
కీవ్: ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా శుక్రవారం 93 క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది. ఏకంగా 200 డ్రోన్లతో దాడి చేసింది. గత మూడేళ్లలో రష్యా ఒకే రోజులో చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.
రష్యా నుంచి దూసుకొచ్చిన వాటిల్లో 11క్రూయిజ్ క్షిపణులుసహా 81 మిస్సైళ్లను పశి్చమదేశాలు అందించిన ఎఫ్–16 యద్ధవిమానాల సాయంతో నేలమట్టంచేశామని ఆయన చెప్పారు. ‘‘ పెనుదాడులతో ఉక్రేనియన్లను భయపెడుతున్న రష్యాకు, పుతిన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. పెద్ద ప్రతిఘటన, భారీ ఎదురుదాడితో రష్యా ఉగ్రచర్యలను అడ్డుకుందాం’’ అని జెలెన్స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా చెప్పారు.
ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామికవాడల్లో ఇంధన, శక్తి వనరులు, మౌలిక వసతులను ధ్వంసంచేయడమే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్లోని అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ తెలిపింది. ఉక్రెయిన్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీని నిలువరించడమే లక్ష్యంగా ఇంధన వ్యవస్థలపైనే రష్యా తరచూ దాడులుచేస్తుండటం తెల్సిందే. నవంబర్ 28న చేసిన ఇలాంటి దాడిలో 200 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. నాటి నష్టం కారణంగా 10 లక్షల కుటుంబాలు అంధకారంలో ఉండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment