
భువనేశ్వర్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణ ఆధారంగా చేపట్టిన దాడుల్లో విజిలెన్స్ విభాగం భారీ స్థాయిలో నగదు స్వాధీనపరచుకుంది. ఈ దాడుల్లో రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీరు బైకుంఠ నాథ్ షడంగికి సంబంధించిన ఆస్తులపై పలు చోట్ల శుక్ర వారం విజిలెన్సు వర్గాలు సోదాలు నిర్వహించారు.
నిందితుడు ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నట్లు సమాచారం. విజిలెన్స్, ఎనిమిది మంది డిఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 మంది సహాయ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సహాయక సిబ్బంది అంగుల్ విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా సోదాలు నిర్వహించారు. అంగుల్, భువనేశ్వర్, పిప్పిలి (పూరీ) తదితర 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు.
విజిలెన్స్ అధికారులను చూడడంతో బైకుంఠ నాథ్ షడంగి భువనేశ్వర్లోని తన ఫ్లాట్ కిటికీలోంచి రూ. 500 నోట్ల నగదు కట్టలను బయటకు రువ్వేసినట్లు ఆరోపణ. అంగుల్లోని షడంగి ఉంటున్న ఇంటి నుంచి రూ.1.30 కోట్లు, భువనేశ్వర్లోని అతని ఫ్లాట్ నుంచి రూ.1.21 కోట్లు సమగ్రంగా రూ. 2.51 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికార వర్గాల సమాచారం.
నిందితుడు షేర్ మార్కెట్లో భారీగా రూ. 2.70 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సోదాల్లో తేలింది. విజిలెన్స్ దాడుల సమయంలో 2 బహుళ అంతస్తుల భవనాలు, రెండు ఫ్లాట్లు, 7 అధిక విలువైన ప్లాట్లు, బీమా, రూ. 1.5 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు కనుగొన్నారు.