పట్టభిషేకం ఎవరికో! | - | Sakshi
Sakshi News home page

పట్టభిషేకం ఎవరికో!

Published Mon, Mar 3 2025 2:09 AM | Last Updated on Mon, Mar 3 2025 2:08 AM

పట్టభిషేకం ఎవరికో!

పట్టభిషేకం ఎవరికో!

గుంటూరు ఎడ్యుకేషన్‌: శాసనమండలి కృష్ణా– గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్‌ కళాశాల(ఏసీ)లోని కౌంటింగ్‌ కేంద్రంలో భద్రపరచిన బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. సోమవారం ఉద యం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదివారం ఏసీ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పలు సూచన లు, సలహాలు అందజేశారు. అనంతరం జేసీ ఏ.భార్గ వ్‌ తేజతో కలిసి మీడియాతో నాగలక్ష్మి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు చేపడుతున్నామని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం అన్ని జిల్లాల బ్యాలెట్‌ బాక్సులు కౌంటింగ్‌ జరిగే ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూములో భద్రపర్చినట్లు చెప్పారు. పోలింగ్‌ 69.57 శాతంగా నమోదైన దృష్ట్యా దాదాపు 2.41 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు.

28 టేబుళ్లు ఏర్పాటు

ఇందుకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్యాలెట్‌ పేపర్‌, మొదటి ప్రాధాన్యత ఓట్లు విధానంతో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కౌంటింగ్‌ సుమారు రెండు నుంచి మూడు రోజులు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా కౌంటింగ్‌ మొదటి రౌండ్‌లో పోలింగ్‌ బూత్‌ల వారీగా పోలైన ఓట్లను సరిచూసుకొని మిక్సింగ్‌ చేస్తారన్నారు. తదుపరి చెల్లుబాటయ్యే ఓట్లను పరిశీలించి, మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నిర్దేశించిన కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలుపొందినట్టు ప్రకటిస్తారన్నారు. అభ్యర్థులు ఎవరికీ నిర్దేశిత స్థాయిలో ఓట్లు రాకపోతే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్‌ చేస్తూ వారికి వచ్చిన తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు.

నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కళాశాలలో పూర్తయిన ఏర్పాట్లు వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

మూడు షిఫ్టుల్లో 750 మందికి విధులు..

ఓట్లు లెక్కింపు కోసం మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా 750 మంది సిబ్బందికి వివిధ విధులను కేటాయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. అభ్యర్థులు సైతం ఏజెంట్లను మూడు షిఫ్టుల్లో నియమించుకునేలా అవకాశం కల్పించామన్నారు. కౌంటింగ్‌ ప్రదేశం మొత్తం మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, గుర్తింపు కార్డు లేకుండా ఏ ఒక్కరిని కౌంటింగ్‌ ప్రాంతానికి అనుమతించబోమన్నారు. అదే విధంగా కౌంటింగ్‌ హాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించరని, పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే కౌంటింగ్‌ హాల్లోకి ఏజెంట్లను, కౌంటింగ్‌ సిబ్బందిని అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. వీటితో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement