పుణె పోర్షే కారు ఘ‌ట‌న‌.. మైన‌ర్‌ను వెంట‌నే విడుద‌ల చేయండి: హైకోర్టు | Pune Porsche Accident Case: High Court Orders Teen Release | Sakshi
Sakshi News home page

పుణె పోర్షే కారు ఘ‌ట‌న‌.. మైన‌ర్‌ను వెంట‌నే విడుద‌ల చేయండి: హైకోర్టు

Published Tue, Jun 25 2024 3:45 PM | Last Updated on Tue, Jun 25 2024 3:54 PM

Pune Porsche Accident Case: High Court Orders Teen Release

ముంబై: పుణె పోర్షే ప్రమాదం కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్ద‌రు యువ ఇంజ‌నీర్ల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నిందితుడు మైన‌ర్ బాలుడిని నిర్బంధం నుంచి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు మంగ‌ళ‌వారం ఆదేశించింది.

ప్రభుత్వ అబ్జర్వేషన్ హోమ్ నుంచి విడుదల చేయాలంటూ బాలుడి అత్త వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ భారతి, జస్టిస్ మజుషా దేశ్‌పాండే ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. బాలుడి రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ దానిని కోర్టు పక్కన పెట్టింది.

కేసును క‌ప్పిపుచ్చుకునేందుకు బాలుడి తల్లిదండ్రులు, తాత ప్రయత్నించి అరెస్టు అయిన నేప‌థ్యంలో మైన‌ర్ ప్ర‌స్తుతం అత‌ని అత్త సంర‌క్ష‌ణ‌లో ఉంటాడ‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. కాగా ఈ కేసులో నిందితుడికి త్వరితగతిన బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వ‌డంతో జువైనల్ జస్టిస్ బోర్డు బాలుడికి రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే.

అస‌లేం జ‌రిగిందంటే..
కాగా మ‌హారాష్ట్ర‌లోని పుణెలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె  కారులో ఇంటికి బయల్దేరాడు.

అదే సమయంలోసాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్‌, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్‌.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్‌, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు.

అయితే ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్‌స్టేషన్‌ నుంచి జువైనల్‌ జస్టిస్‌ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్‌ఎన్‌ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్‌ మంజూరు చేశారు. 

రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్‌ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్‌ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. 

15 గంటల్లోనే బెయిల్‌ మంజూరుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్‌ను రద్దు చేసి అబ్జర్వేషన్‌ హోమ్‌కు తరలించారు.

పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్‌ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement