సరుకు విక్రయించిన తర్వాత మూసివేశాం | - | Sakshi
Sakshi News home page

సరుకు విక్రయించిన తర్వాత మూసివేశాం

Published Wed, Mar 5 2025 2:27 AM | Last Updated on Wed, Mar 5 2025 2:26 AM

సరుకు విక్రయించిన తర్వాత మూసివేశాం

సరుకు విక్రయించిన తర్వాత మూసివేశాం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌)/కంచికచర్ల: కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. హామీల మాట అటుంచి మహిళలు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌ల మూసివేతకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇతర వ్యాపారుల ప్రయోజనాల కోసం లాభాల్లో నడిచే చేయూత మార్ట్‌లను మూసివేయాలని వత్తిళ్లు తెస్తున్నారు. ఆడిట్‌ అధికారులపై వత్తిడి తేవడమే కాకుండా చేయూత మార్ట్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేయూత మహిళా మార్ట్‌లకు రాజకీయ గ్రహణం పట్టింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, వాటి సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేయూత మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో సభ్యురాలి వద్ద నుంచి పెట్టుబడిగా రూ.200 వసూలు చేసి ఆ వచ్చిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సరసమైన ధరలకు, నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్ట్‌లో వచ్చే లాభాల్లో స్వయం సహాయక సంఘ సభ్యులకు జీవిత కాలం వాటా దక్కుతుంది. ఇంతటి సదుద్దేశంతో ఎన్టీఆర్‌ జిల్లాలో కంచికచర్ల, విస్సన్నపేట, కృష్ణాజిల్లాలో పెడన, అవనిగడ్డ మండల కేంద్రాల్లో మహిళా మార్టులు ఏర్పాటు చేశాారు. భవిష్యత్తులో మండలానికో మార్ట్‌ చొప్పున ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పనిచేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది, వీఓలు, మార్ట్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల కృషితో మార్ట్‌లు మాల్స్‌కు దీటుగా ఏర్పాటయ్యాయి. డ్వాక్రా సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను మార్ట్‌ల ద్వారా విక్రయించేందుకు వెసులుబాటు కల్పించారు. మార్ట్‌లు ప్రారంభం నాటి నుంచే లాభాల పట్టాయి. ప్రారంభంలో ఒక్కో మార్ట్‌ రోజుకు రూ.1.50 లక్షల వ్యాపార లావేదేవీలు నిర్వహించాయి. కంచికచర్లలో ఏర్పాటైన చేయూత మార్ట్‌ను ఒడిశా బృందం సందర్శించి సభ్యులను అభినందించింది. స్కోచ్‌ అవార్డు కూడా దక్కింది.

నాడు కళకళ...నేడు వెలవెల

కంచికచర్ల పట్టణంలో రూ.28 లక్షల వ్యయంతో మార్ట్‌ ఏర్పాటు చేశారు. ఫ్లిప్‌కార్ట్‌, మెట్రో, మాల్గుడి వంటి సంస్థలు, హోల్‌ సేల్‌ మార్కెట్ల ద్వారా నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్ట్‌లను నిర్వీర్యం చేసే కుట్రలకు కూటమి నేతలు పదును పెట్టారు. వ్యాపారులతో కుమ్మకై ్క మహిళలు నడిపే మార్ట్‌లపై విషం చిమ్మారు. వ్యాపారుల ప్రయోజనం కోసం సభ్యులు ఎవరూ మార్ట్‌లో సరుకులు కొనుగోలు చేయెద్దంటూ ప్రచారం చేశారు. మార్ట్‌ను మూసివేయాలంటూ కొందరు ఉన్నతాధికారులకు లేఖలు సైతం సంధించారు. కంచికచర్ల మండలానికి చెందిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మార్ట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగస్వామి అయ్యాడు. మార్ట్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లను మార్చి కొత్త వారిని నియమించారు. వీరిలో వ్యాపారస్తులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మార్ట్‌లో అవసరమైన సరుకులు కూడా ఇవ్వడం లేదని కొందరు సభ్యులు వాపోతున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కళకళ లాడిన మార్ట్‌ ఇప్పుడు వెలవెలబోతోంది.

పెడనలో ప్రత్యామ్నాయం చూపని వైనం

పెడనలో 2023 సెప్టెంబర్‌ నెలలో అన్న క్యాంటీన్‌లో మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. రూ.25లక్షల వ్యయంతో మార్ట్‌ను తీర్చిదిద్దారు. మార్టు ఏర్పాటుకు రెండేళ్ల ఒప్పందం చేసుకున్నారు. ఈ మార్ట్‌ కూడా లాభాల బాటలోనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంకా ఒప్పంద కాలం పూర్తికానప్పటికీ మార్ట్‌ను తొలగించారు. సభ్యులు వేరే గది అద్దెకు తీసుకుని అప్పటికే నిల్వ ఉన్న సరుకును విక్రయించారు. ఆ తర్వాత దానిని శాశ్వతంగా మూసివేశారు. దానికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదు.

మూసివేతకు కూటమి నేతల కుట్ర వ్యాపారస్తులతో కుమ్మకై ్క విష ప్రచారం లాభాల బాటలో ఉన్నా మూసివేయించేందుకు వత్తిడి

–రవిబాబు,

ఏరియా కో ఆర్డినేటర్‌

పెడనలో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్‌ లాభాల్లోనే నడిచింది. కొన్నాళ్ల తర్వాత ఇక్కడ మార్ట్‌ను తొలగించడంతో రూమ్‌ అద్దెకు తీసుకుని సరుకులు అందులోకి మార్చేశాం. సరుకు నిల్వ మొత్తం అమ్మిన తర్వాత మార్ట్‌ మూసివేశాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement