
ఢిల్లీ: లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంపై తీసుకువచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలో దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండియా కూటమిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపక్షాల ఇండియా కూటమి లోక్సభ డిప్యూటీ స్పీకర్ కోసం పట్టుపడుతున్న విషయం తెలిసిందే. లోక్సభ స్పీకర్ ఎన్నిక నామినేషన్కు మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ముగియనుండటంతో ఇరు కూటముల మధ్య ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు మాజీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈసారి కూడా బీజేపీ ఓం బిర్లాను స్పీకర్గా ఎంపిక చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికైన లోక్సభ స్పీకర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇక, స్పీకర్ ఎంపికకు ఎన్నిక జరిగితే.. ఇలా ఎన్నిక జరగటం ఇదే తొలిసారి అవుతుంది.డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో బీజేపీ తన మిత్ర పక్షం అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురైని డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసింది. ఇక.. 2019 నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది.
16,17 లోక్సభల్లో కాంగ్రెస్కు కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. కానీ, ఈసారి లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ దక్కించుకోవాలని పట్టుపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment