
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు పెనురాజకీయ దుమారాన్నే సృష్టించాయి. ఇప్పటివరకు ఈ అంశంపై మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జరిగిన మంత్రుల సమావేశంలో స్పందించారు. ఈ వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందించాలని ఆదేశించారు.
ఇది హైలైట్ చెయ్యండి..
బుధవారం జరిగిన క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ప్రధాని రెండు అంశాలపై వారికి స్పష్టతనిచ్చారు. మొదటిది సనాతన ధర్మంపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించమన్నారు. రెండవది 'ఇండియా' 'భారత్' అంశంపై మాట్లాడవద్దని మంత్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. కేవలం పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తారని మిగతావారంతా సనాతన ధర్మాన్ని కించపరచిన వ్యాఖ్యలకు దీటుగా సమాధానమివ్వాలని కోరారు.
కుర్రనేత తగ్గేదెలే..
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకపక్క బీజేపీ నేతలంతా ఈ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తుంటే.. మరోపక్క డీఎంకే యువనేత మాత్రం తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని మళ్ళీ మళ్ళీ ఇదే మాట అంటానని తెగేసి చెబుతున్నారు. కేంద్రం కులవివక్షను పెంచి పోషిస్తోందని, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధి స్టాలిన్ పైన ఆ వ్యాఖ్యలను సమర్ధించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పైన కూడా యూపీలోని రామ్పూర్లో కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: రామ్నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు
Comments
Please login to add a commentAdd a comment