
రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి
మహారాష్ట్రలో చెప్పడం సరికాదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో మత పరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని... ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్నట్టుగానే మహారాష్ట్రలో కూడా 4శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆర్ఎస్ఎస్ వరిష్ట్ ప్రచారక్ నందకుమార్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేశాయని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పాయని గుర్తు చేశారు.
దీనిపై సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు..ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టు తీర్పు ఇచి్చందని తెలిపారు. ఆ కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గౌరవించాలని సూచించారు. లగచర్ల అంశంపై చట్టం తనపని తాను చేస్తుందని, ఇది ముఖ్యంగా శాంతిభద్రతల సమస్య అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. హిందూ దేవాలయాల్లో పనిచేసే ఇతర మతాల వారిని వేరేచోట్లకు బదిలీ చేయాలని కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment