
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైవాసి శంకర్ మిశ్రాపై అతడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం వేటు వేసింది. ఉద్యోగంలోనుంచి తొలగించింది. శంకర్ మిశ్రా వెల్స్ ఫార్గో అనే బహుళజాతి సంస్థలో ఇండియా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. తమ సంస్థలో పనిచేసే సిబ్బంది వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ హుందాగా ప్రవర్తించాలని తాము కోరుకుంటున్నామని వెల్స్ ఫార్గో్గ ఒక ప్రకటనలో వెల్లడించింది. శంకర్ మిశ్రా చేసిన పని తమకు తలవంపులు తెచ్చిందని పేర్కొంది.
కేసు పెట్టొద్దని వేడుకున్నాడు
విమానంలో ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తీవ్ర అవమానం జరిగిందని, నిందితుడి ముఖం చూడాలంటే అసహ్యం వేసిందని బాధితురాలు వెల్లడించారు. కేసు పెట్టొద్దని వేడుకున్నాడని, క్షమాపణ కోరాడని చెప్పారు.