
లక్నో: ‘మీరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి (love marriage) చేసుకున్నారు. అలాంటప్పుడు మీకెందుకు పోలీస్ భద్రత ఇవ్వాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేం. మీ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉందని మేం భావిస్తే అప్పుడు మీకు పోలీసులు భద్రత కల్పిస్తారు’ అంటూ అలహాబాద్ హైకోర్టు (allahabad high court) కీలక తీర్పును వెలువరించింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రేమవివాహం చేసుకున్న దంపతుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 4న ఓ కీలక తీర్పును వెలువరించింది. ‘తాము ప్రేమవివాహం చేసుకున్నామని, తల్లిదండ్రుల నుంచి భయాందోళనలు ఉన్నాయంటూ శ్రేయా కేసర్వాని అనే మహిళ తన భర్తతో కలిసి తమకు పోలీసు రక్షణ కల్పించాలని’ కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్పై న్యాయమూర్తి సౌరభ్ శ్రీవాస్తవ విచారణ చేపట్టారు. విచారణలో.. మీ జీవితానికి, మీ స్వేచ్ఛకు భంగం కలిగించేలా బెదిరింపులు వస్తే పోలీసులు రక్షణ కల్పించవచ్చు. అలాంటి బెదిరింపులు లేకుండా, కేవలం తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పి రక్షణ కోరడం తగదని స్పష్టం చేసింది.
దంపతులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాలను పరిశీలించిన అనంతరం, దంపతులకు ప్రాణ భయమేమీ లేదని, వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, పైగా వారి బంధువులు ఎటువంటి మానసిక లేదా శారీరక హానిని కలిగించే అవకాశం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
అలాగే, తమకు బెదిరింపులు వస్తున్నాయని సంబంధిత పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయకపోవడం కూడా పరిగణనలోకి తీసుకుంది. అయితే, చిత్రకూట్ జిల్లా ఎస్పీకి రక్షణ కోరుతూ వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తించింది. పోలీసులు అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సామాజికంగా ఎదురయ్యే సమస్యలను దంపతులు ఎదుర్కొని, పరస్పరం అండగా ఉండడం నేర్చుకోవాలి’ అని కోర్టు సూచించింది.
అంతేకాదు..ప్రేమ పెళ్లి చేసుకున్న యువతకు న్యాయస్థానాలు కేవలం రక్షణ కల్పించేందుకు మాత్రమే లేవు’ అంటూ గతంలో ఈ తరహా పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (supreme court of india) చేసిన వ్యాఖ్యల్ని ఉదహరించింది.