
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి ఆ పార్టీలోని సీనియర్ నేతలే కారణమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికలు పార్టీకి కత్తిమీద సాములా మారాయి.
హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ హిమాచల్లోని మండి స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ససేమీరా అంటున్నారు. ప్రతిభా సింగ్ 2019లో మండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆమెకు అమితమైన ప్రజాదరణ ఉంది. కాగా మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్తో పాటు పలువురు సీనియర్ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఇదే వైఖరితో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు వీరభద్ర సింగ్ గ్రూపులోని పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారట. విక్రమాదిత్య సింగ్ వర్గం హిమాచల్ సీఎం కుర్చీపై కన్నేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment