
న్యూఢిల్లీ: అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఉండే సరిహద్దు రాష్ట్రాల్లో సన్నద్ధతను పెంచేందుకు ఈ శనివారం సెక్యూరిటీ డ్రిల్స్ చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. గుజరాత్, పంజాబ్, రాజస్తాన్, హరియాణా, జమ్మూకశ్మీర్లలో ముందుగా ప్రకటించినట్లు వాస్తవానికి గురవారమే ఈ డ్రిల్స్ చేపట్టాల్సి ఉంది. అయితే, పరిపాలనా సంబంధ కారణాలతో శనివారం సాయంత్రానికి వాయిదా వేసినట్లు వివరించింది. ఇందులో భాగంగా కంట్రోల్ రూంల పనితీరు, వైమానిక దాడుల హెచ్చరికలు, ఫైర్సేఫ్టీ వంటి పౌర రక్షణ సేవల సన్నద్ధతను పరీక్షించనున్నారు.
వైమానిక దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలో పౌరులకు చూపుతారు. పాకిస్తాన్తో సరిహద్దులున్న రాష్ట్రాల్లో ఇకపై ప్రతినెలా ఈ డ్రిల్స్ను చేపడతామని తెలిపింది. ఈ సమయంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులిచ్చే సూచనలను పాటించాలని కోరింది. గుజరాత్లోని అన్ని జిల్లాల్లోని డ్రిల్ ఉంటాయని, సివిల్ డిఫెన్స్ వలంటీర్లుగా పౌరులు నమోదు చేయించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్లోని అన్ని జిల్లాల పరిధిలో, రాజస్తాన్లోని సరిహద్దు జిల్లాల్లో హై అలెర్ట్ అమల్లో ఉంది. ఈ సమయంలో అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తారు. ఇతర బహిరంగ కార్యక్రమాలు సైతం రద్దవుతాయి.