ఓటెత్తిన చైతన్యం
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
పెద్దపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో బారులుతీరిన ఓటర్లు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్శాతం పెరిగింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారం, అభ్యర్థులు చేపట్టిన ఓటింగ్ నమోదు పోలింగ్శాతం పెరుగుదలకు దోహదం చేసింది. గురువారం నాలుగు పాత జిల్లా(కొత్త 15 జిల్లాలు)లు, 42నియోజకవర్గాల్లోని 773 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానంలో 3,55,159 ఓట్లు ఉండగా.. 70.42శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 91.90 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల్లో 11.39శాతం, టీచర్లలో 8.36 శాతం పోలింగ్ మెరుగైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న 56మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో నిలిచిన 15మంది భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బ్యాలెట్ బాక్సులు కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్రూముల్లో భద్రపరచగా.. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విజయావకాశాలపై ఆన్లైన్ సర్వేలు జోరందుకున్నాయి.
ప్రతికూలతతో తగ్గిన ఓటింగ్..
వాస్తవానికి ఈసారి పోలింగ్ ఇంకా పెరగాల్సి ఉన్నా.. పలు ప్రతికూలతల వల్ల అది సాధ్యం కాలేదు. టీచర్లకు ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవు పేరిట రోజు మొత్తం సెలవు ఇచ్చింది. కానీ, విద్యాశాఖ, ప్రైవేటు యాజమాన్యాలు కాలడ్డం పెట్టాయి. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకు సగంరోజు, ప్రైవేటు వారికి గంట మాత్రమే అనుమతించారు. వాస్తవానికి టీచర్లు గ్రాడ్యుయేట్, టీచర్ రెండు ఓట్లు వేయాల్సి ఉంటంది. కానీ, సమయాభావం, సెలవు దొరక్కపోవడంతో వారిలో అధికశాతం ఒక్క ఓటుకే పరిమితమయ్యారు. దీనికితోడు ముందు రోజు రాత్రి శివరాత్రి జాగారం కావడం పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఇక హైదరాబాద్, తదితర నగరాలకు వలసవెళ్లిన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఇక్కడ ఓటు ఉన్నా.. సెలవు దొరక్క, చార్జీల భారం వల్ల రాలేకపోయారు.
ఓటేసిన కలెక్టర్.. 3వ తేదీన లెక్కింపు
కరీంనగర్లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ముకరంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమె తన గ్రాడ్యుయేట్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఓటు వేశారు. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్లోని బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేపడుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. కొత్త 15 జిల్లాల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఆన్లైన్లో ఎగ్జిట్పోల్ కోసం అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఫోన్లలో ఐవీఆర్ పద్ధతిలో, నేరుగా, సోషల్మీడియా లేదా ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించడం మొదలు పెట్టారు.
గ్రాడ్యుయేట్స్ స్థానంలో పోలింగ్ ఇలా..
ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్శాతం
2019 1,95,581 59.03శాతం
2025 3,55,159 70.42శాతం
టీచర్స్ స్థానంలో
ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్శాతం
2019 23,160 83.54 శాతం
2025 27,088 91.90 శాతం
సజావుగా ఎన్నికలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: పెద్దపల్లిలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 31వేల మంది పట్టభద్రుల ఓటర్ల కోసం 36 పోలింగ్కేంద్రాలు, 1100 మంది ఉపాధ్యాయుల కోసం 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్లోని రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సజావుగా మొదలైందని ఉపాధ్యాయ ఎన్నికల పరిశీలకుడు మహేశ్దత్త ఎక్కా అన్నారు. పెద్దపల్లిలోని జూనియర్ కాలేజీ ఆవరణలోని కేంద్రాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్లో కంట్రోల్రూం ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామన్నారు. అలాగే కలెక్టర్, ఉపాధ్యాయ ఎన్నికల పరిశీలకుడు సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్ రామచందర్రావు, ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
● రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్
గోదావరిఖని(రామగుండం): పటిష్ట బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. రెండు జిల్లాల్లోని 108 కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేంద్రాలను సందర్శించి ఎన్నికలు జరుగుతున్న తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది మొత్తం 560 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఏలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేశ్, గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్ఐ సంపత్, రామగుండం ఎస్ఐ సంధ్యరాణి తదితరులున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెరిగిన చైతన్యం
2019తో పోలిస్తే మెరుగుపడిన పోలింగ్
11.39 శాతం పెరిగిన పట్టభద్రులు, 8.36శాతం పెరిగిన టీచర్లు
మూడో తేదీన లెక్కింపు, ఏర్పాట్లు ముమ్మరం
విజయావకాశాలపై మొదలైన ఆన్లైన్ సర్వేలు
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
Comments
Please login to add a commentAdd a comment