Bihar Politics: సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా నేడు? | Sakshi
Sakshi News home page

Bihar Politics: సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా నేడు?

Published Sat, Jan 27 2024 11:37 AM

Bihar Politics: Nitish Kumar Will Resign TO CM Post Can Return To NDA - Sakshi

పాట్నా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌ పాలిటిక్స్‌ ఒక్కసారిగా వేడేక్కాయి. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ వైపు జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ అడుగులు వేయన్నుట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. నేడు సీఎం పదవికి నితీష్‌ రాజీనామా చేసే అవకాశం ఉంది. జేడీయూ నిష్క్రమణతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్‌బంధన్‌ సంకీర్ణ కూటమి కుప్పలిపోయే సూచనలు కనిపిస్తన్నాయి. 

ఇప్పటికే నితీష్‌ కోసం అవసరమైతే తలుపులు తెరుస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు. ఆదివారమే సీఎం.. గవర్నర్‌ను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీతో కలిసి నితీష్‌ ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోసారి సీఎంగా నితీష్‌, డిప్యూటీ సీఎంగా సుశీల్‌ కుమార్‌ మోదీ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం వెంట పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లే చాన్స్‌ ఉంది.

జేడీయూ నేతలతో నితీష్‌ భేటీ
తాజా పరిణామాల నేపథ్యంలో నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్‌ సమావేశం కానున్నారు. ఇటు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇంట్లో ఆర్జేడీ కీలక నేతలు సమావేశం కానున్నారు. అదే సమయంలో పూర్ణియాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ సమావేశం ఏర్పాటు చేసింది.

ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్‌ సమర్థ్‌ చౌదరి, సుశీల్‌కుమార్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో నేడు జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడం, పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి.

నితీష్‌కు సోనియా ఫోన్‌..
నితీష్‌ బీజేపీతో చేతులు కలిపితే విపక్ష ‘ఇండియా’ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఊహాగానాల వేళ కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ నితీశ్‌కు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని సోనియా గాంధీ శుక్రవారం ఆయనతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆ కాల్స్‌ను సీఎం పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
చదవండి: Nitish Kumar: నితీశ్‌ కొత్త అవతారం!

Advertisement
Advertisement