
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రాలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. సావర్కర్ను అవమానిస్తే మహావికాస్ అఘాడీతో తెగదెంపులు చేసుకునేందుకైనా వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్రౌత్ హెచ్చరించారు. ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతారని పేర్కొన్నారు.
సావర్కర్ విషయం తమకు చాలా ముఖ్యమని, ఆయన హిందుత్వ సిద్ధాంతలను శివసేన నమ్ముతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడవద్దని సూచించారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్లతే తుది నిర్ణయమని థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఇప్పటికే ప్రకటించారు.
శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపట్టింది. రాహుల్ గాంధీ సావర్కర్ను అవమానించలేదని, చరిత్రలో జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయంపై సంజయ్ రౌత్తో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో మహావికాస్ అఘాడీ(ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి)పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిషర్లను క్షమాపణలు కోరిన వ్యక్తి అని అన్నారు. అండమాన్ జైలులో మూడు నాలుగేళ్లకే భయపడి బ్రిటిషర్లకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను ఆధారంగా చూపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. సావర్కర్ను అవమానించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారని విమర్శించింది.
చదవండి: 'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment