్టారు. అయితే ఇప్పుడామె చనిపోయింది కరోనాతో. అవయవదానం కుదరదు. అలాగని ఆమె అంతిమ కోరికను నెరవేర్చకుండా ఎలా... అనుకున్నారు తీస్తా బసు. జ్యోత్స్న ఆసుపత్రిలో చేరిన రోజు వేరొక ఆసుపత్రిలో కరోనాతో మరణించిన బ్రోజోరాయ్ అనే వ్యక్తికి కోల్కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో పేథలాజికల్ అటాప్సీ జరిగింది. అది స్ఫురించి, జోత్స్న మృతదేహాన్ని కూడా అక్కడికి పంపించారు తీస్తా బసు. మే 20 న అక్కడ ఆమెకు అటాప్సీ జరిగింది. దేశంలోనే తొలిసారి కరోనా పరిశోధనలకు తోడ్పడిన మహిళగా జోత్స్న చరిత్రలో నిలిచిపోయారు. ఆమె తర్వాత కోల్కతాలో ప్రముఖ నేత్ర వైద్యులు బిస్వజిత్ చక్రవర్తి (60) మృతదేహానికి అటాప్సీ జరిగింది. జోత్స్న కు ముందు అటాప్సీ జరిగిన బ్రోజోరాయ్.. కోల్కతాలోని ప్రసిద్ధ అవయవదాన స్వచ్ఛంద సంస్థ ‘గణదర్పణ్’ వ్యవస్థాపకులు. అవయవదానానికి అనుమతినిస్తూ పదేళ్ల క్రితం జ్యోత్స్న సంతకాలు పెట్టి ఇచ్చింది ఆ సంస్థకే. ఇప్పుడీ ముగ్గురి మృతదేహాలపై జరిగిన పరిశోధనల ఫలితాలు వస్తే కరోనాను నివారించేందుకు, నిరోధించేందుకు, నియంత్రించేందుకు దారేదైనా కనిపించవచ్చని ఈ పరీక్షలు నిర్వహించిన వైద్యుల కమిటీ ఆశిస్తోంది. కరోనాతో మరణించినవారిపై విదేశాల్లో అరకొరగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ మన దేశంలో ఇలా జరగడం ఇదే మొదటì సారి. పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళ జ్యోత్స్న.. మరణానంతరం కూడా కరోనా యోధురాలిగానే దేశానికి గుర్తుండిపోతారు. జ్యోత్స్న 1927లో చిట్టాగాంగ్ (నేడు బంగ్లాదేశ్లో ఉన్న ప్రాంతం) జన్మించారు. ఆనాటి సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కార్మిక సంఘాల పోరాటాలలో పాలు పంచుకున్నారు. రాయల్ ఇండియన్ నౌకాదళ తిరుగుబాటుకు మద్దతుగా 1946లో తంతీతపాల కార్మికుల సమ్మెకు ‘నేను సైతం’ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె తండ్రి అదృశ్యం అయిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడింది. జ్యోత్స్న చదువు కుంటుపడింది. బ్రిటిష్ టెలిఫోన్స్లో ఆపరేటర్గా చేరి బతుకుబండిని లాక్కొచ్చారు. -
కూల్డ్రింక్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయా?
కూల్డ్రింక్స్లో సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇది విటమిన్ ’సి’తో కలిసినప్పుడు క్యాన్సర్ కారకం (కార్సినోజెన్) గా మారుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మానవుల డీఎన్ఏలోని కీలకమైన అంశాలను కూడా ఈ రసాయనం దెబ్బతీస్తుందని కొన్ని బ్రిటిష్ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం వల్ల కలిగే ఫలితాలు వయస్సు పెరగడంతోనూ, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే దుష్పరిణామాల్లాగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ రసాయనం లివర్ సిర్రోసిస్కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరింత ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలకు, పిల్లలకు కూల్డ్రింక్స్లో ఈ ప్రిజర్వేటివ్ ఉంటుందనీ, దాన్ని తీసుకోకూడదనే అవగాహన ఉండదు. అందుకే వీలైనంతవరకు కూల్డ్రింక్స్కు బదులుగా తాజా పళ్లరసాలు, ఇతర ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవడం మంచిది. ( చదవండి: పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..? ) -
ఇంతకీ ఈ వింత జంతువు పేరేంటి!
అవును.. ఇదేంటి? ఒక్కొక్కరూ ఒక్కోటి చెప్తారు.. చూడ్డానికి నక్కలా ఉందని కొందరు.. కుక్కలా ఉందని మరికొందరు.. ఇవన్నీ కాదహే.. అని ఇంకొందరు.. ఇది తిమింగళం అని మేమంటాం? మీరేమంటారు? ఎర్రగడ్డ నుంచి డిశ్చార్జి అయి ఎన్ని రోజులైంది అని అనేగా.. అచ్చంగా ఇది తిమింగళమే.. అవును.. అవి ఒకప్పుడు నాలుగు కాళ్లపై నడిచేవట. మనిషి కోతి నుంచి పుట్టాడు అంటారు.. ఒక్కో జంతువు.. ఒక్కో జంతువు నుంచి పరిణామం చెందాయనేది కూడా తెలిసిందే. తాజాగా వేల్స్ విషయం చూసుకుంటే.. అవి ఎలా పరిణామం చెందాయనే దానిపై పరిశోధనలు జరిగాయి. ఈ జలచరాలు.. జింకల మాదిరిగా చెంగుచెంగున భూమిపై గంతులు వేసేవనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని నార్త్ ఒహియో మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. లిటిల్ డీర్స్ అనే ఇండోహయస్ జంతువుల నుంచి ఈ వేల్స్ పరిణామం చెందాయని వివరించారు. సీటేషియన్స్ జాతికి చెందిన జంతువుల (హిప్పోపోటమస్, వేల్స్ వంటివి) జీవ పరిణామం గురించి అధ్యయనం చేస్తుండగా, పాకిస్తాన్లో 4.7 కోట్ల సంవత్సరాల కిందటి లిటిల్ డీర్కు సంబంధించిన శిలాజం లభించింది. ఇది ఓ నక్క పరిమాణంలో ఉండి, పొడవాటి శరీరం, తోక కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ జీవిలోని పలు ఎముకల నిర్మాణం వేల్స్ ఎముకలతో పోలి ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ జంతువులు ఆహారం కోసం వెతుకుతూ.. శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు సముద్రం దగ్గరికి వెళ్లి దాచుకునేవని, అలా కాలక్రమేణా నీటిలో జీవించే జీవనాన్ని అలవరుచుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. ఇండోహయస్, వేల్స్ రెండింటి కపాలం, చెవుల నిర్మాణాలు ఒకేలా ఉన్నాయని తెలిసింది. మొసళ్ల మాదిరిగా ఆహారం కోసం ఒడ్డున ఎదురుచూసేవని, చివరికి ఆ నీళ్లలోనే జీవనం అలవాటు చేసుకున్నాయని చెబుతున్నారు. -
అబ్బాబ్బా.. ఏమీ ఎండలు: ఇకపై 6 నెలలు ఎండాకాలం!
నాలుగు నెలలు వానాకాలం.. ఇంకో నాలుగు నెలలు చలికాలం.. తర్వాత నాలుగు నెలలు ఎండాకాలం.. ఈ నాలుగు నెలలు మండిపోయినా.. మిగతా ఎనిమిది నెలలు కాస్త చల్లగా, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మెల్లమెల్లగా ఎండాకాలం టైం పెరిగిపోతోందట.. ఈ శతాబ్దం ముగిసేనాటికి, అంటే 2100 నాటికి ఏడాదిలో ఆరు నెలలు ఎండాకాలమే ఉంటుందట. ముఖ్యంగా చలికాలం బాగా తగ్గిపోయి నెలా, నెలన్నర రోజులకే పరిమితం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో నాలుగున్నర నెలలు వానాకాలం ఉంటుందని అంచనా వేసుకుంటున్నా.. అందులో గట్టిగా వానలు పడే టైం సగం రోజులే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్నేళ్లుగా రుతువుల క్రమం మారిపోతోందని గుర్తు చేస్తున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అమెరికాలోని కెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై వేర్వేరుగా పరిశోధనలు చేశారు. మార్చి నుంచి జూన్ దాకా.. అంటే సుమారు నాలుగు నెలల పాటు ఎండాకాలం ఉంటుంది. ఎంత వేసవి అయినా సరే.. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదుకావడం చాలా తక్కువగా ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఎండా కాలం వచ్చిందంటేనే వణికిపోయే పరిస్థితి ఉంటోంది. వేసవిలో చాలా ప్రాంతాల్లో, చాలా రోజుల పాటు 40 సెంటీగ్రేడ్లకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల అయితే ఏకంగా 47, 48 డిగ్రీల వరకు వెళ్తున్నాయి. కొన్నేళ్లలో 50 డిగ్రీల దాకా పెరిగిపోయే అవకాశమూ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడీ పరిస్థితి ఏడాదిలో మూడు, నాలుగు నెలలే ఉంటుండగా.. ఇక ముందు ఆరు నెలల పాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 70 ఏండ్ల రికార్డులను విశ్లేషించి.. 1952 నుంచి 2011 వరకు రోజువారీ వాతావరణ రికార్డులను కెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వాతావరణ మార్పులకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన మోడల్స్ ఆధారంగా పరిశీలన జరిపారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో రుతువులు ఎలా మారుతాయన్నది అంచనా వేశారు. 1950వ దశాబ్దంలో సగటున 78 రోజులుగా ఉన్న ఎండాకాలం (వసంతకాలం మినహా).. ఇప్పుడు 95 రోజులకు చేరిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే చలికాలం 73 రోజులకు, వానాకాలం కూడా 82 రోజులకు తగ్గిపోయాయని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎండాకాలం ఏకంగా ఆరు నెలల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మధ్యదరా ప్రాంతాలు, టిబెట్ పీఠభూమి ప్రాంతాల్లో ఎండాకాలం ముందే మొదలై లేటుగా ముగుస్తోందని.. వానాకాలం, చలికాలం లేటుగా మొదలై, తొందరగా ముగుస్తున్నాయని తెలిపారు. అన్నింటిపైనా ప్రభావం కర్బన ఉద్గారాల విడుదల, కాలుష్యం, వాతావరణ మార్పులు ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే.. భూమధ్యరేఖకుపైన ఉత్తరంగా ఉన్న దేశాలన్నింటా ఎండాకాలం పెరిగిపోతుందని పరిశోధనలో తేలింది. ఏడాదిలో ఆరు నెలల పాటు ఎండాకాలం కొనసాగితే చాలా ప్రమాదకరమైన పరిణామాలు నెలకొంటాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనుషులు, చెట్లు సహా అన్ని జీవుల ఆరోగ్య పరిస్థితి, వ్యవసాయంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. దోమలు, ఇతర కీటకాల పెరుగుదల కారణంగా రోగాల వ్యాప్తి కూడా పెరిగిపోతుందని చెబుతున్నారు. రుతువుల ఆధారంగా పండే పంటలు, పూలు పూయడం, చెట్లు ఆకు రాల్చి కొత్త చిగుర్లు వేయడం వంటివన్నీ అస్తవ్యస్తం అవుతాయని.. తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీయడం, కార్చిచ్చులు చెలరేగడం వంటివి పెరిగిపోతాయని అంటున్నారు. మరోవైపు చలికాలంలో చలి తీవ్రత పెరగడం, మంచుతుఫాన్లు చెలరేగడం వంటివీ సంభవిస్తాయని పేర్కొంటున్నారు. మొత్తంగా ఒకదాని మీద ఒకటిగా ఆధారపడి ఉన్న పర్యావరణ, జీవావరణ వ్యవస్థలన్నింటిపైనా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాలిఫోర్నియా, బర్కిలీ, హార్వర్డ్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ఆరేళ్ల కింద చేసిన పరిశోధనలో కూడా రుతువుల మార్పు జరుగుతోందని గుర్తించారు. వారు 1850 నుంచి 2007 వరకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వాతావరణ వివరాలను విశ్లేషించారు. ఎండాకాలం పరిధి పెరుగుతోందని, చలికాలం సమయం తగ్గుతోందని గుర్తించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా చలికాలంలో సగటు ఉష్ణోగ్రతలు కొన్నేళ్లుగా పెరిగిపోతున్నాయని తేల్చారు. కాలాన్ని బట్టి వలసపోయే పక్షులు.. కొన్నేళ్లుగా ముందుగానే వలస పోతున్నాయని, కొన్నిరకాల చెట్లు ముందుగానే పుష్పిస్తున్నాయని ప్రకటించారు. మనుషుల కారణంగా పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగే దీనంతటికీ ప్రధాన కారణమని, వాతావరణంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. కాలుష్యం కారణంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగి.. ప్రపంచవ్యాపంగా వీచే రుతుపవనాల మార్గంలో, కాలంలో మార్పులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అడవులు తరిగిపోతుండటంతో కర్బన ఉద్గారాల నియంత్రణ తప్పిపోతోంది. దీనికితోడు పట్టణీకరణ పెరుగుతోంది. మొక్కలు, చెట్లు సంగ్రహించాల్సిన సూర్య కిరణాల వేడి వాతావరణంలోనే నిలిచిపోతోంది. ఇప్పటికే మొదలైందా? హిమాలయాల ప్రాంతంలో ఉండే రోడోడెండ్రాన్ చెట్లు సాధారణంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో అంటే ఎండాకాలం మొదట్లో పూలు పూస్తాయి. కానీ కొన్నేళ్లుగా జనవరిలోనే పూస్తున్నాయి. ఈసారి కూడా జనవరిలోనూ పూశాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా మామిడి చెట్లకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అనుకూలం. అలాంటి ప్రాంతాల్లోనే పండ్లు కాస్తాయి. చలి, మంచు ప్రదేశాల్లో చెట్లు పెరిగినా పళ్లు కాయవు. కానీ అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగైదేళ్లుగా కొండ ప్రాంతాల్లో కూడా మామిడి పండ్లు కాస్తున్నాయని, ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదని చెబుతున్నారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్