
బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని ఆయనకు అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. కొందరు అయితే ఏకంగా కృష్ణం రాజుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరో వైపు తమ అభిమాన హీరో పెద్ద నాన్నకు గవర్నర్ పదవి దక్కనుందన్న వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, కృష్ణంరాజు ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ.. బీజేపీలోనే కొనసాగుతున్నారు.
1998లో కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికైన కృష్ణం రాజు.. 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వివిధ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణం రాజు.. అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు.
2016లో రోశయ్య వెళ్లిపోయిన తర్వాత, అప్పటి మహారాష్ట్ర గవర్నర్ ఉన్న విద్యాసాగర్ రావే కొద్ది రోజుల పాటు తమిళనాడుకు కూడా గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా తిరు బన్వారిలాల్ పురోహిత్ ఉన్నారు. తమిళనాడులో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందులో భాగంగానే కృష్ణంరాజును గవర్నర్గా పంపాలని నిర్ణయించిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment