
రోజుకు రూ. 300కు బదులుగా సగటున
రూ. 213 వేతనాన్ని పొందుతున్న కార్మికులు
కార్మికులకు రూ. 1,059 కోట్ల్ల వేతనం తక్కువగా చెల్లింపు
36.5%తో ములుగు జిల్లాలో అత్యధిక వృద్ధి
25.3% తగ్గుదలతో చివరి స్థానంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా
లిబ్టెక్ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమలైన తీరుపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పథకంలో పాల్గొనే కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా వారికి అందుతున్న పనిదినాలు మాత్రం తగ్గిపోతున్నాయి. లిబ్టెక్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ట్రాకర్ 2024–25’ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పలుచోట్ల అభివృద్ధి కనిపించినా కీలకాంశాల్లో మందగమనమే కనిపిస్తోంది.
సగటు పనిదినాల్లో క్షీణత..
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన ప్రత్యేక కుటుంబాల సంఖ్య జాతీయ స్థాయిలో 3.5% తగ్గుదల నమోదవగా తెలంగాణలో మాత్రం 5.3% పెరుగుదల నమోదైంది. ఈ సంఖ్య 25.33 లక్షల నుంచి 26.68 లక్షలకు పెరిగింది. అదే సమయంలో ప్రతి ఇంటికి సగటు పనిదినాలు 47.7 నుంచి 45.8కి తగ్గాయి. వంద రోజుల పని పూర్తిచేసే కుటుంబాలు 31% తగ్గాయి. ఇది జాతీయ క్షీణత కంటే మూడురెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వ్యక్తిగత పనుల్లో 7% తగ్గుదల నమోదవగా తెలంగాణలో మాత్రం మొత్తం ఉద్యోగ దినాలు 1.1% పెరిగాయి. గతేడాదితో పోలిస్తే సంవత్సర ప్రారంభంలో పెరుగుదల నమోదైంది. వ్యక్తిగత పనిదినాల్లో 2024 ఏప్రిల్, మే నెలల్లో 88%, 35% వృద్ధి నమోదైన తర్వాత తగ్గుదల కనిపించింది.
వేతన నష్టం..
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతన రేటు రూ. 272 నుంచి రూ. 300కు పెంచినట్లు ప్రకటించినప్పటికీ కార్మికులు రోజుకు సగటున రూ. 213 మాత్రమే పొందారు. కార్మికులకు అంచనా వేసిన వేతన నష్టం రూ.1,059 కోట్లుగా ఉంది. కాగా ఈ పథకం నుంచి గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది కార్మికులు ఎంజిఎన్ఆర్ఇజీఏ జాబితా నుంచి తొలగించబడ్డారు. ఇతర రాష్ట్రాలు తిరిగి కార్మికులను చేర్చుకొనే ప్రక్రియలు చేపడుతున్నా తెలంగాణలో మాత్రం ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. తప్పుగా తొలగించిన లబి్ధదారులను పునరుద్ధరించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది.
జిల్లాలవారీగా చూస్తే..
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 32 జిల్లాల్లో 17 జిల్లాలు పెరిగిన ఉద్యోగ దినాలను నమోదు చేశాయి. ములుగు జిల్లాలో 36.5%, కామారెడ్డి జిల్లాలో 24.6%, వరంగల్ జిల్లాలో 23.7% అత్యధిక పెరుగుదల నమోదవగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో –25.3%, సంగారెడ్డి జిల్లాలో –19.2%, మహబూబాబాద్ జిల్లాలో–18.1% అత్యధిక తగ్గుదల నమోదైంది. గ్రామీణ పనులకు డిమాండ్ ఉన్నప్పటికీ పాలనాపరమైన అడ్డంకులు, వేతనంలో తగ్గుదల, మినహాయింపులు తెలంగాణలో పథకం లక్ష్యాలను బలహీనపరుస్తున్నాయని నివేదిక పేర్కొంది.
నివేదికలోని ప్రధానాంశాలు
⇒ ఉపాధి హామీ పథకంలో పాల్గొన్న కుటుంబాలు: 25.33 లక్షల నుంచి 26.68 లక్షలకు పెరిగాయి (5.3%)
⇒ పనిదినాల సగటు: 47.71 నుంచి 45.80కి తగ్గింది
⇒ 100 రోజుల ఉద్యోగం పూర్తి చేసిన కుటుంబాలు: 1.35 లక్షల నుంచి 0.93 లక్షలకు తగ్గింది. (–31.1%)
⇒ ప్రభుత్వం ప్రకటించిన వేతనం: రూ.300, కానీ వాస్తవంగా అందినది రూ.213 మాత్రమే
⇒ వేతన లోటు: రూ.1,059 కోట్లు (40.6%)
⇒ కార్మికుల తొలగింపులు: గత మూడేళ్లలో 21 లక్షల మంది తొలగింపు
⇒ రాష్ట్రం నూతన జాబ్కార్డుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు.