విజయనగరం అర్బన్: జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, దీనిలో భాగంగా ఈ నెలాఖరులోగా స్థలాల సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ చాంబర్లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్ఫ్ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం అవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో మైనారిటీ సంక్షేమశాఖ రికార్డుల ప్రకారం మొత్తం 96 వక్ఫ్ స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. మొత్తం ఆ స్థలాల వివరాలను వెంటనే సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని వక్ఫ్, మైనారిటీ శాఖాధికారులకు సూచించారు. అలాగే ఇవే కాకుండా రెవెన్యూ, టౌన్ రికార్డుల్లో ఉన్న మొత్తం వక్ఫ్ స్థలాల వివరాలను సేకరించి, వాటిని సర్వే చేసి, నమూనా పటాలతో సహా ఈ నెలాఖరుకు అందజేయాలని, అనంతరం ఈ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment