
అనుబ్రతా మోండల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పార్థ చటర్జీ ఈడీ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లగా.. తాజాగా మరో అగ్రనేత సీబీఐకి చిక్కారు.
మమతకు అత్యంత సన్నిహితుడైన బీర్భూమ్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మోండల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2020 పశువుల అక్రమ రవాణా కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. బీర్భూమ్ జిల్లాలోని తన నివాసంలో అనుబ్రతా మోండల్ను గురువారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఆయనను అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో టీఎంసీ కార్యకర్తలు, మోండల్ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరీ చెదరగొట్టి మోండల్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తమ ఎదుట హాజరుకావాలని 10 పర్యాయాలు సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని సీబీఐ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో రెండు సార్లు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
ఏంటీ కేసు?
2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. (క్లిక్: ఐటీ దాడులు.. డబ్బులు లెక్కించడానికి 13 గంటలు)
Comments
Please login to add a commentAdd a comment