ఇది ఖచ్చితంగా క్లాస్ వార్.. పేదలపై పెత్తందారుల దాడి | Political Leaders Reacts Over CM YS Jagan Incident | Sakshi
Sakshi News home page

ఇది ఖచ్చితంగా క్లాస్ వార్.. పేదలపై పెత్తందారుల దాడి

Apr 14 2024 12:39 PM | Updated on Apr 14 2024 1:10 PM

Political Leaders Reacts Over CM YS Jagan Incident - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాళ్ల దాడి వెనుక చాలా సామాజిక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి ఒక ఆకతాయి పని కాదని, ఒక తుంటరి కుర్రాడు చేసిన పని కాదని, ఆ ఘటన వెనుక పెద్ద పన్నాగమే ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయంగా సీఎం జగన్‌ వేస్తున్న అడుగులు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పెత్తందారులకు కంటగింపుగా, కడుపు మంటగా మారాయని, ఆ క్రమంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మొదటి నుంచీ రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతోమంది మేధావులు, సామాజికవేత్తలను ఆలోచింపజేస్తున్నాయి. మొదటి నుంచీ తాను పేదల ప్రతినిధిని అని, పేదలు, బీసీలు ఇతర అణగారిన వర్గాలకు నాయకుడిని అని పదేపదే చెప్పడమే కాకుండా టిక్కెట్లు ఇచ్చే సమయంలో తాను తన మాటకు ఏ విధంగా కట్టుబడిందీ చేసి చూపించారు.

రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు మొత్తం 200 ఉండగా అందులో వంద స్థానాలు.. అంటే యాభై శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. విశాఖ, నరసరావుపేట వంటి లోక్‌సభ స్థానాలను సైతం బీసీలకు కేటాయించారు. ఇన్నాళ్ళూ ఆర్థికంగా బలవంతులు, అగ్రవర్ణాలు, సామాజికంగా రాజకీయంగా పెత్తందారీ పాత్ర పోషించిన వర్గాలకు ఇప్పుడు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు శరాఘాతంగా మారాయి. రూల్స్ మావి రూలింగ్ మాది.. గవర్నమెంట్ మాది.. అసలు మేమే గవర్నమెంట్ అనే పరిస్థితిని ఆయన ఏకంగా తిరగరాశారు.

దానికితోడు విజయవాడ వంటి పెత్తందారీ పోకడలున్న నగరంలో సీఎం జగన్ రోడ్ షోకు వస్తున్న అసాధారణ స్పందన చూసి వారికి కడుపు రగిలిపోయింది. పేదల ప్రతినిధిగా, సామాజిక, రాజకీయ సంస్కర్తగా ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు తమను రాజకీయ సమాధి చేస్తాయన్న భయాందోళనలతోనే పెత్తందారుల చెంచాలు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌పై జరిగిన చేసిన ఈ దాడిని ఏకంగా పేదలపై జరిగిన దాడిగా చూడాలని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు సీఎం జగన్ చెప్పినట్లుగానే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది క్లాస్ వార్ అని.. రానున్న ఎన్నికలు పేదలు, పెత్తందారులు మధ్య జరిగే యుద్ధానికి ప్రతీక కాబోతున్నదని ఈ దాడి స్పష్టం చేస్తోంది.

-సిమ్మాదిరప్పన్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement