సోషల్‌ మీడియాలో.. 504 కోట్ల మంది  | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో.. 504 కోట్ల మంది 

Published Mon, Feb 12 2024 5:03 AM

504 crore people on social media - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని సోషల్‌ మీడియా ఊపేస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలోని వివిధ యాప్‌లలో గంటలు గంటలు గడిపేస్తున్నారు. గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్‌ పరిశోధన ప్రకారం.. ప్రపంచ జనాభాలో ఏకంగా 62.30 శాతం మంది సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నట్లు తేలింది.

గతేడాదితో పోలిస్తే 26.60 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్‌ మీడియాలోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా యూ­జర్ల సంఖ్య 504 కోట్లకు చేరిందని వెల్లడించింది. వీరిలో 46.50 శాతం మంది మహిళలు, 53.50 శాతం మంది పురుషులు ఉన్నారు.

సగటున ఒక వ్యక్తి రోజువారీ సోషల్‌ మీడియా వినియోగం 2.23 గంటలుగా నమోదయ్యింది. ఇక ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్న వారిలో అత్యధికంగా 94.20 శాతం మంది సోషల్‌ మీడియాలోనే ఉంటున్నారని నివేదిక పేర్కొంది. 

అమెరికాలో యూట్యూబ్‌ టాప్‌ 
గతంలో సగటున ఒక వ్యక్తి సోషల్‌ మీడియా ప్లామ్‌ఫారమ్‌ల వినియోగం 6.9 శాతంగా ఉంటే ఇప్పుడు 6.7 శాతానికి తగ్గడం విశేషం. మరోవైపు టాప్‌–4 సోషల్‌ మీడియా ఫ్లామ్‌ఫారమ్‌లలో మూడు ‘మెటా’కు చెందినవే ఉన్నాయి.

అగ్రస్థా­నం­లో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ కొనసాగుతున్నాయి. అమెరికాలో మాత్రం ఫేస్‌బుక్‌ను వెనక్కి నెడుతూ యూ­ట్యూబ్‌ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement