
భువనేశ్వర్: వచ్చే నెలలో జరగనున్న పూరి రథయాత్ర మరోసారి భక్తులు లేకుండానే జరగనుంది. కోవిడ్-19 కారణంగా భక్తులు లేకుండా రథయాత్ర జరగడం ఇది రెండోసారి. ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పి కె జెనా మాట్లాడుతూ.. పూర్తిగా టీకా డోసులు వేసుకున్న వారు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ రథయాత్రలో కోవిడ్ నెగటివ్ వచ్చిన సేవకులను మాత్రమే వాడనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత ఏడాది సుప్రీంకోర్టు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను ఈసారి కూడా పాటించనున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్పవాలకు కచ్చితంగా కోవిడ్-19 ప్రోటోకాల్స్ అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. కాగా జగన్నాథ రథయాత్రకు కేవలం 500 మంది సేవకులు మాత్రమే రథాన్ని లాగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఉత్సవాలను భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చునని తెలిపారు. కాగా ప్రస్తుతం పూరి ప్రాంతంలో ప్రతిరోజూ సుమారు 300 వరకు కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జిల్లా కలెక్టర్ సమర్త్ వర్మ పేర్కొన్నారు.
చదవండి: భంవురి ఉత్సవంతో మొదలైన రథం పనులు