
పల్లె దృశ్యాన్ని మార్చిన మహిళలు
దుఃఖనది జీవనది అయ్యింది
బందిపోట్లు రైతులయ్యారు
కరౌలీ పచ్చదనానికి మారుపేరైంది
రాజస్థాన్ అనగానే గుర్తొచ్చేది ఎడారి. అందులోనూ కరౌలీ జిల్లా అంటేనే నీటికోసం తండ్లాట. వరుస కరువులు. పచ్చదనం అంటే తెలియని పల్లెలు. ఈ దృశ్యాన్ని మార్చేశారు మహిళలు. చుక్క చుక్కను ఒడిసిపట్టి పొఖార్(నీటికుంట)లను సృష్టించారు. ఉపాధి లేక బందిపోట్లుగా మారిన పురుషులను వ్యవసాయం వైపు మళ్లించి.. మళ్లీ రైతులను చేశారు.
బంజరు నేలల్లో ఇప్పుడు బంగారం పడిస్తున్నారు. దుఃఖనదిలా మారిన షేర్నిని మళ్లీ జీవనదిగా మార్చారు. మే నెల మండుటెండల్లోనూ కరౌలీ చెరువులు, పొఖార్లు నీటితో కళకళలాడుతున్నాయి. నెమ్మదిగా ప్రవహిస్తున్న సేర్ని నది ఒడ్డున పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పక్కనే పశువులు మేస్తూ ఉన్నాయి. ఒక దశాబ్దం క్రితం, ఎవరూ ఊహించని దీనిని మహిళలు సాధ్యం చేసి చూపించారు. అదెలా సాధ్యమైందంటే...
రాజస్థాన్లోని కరౌలీ జిల్లా.. కరువుకు మారుపేరు. వాతావరణ మార్పులతో వర్షపాతం తగ్గింది. భూములు బంజరుగా మారా యి. నీటి వనరులు లేవు. 50 ఏళ్ల కిందట జీవనాధారంగా ఉన్న వ్యవసాయం, పశుపోషణ లే కుండా పోయింది. వేరే మా ర్గం లేక చాలా మంది వలసపోయారు. ఉపాధి లేక కొందరు నగరాలకు వలస వెళ్లగా, మరికొందరు మై నింగ్వైపు మొగ్గుచూపా రు. ఇంకొందరు బందిపోట్లుగా మారారు. ఒక్క సారి ఇంటినుంచి వెళ్లిన వారు తిరిగి ఇంటికొస్తారో లేదో తెలియదని భయం.
మైనింగ్ నుంచి వచ్చే సిలికా ధూళితో సిలికోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యింది. ఈ పనిలోకి వెళ్లినవారిలో 74శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. చాలామంది 40 ఏళ్లు దాటి జీవించలేదు. నీటికరువు ఆ ప్రాంత సామాజిక పరిస్థితిని కూడా మార్చేసింది. నీళ్లు లేని కారణంగా ఆ జిల్లాలోని గ్రామాలకు పిల్లనివ్వాలంటే భయపడేవారు. మరోవైపు వరుస కరువులు, పేదరికంతో తమ ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేసి పంపేవారు కరౌలీ జిల్లాలోని గ్రామస్తులు. అందరి జీవితాల్లో ఒకరకమైన నిరాశ.
కరువు నుంచి లక్షాధికారుల వరకు..
2010లో మార్పునకు బీజం పడింది. నీటి సంరక్షణ స్వచ్ఛంద సంస్థ తరుణ్ భారత్ సంఘ్వారి జీవితాల్లోకి వచ్చింది. ఒకప్పటి చెరువులన్నీ ఎండిపోయాయి. మట్టి, ఇసుకతో నిండిపోయాయి. వాటిని పునరుద్ధరణకు నడుం కట్టారు మహిళలు. ఆలంపూర్ గ్రామ సంపత్తి దేవి అనే మహిళ అప్పటిదాకా తాను కూడబెట్టిన మొత్తాన్ని ఖర్చు చేసి 2015–16లో కొండ కింద పొఖార్ను నిర్మించింది. వర్షాలు పడినప్పుడు కొండపైనుంచి వచ్చిన నీటితో పొఖార్ నిండిపోయింది. ఏడాదికి సరిపడా నీరు. బందిపోటు అయిన భర్తను వ్యవసాయానికి ఒప్పించింది.
58 ఏళ్ల జగదీష్, ఆయన భార్య కలిసి ఇప్పుడు ఆవాలు, గోధుమలు, చిరుధాన్యాలు, కూరగాయలు పండిస్తున్నారు. ప్రతి సీజన్లో లక్షరూపాయలు సంపాదిస్తున్నారు. అదే జిల్లాలోని భూర్ఖేడ గ్రామానికి చెందిన ప్రేమ్.. బిడ్డలకు చిన్నవయసులోనే పెళ్లి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో భర్త బందిపోటుగా మారాడు. ఈ పరిస్థితి మార్చాలనుకుంది. గ్రామ శివార్లలో పొఖార్ నిర్మించేందుకు నాలుగు బిగాల సొంత భూమిని ఇచ్చింది. చెరువు నీటితో గోధుమలు, చిరుధాన్యాలను పండిస్తూ గర్వంగా కుటుంబాన్ని పోషించుకుంటోంది.
బందిపోటు నుంచి రైతుగా మారిన మరో వ్యక్తి భూర్ఖేడకు చెందిన 60 ఏళ్ల లజ్జా రామ్. ‘నా తండ్రి రైతు. ఆ కాలంలో తగినంత నీరు ఉండేది. నేను పెరిగేకొద్దీ వర్షపాతం తగ్గింది, బావులు ఎండిపోయాయి. వ్యవసాయం కష్టమైంది. పశువులు చనిపోయాయి, తరువాత మా ప్రాణాలు పోతాయేమో అనిపించింది. అలా దొంగగా మారిపోయాను. నేను లొంగిపోయేందుకు నా సోదరి ఒప్పించింది. ఇప్పుడు మా 10 బిగాల భూమిలో గోధుమలు, ఆవాలు, శనగలు, ముత్యాల మిల్లెట్లను పండిస్తున్నారు. ఎనిమిది గేదెలు, మేకలతో ఆనందంగా ఉన్నాం’అని చెబుతున్నాడు.
జీవనదిగా మారిన సేర్ని...
ఈ పదిహేనేళ్ల కాలంలో.. జిల్లాలోని చుట్టుపక్కల అడవిలో ఇటువంటి 16 పొఖార్లను నిర్మించారు. ఇవన్నీ వర్షపు నీటిని ఒడిసిపట్టేవే. వీటినుంచి డీజిల్ పంపుల ద్వారా సాగుకు వాడుకుంటారు. పొఖార్లతో భూగర్భజలం మట్టం పెరిగింది. నేలను తవి్వతే ఐదు నుంచి పది అడుగుల లోపే నీరు అందుతుంది. జిల్లాలోని సేర్ని నది.. 40 ఏళ్లకిందట ఏడాది పొడవునా ప్రవహించేది. వాతావరణ మార్పులు.. అది ఎండిపోయేలా చేశాయి. దీపావళి పండుగ అయిపోయిందంటే నదిలో చుక్క నీరు కనిపించకపోయేది. కానీ.. ఇప్పుడది జీవనదిగా మారింది. వేసవిలోనూ నీరు ప్రవహిస్తోంది. నీరు జీవం.. నీటితో స్థిరత్వం వస్తుంది. నీటి గతిని అనుసరించే నాగరికతలు ఏర్పడ్డాయి. ఇప్పుడా నీరే రాజస్థాన్ ఎడారి జీవితాలను మార్చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్