ఆ మూడు కుటుంబాల పాలన అంతమే ఈ ఎన్నికలు: అమిత్‌ షా | JK Assembly election going to end rule of Abdullah Mufti and Nehru Gandhi family{ Amit Shah | Sakshi
Sakshi News home page

ఆ మూడు కుటుంబాల పాలన అంతమే ఈ ఎన్నికలు: అమిత్‌ షా

Published Sat, Sep 21 2024 3:19 PM | Last Updated on Sat, Sep 21 2024 4:41 PM

JK Assembly election going to end rule of Abdullah Mufti and Nehru Gandhi family{ Amit Shah

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ ఎన్నికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ ఎన్నికలు రాహుల్‌ గాంధీ, మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలే ఎన్నోఏళ్లుగా జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే, జమ్మూకశ్మీర్‌లో ఎప్పటికీ పంచాయతీ లేదా బ్లాక్ స్థాయి ఎన్నికలు జరిగేవి కావని అన్నారు.

ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో శనివారం కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్ధేశించి ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూలో మూడు కుటుంబాలు  (గాంధీ, ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా)హింసను ప్రేరేపించాయని, కాబట్టి ఆ మూడు పార్టీల (కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ) వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘1947 నుంచి పాకిస్థాన్‌తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ జమ్ము సైనికులు భారత్‌కు రక్షణగా నిలిచారు. సరిహద్దుల్లో దైర్యసాహాలు ప్రదర్శించి బుల్లెట్లను ఎదుర్కొన్నారు.  ప్రస్తుతం మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం యువతకు రాళ్లు, తుపాకులు బదులు పెన్నులు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చింది. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో మరిన్ని బంకర్లను ఏర్పాటు చేస్తాం.

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీలు, వెనుకబడిన తరగతులు, గుజ్జర్ బకర్వాల్‌లు, పహారీలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఆ బిల్లును నేను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఫరూక్‌ అబ్దుల్లా పార్టీ దానిని వ్యతిరేకించి ఇక్కడి గుజ్జర్ సోదరులను రెచ్చగొట్టడం చేశారు. అప్పుడు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాను. గుజ్జర్-బకర్వాల్ సోదరుల రిజర్వేషన్లను తగ్గించకుండా కొండ ప్రాంత ప్రజలకు.. ఆ హామీని నెరవేర్చాం’అని పేర్కొన్నారు.

 కాగా జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 18న తొలివిడత పోలింగ్‌ నిర్వహించగా.. రెండో దశ సెప్టెంబరు 25న, చివరిదశ అక్టోబర్‌ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను అక్టోబర్‌ 8న వెల్లడి కానున్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement