
ఢిల్లీ: సాంకేతిక సమస్యతో రష్యాకు విమానం దారి మళ్లింపు, అక్కడ మారుమూల ప్రాంతంలో అరకోర సౌకర్యాల నడుమ పడిగాపులు పడిన వ్యవహారంపై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికులందరికీ క్షమాపణలు తెలియజేస్తూ.. వాళ్ల టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వడంతో పాటు బోనస్గా ట్రావెల్ వౌచర్లను ఇస్తామని ప్రకటించింది.
మంగళవారం న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న క్రమంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లోని ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 216 మంది ప్యాసింజర్లు, 16 మంది సిబ్బందితో కూడిన విమానాన్ని రష్యా మగడాన్ ఎయిర్పోర్ట్కు తరలించారు. మాస్కో నుంచి 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. మారుమూల పట్టణం కావడంతో అరకోర సౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే దాదాపు 36 గంటల తర్వాత.. ప్రత్యామ్నాయ విమానం అక్కడికి చేరుకుని ఈ ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణికులను చేర్చింది. ఈ పరిణామంపై క్షమాపణలు చెబుతూ ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ & గ్రౌండ్ హ్యాండిలింగ్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి, అంతరాయానికి క్షమాపణలు చెబుతున్నామని, టికెట్ ఎమౌంట్ను రిఫండ్ చేయడంతో పాటు ట్రావెల్ వౌచర్లను స్వీకరించాలంటూ మనస్ఫూర్తిగా క్షమాపలంటూ ప్రకటనలో పేర్కొన్నారాయన.
ఇక ఈ పరిణామంపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment